Sunday, June 14, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-8 రచన:- శ్రీ శంకరాచార్యులు

 ప్రశ్నోత్తర రత్నమాలికా Part-8

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

122.     ప్రశ్న :- కస్య క్రియా సఫలా?

ఎవరి పనులు ఫలవంతం ఔతాయి?  .

సమాధానం :- య: పున: ఆచారవాన్ శిష్ట:

ఎవడు మంచివాడై,  సదాచార సంపన్నుడుగా ఉంటాడో, అతని పనులన్నీ తప్పక సఫలమౌతాయి . ఇక్కడ ఆచారమంటే మడి, ఆచారం అని కాదు. ఆచరణ అని అర్థం. మన సమాజంలో నూటికి తొంబై మంది నీతులు చెప్పే వారే గాని ఆచరించే వారు చాల తక్కువ. వేదం ఆచరణకు చాల ప్రాధాన్యం ఇచ్చింది . ఏమంటున్నదో స్వయంగా చూడండి.

ఆచారహీనం న పునంతి వేదా: యద్యప్యధీతా: సహ షడ్భిరంగై:

                    ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షా:

ఒక వ్యక్తి ఎన్ని వేదాలు, వేదాంగాలు చదివినా వాటి విలువల్ని ఆచరణలో పెట్టకపోతే అవి అతనిని రక్షించవు. ఏ విధంగా రెక్కలొచ్చిన పక్షి గూడు విడిచిపెట్టి పాఱి పోతుందో అలాగే ఆ వ్యక్తి మరణించిన తరువాత వేదాలన్నీ అతనిని విడిచిపెట్టి పోతాయి. ఆచరణ  లేని జ్ఞానం వ్యర్థం . ఇక గూడు విడిచిపెట్టి  వెళ్ళిన పక్షి మరల ఆ గూటికి చేరదు . తనకు తానే స్వయంగా నిర్మించుకొంటుందని ప్రతీతి .

123.     ప్రశ్న :-  క: శిష్ట: ?

ఎవడు శిష్టుడు/సజ్జనుడు  ?

సమాధానం :-యో వేదప్రామాణ్యవాన్.

ఎవడు, వేదాన్నే ప్రమాణంగా తీసుకుంటాడో అతడే శిష్టుడు/ సజ్జనుడు.

124.     ప్రశ్న :- యో హత: ? ఎవడు హతుడు ?

సమాధానం :-క్రియా భ్రష్ఠ:

ఎవడు తన కర్తవ్యాన్ని విడిచి పెడతాడో,  అతడే హతుడు.   

125.     ప్రశ్న :- కో ధన్య: ?

ఎవడు ధన్యుడు?

సమాధానం :-సన్యాసీ

సన్యాసి చాల ధన్యుడు.

‘అన్ని విడిచిపెడితే, వాడు సన్యాసి; అందరు విడిచి పెడితే వాడు సన్నాసి’ అని సుప్రసిద్ధ పండితులు , అవధాని శ్రీ రావూరి వేంకటేశ్వర్లు గారు ఒక అవధానంలో సన్యాసికి సన్నాసికి మధ్య గల తేడాను చమత్కరించారు.    

126.     ప్రశ్న :- కో మాన్య: ? ఎవడు గౌరవించదగినవాడు.

సమాధానం :-పండిత: సాధు:

                పండితుడైన సజ్జనుడు. కేవలం విద్యావంతుడైనంత మాత్రాన సరిపోదు. శీలం కూడ అవసరం .     శీలం లేని విద్యావంతుడు అందరికన్నా ప్రమాదకారి. అందుకే భర్తృహరి  

‘దుర్జన: పరిహర్తవ్య: విద్యయాsలంకృతోsపి సన్

మణినా భూషిత: సర్ప: కిమసౌ న భయంకర:’   అంటాడు .

దుర్జనుడు విద్యావంతుడైనప్పటికి అతనిని చేర రాదు. పాము తన తలపై విలువైన మణిని ధరించినప్పటికీ అది భయంకరమైనదే కదా!  .  ఇంచుమించు ఇదే భావాన్ని  Shakespeare మహాకవి రచించిన

‘As you like it’ నాటకంలోని ....  Which like the toad, ugly and venomous,

Wears yet a precious jewel in his head...... మొదలైన మాటలు జ్ఞప్తికి తెస్తాయి.

127.     ప్రశ్న :- క: సేవ్య: ?

ఎవడు సేవిపదగిన వాడు? 

సమాధానం :-యో దాతా

దాతృత్వం గల వ్యక్తి సేవింప దగిన వాడు .

Part-23.

128.     ప్రశ్న :- కో దాతా?

దాత అనగా ఎవరు?

సమాధానం :-య:  అర్థిం  తృప్తిమాతనుతే

ఎవడు, తన వద్దకు వచ్చిన అర్థిని /యాచకుని  పూర్తిగా సంతృప్తి పరుస్తాడో అతడే దాత .

129.     ప్రశ్న :- కిం భాగ్యం దేహవతామ్  ?

మానవులకు ఏది అసలైన భాగ్యము ?

సమాధానం :-ఆరోగ్యం.  

