Wednesday, March 1, 2023

13. సాంఖ్య-యోగదర్శనాలలో అద్వైతభావాలు

 

13. సాంఖ్య-యోగదర్శనాలలో అద్వైతభావాలు

(s.సుబ్రహ్మణ్యశాస్త్రి)

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు  

సాంఖ్యదర్శన ప్రవర్తకుడు కపిలమహర్షి. ఈశ్వర కృష్ణుడు రచించిన సాంఖ్యకారికలు సాంఖ్య దర్శనానికి అతి ప్రాచీన గ్రంథంగా పేరు     పొందింది. సాంఖ్యసిద్ధాంత ప్రతిపాదితుడైన ఆత్మరూపమైన పురుషుడు  నిత్య ముక్తుడని ,ఎటువంటి బంధాలు లేనివాడని , స్వతంత్రుడని  చెప్పడంలో  అద్వైత సిద్ధాంత భావాలు కనిపిస్తున్నాయి.

శ్రీమద్భాగవతంలోని  కపిలమహర్షి బోధలు  అద్వైత భావాలతోనిండి యున్నాయి.

ఇక యోగ దర్శన ప్రవక్త పతంజలి మహర్షి . యోగ సూత్రాలకు మూలం, పునాది  హిరణ్యగర్భుడయిన బ్రహ్మ . పతంజలిమహర్షి  యోగ సూత్రాలను మనకు అందించారు. వేద వ్యాసుని వంటి మహనీయుడు ఈ సూత్రాలు వ్యాఖ్యానించాడు. మనస్సును నియంత్రించడం ద్వారా  (చిత్త వృత్తి నిరోధం) అద్వైతాత్మ సాక్షాత్కారాన్ని కలిగించడమే యోగ శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం. యోగ శాస్త్ర పరమావధి,యోజనం కూడ అద్వైతమే.  వ్యాసంలో ఈ విషయాలు విస్తృతంగా చర్చించడం జరిగింది. 

<*><*><*>

 

 

11. న్యాయశాస్త్రంలో అద్వైతభావాలు

 

11.   న్యాయశాస్త్రంలో అద్వైతభావాలు

(ఆచార్య కింకరులు)

అనువాదం :- డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

న్యాయదర్శనం ప్రవర్తకులు  గౌతమమహర్షి. వాత్స్యాయనుడు ,  భరద్వాజుడు, వాచస్పతి, ఉదయనాచార్యులు మొదలైనవారు  ఎన్నో అమూల్యమైన  గ్రంధాలు రచించి ఈ దర్శనాన్ని పరిపుష్టం చేశారు.  ఇక   కణాదమహర్షి వైశేషిక దర్శన ప్రతిపాదకులు. ఈ వైశేషిక దర్శనాన్ని ప్రశస్తదేవుడు, శ్రీ హరి మొదలైన పండితులు తమ అమూల్యమైన వ్యాఖ్యానాలతో   పరిపుష్టం చేసి బలోపేతంగా తీర్చిదిద్దారు. విషయపరంగా ఈ రెండు దర్శనాలకూ స్వల్పమైన భేదాలున్నప్పటికి తాత్త్వికపరంగా చెప్పుకోదగిన పెద్ద భేదం లేదు . వాద,వివాదాలకోసం  కొన్ని సిద్ధాంతాలు  ద్వైతాన్ని ప్రతిపాదించినా శాస్త్ర తాత్పర్యం మాత్రం అద్వైతం గానే  గోచరిస్తుంది . గౌతమ మహర్షి  “తత్త్వ జ్ఞానాన్నిశ్రేయసాధిగమ:” అని ప్రతిజ్ఞ చేసి “దు:ఖ జన్మ ప్రవృత్తిదోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాదపవర్గ:” అని రెండో సూత్రంలో సంసారం  మిథ్యాజ్ఞాన మూలకమని సాంసారికదు:ఖం  మిథ్యాజ్ఞాననివృత్తి వలన సాధ్యమని చెప్పడం అద్వైత సిద్ధాంతభావాలతో సామ్యం కలిగి ఉంది.

