Thursday, June 25, 2026

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-11 రచన:- శ్రీ శంకరాచార్యులు

 

ప్రశ్నోత్తర రత్నమాలికా Part-11

రచన:- శ్రీ శంకరాచార్యులు

సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో    కొంతమంది శిష్యుల ప్రశ్నలకు   శ్రీ శంకరభగవత్పాదుల  వారి  సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు  చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా  తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.

 

122.     ప్రశ్న :- () అజ్ఞానం కుత: ?

అజ్ఞానం ఎక్కడిది ?

సమాధానం :-అనాది:

అజ్ఞానం అనాది .

జీవ ఈశో విశుద్ధా చిత్ , తథా జీవేశయోర్భిదా

 అవిద్యా తచ్చితోర్యోగ: షడస్మాకమనాదయ:  

1.      జీవుడు  2.ఈశ్వరుడు  3. విశుద్ధమైన చైతన్యం ,  4. జీవేశ్వర భేదం  5. అవిద్య 6. అవిద్యకు చైతన్యంతో గల సంబంధం ఈ ఆఱు అనాదులు. ఇక అవిద్య అనాది ఐనప్పటికీ సాంతం . జ్ఞానం వల్ల  తొలగిపోతుంది.        

123.     ప్రశ్న :- వపుషశ్చ పోషకం కిం ?

శరీరాన్ని పోషించేది (నడిపించేది) ఏది?

సమాధానం :- ప్రారబ్ధం

ప్రారబ్ధమే శరీరాన్ని నడిపిస్తుంది .

కర్మలు మూడు విధాలుగా ఉంటాయి. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. మనందరికీ సులభంగా అర్థం అవ్వడం కోసం చెప్పుకోవాలంటే మనకు ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఉన్నాయనుకోండి, అది సంచితం. మనం వ్యాపారం చెయ్యడానికి కొంత ధనం తీసుకుని  ఏదో ఒక ఊరు వెళ్లి ఆ డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాం  అనుకుందాం, అది ప్రారబ్ధం . అక్కడ మరల కొంత ధనం సంపాదిస్తాం. అది ఆగామి ఔతుంది.  మనం అనేక జన్మల్లో పోగేసుకున్న కర్మలు ఒక్క జన్మలోనే అనుభవించడం సాధ్యం కాదు కాబట్టి  కొన్ని కర్మలతో మనిషి పుడతాడు. ఇక జ్ఞానం కలిగిన వెంటనే సంచిత , ఆగామి కర్మలు నశిస్తాయి. “ప్రారబ్ధం భోగతో నశ్యేత్” అనే నియమం ప్రకారం అది మాత్రం అనుభవించి తీరాలని కొంతమంది వాదన. శ్రీ రామకృష్ణ పరమహంస , రమణమహర్షి వంటి కొంతమంది సిద్ధ పురుషులు అనుభవించిన కొన్ని శారీరకమైన యాతనలు ఇందుకు నిదర్శనం . ఇక కొంత మంది అభిప్రాయం ప్రకారం ఈ మూడు ఒకేసారి నశిస్తాయి. వారు “భిద్యతే హృదయ గ్రంథి: ఛిద్యంతే సర్వ సంశయా:

 క్షీయంతే చాsస్య కర్మాణి   తస్మిన్ దృష్టే పరావరే” అనే ఉపనిషద్వాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ కర్మాణి (బహువచనం) అన్నప్పుడు అవి ప్రారబ్ధం , సంచితం , ఆగామి కర్మలను సూచిస్తాయని వివరించారు. ఇక రమణమహర్షి వంటి మహనీయులు బాధలను అనుభవించారని, దాన్ని ప్రారబ్ధమని మీరు చెపుతున్నారు. మీరు మీ దృష్టిలో వారు  బాధపడుతున్నారని అనుకుంటున్నారు కాని వారికి  అవేమీ లేవని వాదిస్తున్నారు. ఇక “తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యేsథ సంపత్స్యే”  మొదలైన వాక్యాలు జీవన్ముక్తుడు ప్రారబ్ధ కర్మ అనుభవించడం కోసం కొంతకాలం శరీరంతో ఉంటాడని , అది పూర్తి కాగానే దేహ పాతానంతరం విదేహముక్తి పొందుతాడని చెపుతున్నాయి. ఉపనిషత్తులు ఏ విషయాన్నీ  పరస్పర విరుద్ధంగా చెప్పవు. ఇవన్నీ మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి              

124.     ప్రశ్న :- (చ) అన్నదాయి కిం ?

ఏది అన్నదాయి

సమాధానం:- (చ) ఆయు:

ఆయువు .

 ఎవరైనా మరణిస్తే ‘వాడికి నూకలు చెల్లి పోయాయి’ అని మనం నిత్య వ్యవహారంలో అంటూ ఉంటాం

125.     ప్రశ్న :- కో బ్రాహ్మణై: ఉపాస్య: ?

ఎవరు బ్రాహ్మణుని చేత ఉపాసింప దగిన వారు?

 సమాధానం :- గాయత్రీ - అర్క - అగ్ని- గోచర: శంభు:

గాయత్రి , సూర్యుడు, అగ్ని మొదలైన వారి ద్వారా తెలుసుకోదగిన శివుడు

126.     ప్రశ్న :- గాయత్ర్యామాదిత్యే చ అగ్నౌ శంభౌ చ కిం ను?

గాయత్రి , సూర్యుడు , అగ్ని , శివుడు వీరిలో ఏమి ఉన్నది .

సమాధానం :- తత్ తత్వం

తత్త్వం ఉన్నది .

మననాత్ త్రాయతే ఇతి మంత్ర:

మననం చేస్తే రక్షిస్తుంది కాబట్టి అది మంత్రం అయింది. న గాయత్ర్యా: పరం మంత్రం అనడం వల్ల గాయత్రిని మించిన మంత్రం లేదని తెలుస్తోంది.  ఇక సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం.  “అగ్ని ముఖా: వై దేవా:” అనడం వల్ల ఆయన గొప్ప సంధాన కర్త . శివుడు సాక్షాత్తుగా జ్ఞాన స్వరూపుడు .

127.     ప్రశ్న :- ప్రత్యక్షదేవతా కా?

మనకు  కళ్ళ యెదుట కన్పించే ప్రత్యక్ష దైవం ఎవరు ?

 సమాధానం :-మాతా

తల్లి మనకు  కళ్ళ యెదుట కన్పించే ప్రత్యక్ష దైవం

“మాతా కిల మనుష్యాణాం దైవతానాం చ దైవతమ్”  అంటాడు భాసమహాకవి .  

God created mother because, He can not stay every where.

128.     ప్రశ్న :- ప్రత్యక్షో గురుశ్చక: ?

ఎవరు ప్రత్యక్ష గురువు ?

సమాధానం :-తాత:

తండ్రి ప్రత్యక్ష గురువు.

><>< 

 

No comments: