Thursday, June 25, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-9 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-9

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- కో జగద్భర్తా?

ఈ జగత్తును ఎవడు భరిస్తున్నాడు?

 సమాధానం :- సూర్య:

సూర్యుడే ఈ జగత్తును భరిస్తున్నాడు. సూర్యుని సవితా అని కూడా పిలుస్తారు . షూఙ్ ప్రాణి ప్రసవే అనే  ధాతువు నుండి   ( सूयते इति सविता ) అనే వ్యుత్పత్తిని బట్టి ఆయనే వృక్ష జాలానికి (Flora) జంతుజాలానికి( Fauna) జీవనాధారం (He gives life to Flora and Fauna) అని తెలుస్తోంది.

123.     ప్రశ్న :- సర్వేషాం కో జీవనహేతు: ?

అందరికి ఎవరు జీవనాధారము ?

సమాధానం :-స: పర్జన్య:

మేఘమే అందరికీ జేవనాధారము.  

124.     ప్రశ్న :- క:  శూర: ?

ఎవడు శూరుడు/ పరాక్రమవంతుడు ?

సమాధానం :-యో భీతత్రాతా

ఎవడు ఆపదలో ఉన్నవారిని , భయపడేవారిని రక్షిస్తాడో అతడే శూరుడు/ పరాక్రమవంతుడు

125.     ప్రశ్న :- త్రాతా చ క: ?

మనకు రక్షకులు ఎవరు ?

సమాధానం :-స: గురు:

సంసార సాగరంలో పడి దిక్కు తోచక అలమటిస్తున్న  వారిని కాపాడ గలిగిన వాడు ఆ గురువు మాత్రమే. ఆయనే  మనకు రక్షకుడు .  

126.     ప్రశ్న :- కో హి జగద్గురురుక్త:?

ఎవరు జగద్గురువుగా చెప్పబడుతున్నాడు.?

 సమాధానం :-శంభు: శం భవతి అస్మాత్ (ఇతని వలన సుఖం కలుగుతుంది)ఇతి శంభు: అనే అర్థంలో శంభు: అనే పదం ఏర్పడింది.   

శివుడే జగద్గురువుగా చెప్ప బడుతున్నాడు. 

127.     ప్రశ్న :- జ్ఞానం కుత: ?

జ్ఞానం ఎవరి వలన కలుగుతుంది?

సమాధానం :-శివాదేవ

 జ్ఞానం శివుని వలన మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే ఆయన జ్ఞాన స్వరూపుడు.  

128.     ప్రశ్న :- ముక్తిం లభతే కస్మాత్?

దేని వలన ముక్తి లభిస్తుంది ?

సమాధానం :-ముకుందభక్తే:

ముకుందుని పట్ల భక్తి కలిగి ఉండడం వలన ముక్తి లభిస్తుంది

129.     ప్రశ్న :- ముకుంద: క:?

ఎవడు ముకుందుడు?

సమాధానం :-య: తారయేదవిద్యామ్

ఎవరు అవిద్యనుండి మనల్ని తరింపచేస్తాడో అతడే ముకుందుడు.

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ( భగవద్గీత )

నా ఆధీనములో ఉన్నది,  త్రిగుణాత్మకమైనది అగు ఈ మాయ ఎవరికీ దాటడానికి వీలు కానిది. ఇక ఎవరైతే నన్ను సేవిస్తారో వారు మాత్రమె ఈ మాయను దాటగలరు.  

130.     ప్రశ్న :- కా చ అవిద్యా ?

అవిద్య అంటే ఏది ?

సమాధానం :-యత్  ఆత్మనోsస్ఫూర్తి:

ఆత్మస్వరుపాన్ని మరుగుపరిచేదే అవిద్య

అనిత్యాsశుచి దు:ఖాsనాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా” అని శాస్త్రం చెపుతోంది. దీన్నిబట్టి అనిత్యాన్ని నిత్యం గాను; అశుచిని శుచిగాను ; దు:ఖాన్ని సుఖంగాను ; అనాత్మను ఆత్మగాను భావించడమే అవిద్య .  అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం కాదు , విపరీత జ్ఞానం మాత్రమే, అంటే తప్పుడు భావన. అవిద్య జీవ గతం,  (micro) మాయ ఈశ్వర గతం (macro)  అని తెలుసు కోవాలి. ఒకటి జీవాశ్రయం రెండోది ఈశ్వరాశ్రయం.  