 ఉదయనాచార్యులవారు ‘ఆత్మతత్వవివేకం’లో జ్ఞానానికి జ్ఞానప్రతిపాదితమైన వస్తువునకు మధ్య ఎటువంటి భేదం లేదని పేర్కొన్నారు. ఈ నియమం  బ్రహ్మసాక్షాత్కార విషయంలో కూడ వర్తిస్తుంది .

ఉదయనాచార్యులవారు తమకిరణావళిలో ” మోక్షం లభించిన తరువాత అజ్ఞానం నశిస్తే ఆత్మ ఒక్కటే నిలిచి ఉంటుంది అనే మాట వేదాంత సమ్మతమే అయితే గనుక వారితో మాకు ఎటువంటి వివాదం లేదన్నారు.

                      <><><><><>

9. భగవద్గీతలో అద్వైతభావాలు

 

9.  భగవద్గీతలో అద్వైతభావాలు

శ్రీ మండలీక వేoకటేశ్వరశాస్త్రి గారు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

శ్రీమద్భగవద్గీత యొక్క ప్రాముఖ్యమేమిటంటే అది స్వయంగా శ్రీ కృష్ణ భగవానుని నోటి నుండి వెలువడింది. ఇక గీతాశాస్త్ర విషయంలో పండితకంలో  ఎన్నో పరస్పర భిన్నాభిప్రా యాలున్నాయి. కొంతమంది ఆచార్యులు జ్ఞాన పారమ్యాన్ని, మరి కొంతమంది భక్తిపారమ్యాన్ని ఇంకా కొంతమంది కర్మపారమ్యాన్ని  సమర్ధించారు. ఇంతకీ ఆ భగవద్గీత మనకు ఏమి బోధిస్తోంది?

వాస్తవానికి మోహపరవశుడైన అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మ  ఎదుట ఎన్నో సందేహాల్ని,  సమస్యల్ని వెలిబుచ్చాడు. శ్రీకృష్ణుడు వాటికి సరైనా సమాధానాలు  ఇవ్వడం జరిగింది. భగవానుని  సృష్టిలో మానవుడు ఒక అంశ. మమైవాsoశో జీవలోక జీవభూత: సనాతన: అని గీతావాక్యం .   ఇక మానవునికి కావలసిన అవసరాలన్నీ అందించగలిగే గొప్ప గ్రంథం భగవద్గీత. “నత్వేవాహం జాతునాసం”

“మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ”మొదలైన మాటల్లో జీవాత్మ యొక్క సత్యత్వాన్ని ఇంద్రియాలు , భౌతిక వస్తువుల యొక్క అశాశ్వతత్వాన్ని వివరించాడు.  

నాsసతో విద్యతే భావ: నాsభావో విద్యతే సత:”  మొదలైన శ్లోకాల్లో మిథ్యాజ్ఞానం వల్లకలిగే అనర్థం వర్ణించబడింది. ఈ విధంగా ఆత్మాsనాత్మల స్వభావాన్ని విశ్లేషించి “అవినాశి తు  త్వం విద్ధి” అనే వాక్యాలద్వారా జీవాత్మ యొక్క శాశ్వతత్వం ప్రతిపాదించడమైనది .  భగవానుడు ఈ విధంగా జీవాత్మ, పరమాత్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించారు. అంతేగాక  అధిష్ఠానజ్ఞానం కలుగగానే ఆరో పితం  అసత్యమని తెలుస్తుందనే  సత్యం ఈ మాటల్లో వ్యక్తమౌతోoది. ఏడవ అధ్యాయంలో “జ్ఞానం తేsహం సవిజ్ఞానం” మొదలైన శ్లోకాల ద్వారా ప్రపంచానికి ఆధారభూతమైన ఆత్మ సర్వవ్యాపి అని “ఇదం శరీరం కౌంతేయ” మొదలైన వాక్యాల్లో దృక్- దృశ్య వివేకం ప్రతిపాదించి అన్ని శరీరాల్లో ఉండే ఆత్మ ఒక్కటేనని , ఉపాధిభేదం వల్ల అది భిన్నంగా కనిపిస్తోందని, ఆన్ని క్షేత్రాల్లో ఉండే  ఆ క్షేత్రజ్ఞుడు తాను మాత్రమే అని  సహేతుకంగా వివరించడం విశేషం . జ్ఞానాజ్ఞానాల తారత్మాన్ని విశ్లేషిస్తూ  జ్ఞానం, అజ్ఞానాన్ని నిర్మూ లిస్తుందని, అసలు అజ్ఞాననివృత్తియే జ్ఞానమని అది   ఆత్మసాక్షాత్కారరూపమేనని , ఆత్మసాక్షాత్కారం కలిగినవాడు  జీవన్ముక్తుడే అని తెలియజేస్తుంది.