మానవులకు ఆరోగ్యమే  అసలైన భాగ్యము.

If money is lost, nothing is lost

If health is lost, something is lost

If character is lost everything is lost. అన్నారు పెద్దలు . అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్  అంటాడు కాళిదాసు . ధర్మ సాధనకు శరీరమే మొట్టమొదటి సాధనము.

130.     ప్రశ్న :- క: ఫలీ ?

ఎవడు మంచి ఫలాలను పొందుతాడు?

సమాధానం :-కృషికృత్

వ్యవసాయం చేసే వాడు మంచి ఫలాలను పొందు తాడు.

ఈ ప్రపంచంలోని అన్ని వృత్తులలో వ్యవసాయమే చాల పవిత్రమైనది, గొప్పదీని . ఇక కృషి అంటే పరిశ్రమ అనే అర్థం కూడ ఉంది. ఏ వృత్తిలోనైనా  అధికమైన పరిశ్రమ చేసినవాడు అన్ని ఫలాలను పొందుతాడు.  

131.     ప్రశ్న :- కస్య న పాపం ?

ఎవరికి పాపం అంటదు.

                 సమాధానం :-జపత:

                 జపం చేసే వానికి పాపం అంటదు. ( కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం) .

132.     ప్రశ్న :- క: పూర్ణ:?

ఎవడు పరిపూర్ణమైన మానవుడు?

 సమాధానం :-య: ప్రజావాన్స్యాత్

సంతానం గల వాడు పరిపూర్ణ మైన మానవుడు ఔతాడు.  

133.     ప్రశ్న :- కిం దుష్కరం నరాణాం?

మానవులకు ఏది చాల కష్టమైన పని ?

సమాధానం :-యన్మనసో నిగ్రహ: సతతం

ఎల్లప్పుడూ మనస్సును అదుపులో పెట్టుకోవడం మానవులకు చాల కష్టమైన పని.

శ్రీ కృష్ణుడంతటి వాడే మనస్సును అదుపులో పెట్టుకోవడం మానవులకు చాల కష్టమైన పని అన్నాడు . కాని అభ్యాసం, వైరాగ్యం వల్ల అది సాధించవచ్చని సలహా చెప్పాడు. అందుకే పతంజలి “అభ్యాస వైరాగ్యాభ్యాం చిత్తవృత్తి నిరోధ: ”  అన్నారు . కాబట్టి మనోనిగ్రహం కష్ట సాధ్యం కావచ్చు నేమో! గాని అసాధ్యం మాత్రం కాదు .    

134.     ప్రశ్న :- కో బ్రహ్మచర్యవాన్ స్యాత్?

ఎవడు బ్రహ్మచారి ?

సమాధానం :- యస్యాస్ఖలితమూర్ధ్వరేతస్క:

అస్ఖలితుడు గాని , ఊర్ధ్వరేతస్కుడు గాని బ్రహ్మచారి ఔతున్నాడు.

సాధారణంగా వివాహం చేసుకోని వాణ్ణి బ్రహ్మచారి అంటారు . అది సరే, కాని  బ్రహ్మణి  చరతి ఇతి బ్రహ్మచారీ అని తాత్త్విక పరమైన అర్థం.  అంటే పర బ్రహ్మమందు మనస్సును  ఎల్లప్పుడూ లగ్నం చేసేవాడు/ లీనమై ఉండే వాడు  అని అర్థం.

ఇక దీనికి సంబంధించినది,  నేను చిన్నప్పుడు చందమామలో చదివిన కథ ఒకటి వివరిస్తాను.