131.     ప్రశ్న :- కస్య న శోక: ?

ఎవడికి శోకం ఉండదు?

 సమాధానం :- య: స్యాదక్రోధ:

ఎవనికైతే క్రోధం ఉండదో అతనికి శోకం ఉండదు.

<><><>  

Sunday, June 14, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-8 రచన:- శ్రీ శంకరాచార్యులు

 ప్రశ్నోత్తర రత్నమాలికా Part-8

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- కస్య క్రియా సఫలా?

ఎవరి పనులు ఫలవంతం ఔతాయి?  .

సమాధానం :- య: పున: ఆచారవాన్ శిష్ట:

ఎవడు మంచివాడై,  సదాచార సంపన్నుడుగా ఉంటాడో, అతని పనులన్నీ తప్పక సఫలమౌతాయి . ఇక్కడ ఆచారమంటే మడి, ఆచారం అని కాదు. ఆచరణ అని అర్థం. మన సమాజంలో నూటికి తొంబై మంది నీతులు చెప్పే వారే గాని ఆచరించే వారు చాల తక్కువ. వేదం ఆచరణకు చాల ప్రాధాన్యం ఇచ్చింది . ఏమంటున్నదో స్వయంగా చూడండి.

ఆచారహీనం న పునంతి వేదా: యద్యప్యధీతా: సహ షడ్భిరంగై:

                    ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షా:

ఒక వ్యక్తి ఎన్ని వేదాలు, వేదాంగాలు చదివినా వాటి విలువల్ని ఆచరణలో పెట్టకపోతే అవి అతనిని రక్షించవు. ఏ విధంగా రెక్కలొచ్చిన పక్షి గూడు విడిచిపెట్టి పాఱి పోతుందో అలాగే ఆ వ్యక్తి మరణించిన తరువాత వేదాలన్నీ అతనిని విడిచిపెట్టి పోతాయి. ఆచరణ  లేని జ్ఞానం వ్యర్థం . ఇక గూడు విడిచిపెట్టి  వెళ్ళిన పక్షి మరల ఆ గూటికి చేరదు . తనకు తానే స్వయంగా నిర్మించుకొంటుందని ప్రతీతి .

123.     ప్రశ్న :-  క: శిష్ట: ?

ఎవడు శిష్టుడు/సజ్జనుడు  ?

సమాధానం :-యో వేదప్రామాణ్యవాన్.

ఎవడు, వేదాన్నే ప్రమాణంగా తీసుకుంటాడో అతడే శిష్టుడు/ సజ్జనుడు.

124.     ప్రశ్న :- యో హత: ? ఎవడు హతుడు ?

సమాధానం :-క్రియా భ్రష్ఠ:

ఎవడు తన కర్తవ్యాన్ని విడిచి పెడతాడో,  అతడే హతుడు.   

125.     ప్రశ్న :- కో ధన్య: ?

ఎవడు ధన్యుడు?

సమాధానం :-సన్యాసీ

సన్యాసి చాల ధన్యుడు.

‘అన్ని విడిచిపెడితే, వాడు సన్యాసి; అందరు విడిచి పెడితే వాడు సన్నాసి’ అని సుప్రసిద్ధ పండితులు , అవధాని శ్రీ రావూరి వేంకటేశ్వర్లు గారు ఒక అవధానంలో సన్యాసికి సన్నాసికి మధ్య గల తేడాను చమత్కరించారు.    

126.     ప్రశ్న :- కో మాన్య: ? ఎవడు గౌరవించదగినవాడు.

సమాధానం :-పండిత: సాధు:

                పండితుడైన సజ్జనుడు. కేవలం విద్యావంతుడైనంత మాత్రాన సరిపోదు. శీలం కూడ అవసరం .     శీలం లేని విద్యావంతుడు అందరికన్నా ప్రమాదకారి. అందుకే భర్తృహరి  

‘దుర్జన: పరిహర్తవ్య: విద్యయాsలంకృతోsపి సన్

మణినా భూషిత: సర్ప: కిమసౌ న భయంకర:’   అంటాడు .