ఇక అద్వైతసిద్ధాంతముఖ్యలక్షణమైన , జ్ఞానం వల్ల  ముక్తి కలుగడమని ,  అది బ్రహ్మావగతి రూపమని ఎంతోమంది జ్ఞాన తపస్సుతో తనను  చేరుకున్నారని వివరించాడు. ఈ వ్యాసంలో మరెన్నో విషయాలు పొందు పరచబడ్డాయి వాటిని వ్యాసవిస్తరభీతితో వదలడమైనది.

<><><><> 

 

 

 

8. ధర్మసుత్రాల్లో అద్వైత భావాలు

 

8. ధర్మసుత్రాల్లో అద్వైత భావాలు

{మహామహోపాధ్యాయ చిన్నస్వామి శాస్త్రిగారు}

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 ఆపస్తంబుడు తన ధర్మ  సూత్రాల్లో “ఆత్మ లాభాన్న పరం విద్యతే కించిత్”  అనే సూత్రం ద్వారా  ఆత్మలాభం కంటే  ఉన్నతమైనటువంటి లాభం మరేదీ లేదని పేర్కొన్నాడు . ఆత్మ నిత్యం కాబట్టి ఆత్మలాభం పొందడానికి   అజ్ఞానాన్ని  తొలగించుకోవడమే  మార్గం . హరదత్తాచార్యులవారు ఈ విషయంలో ఒక కథను దృష్టాంతంగా ప్రస్తావించారు. ఒక రాజకుమారుడు కొంతమంది ఆటవికులచే  పెంచబడి, పెరిగి  పెద్దవాడయ్యాడు. తనను ఆటవికునిగానే  భావించు కుంటున్నాడు .

ఎప్పుడైతే ఒక వ్యక్తి  ద్వారా తాను ఆటవికుడను కానని రాజకుమారుడనని  తెలుసుకుంటాడో అప్పుడు అతని లో ఉండే భ్రాంతి తొలగిపోతుంది  ఈ కథను శ్రీ భగవత్పాదులు కూడ బృహదారణ్యక ఉపనిషత్తులో  ప్రస్తావించడం మనం  గమనిస్తాం.

 

 

ఓమితి బ్రహ్మ బ్రహ్మవా ఏష జ్యోతి :

య ఏష తపతి ఏష వేదో య ఏష తపతి వేద్యమేవైతత్

య ఏష తపతి ఏవమేవైష ఆత్మానం తర్పయతి

ఆత్మనే నమస్కరోతి ఆత్మా బ్రహ్మ ఆత్మా జ్యోతి:

ఓం అనే అక్షరం బ్రహ్మ అది జ్యోతి స్వరూపం . ఆ జ్యోతిని ప్రకాశంపచేసేది వేదం. ప్రకాశం కలుగ జేసేవాడు వేద్యుడు. ఆత్మ (తనకే) ఆత్మకే నమస్కరిస్తుంది. ఆత్మయే  బ్రహ్మ  ఆత్మయే జ్యోతి. (బోధాయన సూత్రం) అన్నము బ్రహ్మ ఆ అన్నాన్ని సమర్పించేవాడు భుజించేవాడు   కూడ బ్రహ్మమే మొదలైన భావాలు  జీవ,బ్రహ్మల ఏకత్వాన్ని  ప్రతిపాదిస్తున్నాయి

 

><(*)<*>{*}<>

7. మన్వాది స్మృతులలో అద్వైతవిషయాలు. (

 

7. మన్వాది స్మృతులలో అద్వైతవిషయాలు.

