Saturday, July 4, 2026

చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన కరుణావిజయం (పద్యనాటకం)-సమీక్ష

 

“పద్య నాటక రత్న”  చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన

కరుణావిజయం

(పద్యనాటకం)

ఒక విహంగ వీక్షణాత్మక సమీక్ష

సమీక్షకులు : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

‘ఉత్తమశ్లోకచరిత ముదాహరణమర్హతి’ అన్నారు మన పెద్దలు . అంటే ఉత్తమ శ్లోకుడైన ఒక గొప్పవ్యక్తి  చరిత్ర అందరికి తెలియ జేయుటకు యోగ్యమైనది అని ఆ మాటలలోని సారాంశం . కాబట్టి లోకోత్తరుడయిన   బుద్ధభగవానుని జీవిత విశేషాలను, బోధలను ,  ఒక దృశ్య కావ్యంగా మలచి మనకు అందించిన నా మిత్రుడు వేంకటరత్నం గారికి ముందుగా అభినందనలు. వారు రచించిన ఈ పద్య నాటకం చదివి విగలిత వేద్యాంతరమైన, ఆనందాన్ని పొందాను.

ఇక “నాటకాంతం  హి సాహిత్యం” అన్నారు పెద్దలు . నాటకరచన సాహిత్య సృష్టికి ఒక పరాకాష్ఠ.   అందులోనూ రూప రహితమైన మనోభావాలకు రూపకల్పన చేసి  ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించడం అంత సులభమేమీ కాదు . ఆ ప్రయత్నంలో సంపూర్ణ విజయం సాధించారు వేంకటరత్నం గారు.  గతంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అశ్వఘోషుని సౌందరనందం, పింగళి కాటూరి కవుల సౌందరనందకావ్యం చదివిన వాడనే. ఇక ఈ పద్య నాటకం అశ్వఘోషుని సౌందరనందం లోని తాత్త్విక విశేషాలు, పింగళి కాటూరి కవుల సౌందరనంద కావ్య విశేషాలతో బాటుగా   దృశ్య కావ్యపు  సొబగులను సంతరించుకున్న   త్రివేణీ సంగమంలా మారింది. ఇక ఆ రెండు కావ్యాలను నిశితంగా పరిశీలించినవారికి వేంకటరత్నం గారి కృషి ఎంత మహత్తరమైనదో అర్థం ఔతుంది. ఇక “కవి ప్రతిభలోననుండు కావ్యగత శతాంశమునందు తొంబది యైన పాళ్ళు” అన్న విశ్వనాథ వారి మాటలను బట్టి ఆలోచిస్తే నాటకీకరణ కోసం వేంకటరత్నం గారు మూలంలో లేని    పాత్రలను  కల్పించిన తీరు  , సృష్టించిన సన్నివేశాలు, పాత్రోచితమైన నామకరణం    వారి ప్రతిభకు నిదర్శనాలుగా  కనిపిస్తున్నాయి .

      ఇక  రసహీనమైన తాత్త్విక విశేషాలకు  రసం పులిమి ప్రేక్షకులముందు ప్రదర్శించడం చాల కష్టమైన  పని . ఇది ఒక సవాలని  అందరికీ  తెలిసిన విషయమే. సాహిత్యంలో ‘ప్రబోధచంద్రోదయం’ , ‘సంకల్పసూర్యోదయం’ వంటి వేదాంత విషయ సంబంధమైన  నాటకాలు  చాల అరుదుగా కనిపిస్తున్నాయి . ఆ మార్గంలో  ప్రయాణం చేసి ఆయా నాటకాల్ని  రచించి వారు ఆహా అనిపిస్తే ఇప్పుడు వీరు ఈ నాటక రచన చేసి ఓహో అనిపించారు.       

ఇక ఇతివృత్తం మాటకొస్తే, నందుడు బుద్ధునకు సవతి సోదరుడు. అతడు అందగాడు, ఇంద్రియ లోలుడున్నూ. అతని భార్య సుందరి.  సుందరీ నందుల ప్రేమ చక్కనిదీ, చిక్కనిదీని. ఎంత చక్కనిదో అంత చిక్కనిది , ఎంత చిక్కనిదో, అంతే చక్కనిది.  ఒకనాడు వారిరువురు ఏకాంతంలో ఉండగా బుద్ధుడు భిక్షకై వారి ఇంటికి వెళతాడు. అతని రాకను గమనించలేని తమకంలో వారున్నారు. బుద్ధ భగవానుడు కొంత సేపు నిరీక్షించి వెనుదిరిగి వెళ్లి పోతాడు . ఆ తరువాత వారి పరిచారిక భగవానుని రాకను వారికి విన్నవిస్తుంది. నందుడు, జరిగినదానికి తీవ్రమైన  పరితాపం చెందుతాడు . అన్నగారి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకోడానికి బయలుదేరతాడు . ఆమె క్షణంలో తిగిగి రమ్మని భర్తను కోరుకుంటుంది. నేను ఇప్పుడే నీ  చెక్కిళ్ళకు అలదిన మకరికాపత్రాల తడి ఆరక ముందే తిరిగి వస్తానని వాగ్దానం చేసి అక్కడ నుండి బయలు దేరతాడు . బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందునకు తన శిష్యుల ద్వారా ధర్మోపదేశం కావిస్తాడు . అంతే! నందుడు ఇక ఇంటికి తిరిగి వెళ్ళడు. ఆ తరువాత సుందరి బుద్ధ భగవానుని చేరుకొని ఆయన అనుమతితో బౌద్ధమతాన్ని స్వీకరింస్తుంది. వారిరువురు సమాజ సేవలో తమ జన్మలు  పునీతం చేసుకుంటారు . ఇది మూల కథలోని సారాంశం .  