దుర్జనుడు విద్యావంతుడైనప్పటికి అతనిని చేర రాదు. పాము తన తలపై విలువైన మణిని ధరించినప్పటికీ అది భయంకరమైనదే కదా!  .  ఇంచుమించు ఇదే భావాన్ని  Shakespeare మహాకవి రచించిన

‘As you like it’ నాటకంలోని ....  Which like the toad, ugly and venomous,

Wears yet a precious jewel in his head...... మొదలైన మాటలు జ్ఞప్తికి తెస్తాయి.

127.     ప్రశ్న :- క: సేవ్య: ?

ఎవడు సేవిపదగిన వాడు? 

సమాధానం :-యో దాతా

దాతృత్వం గల వ్యక్తి సేవింప దగిన వాడు .

Part-23.

128.     ప్రశ్న :- కో దాతా?

దాత అనగా ఎవరు?

సమాధానం :-య:  అర్థిం  తృప్తిమాతనుతే

ఎవడు, తన వద్దకు వచ్చిన అర్థిని /యాచకుని  పూర్తిగా సంతృప్తి పరుస్తాడో అతడే దాత .

129.     ప్రశ్న :- కిం భాగ్యం దేహవతామ్  ?

మానవులకు ఏది అసలైన భాగ్యము ?

సమాధానం :-ఆరోగ్యం.  

మానవులకు ఆరోగ్యమే  అసలైన భాగ్యము.

If money is lost, nothing is lost

If health is lost, something is lost

If character is lost everything is lost. అన్నారు పెద్దలు . అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్  అంటాడు కాళిదాసు . ధర్మ సాధనకు శరీరమే మొట్టమొదటి సాధనము.

130.     ప్రశ్న :- క: ఫలీ ?

ఎవడు మంచి ఫలాలను పొందుతాడు?

సమాధానం :-కృషికృత్

వ్యవసాయం చేసే వాడు మంచి ఫలాలను పొందు తాడు.

ఈ ప్రపంచంలోని అన్ని వృత్తులలో వ్యవసాయమే చాల పవిత్రమైనది, గొప్పదీని . ఇక కృషి అంటే పరిశ్రమ అనే అర్థం కూడ ఉంది. ఏ వృత్తిలోనైనా  అధికమైన పరిశ్రమ చేసినవాడు అన్ని ఫలాలను పొందుతాడు.  

131.     ప్రశ్న :- కస్య న పాపం ?

ఎవరికి పాపం అంటదు.

                 సమాధానం :-జపత:

                 జపం చేసే వానికి పాపం అంటదు. ( కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం) .

132.     ప్రశ్న :- క: పూర్ణ:?

ఎవడు పరిపూర్ణమైన మానవుడు?

 సమాధానం :-య: ప్రజావాన్స్యాత్

సంతానం గల వాడు పరిపూర్ణ మైన మానవుడు ఔతాడు.  

133.     ప్రశ్న :- కిం దుష్కరం నరాణాం?

మానవులకు ఏది చాల కష్టమైన పని ?

సమాధానం :-యన్మనసో నిగ్రహ: సతతం

ఎల్లప్పుడూ మనస్సును అదుపులో పెట్టుకోవడం మానవులకు చాల కష్టమైన పని.

శ్రీ కృష్ణుడంతటి వాడే మనస్సును అదుపులో పెట్టుకోవడం మానవులకు చాల కష్టమైన పని అన్నాడు . కాని అభ్యాసం, వైరాగ్యం వల్ల అది సాధించవచ్చని సలహా చెప్పాడు. అందుకే పతంజలి “అభ్యాస వైరాగ్యాభ్యాం చిత్తవృత్తి నిరోధ: ”  అన్నారు . కాబట్టి మనోనిగ్రహం కష్ట సాధ్యం కావచ్చు నేమో! గాని అసాధ్యం మాత్రం కాదు .    

134.     ప్రశ్న :- కో బ్రహ్మచర్యవాన్ స్యాత్?

ఎవడు బ్రహ్మచారి ?

సమాధానం :- యస్యాస్ఖలితమూర్ధ్వరేతస్క:

అస్ఖలితుడు గాని , ఊర్ధ్వరేతస్కుడు గాని బ్రహ్మచారి ఔతున్నాడు.

సాధారణంగా వివాహం చేసుకోని వాణ్ణి బ్రహ్మచారి అంటారు . అది సరే, కాని  బ్రహ్మణి  చరతి ఇతి బ్రహ్మచారీ అని తాత్త్విక పరమైన అర్థం.  అంటే పర బ్రహ్మమందు మనస్సును  ఎల్లప్పుడూ లగ్నం చేసేవాడు/ లీనమై ఉండే వాడు  అని అర్థం.