(పోలకం శ్రీ  సుందరశాస్త్రి వర్యులు)     

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు 

ధర్మం మోక్షప్రాప్తికి  ప్రధానసాధనం కాబట్టి  స్మృతులు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రాస్తావికంగా వివరించాయి. ఆత్మస్వరూప సాక్షాత్కారమే అన్ని ధర్మాలలో ప్రధానమైనదని పేర్కొన్నాయి.

 మనుస్మృతి యొక్క ఉపక్రమ - ఉపసంహారాలు ఆత్మజ్ఞానమే అత్యున్నతమైన మోక్షసాధననమని  వివరించాయి.

  యోగమార్గం ద్వారా ఆత్మను తెలు తెలుసుకోవడమనేది  అన్ని ధర్మాల్లో కెల్ల ఉత్తమ ధర్మమని మనుస్మృతి పేర్కొంది. (1-8)

‘ నేను అన్ని జీవులలోను  ఆత్మరూపంగా ఉన్నాను, అన్ని జీవులు ఆత్మరూపంగా నాలో ఉన్నాయి అని అంతట ఏకత్వాన్ని దర్శించడం వల్ల భక్తుడు ఆత్మ(బ్రహ్మ) సాక్షాత్కారాన్ని పొందగలడని తెలిపింది.   అదియే స్వారాజ్య సిద్ధి అని వివరించింది. ఆత్మ స్వయం ప్రకాశకం కావడం వల్ల (స్వయం రాజతే ఇతి స్వరాట్ ) ఆత్మలాభమే స్వారాజ్యసిద్ధి. జడం తనను తాను తెలుసుకోలేదు, ఇతర పదార్థాలను తెలుసుకోలేదు. మనస్సు ఇతరవస్తువుల్ని తెలుసుకుంటుoదిగాని  తనను తాను తెలుసుకోలేదు. ఇక ఆత్మ  విషయానికొస్తే అది అన్నిటినీ తెలుసుకుంటుంది  తనను కూడ  తాను తెలుసుకుంటుంది. అందుకే “ఆత్మన్యేవాత్మానం పశ్యేత్” అన్నారు. అందుకే ఆత్మదర్శనాన్ని స్వారాజ్యసిద్ధి అని కూడ పిలుస్తారు.  ధర్మశాస్త్రాలు ధర్మాన్ని నిర్వచిస్తూ పది లక్షణాలు చెప్పాయి. అందులో ‘విద్య’ అనే పదం ఉంది. ఆ పదానికి ధర్మశాస్త్ర వ్యాఖ్యాత కుల్లూకుడు ఆత్మజ్ఞానమని నిర్వ చించాడు. మనువు, బ్రహ్మ ఈ జగత్తుకు కర్త కాబట్టి ఆత్మజ్ఞానమే అన్ని ధర్మాల కంటే ప్రధానమైన దన్నారు.  బ్రాహ్మణుడు ధర్మాచరణ ద్వారా ఆత్మజ్ఞానరూపమైన మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి విప్రుని ధర్మానికి అవతారంగాను , ప్రతిరూపంగాను వర్ణించాడు.

అద్వైత సిద్దాంతంలో ప్రధానసూత్రమైన మోక్షప్రాప్తికి ధర్మమే ప్రధాన సాధనమని, వేదాధ్యయనం , తపస్సు, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం , అహింస , గురుసేవ మొదలైనవి మోక్షానికి సాక్షాతత్సాధనాలుగా చెప్పడం విశేషం (12-83, 12-85)

కర్మ నివృత్తిద్వారా పంచభుతాలను అతిక్రమించవచ్చుననే మాటలు  అద్వైత సిద్ధాంతాన్నే సమర్ధించేవిగా కనిపిస్తున్నాయి .               

యాజ్ఞవల్క్యస్మృతికి వ్యాఖ్యానమైన ‘మితాక్షరి’లోని  ప్రాయశ్చిత్తకాండ ప్రారంభంలో  ముందుగా జీవేశ్వరాభేదవాదం   కనిపిస్తోంది(1/34).

 యతిధర్మ ప్రకరణంలో (1౦8-110)

ఆత్మజ్ఞానమే పునర్జన్మనివృత్తికి కారణమని చెప్పబడింది..