వేంకటరత్నం గారు ఈ కథకు కొన్ని పాత్రలను , పాత్రలకు తగిన సన్నివేశాలను జోడించి ఈ పద్యనాటకాన్ని రచించారు. ఇక ప్రాచీన నాటక కర్తలు  నాటకరచన చేయడానికి ఎంత ప్రతిభ చూపించారో, ఆ నాటకానికి పేరు, నాందీ, ప్రస్తావనల కల్పనకు కూడ ఇంచుమించుగా అంతే ప్రతిభ కనబరిచేరు అనడం నిర్వివాదాంశం . అభిజ్ఞానశాకుంతలం , మృచ్ఛకటికం, వేణీ సంహారం మొదలైన నాటకాలు ఇందుకు ఉదాహరణ . ఈ నాటక రచయిత కూడ ఈ విషయంలో ఎంతో ప్రతిభను ప్రదర్శించారు.  

  ఈ నాటకంలో ఆరు అంకాలున్నాయి.

మొదటి అంకంలోని మొదటి రంగంలో  యశోధరా శుద్దోధనుల సంభాషణ ద్వారా బుద్ధభగవానుడు కపిలవస్తు నగరానికి వస్తున్నాడనే వార్త తెలుస్తుంది. యశోధర, తన  ఇంటి దీపం, మింటి దీపం గా మారిందని లోలోన సంతోషిస్తుంది . ప్రజలకు బుద్ధుని పై గల భక్తి,  ప్రపత్తులకు ; వారు బుద్ధునిపై కురిపించే ప్రశంసలకు  ఆమె పరవశించి పొతుంది .  ఆమె తన మామగారితోను  , కుమారునితోను కలసి బుద్ధుని చూడటానికి బయలుదేరుతుంది.

రెండవ రంగంలో బుద్ధభగవానుడు ఒక మర్రిచెట్టు క్రింద నున్న వేదికపై కూర్చుని శిష్యులకు జ్ఞాన బోధ చేస్తూ ఉంటాడు. తన వద్దకు చేరిన తండ్రి శుద్దోధనునకు, దీక్ష ప్రసాదిస్తాడు.  దీక్షకోసం పుర ప్రజలను ఆశ్రమానికి రమ్మని ఆదేశించి  తనకు మ్రొక్కిన భార్య యశోధరను , కుమారుడు రాహులుని ఆశీర్వదించి అక్కడ నుండి నిష్క్రమిస్తాడు .

రెండవ అంకం మొదటి రంగంలో సుందరీ నందుల ప్రణయ కలహం తోనూ  , శృంగార చేష్టలతోను  మనోరంజకంగా సాగుతుంది . సుందరి చెలికత్తె రాగమాలిక ప్రవేశించి నందునితో “ అయ్యగారూ! మీ అన్నగారైన బుద్ధభగవానులు భిక్షకోసం ఇంటికి వచ్చారని, ఇంటి ముందు నిలబడి ‘భిక్ష’ ‘భిక్ష’   ‘భిక్ష’ అని మూడుసార్లు అరిచి ఎటువంటి సమాధానం రాకపోయే సరికి వెనుదిరిగి వెళ్లి పోయారని వివరిస్తుంది. జరిగిన దానికి సుందరీ నందులు చాల బాధపడతారు.  నందుడు తాను  చేసిన తప్పుకు పరిహారంగా ఆశ్రమానికి వెళతానని,  ఆమెకు తాను అలదిన మకరికా పత్రాల తడి ఆరక ముందే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఆమె  కౌగిలి వదలించుకుని బయలు దేరతాడు.  

రెండవ అంకం రెండవ రంగంలో బుద్ధుడు,  నందుల సమాగమంతో మొదలౌతుంది. బుద్ధుడు నందునకు   “ఈ ప్రపంచమంతా క్షణికమని, ఇంద్రియసుఖాలు క్షణ భంగురాలని ఉపదేశిస్తాడు . అంతలో బుద్ధుని శిష్యుడు సౌమత్యాయనుడు అక్కడకు రాగా తన తమ్మునకు దీక్షను ఇమ్మని అతనిని ఆదేశిస్తాడు. నందుడు ఎంత ప్రతిఘటిస్తున్నా వినకుండా సౌమత్యాయనుడు అతనిని తన వెంట లాక్కు పోతాడు .       