ఇక దీనికి సంబంధించినది,  నేను చిన్నప్పుడు చందమామలో చదివిన కథ ఒకటి వివరిస్తాను.

                 ఒకనాడు వసిష్ఠ మహర్షి తన భార్య    అరుంధతిని పిలిచి ఆమెతో “ ఈ రోజు నువ్వు గంగానదికి అవతలి గట్టున ఉన్న అగస్త్య మహర్షికి భోజనం పట్టుకొని వెళ్ళు “ అని చెప్పాడు. ఆమె ఆహారం పట్టుకొని నది దగ్గరకు వెళ్ళింది. ఆ నది పరవళ్ళు తొక్కుకుంటూ చాల వేగంగా ప్రవహిస్తోంది . నదీ ప్రవాహం దాటడానికి వీలుగా లేదు, దాటించే వారు కూడ ఎవరు లేరు . ఆమె ఇంటికి వచ్చి విషయం అంతా చెప్పింది.  అప్పుడు మహర్షి ఆమెతో నిత్య బ్రహ్మచారి పంపించాడని ఆ నదితో చెప్పమని మరలా పంపించాడు . ఆమె తిరిగి వెళ్లి ఆ విషయాన్ని నదికి విన్నవించగానే ఆ నది రెండు పాయలుగా విడిపోయి ఆమెకు దారి ఇచ్చేసింది. ఆమె కాలి నడకన నది దాటి ఆ మహర్షిని చేరుకొని తాను తెచ్చినదంతా ఆయనకు సమర్పించింది . ఆయన కూడ ఒక్క మెతుకు మిగుల్చకుండా పూర్తిగా తినేశాడు. ఆమెతో ధన్యవాదాలు తల్లీ! వెళ్ళిరామ్మా ! అన్నాడు . ఆమె, స్వామీ! నేను ఎలా తిరిగి వెళ్ళగలను? . నది చాల వేగంగా ప్రవహిస్తోంది. అక్కడ దాటించే వారు కూడ ఎవరు లేరు అంది. ఆయన ఓహో అలాగా! దానికేముందమ్మా! నిత్యోపవాసి పంపించాడని చెప్పు , ఆ నది నీకు దారి ఇస్తుంది’  అన్నాడు. ఆమె అలాగే చెప్పింది . నది అలాగే దారి ఇచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ప్రశాంతంగా తిరిగి వచ్చినా మనశ్శాంతి లేదు. మా ఆయన ఎల్లపుడు నా తోనే ఉంటూ నిత్య బ్రహ్మచారి ఎలా అయ్యారు . ఇక ఒక్క మెతుకు కూడ మిగుల్చకుండా తినేసిన ఆయన నిత్యోపవాసి ఎలా అయ్యాడో ఈమెకు అర్థం కాలేదు . భర్తను చేరి వినయంగా అన్ని అడిగింది. ఆయన చెప్పాడు. ఎవడు, సర్వకాల, సర్వావస్థలలోను  మనస్సును ఆత్మ(బ్రహ్మ)యందు లయం చేస్తాడో అతడే బ్రహ్మచారి. నేను బాహ్యంగా ఎన్నో లౌకిక కార్యక్రమాలలో పాల్గొంటున్నా, నా మనస్సు ఎప్పుడు అంతర్ముఖం గానే ఉంటుంది. నేను నిత్య బ్రహ్మచారినే. ఇక ఉపవాసం విషయానికొద్దాం. ఉపవాసం అనే పదానికి ఒక విశిష్టమైన అర్థం ఉంది .

ఉపసమీపే యో వాస: జీవాత్మ పరమాత్మనో:

ఉపవాస: స విజ్ఞేయ: న తు కాయస్య శోషణం

 దీన్ని బట్టి ఉపవాసం అంటే జీవాత్మను , పరమాత్మ సమీపంలో ఉండేటట్లు చెయ్యడం . ఒక విధంగా ధ్యానంలో ఉండమని  తాత్పర్యం. ఆహారం కడుపునిండా తింటే అది సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైనంత స్వల్పంగా తీసుకోవడం పరిపాటి. ఆహారం ఎక్కవగా తీసుకున్నవానికి; అదే విధంగా అసలు ఆహారం తిననివానికి యోగం కుదరదని  నాత్యశ్నతస్తు  యోగోsస్తి న చ యోగమనశ్నత:  అనే మాటల్లో  భగవానుడు సెలవీయడం మనకందరికీ తెలిసిందే కదా! ఇంకో విషయం  చెపుతాను విను. మనం ఆహారం తీసుకొని వెళ్లినప్పుడు ఆయన స్వీకరించాడు గాని నా భార్య లోపాముద్ర పుట్టింటికి వెళ్ళింది నాకు అన్నం పంపించమని ఎప్పుడు మనల్ని అడగలేదు, నువ్వు గమనిచావా! అన్నాడు . ఆమె తల ఉపింది .  రామాయణంలో “ ఉపవాసపరైకాగ్రా వస త్వం జనకాత్మజే! పతివ్రతాత్వమస్థాయ రామం కృత్వా సదా హృది” అనే మాటలకు ధ్యానం చేస్తూ ఉండమనే తాత్పర్యం .   ఆ సంగతి అలా ఉంచుదాం. ఈ సందర్భంలో మా గురుదేవులు శ్రీ గంటి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఒక విషయాన్ని చెప్పారు . అది ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. నేటికి మన పవిత్ర భారతదేశంలో హిమాలయాల్లో ఎంతో మంది యోగులున్నారు. వాళ్ళ కోసం టాటా - బిర్లా ల వంటి మహానుభావులు కొన్ని ట్రస్టులను ఏర్పాటు చేశారట. ప్రతి రోజు అక్కడ ఉండే యోగులకు ఉచితంగా పాలు, ఆహారం సమకూర్చడం వారి నిత్యకృత్యం . ప్రతి రోజు ఎంతోమంది యోగులు అక్కడకు వస్తూ, పోతూ ఉంటారు. లైనులో మౌనంగా నిలబడి, వారు పెట్టింది తినేసి, వెళ్లి పోతూ ఉంటారు . విచిత్రమేమిటంటే

కొంతమంది రోజూ రావడం లేదట. నెలకో  , రెండు నెలలకో , మూడు నెలలకో  తినాలనిపిస్తే ఒక్కసారి వస్తున్నారట. అక్కడ పని చేసే వారు ఈ  విషయాన్ని బాగా గమనించారు . ఆహా ! ఎంత గొప్ప వారు ఆ యోగులు! . అటువంటి వారికి నిలయమైన మన భారతదేశం చాల ధన్యమైనది. ఇక స్వామి రామ అనే మహనీయుడు My experience with the Himalayan yogis అనే గ్రంథాన్ని  వ్రాశారు. అది చదివితే మరెన్నో విశేషాలు తెలుస్తాయి.          

 ఇక మనలో కొందరు ముందుగా తిండి మానెయ్యడం ఆ తరువాత పదింతలు తినెయ్యడం    ఒకే సారి ఈ రెండు తప్పులు చేస్తున్నారు . దైవ ధ్యానం కన్నా సాయంకాలం తినబోయే వంటకాలపైనే ధ్యాస ఎక్కువ. దీనివల్ల పారమార్థిక లాభం శూన్యమే అని చెప్పక తప్పదు. ఇది ఎవరికి వారు  తెలుసుకోవాలి . ఎవరూ చెప్పే విషయం కాదు. 

             135.     ప్రశ్న :- కా చ పరదేవతా ఉక్తా ?

ఏది పర దేవతగా చెప్పబడున్నది?

సమాధానం :-చిచ్ఛక్తి:

మన శరీరంలో ఉన్న చైతన్య శక్తియే  పర దేవతగా చెప్పబడుతున్నది. మనలో ప్రత్యగాత్మ (జీవాత్మ) రూపంలో ఉన్న చైతన్య శక్తియే పరమ దైవం ..
<><><>

Thursday, June 11, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-7 రచన:- శ్రీ శంకరాచార్యులు

  ప్రశ్నోత్తర రత్నమాలికా Part-7

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

1.      ప్రశ్న :- సంభావితస్య మరణాత్ అధికం కిం ?

                             మరణం కంటే నీచమైనది ఏది?  

                 సమాధానం :- దుర్యశో భవతి.