ఆత్మజ్ఞానాన్ని చెప్పడం కోసం స్వీకరించిన ఘటాకాశ, ప్రతిబింబవాదాలన్నీ   అద్వైత తత్వాన్నే సమర్ధిస్తున్నాయి.

                                                 

గ్రంథసమాప్తిలో  ‘ నేను ఆత్మ ఆత్మను ఎలా  సృష్టిస్తోంది? ఆత్మకు త్రిగుణాలతో  ఎలా సంబంధం ఏర్పడుతుంది? ఆత్మశరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? జీవునిగా ఎలా అవతరిస్తుంది? సంసారమనే చక్రంలో ఎలా  పరిభ్రమిస్తుంది? అనే విషయాలు వివరించాను. దీన్ని బట్టి జీవుడు ఈశ్వరుడు ఒకరేనని తెలుస్తోంది. కాబట్టి ఈ శాస్త్రం యొక్క సారాంశం ఈశ్వరుడు జీవుడు ఒకటేనని బోధించడమే అని వివరిస్తుంది.

విష్ణుసంహితలో (అధ్యాయం -96) విష్ణువు భూదేవితో ఈ శరీరం క్షేత్రమని అది తెలుసుకున్న వాడు క్షేత్రజ్ఞుడని చెపుతూ ఓ దేవీ !  నన్ను అన్ని క్షేత్రాలలోను నెలకొన్న క్షేత్రజ్ఞునిగా తెలుసుకో అంటాడు.

క్షేత్ర - క్షేత్ర జ్ఞానమే మోక్షమార్గానికి ప్రధాన సాధనమని వివరించాడు. నిర్గుణోపాసన గురించి వివరిస్తూ నిర్గుణోపాసన చేయలేని వారికి సగుణోపాసన శ్రేయస్కరమని వివరించింది. జ్ఞానమే మోక్షసాధనమని నిర్ధారణ చేసింది .

నిర్గుణోపాసన గురిం చి వివరిస్తూ  సగుణోపాసన అనేది  నిర్గుణోపాసన చేయలేని వారికి విధింపబడినదని  వివరిస్తుంది.

గ్రంథ  పరిసమాప్తిలో జ్ఞానం బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనమని చెప్పడం ద్వారా అద్వైత సిద్ధాంతభావాలను వేలువరించి నట్లుగా  తెలుస్తోంది.

దక్ష స్మృతి  ‘ఎవడు సమస్తాన్ని మనకంటే అభిన్నంగా  చూస్తాడో వాడే బ్రహ్మజ్ఞాని’ అని చెపుతోంది.

మనస్సును కర్మబంధనాలనుండి విముక్తి చెయ్యడం, క్షేత్రజ్ఞుని పరమాత్మగాభావించడం ఉత్తమమైన యోగసాధన అని వివరించింది. మనసును సమస్తకర్మబంధములనుండి  తప్పించి క్షేత్రజ్ఞునివైపునకు మరల్చడమే ఉత్తమమైన యోగసాధనగా పేర్కొంది. ఈ విధంగా దక్షస్మృతి ధర్మాన్ని నిర్వచించడంలో అద్వైత భావాలనే సమర్ధించిందని చెప్పవచ్చు .   

శంఖసంహిత కూడ ఇరువది ఐదవ తత్వమైన పురుషుడు లేదా ప్రత్యగాత్మ (జీవాత్మ ) పరమాత్మకంటే భిన్నుడు కాడనే జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుందని వెల్లడించింది.

<*><*><*><*><*>

6. అథర్వవేదంలో అద్వైతభావాలు.

 

6. అథర్వవేదంలో అద్వైతభావాలు.

(శ్రీ. శివరామకృష్ణ శాస్త్రి)

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 కర్మకాండకు సంబంధించిన అధర్వవేదంలో కూడ అద్వైత వేదాంతానికి సంబంధించిందన ఎన్నో  విషయాలు  కనిపిస్తున్నాయి .కాలసూక్తంలో

“ బ్రహ్మ హోతా , బ్రహ్మ యజ్యా బ్రహ్మణా స్వరే వోమితా: |

అధ్వర్యు: బ్రాహ్మణో జాతో బ్రాహ్మణో soతర్హితం హవి:” || మొదలైన మంత్రాలద్వారా

 బ్రహ్మమే  హోత, బ్రహ్మమే యాగము, బ్రహ్మమే  యథార్థమైన యజ్ఞంఫలం అని చెప్పబడింది.