                 ఒకనాడు వసిష్ఠ మహర్షి తన భార్య    అరుంధతిని పిలిచి ఆమెతో “ ఈ రోజు నువ్వు గంగానదికి అవతలి గట్టున ఉన్న అగస్త్య మహర్షికి భోజనం పట్టుకొని వెళ్ళు “ అని చెప్పాడు. ఆమె ఆహారం పట్టుకొని నది దగ్గరకు వెళ్ళింది. ఆ నది పరవళ్ళు తొక్కుకుంటూ చాల వేగంగా ప్రవహిస్తోంది . నదీ ప్రవాహం దాటడానికి వీలుగా లేదు, దాటించే వారు కూడ ఎవరు లేరు . ఆమె ఇంటికి వచ్చి విషయం అంతా చెప్పింది.  అప్పుడు మహర్షి ఆమెతో నిత్య బ్రహ్మచారి పంపించాడని ఆ నదితో చెప్పమని మరలా పంపించాడు . ఆమె తిరిగి వెళ్లి ఆ విషయాన్ని నదికి విన్నవించగానే ఆ నది రెండు పాయలుగా విడిపోయి ఆమెకు దారి ఇచ్చేసింది. ఆమె కాలి నడకన నది దాటి ఆ మహర్షిని చేరుకొని తాను తెచ్చినదంతా ఆయనకు సమర్పించింది . ఆయన కూడ ఒక్క మెతుకు మిగుల్చకుండా పూర్తిగా తినేశాడు. ఆమెతో ధన్యవాదాలు తల్లీ! వెళ్ళిరామ్మా ! అన్నాడు . ఆమె, స్వామీ! నేను ఎలా తిరిగి వెళ్ళగలను? . నది చాల వేగంగా ప్రవహిస్తోంది. అక్కడ దాటించే వారు కూడ ఎవరు లేరు అంది. ఆయన ఓహో అలాగా! దానికేముందమ్మా! నిత్యోపవాసి పంపించాడని చెప్పు , ఆ నది నీకు దారి ఇస్తుంది’  అన్నాడు. ఆమె అలాగే చెప్పింది . నది అలాగే దారి ఇచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ప్రశాంతంగా తిరిగి వచ్చినా మనశ్శాంతి లేదు. మా ఆయన ఎల్లపుడు నా తోనే ఉంటూ నిత్య బ్రహ్మచారి ఎలా అయ్యారు . ఇక ఒక్క మెతుకు కూడ మిగుల్చకుండా తినేసిన ఆయన నిత్యోపవాసి ఎలా అయ్యాడో ఈమెకు అర్థం కాలేదు . భర్తను చేరి వినయంగా అన్ని అడిగింది. ఆయన చెప్పాడు. ఎవడు, సర్వకాల, సర్వావస్థలలోను  మనస్సును ఆత్మ(బ్రహ్మ)యందు లయం చేస్తాడో అతడే బ్రహ్మచారి. నేను బాహ్యంగా ఎన్నో లౌకిక కార్యక్రమాలలో పాల్గొంటున్నా, నా మనస్సు ఎప్పుడు అంతర్ముఖం గానే ఉంటుంది. నేను నిత్య బ్రహ్మచారినే. ఇక ఉపవాసం విషయానికొద్దాం. ఉపవాసం అనే పదానికి ఒక విశిష్టమైన అర్థం ఉంది .

ఉపసమీపే యో వాస: జీవాత్మ పరమాత్మనో:

ఉపవాస: స విజ్ఞేయ: న తు కాయస్య శోషణం

 దీన్ని బట్టి ఉపవాసం అంటే జీవాత్మను , పరమాత్మ సమీపంలో ఉండేటట్లు చెయ్యడం . ఒక విధంగా ధ్యానంలో ఉండమని  తాత్పర్యం. ఆహారం కడుపునిండా తింటే అది సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైనంత స్వల్పంగా తీసుకోవడం పరిపాటి. ఆహారం ఎక్కవగా తీసుకున్నవానికి; అదే విధంగా అసలు ఆహారం తిననివానికి యోగం కుదరదని  నాత్యశ్నతస్తు  యోగోsస్తి న చ యోగమనశ్నత:  అనే మాటల్లో  భగవానుడు సెలవీయడం మనకందరికీ తెలిసిందే కదా! ఇంకో విషయం  చెపుతాను విను. మనం ఆహారం తీసుకొని వెళ్లినప్పుడు ఆయన స్వీకరించాడు గాని నా భార్య లోపాముద్ర పుట్టింటికి వెళ్ళింది నాకు అన్నం పంపించమని ఎప్పుడు మనల్ని అడగలేదు, నువ్వు గమనిచావా! అన్నాడు . ఆమె తల ఉపింది .  రామాయణంలో “ ఉపవాసపరైకాగ్రా వస త్వం జనకాత్మజే! పతివ్రతాత్వమస్థాయ రామం కృత్వా సదా హృది” అనే మాటలకు ధ్యానం చేస్తూ ఉండమనే తాత్పర్యం .   ఆ సంగతి అలా ఉంచుదాం. ఈ సందర్భంలో మా గురుదేవులు శ్రీ గంటి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఒక విషయాన్ని చెప్పారు . అది ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. నేటికి మన పవిత్ర భారతదేశంలో హిమాలయాల్లో ఎంతో మంది యోగులున్నారు. వాళ్ళ కోసం టాటా - బిర్లా ల వంటి మహానుభావులు కొన్ని ట్రస్టులను ఏర్పాటు చేశారట. ప్రతి రోజు అక్కడ ఉండే యోగులకు ఉచితంగా పాలు, ఆహారం సమకూర్చడం వారి నిత్యకృత్యం . ప్రతి రోజు ఎంతోమంది యోగులు అక్కడకు వస్తూ, పోతూ ఉంటారు. లైనులో మౌనంగా నిలబడి, వారు పెట్టింది తినేసి, వెళ్లి పోతూ ఉంటారు . విచిత్రమేమిటంటే

కొంతమంది రోజూ రావడం లేదట. నెలకో  , రెండు నెలలకో , మూడు నెలలకో  తినాలనిపిస్తే ఒక్కసారి వస్తున్నారట. అక్కడ పని చేసే వారు ఈ  విషయాన్ని బాగా గమనించారు . ఆహా ! ఎంత గొప్ప వారు ఆ యోగులు! . అటువంటి వారికి నిలయమైన మన భారతదేశం చాల ధన్యమైనది. ఇక స్వామి రామ అనే మహనీయుడు My experience with the Himalayan yogis అనే గ్రంథాన్ని  వ్రాశారు. అది చదివితే మరెన్నో విశేషాలు తెలుస్తాయి.          

 ఇక మనలో కొందరు ముందుగా తిండి మానెయ్యడం ఆ తరువాత పదింతలు తినెయ్యడం    ఒకే సారి ఈ రెండు తప్పులు చేస్తున్నారు . దైవ ధ్యానం కన్నా సాయంకాలం తినబోయే వంటకాలపైనే ధ్యాస ఎక్కువ. దీనివల్ల పారమార్థిక లాభం శూన్యమే అని చెప్పక తప్పదు. ఇది ఎవరికి వారు  తెలుసుకోవాలి . ఎవరూ చెప్పే విషయం కాదు. 

             135.     ప్రశ్న :- కా చ పరదేవతా ఉక్తా ?

ఏది పర దేవతగా చెప్పబడున్నది?

సమాధానం :-చిచ్ఛక్తి:

మన శరీరంలో ఉన్న చైతన్య శక్తియే  పర దేవతగా చెప్పబడుతున్నది. మనలో ప్రత్యగాత్మ (జీవాత్మ) రూపంలో ఉన్న చైతన్య శక్తియే పరమ దైవం ..
<><><>

Thursday, June 11, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-7 రచన:- శ్రీ శంకరాచార్యులు

  ప్రశ్నోత్తర రత్నమాలికా Part-7

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

1.      ప్రశ్న :- సంభావితస్య మరణాత్ అధికం కిం ?

                             మరణం కంటే నీచమైనది ఏది?  

                 సమాధానం :- దుర్యశో భవతి.

                       అపకీర్తి మరణం కన్న నీచమైనది. ఈ ప్రపంచంలో కొన్ని దేశాలున్నాయి. వాటి పేర్లు అందరికీ తెలిసినవే . ఆ దేశాలలో పాలకులుగా నియమితులైన వారు ప్రజా పరిపాలన విషయంలో ఎటువంటి తప్పిదం  చేయరు. ఎవరైనా వారిపై దోషం మోపితే చాలు అది నిజమైనా కాక పోయినా  ప్రజలకు మొగం చూపించలేక  ఆత్మహత్య చేసుకుంటారట! ఇదే అపకీర్తి కన్నా మరణమే మిన్న అనే మాటలకు అర్థం . మన దేశ పరిస్థితి వేరు కాళ్ళు పట్టుకు లాగుతున్నా చూరు పట్టుకుని  వ్రేళాడుతూ ఉంటారు.       

2.      ప్రశ్న :- లోకే సుఖీ భవేత్ క:?

           లోకంలో ఎవడు సుఖం పొందుతున్నాడు ?

        సమాధానం :- ధనవాన్.

          లోకంలో  ధనవంతుడు సుఖం పొందుతున్నాడు.

3.      ప్రశ్న :- ధనమపి చ కిం ?

             ధనం అంటే ఏది?

            సమాధానం :-యతశ్చేష్టమ్.

              మనిషి దేని వలన తనకు కావలసినది పొందుతున్నాడో అదే ధనం .

4.      ప్రశ్న :- సర్వసుఖానాం బీజం కిం?

                సమస్త సుఖాలకు ఏది కారణం ?

సమాధానం :- పుణ్యం.

మనిషి పొందే సమస్త సుఖాలకు తానూ చేసుకున్న  పుణ్యమే కారణం.

5.      ప్రశ్న :- దు:ఖమపి కుత: ?

దేని వలన దు:ఖం కలుగుతుంది?

  సమాధానం :-పాపాత్ . పాపం చేయడం వలన దు:ఖం కలుగుతుంది.

6.      ప్రశ్న :- కస్య ఐశ్వర్యం ?

      ఎవరికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి?

సమాధానం :- య: కిల శంకరమారాధయేత్ భక్త్యా

ఎవడు శంకరుని భక్తితో ఆరాధిస్తాడో అతనికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

శం(సుఖం) కరోతి ఇతి  శంకర: . అంటే సుఖాలను ప్రసాదించే వాడు కాబట్టి ఆయన శంకరుడు . ‘ఈశ’ ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ‘వరచ్’ ప్రత్యయంతో ఈశ్వర శబ్దం ఏర్పడింది .  స్థేశభాసపిసకసో వరచ్ అనే సూత్రం చేత  స్థావర: , ఈశ్వర:, భాస్వర: , పిస్వర: , కస్వర: అనే రూపాలు ఏర్పడతాయి.       

7.      ప్రశ్న :- కో వర్ధతే ?

 ఎవడు నిత్యం వృద్ధి పొందుతూ ఉంటాడు ?

సమాధానం :- వినీత:

వినయం గలవాడు నిత్యం వృద్ధి పొందుతూనే ఉంటాడు. వినయమే  అభివృద్ధికి కారణం.

8.      ప్రశ్న :- కో వా హీయతే ?

            ఎవడు నశిస్తాడు

సమాధానం :- యో దృప్త:

ఎవడు గర్వంతో విఱ్ఱ వీగుతాడో, వాడు తప్పక నశిస్తాడు.

9.      ప్రశ్న :- కో న ప్రత్యేతవ్య: ?

ఎవరిని నమ్మకూడదు ?

సమాధానం :- బ్రూతే యశ్చ అనృతం శశ్వత్

ఎవడు నిరంతరం అసత్యాలు చెపుతాడో అటువంటి వానిని నమ్మకూడదు.

10. ప్రశ్న :- కుత్ర అనృతేsపి అపాపం?

ఏ సందర్భంలో అబద్ధం చెప్పినప్పటికి  ఎటువంటి పాపం అంటదు.

సమాధానం :- యచ్చోక్తం ధర్మ రక్షార్థం.

ఒక్కొక్కప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, నిరపరాధుల్ని రక్షించడం కోసం అసత్యం చెప్పినా పాపం అంటదు.   

11. ప్రశ్న :- కో ధర్మ:?

               ఏది ధర్మము?     

సమాధానం :- అభిమతో య: శిష్టానాం నిజకులీనానాం .

మంచి వారికి, గౌరవప్రదమైన వంశంలో జన్మించిన వారికి ఏది సమ్మతమో అదే ధర్మం.   

ప్రశ్న :- ప్రశ్న :- సాధుబలం కిం ?

మంచి వారికి ఏది బలము ?

సమాధానం :- దైవం

మంచి వారికి దైవమే  బలము.

121    ప్రశ్న :- క: సాధు:?

ఎవడు సాధువు / సజ్జనుడు ?

సమాధానం :-సర్వదా తుష్ట:   

ఎవడు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటాడో అతడే సాధువు / సజ్జనుడు.


122.     దైవం కిం ?

ఏది దైవం ?

సమాధానం :- యత్సుకృతం

మనం చేసిన మంచి పని యేదైతే ఉంటుందో అదే  దైవం.

ఈ ప్రపంచంలో చాల మతాలున్నాయి . అన్ని మతాలూ దైవాన్ని నమ్మవు. భారతదేశంలోనే పుట్టిన చాల మతాలు దైవాన్ని నమ్మవు. కాని దైవాన్ని నమ్మని దేశ, విదేశీయ మతాలు కూడ కర్మను నమ్ముతాయి. అందుకే పెద్దలు ‘అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాsశుభమ్’ అన్నారు  కాబట్టి ప్రతి వ్యక్తీ తాను చేసిన పుణ్య, పాపాలకు ఫలితాన్ని తానే అనుభవించి తీరాలి. ఏ దేవుడు రక్షించ లేడు. ఒకసారి తప్పు చేస్తే మరల చెయ్య కుండ కాపాడ గలుగుతాడేమో గాని చేసిన దాన్ని తప్పించ లేడు. ఒక వేళ తప్పు చేసిన వాణ్ణి కూడ రక్షించాలనుకుంటే ఆయన GOD ( Generator Operator  Destroyer) ఎలా అవుతాడు? ఇంకోటేదో ఔతాడు . ఇక మన సనాతన ధర్మంలో దైవ భీతికి చోటు లేదు. అధర్మ భీతికే చోటు ఉంది .  మనం తప్పు చేయడానికి భయపడాలి . దేవునికి కాదు. ఈ దైవ భీతి మనకు ఇతర సంస్కృతుల నుండి సంక్రమించిన దౌర్భాగ్యం . ప్రతి వ్యక్తి తప్పు చెయ్యడానికి మాత్రమే భయపడాలి. ఇక దేనికీ భయపడ కూడదు.  ఒకాయన అన్నాడు. మనం రహస్యంగా చేసిన పనులు దేవునికి ఎలా తెలుస్తాయండి! అని.  నేనన్నాను మనిషి తయారు చేసిన ఒక  చిన్న electronic device   ప్రతి కదలికను గమనిస్తున్నప్పుడు భగవంతుని ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించ గలమా! అని . ఇక బ్రహ్మసూత్ర వ్యాఖ్యానకర్త శ్రీ వాచస్పతి మిశ్రుల వారు  ఒక సందర్భంలో అంటారు.   మనకు మానవ శరీర నిర్మాణ రహస్యాలే తెలియవు, ఇక సృష్టి రహస్యాలు ఏమి తెలుస్తాయి అని.        

123.     ప్రశ్న :- కా సుకృతి: ?

ఏది మంచి పని  ?

సమాధానం :- శ్లాఘ్యతే చ యా సద్భి:

ఏది  మంచి వారి చేత కొనియాడ బడుతుందో అదే మంచి పని .

124.     ప్రశ్న :- గృహమేధినశ్చ మిత్రం కిం?

ఎవరు గృహస్థునకు మంచి మిత్రుడు ?

సమాధానం :- భార్యయే గృహస్థునకు మంచి మిత్రుడు

125.     ప్రశ్న :- కో గృహీ చ ?

ఎవడు గృహస్థుడు?

సమాధానం :- యో యజతే

ఎవడు, యజ్ఞం మొదలైన క్రియా కలాపాలు నిర్వహిస్తాడో అతడే గృహస్థుడు.

126.     ప్రశ్న :- కో యజ్ఞ: ?

ఏది యజ్ఞము ?

సమాధానం :-య: శ్రుత్యా విహిత: శ్రేయస్కరో నృణాం

ఏదైతే వేదముచే విధింపబడి, సమస్త మానవ లోకానికి మేలు చేకూరుస్తుందో  అదే యజ్ఞం.  

<><><>

Wednesday, June 10, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-6 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-6

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

 

1.      ప్రశ్న :- కా సురక్ష్యా ? మనం దేనిని జాగ్రత్తగా రక్షించుకోవాలి?

సమాధానం :-కీర్తి:, పతివ్రతా, నిజబుద్ధిశ్చ

కీర్తిని. స్త్రీల పాతివ్రత్యాన్ని , మన వ్యక్తిత్వాన్ని   జాగ్రత్తగా రక్షించుకోవాలి?

2.      ప్రశ్న :- కా కల్పలతా లోకే ?

లోకంలో ఏది కల్పలత వంటిది ?

సమాధానం :- సచ్ఛిష్యాయ అర్పితా విద్యా

మంచి శిష్యునకు నేర్పని విద్య కల్పవృక్షము వంటిది . మంచి శిష్యునకు బోధించిన విద్య కల్పవృక్షంలా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కణ్వుడు, తన ప్రమేయం లేకుండా శకుంతల గాంధర్వ విధిలో  దుష్యంతుని వివాహం చేసుకున్న సందర్భంలో కణ్వుడు ఆమెను చేరి ఆమెను ఆశీర్వదిస్తూ  అమ్మా! “సుశిష్య పరిదత్తా విద్యేవాsశొచనీయా సంవృత్తా” అంటాడు.  అమ్మా ! మంచి శిష్యునకు బోధించిన విద్యలా నీ గురించి నేను విచారించవలసిన పనిలేదు అని ఆ మాటలకర్థం.       

3.       ప్రశ్న :- కో అక్షయ వటవృక్ష: స్యాత్ ?

సమాధానం :-విధివదత్తమపాత్రం దానం యత్

విధిలేక అపాత్రునకు ఇచ్చిన విద్య వటవృక్షం వంటిది .

వటవృక్షం తన నీడలో ఏ చెట్టును ఎదుగ నివ్వదని ప్రతీతి . వాడా ! వాడొక వటవృక్షం లాంటి వాడండీ! అంటారు . అంటే వాడు ఎవరినీ ఎదుగనివ్వడని తాత్పర్యం. విద్య అందరికీ పంచాలి. “కేతుం కృణ్వన్నకేతవే” అంటుంది వేదం.  ఒక విద్యావంతుడు మరొకరిని విద్యావంతునిగా చెయ్యాలని అర్థం . అది మంచి వానికి విద్య నేర్పినప్పుడే సాధ్యపడుతుంది.    ఇక అన్నదానాత్పరం దానం విద్యాదానమితి స్మృతమ్

అన్నేన క్షిణికా తృప్తి: యావజ్జీవం చ విద్యయా అన్నారు పెద్దలు . అన్నం పెట్టడం కన్నా విద్య నేర్పించడం చాల ఉత్తమం, అన్నం వల్ల కలిగే తృప్తి క్షణికమైనది . ఇక విద్యవల్ల కలిగే సంతృప్తి శాశ్వతమైనది. అందుకే కాబోలు  Instead of giving a fish to a person daily, it is better to teach how to catch fish అంటారు Jesus Christ ఒక సందర్భంలో.   

4.      ప్రశ్న :- కిం శాస్త్రం సర్వేషాం ?

అందరకు ఏది శాస్త్రము ?

సమాధానం :- యుక్తి: అ ఒక సూది బెజ్జం నుంచి ఒక ఒంటెను పంపించడం సులభమౌతుందేమో గాని  ఒక ధనవంతుని ఉన్నతలోకానికి పంపటం సాధ్యమూ  కాదని భావం . ఒక సూది బెజ్జం నుంచి ఒక ఒంటెను పంపించడం సులభమౌతుందేమో గాని  ఒక ధనవంతుని ఉన్నతలోకానికి పంపటం సాధ్యమూ  కాదని భావం .

నగా హేతుబద్ధమైన ఆలోచనయే శాస్ర్తం    

5.      ప్రశ్న :- మాతా చ కా?

అందరికీ తల్లి ఎవరు?

సమాధానం :-ధేను: గోవు అందరికీ తల్లి .

6.      ప్రశ్న :- కిం ను బలం ? అందరికీ ఏది బలము?

సమాధానం :-యద్ధైర్యం. ధైర్యమే అందరికీ బలం.

7.      ప్రశ్న :- కో మృత్యు: ?

ఏది మరణంతో సమానమైనది?

సమాధానం :-యదవధానరహితత్త్వం

అవధాన రాహిత్యమే మృత్యువుతో సమానమైనది . మనిషి ఎల్లప్పుడు అన్ని విషయాల్లోనూ జాగరూకతతో ఉండాలి . ఏమరుపాటు పనికి రాదు.  అది మృత్యువుతో సమానం .

8.      ప్రశ్న :-  కుత్ర విషం ?

ఎక్కడ విషం ఉంటుంది?

 సమాధానం :- దుష్ట జనే దుష్టుని యందు ఉంటుంది.

తలనుండు విషము ఫణికిని

వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విసము గదరా సుమతీ !   

9.      ప్రశ్న :- కిమిహాశ్చర్యం భవేత్ ?

ఏది చాల ఆశ్చర్య కరమైనది ?

సమాధానం :-ఋణం నృణాం

మానవునికి అప్పులు , కర్మలు చాల ఆశ్చర్య కరమైనవి. చేసే కొద్దీ పెరుగుతాయి. ఆనందంతో చేస్తాం. తీర్చేటప్పుడు ఏడుస్తాం .  చెయ్యడం  చాల సులభం బయటపడటం ఎంతో కష్టం . అప్పులు చాల  ప్రమాదకరమైనవి. ఐహికంగాను, ఆధ్యాత్మికంగాను రెండు విధాల ఇవి ప్రమాదకరమే, ప్రగతి నిరోధకారకమే. ఋణం తీరితే గాని స్వేచ్ఛ లేదు, కర్మలు  క్షయం కాకుండ మోక్షం రాదు.  Debt is a bottomless ocean.

10. ప్రశ్న :- కిమభయం ఇహ?

ఈ లోకంలో మనకు అభయం ఇచ్చేది ఏది ?  

సమాధానం :- వైరాగ్యం. వైరాగ్యమే మనకు అభయం చేకూరుస్తుంది. భర్తృహరి వైరాగ్యశతకంలో భోగే రోగభయం అనే శ్లోకంలో మనం భోగాలు అనుభవిస్తున్నామనుకుంటే, రాబోయే కాలంలో రోగాలు  వస్తాయేమో  అన్న భయం.  మంచి కులంలో పుట్టేమనుకుంటే, కులం నుంచి వెలివేయబడతామేమో అన్న భయం; ధనం ఉంటే రాజులు tax రూపంలో వశపరచు కుంటారేమో అన్న భయం; ఇపుడు చాల ఉన్నత స్థితిలో ఉన్నామనుకుంటే రేపు దైన్యం కలుగుతుందేమో అన్న భయం. మనం బలవంతులం అనుకుంటే శత్రువులు ముట్టడిస్తారేమో అని భయం. ఈ విధంగా  చెప్పుకొస్తు ఈ ప్రపంచంలో అన్నీ భయంతో కూడు కొన్నవే, వైరాగ్యమొక్కటే  అభయాన్ని ఇస్తుంది అంటారు.

 

11. ప్రశ్న :- భయమపి కిం ?

                ఏది భయం కలిగిస్తుంది?

సమాధానం :- విత్తమేవ సర్వేషాం. అందరికి ధనమే భయాన్ని కలిగిస్తుంది.

అందుకే Jesus Christ కూడ ఒక సందర్భంలో  It is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God

 అంటారు. ఒక సూది బెజ్జం నుంచి ఒంటెను పంపించడం సులభం ఔతుందేమో గాని  ఒక ధనవంతుని ఉన్నత లోకానికి పంపటం సాధ్యమూ  కాదని భావం . ఇక్కడ ముముక్షువునకు ధనంతో బంధం పనికి రాదని అది ప్రతిబంధకమని వారి అభిప్రాయంగా మనం భావించవచ్చు. 

12. ప్రశ్న :- కా దుర్లభా నరాణామ్ ?

మానవులకు ఏది దుర్లభము ?

సమాధానం :-హరిభక్తి: మానవులకు పరమేశ్వరుని యందు భక్తి కలిగియుండడమే దుర్లభము.

  

13. ప్రశ్న :- పాతకం చ కిమ్ ? పాతకమంటే ఏమిటి ?

సమాధానం :- హింసా. ఇతరులను శారీరకంగాను , మానసికంగాను హింసించడమే పాతకం  .  వేదం ‘అహింసా పరమో ధర్మ:’ అంటుంది. అహింసను మించిన ధర్మం మరొకటి లేదు. జైన మతం మరో అడుగు ముందుకు వేసి కేవలం హింసించక పోయినంత మాత్రాన   సరి పోదు, వాటిని ఆదుకోవడం కూడ మన కర్తవ్యం అంటుంది.

ఈ సందర్భంలో సంత్ కబీర్ దాసు చెప్పిన ఒక మాట ప్రస్తావించడం అప్రస్తుతం కాదు.

“దుర్బల కో న  సతాయియే జాకీ మోటా హాయ్... సార భస్మ హో జాయ్”.

నువ్వు నీ కంటే బలహీనుని ఎన్నడు బాధ పెట్టకు. వాడు బలహీనుడైనా, వాడి ఊపిరి (ఉసురు) చాల బలమైనది . గిన్నెలకు  మాట్లు వేసే వాని దగ్గర ఉండే ప్రాణం లేని కొలిమి తిత్తి నుండి వచ్చే గాలి ఇనుమును కరిగిస్తోంది. ఇక ప్రాణమున్న అభాగ్యుని ఉసురు నీ వంశాన్ని దహిస్తుంది,  జాగ్రత సుమా ! అంటారు .                   

14. ప్రశ్న :- కో హి భగవత్ప్రియ: స్యాత్ ?

ఎవడు భగవంతునకు ప్రీతిపాత్రుడు?

సమాధానం :-యోsన్యం న ఉద్వేజయతి, అనుద్విగ్న:

ఇతరులను ఇబ్బంది పెట్టనివాడు, ఇతరులవలన ఎటువంటి ఇబ్బందులు పడనివాడు .

ఈ ప్రపంచంలో భక్తులు రెండు విధాలుగా ఉంటారు. మొదటి వాడు దేవుని ఇష్టపడేవాడు , రెండోవాడు దేవుని ప్రేమకు పాత్రుడయినవాడు, అంటే దేవుని చేత ప్రేమించబడే వాడు. గీతలో 12 అధ్యాయం భక్తి యోగం చాల గొప్పది.   మహాత్మా గాంధీ ప్రతిరోజూ గీత పూర్తిగా చదివే వారు. ఒక్కొక్కప్పుడు సమయం లేకపోతే 12వ అధ్యాయం తప్పని సరిగా చదివేవారు. అందులో పరమాత్ముడు తనకు ఇష్టమైన భక్తుల లక్షణాలను స్పష్టంగా వివరించడం మనం గమనిస్తాం .

గీతలో  యస్మాన్నోద్విజతే లోక: లోకాన్నోద్విజతే చ య: అని చెప్పడం గమనార్హం .

15. ప్రశ్న :- కస్మాత్ సిద్ధి: ?

సిద్ధి దేని వలన కలుగుతుంది?

సమాధానం :-తపస: తపస్సు వలన సిద్ధి కలుగుతుంది

16. ప్రశ్న :- బుద్ధి: క్వను?

       బుద్ధి ఎక్కడ ఉంటుంది ?

సమాధానం :-భూసురే బ్రాహ్మణుని యందు ఉంటుంది.

నన్నయగారు మహాభారతంలో బ్రాహ్మణుని లక్షణాలు వివరిస్తూ ఇలా అంటారు.  

ఉ || భునుతకీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడనె పుట్టు నుత్తమ

       జ్ఞానము, సర్వభూత హితసంహితశక్తియు, నాత్మశుద్ధియున్,

      మాన మద ప్రహాణము, సమత్వము, సంతతయోగవిద్యను

      ష్ఠానము, చిత్తశాంతియు, దృఢవ్రతముం, గరుణాపరత్వమున్

      1. నుత్తమ జ్ఞానం 2. సర్వ భూతముల పట్ల దయ 3. ఆత్మ శుద్ధి  

4. గర్వం లేకపోవడం 5. అందరి పట్ల సమ భావన 6. ఎల్లప్పుడూ యోగ విద్యను

అనుష్ఠానం చేయడం 7. చిత్త శాంతి 8. దృఢమైన  దీక్ష 9. కరుణ అనేవి బ్రాహ్మణుని సహజ లక్షణాలు, అంటే పుట్టుకతో వచ్చేవి . కాబట్టి ఈ నవ లక్షణాలు కలిగి ఎటువంటి అవలక్షణాలు లేనివాడే బ్రాహ్మణుడు . 

17. ప్రశ్న :- కుతో బుద్ధి:?

బుద్ధి దేని వలన కలుగుతుంది ?

సమాధానం :-వృద్దోపసేవయా . గురువులను , పెద్దలను సేవించడం వలన.   

18. ప్రశ్న :- కే వృద్ధా: ? ఎవరు  వృద్ధులు ?

       సమాధానం :-యే ధర్మ తత్త్వజ్ఞా:

ఎవరు ధర్మం యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలుసుకుని ఆచరిస్తారో వారు తత్త్వజ్ఞులు . అసలు ముందుగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం .

धृति: क्षमा दमोsस्तेय: शौचमिन्द्रियनिग्रह: |

धीर्विद्या सत्यमक्रोध: दशकं धर्मलक्षणम्   ||  

ఇది ధర్మ స్వరూపం . धृति: అంటే దేహేంద్రియాలను దృఢముగా ఉంచుకోడానికి చేసే ప్రయత్నం.क्षमा అంటే ఆకర్షణలకు, అవరోధములకు చలించకుండా ఉండడం.   दम: అంటే అంతరింద్రియ(మనో) నిగ్రహం, अस्तेय: అంటే ఇతరుల ద్రవ్యాన్ని అపహరించక పోవడం , शौचम् అంటే శరీర, మనస్సుల పవిత్రత, इन्द्रियनिग्रह: అంటే ఇంద్రియాలను మనస్సును అదుపులో పెట్టుకోవడం, धी: అంటే బుద్ధికుశలత , विद्या అంటే వేదార్థ పరిజ్ఞానం, सत्यम् అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం .अक्रोध: మనం కోరుకున్నది జరుగకపోయిన, లేదా విఘాతం కలిగినా కోపం పొందక పోవడం . ఇవి స్థూలంగా ధర్మం యొక్క లక్షణాలు . ఇవి ఆచరించే వాడే ధర్మాత్ముడు.   ఆచరణయే ముఖ్యం తెలుసుకోవడం కాదు. మహాభారతంలో దుర్యోధనుడు . జానామి ధర్మం నచమే ప్రవృత్తి: జానామ్యధర్మం నచ మే నివృత్తి . నాకు ధర్మం తెలుసు కాని ఆచరించను; అధర్మం తెలుసు కాని మానను అంటాడు. ఏం ప్రయోజనం ?  

<><><>