                       అపకీర్తి మరణం కన్న నీచమైనది. ఈ ప్రపంచంలో కొన్ని దేశాలున్నాయి. వాటి పేర్లు అందరికీ తెలిసినవే . ఆ దేశాలలో పాలకులుగా నియమితులైన వారు ప్రజా పరిపాలన విషయంలో ఎటువంటి తప్పిదం  చేయరు. ఎవరైనా వారిపై దోషం మోపితే చాలు అది నిజమైనా కాక పోయినా  ప్రజలకు మొగం చూపించలేక  ఆత్మహత్య చేసుకుంటారట! ఇదే అపకీర్తి కన్నా మరణమే మిన్న అనే మాటలకు అర్థం . మన దేశ పరిస్థితి వేరు కాళ్ళు పట్టుకు లాగుతున్నా చూరు పట్టుకుని  వ్రేళాడుతూ ఉంటారు.       

2.      ప్రశ్న :- లోకే సుఖీ భవేత్ క:?

           లోకంలో ఎవడు సుఖం పొందుతున్నాడు ?

        సమాధానం :- ధనవాన్.

          లోకంలో  ధనవంతుడు సుఖం పొందుతున్నాడు.

3.      ప్రశ్న :- ధనమపి చ కిం ?

             ధనం అంటే ఏది?

            సమాధానం :-యతశ్చేష్టమ్.

              మనిషి దేని వలన తనకు కావలసినది పొందుతున్నాడో అదే ధనం .

4.      ప్రశ్న :- సర్వసుఖానాం బీజం కిం?

                సమస్త సుఖాలకు ఏది కారణం ?

సమాధానం :- పుణ్యం.

మనిషి పొందే సమస్త సుఖాలకు తానూ చేసుకున్న  పుణ్యమే కారణం.

5.      ప్రశ్న :- దు:ఖమపి కుత: ?

దేని వలన దు:ఖం కలుగుతుంది?

  సమాధానం :-పాపాత్ . పాపం చేయడం వలన దు:ఖం కలుగుతుంది.

6.      ప్రశ్న :- కస్య ఐశ్వర్యం ?

      ఎవరికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి?

సమాధానం :- య: కిల శంకరమారాధయేత్ భక్త్యా

ఎవడు శంకరుని భక్తితో ఆరాధిస్తాడో అతనికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

శం(సుఖం) కరోతి ఇతి  శంకర: . అంటే సుఖాలను ప్రసాదించే వాడు కాబట్టి ఆయన శంకరుడు . ‘ఈశ’ ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ‘వరచ్’ ప్రత్యయంతో ఈశ్వర శబ్దం ఏర్పడింది .  స్థేశభాసపిసకసో వరచ్ అనే సూత్రం చేత  స్థావర: , ఈశ్వర:, భాస్వర: , పిస్వర: , కస్వర: అనే రూపాలు ఏర్పడతాయి.       

7.      ప్రశ్న :- కో వర్ధతే ?

 ఎవడు నిత్యం వృద్ధి పొందుతూ ఉంటాడు ?

సమాధానం :- వినీత:

వినయం గలవాడు నిత్యం వృద్ధి పొందుతూనే ఉంటాడు. వినయమే  అభివృద్ధికి కారణం.

8.      ప్రశ్న :- కో వా హీయతే ?

            ఎవడు నశిస్తాడు

సమాధానం :- యో దృప్త:

ఎవడు గర్వంతో విఱ్ఱ వీగుతాడో, వాడు తప్పక నశిస్తాడు.

9.      ప్రశ్న :- కో న ప్రత్యేతవ్య: ?

ఎవరిని నమ్మకూడదు ?

సమాధానం :- బ్రూతే యశ్చ అనృతం శశ్వత్

ఎవడు నిరంతరం అసత్యాలు చెపుతాడో అటువంటి వానిని నమ్మకూడదు.

10. ప్రశ్న :- కుత్ర అనృతేsపి అపాపం?

ఏ సందర్భంలో అబద్ధం చెప్పినప్పటికి  ఎటువంటి పాపం అంటదు.

సమాధానం :- యచ్చోక్తం ధర్మ రక్షార్థం.

ఒక్కొక్కప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, నిరపరాధుల్ని రక్షించడం కోసం అసత్యం చెప్పినా పాపం అంటదు.   

11. ప్రశ్న :- కో ధర్మ:?

               ఏది ధర్మము?     

సమాధానం :- అభిమతో య: శిష్టానాం నిజకులీనానాం .

మంచి వారికి, గౌరవప్రదమైన వంశంలో జన్మించిన వారికి ఏది సమ్మతమో అదే ధర్మం.   