అలాగే “ త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారా ఉత వా కుమారీ|త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖ:” || ( అథర్వ*11 కాండం -9,10,11) మొదలైన శ్రుతులు “నీవే స్త్రీ , నీవే పురుషుడవు, నీవే బాలుడవు , నీవే బాలికవు , నువ్వు దండం పుచ్చుకొని నడుస్తున్నావు. నీవే విశ్వతోముఖుడవు”  (10-8-27) అని చెపుతున్నాయి.  

            <*><*><*><*>

5. సామవేదంలో అద్వైతభావాలు

 

5. సామవేదంలో అద్వైతభావాలు

(మాయూరవాసీ శ్రీ. రామనాథ దీక్షిత:)

అనువాదం :- డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

సామవేదానికి ఒక 1000 శాఖలున్నట్టుగా తెలుస్తోంది. వీటిలో కౌథుమశాఖ ఒక్కటే  దక్షిణ భారతదేశంలో చాల ప్రాచుర్యంలో  ఉంది. ఈ వేదానికి  సంబంధించినటువంటి సంహిత, ఎనిమిది  బ్రాహ్మణాలు ఎన్నో  అద్వైత వేదాంత విషయాలతో కూడి ఉన్నాయి.  సామవేదబ్రాహ్మణoలో ఒకచోట సృష్టికర్త ‘అహమ:’ అనే పదం ద్వారా అహమునిగా చెప్పపడ్డాడు. దీని సారాంశం ‘నేను’ అని.  దీన్ని బట్టి  ప్రపంచానికి ఆధారం, సృష్టికర్త అయిన ప్రభువు, జీవుడు ఒకరేనని  తెలుస్తోంది.   మట్టి యొక్క స్వరూపం తెలిస్తే ఆ మట్టితో చేయబడిన వస్తువుల యొక్క స్వరూపం తెలుస్తుంది  ఎందుకంటే మట్టితో చేయబడిన వస్తువులు  మట్టి యొక్క ప్రతిరూపాలు లేదా వికారాలు  మాత్రమే, అవి మట్టికంటే  భిన్నం కావు . మట్టి ఒకటే సత్యము, నిత్యమున్ను   . నామరూపాలు సత్యం కావు.  కాబట్టి  ఆత్మజ్ఞానం కలిగితే  సమస్తము తెలుస్తుంది , అవగతమౌతుంది(ఛా౦దోగ్యం-6)  అనే విషయం “తత్త్వమసి” (ఛా౦దోగ్యం-6) అనే వాక్యం ద్వారా జీవునికి  పరమాత్మకు భేదం లేదని చెప్పబడింది. పరమేశ్వరుడే జీవుల యొక్క శరీరంలో ప్రవేశించి నామ రూపాలు కల్పించాడని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఛా౦దోగ్యం ద్వారా మనకు తెలుస్తున్నాయి.

                 *X*X*X*X*X*X*

4. యజుర్వేదంలో అద్వైతభావాలు

 

4. యజుర్వేదంలో అద్వైతభావాలు

(శ్రీ శంకరకింకరులు)

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు 

 యజుర్వేదం నూట ఒక్క శాఖలు (1౦1) గా విభజింపబడింది. ఇది   దక్షిణభారతదేశంలో  చాల ప్రచారంలో ఉంది . యజుర్వేదానికి సంబంధించిన తైత్తిరీయోపనిషత్తులోను, కర్మకాండకు సంబంధించినటువంటి మరికొన్ని చోటు లందు అద్వైతసిద్దాంతవిషయాలు ఎన్నో  కనిపిస్తున్నాయి.

“ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి తానే స్వయంగా ప్రవేశించాడు”  అని తైత్తిరీయోపనిషత్తు చెపుతోంది .(తైత్తిరీయ ఉపనిషత్తు)

 సూర్యునిలో ఉన్న ఆ పరమాత్మ, నీలో ఉన్న ఆ పరమాత్మ ఇద్దరు ఒకటేనని  తైత్తిరీయ ఉపనిషత్తు చెపుతోంది.  పరమేశ్వరుడే మనకు తండ్రియని, అతడే రక్షకుడని, తన నుంచే నామరూపాత్మకమైన  ఈ ప్రపంచం సృష్టించాడని, తానే అనేక దేవతారూపాలతో ఉన్నాడని,  ఈ ప్రపంచమంతా ఆయనలోనే దాగి ఉందని తైత్తిరీయసంహిత వివరించింది. ఈ ప్రపంచానికి సృష్టికర్తయైన భగవంతుని నువ్వు తెలుసుకోలేవని , అతనికి నీకు మధ్య మాయ అనే మంచుపొర ఉందని మానవులు మాయ అనే మంచుతెర ముసుగులో సుఖం అనుభవిస్తూ, ఆనందిస్తున్నారని వివరిస్తోంది.

                                             >*<>*<*><*><

 

3. ఋగ్వేదంలో అద్వైత భావాలు

 

  3. ఋగ్వేదంలో అద్వైత భావాలు

                (జంబుకేశ్వరం శివరామకృష్ణ ఘనాపాఠీ               అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.


ప్రతి వేదం కర్మకాండ -జ్ఞాన కాండ అని రెండు భాగాలుగా విభజింపబడింది . పూర్వమీమాంస కర్మకాండగాను , ఉత్తర మీమాంస జ్ఞానకాండగాను వ్యవహరించబడుతున్నాయి.

పూర్వమీమాంస సమస్త మానవజాతి  సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మానవునికి ఎన్నో యజ్ఞయాగాది వైదిక కర్మలు విధించింది. ఇక వేదానికి రెండో భాగం అయినటువంటి జ్ఞానకాండ మానవునికి కావలసిన ఆత్మ(స్వరూప) జ్ఞానం బోధిస్తుంది.  ఈ ఆత్మజ్ఞానప్రాప్తికి  జీవుడు, బ్రహ్మ ఒకటే అనే భావన , ప్రతిఫలాసక్తి లేని నిష్కామకర్మానుష్ఠానం,  భక్తి,  వేదాంతశ్రవణాసక్తి,  ధ్యానం,  నిధిధ్యాసనం  మొదలైనవి సోపానాలుగా  ఉపయోగపడతాయి.  జ్ఞానకాండలో వేదాంత విషయాల ఆవశ్యకత చాల అవసరం . కాని కర్మకాండకు సంబంధించిన పుర్వమీమాంసాభాగంలో కూడ అద్వైతాత్మతత్త్వాన్ని బోధించే ఎన్నో వాక్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇదే ఋగ్వేద స్వరూపగా కనిపిస్తోంది.

“ఏకం సత్ విప్రా బహుధా వదంతి(2-3-22-6)  అనే మాట మనం పరిశీలిస్తే సత్పదార్థం ఒక్కటే యని దాన్ని జ్ఞానులు విష్ణువని , ఇంద్రుడని,   సూర్యుడని,   వరుణుడని, అగ్నియని,   గరుత్మంతుడని ఎన్నో విధాలుగా భావిస్తున్నారని తెలుస్తోంది .

 “ నేనే మనువును, నేనే సూర్యుడను , నేనే కక్షిమంతుడను సమస్తమునై యుంటిని (3-6-15-1)అని  వామదేవుడు ఒక చోట చెప్పడం మనం గమనిస్తాం.

 జీవుడు  తాను స్వయంగా భగవంతుడనని  తెలుసుకోలేక పోవడం వల్లనే దు:ఖానికి లోనౌతున్నాడు. ఎప్పుడైతే తాను శరీరం  కంటే, బుద్ధి కంటే,  మనసు కంటే, ఇంద్రియాలకంటే అతీతమైన పరమాత్మ స్వరూపుడనని తెలుసుకుంటాడో   అప్పుడే సంసారరూపమైన దుఃఖం నుంచి విముక్తుడౌతున్నాడు (8-1-20-1),

                            <*><*><*><*><*>