ప్రశ్న :- ప్రశ్న :- సాధుబలం కిం ?

మంచి వారికి ఏది బలము ?

సమాధానం :- దైవం

మంచి వారికి దైవమే  బలము.

121    ప్రశ్న :- క: సాధు:?

ఎవడు సాధువు / సజ్జనుడు ?

సమాధానం :-సర్వదా తుష్ట:   

ఎవడు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటాడో అతడే సాధువు / సజ్జనుడు.


122.     దైవం కిం ?

ఏది దైవం ?

సమాధానం :- యత్సుకృతం

మనం చేసిన మంచి పని యేదైతే ఉంటుందో అదే  దైవం.

ఈ ప్రపంచంలో చాల మతాలున్నాయి . అన్ని మతాలూ దైవాన్ని నమ్మవు. భారతదేశంలోనే పుట్టిన చాల మతాలు దైవాన్ని నమ్మవు. కాని దైవాన్ని నమ్మని దేశ, విదేశీయ మతాలు కూడ కర్మను నమ్ముతాయి. అందుకే పెద్దలు ‘అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాsశుభమ్’ అన్నారు  కాబట్టి ప్రతి వ్యక్తీ తాను చేసిన పుణ్య, పాపాలకు ఫలితాన్ని తానే అనుభవించి తీరాలి. ఏ దేవుడు రక్షించ లేడు. ఒకసారి తప్పు చేస్తే మరల చెయ్య కుండ కాపాడ గలుగుతాడేమో గాని చేసిన దాన్ని తప్పించ లేడు. ఒక వేళ తప్పు చేసిన వాణ్ణి కూడ రక్షించాలనుకుంటే ఆయన GOD ( Generator Operator  Destroyer) ఎలా అవుతాడు? ఇంకోటేదో ఔతాడు . ఇక మన సనాతన ధర్మంలో దైవ భీతికి చోటు లేదు. అధర్మ భీతికే చోటు ఉంది .  మనం తప్పు చేయడానికి భయపడాలి . దేవునికి కాదు. ఈ దైవ భీతి మనకు ఇతర సంస్కృతుల నుండి సంక్రమించిన దౌర్భాగ్యం . ప్రతి వ్యక్తి తప్పు చెయ్యడానికి మాత్రమే భయపడాలి. ఇక దేనికీ భయపడ కూడదు.  ఒకాయన అన్నాడు. మనం రహస్యంగా చేసిన పనులు దేవునికి ఎలా తెలుస్తాయండి! అని.  నేనన్నాను మనిషి తయారు చేసిన ఒక  చిన్న electronic device   ప్రతి కదలికను గమనిస్తున్నప్పుడు భగవంతుని ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించ గలమా! అని . ఇక బ్రహ్మసూత్ర వ్యాఖ్యానకర్త శ్రీ వాచస్పతి మిశ్రుల వారు  ఒక సందర్భంలో అంటారు.   మనకు మానవ శరీర నిర్మాణ రహస్యాలే తెలియవు, ఇక సృష్టి రహస్యాలు ఏమి తెలుస్తాయి అని.        

123.     ప్రశ్న :- కా సుకృతి: ?

ఏది మంచి పని  ?

సమాధానం :- శ్లాఘ్యతే చ యా సద్భి:

ఏది  మంచి వారి చేత కొనియాడ బడుతుందో అదే మంచి పని .

124.     ప్రశ్న :- గృహమేధినశ్చ మిత్రం కిం?

ఎవరు గృహస్థునకు మంచి మిత్రుడు ?

సమాధానం :- భార్యయే గృహస్థునకు మంచి మిత్రుడు

125.     ప్రశ్న :- కో గృహీ చ ?

ఎవడు గృహస్థుడు?

సమాధానం :- యో యజతే

ఎవడు, యజ్ఞం మొదలైన క్రియా కలాపాలు నిర్వహిస్తాడో అతడే గృహస్థుడు.

126.     ప్రశ్న :- కో యజ్ఞ: ?

ఏది యజ్ఞము ?

సమాధానం :-య: శ్రుత్యా విహిత: శ్రేయస్కరో నృణాం

ఏదైతే వేదముచే విధింపబడి, సమస్త మానవ లోకానికి మేలు చేకూరుస్తుందో  అదే యజ్ఞం.  

<><><>