మూడవ అంకం మొదటి రంగం  సుందరి మనో వేదనతో ప్రారంభం ఔతుంది. తన భర్త జాడ తెలుసుకు రమ్మని చెలులను పంపిస్తుంది. తన నాథుడు రానందుకు విలపిస్తుంది , భర్తను అనుమానిస్తుంది , నిందిస్తుంది,  శపిస్తుంది . మరొక చెలి ద్వారా తన భర్త బుద్ధుని వెంట బౌద్ధ విహార మార్గంలో విహరిస్తున్నాడని విని తన భర్త సన్యాసి అయ్యే ఉంటాడని పరిపరి విధాల విలపిస్తుంది . చివరకు చెలులు ఆయన తప్పక తిరిగి వస్తాడని ధైర్యం చెప్పగా కాస్త ఎంగిలి పడుతుంది.

నాల్గవ అంకం మొదటి రంగంలో సుందరి కోసం విలపిస్తూ ఉలుకు పలుకు లేని నందునకు బౌద్ధ ధర్మ బోధలను వినిపించి సుందరీ గతమైన ప్రేమను విశ్వవ్యాప్తం చెయ్యమని  సమాజంలోని దీన జనులను సేవించమని హిత బోధ చేస్తాడు .

నాల్గవ అంకం రెండో రంగంలో కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా నందుని గట్టిగా మందలించగా నందుడు ‘ తాను కాముకుడను కానని , ప్రేమికుడని వాదిస్తాడు .  అప్పుడు బుద్ధుడు నందునితో  వైయక్తికమైన ప్రేమ పరిపూర్ణం కాదని అది విశ్వవ్యాప్తమైతే ఆనందాన్నే ప్రవహింప చేస్తుందని హిత బోధ చేస్తాడు.

అపుడు నందుడు గురుదేవా! స్వరాలు కలిస్తే రాగోదయమైనట్లు మనసులు కలిస్తే అనురాగోదయం ఔతుంది,  అది పరమ సుకుమారం, అతి మనోహరం, అని అంగీకరిస్తాడు. వారిద్దరి వాదోపవాదాల వలన ప్రేమ తత్త్వమే ఈ ప్రపంచాన్ని నడుపుతోందని, అది ‘నా’ అనే భావంతో కాకుండా మమత లేనట్టి ప్రేమ నిత్యమని ఈ ప్రపంచమంతా దు:ఖమయం కాబట్టి దు:ఖ  మగ్నులైన అందరికి అండగా ఉండమని బుద్ధుడు ఉపదేశిస్తాడు.

“ ప్రేమ కన్న సత్యము లేదు భిక్షువులకు

పరమ సత్యము కన్న సుందరము లేదు

లభ్యమైతి సౌందర్య లాలసుడ వీవు

రసమయము లౌను మన విహారమ్ములింక”

అని వివరించి శీలమే బౌద్ధ ధర్మమునకు మూలమని వివరిస్తాడు.

నందుడు సుందరిని కూడ బౌద్ధ ధర్మ దీక్షకు అనుమతించమని కోరగా “ నా కరుణకు నీ ప్రవర్తన వలన కలిగిన విజయం, సుందరి ప్రవేశం వలన ఘన విజయం కాగలదని పలికి అనుమతిస్తాడు.

ఐదవ అంకంలో కపిలవస్తు నగరం లోని ఒక వీథిలో శ్యామలాంబ, కోమలంబల సుదీర్ఘ మైన సంభాషణ ద్వారా సుందరిలో కలిగిన మానసిక పరివర్తన ప్రేక్షకులకు తేటతెల్లం ఔతుంది .          

ఆరవ అంకం మదటి రంగంలో బుద్ధ శిష్యుడైన సౌమత్యాయనుడు సుందరి ఇంటి ముందు నిలబడి ఉంటాడు. సుందరి అతనికి నమస్కరిస్తుంది. ఆయన తనను సుందరికి పరిచయం చేసుకుని ఆమెతో అమ్మా! గురుదేవులు నీ హృదయవేదనను అర్థం

చేసుకుని నీకు దీక్ష ఇవ్వడానికి నన్ను పంపించారని చెప్పి కాషాయవస్త్రాలను , భిక్షాపాత్రను, అందించి తలపై వెంట్రుకలు తీయించుకుని  రమ్మని ఆదేశిస్తాడు. ఆమె అంగీకరిస్తుంది. వారి పరస్పర సంభాషణ వలన ఆమెలో కలిగిన మానసిక పరిణతి ప్రేక్షకులకు అవగతం ఔతుంది. ఆమె సౌమత్యాయనుని సాగనంపి తాను  శిరోముండనం కావించుకుని , కాషాయవస్త్రాలు ధరించడానికి అక్కడ నుండి నిష్క్రమిస్తుంది.

ఆరవ అంకం రెండో రంగంలో కపిలవస్తు నగరం వెలుపల గల మాల వాడలోని ఒక పూరి గుడిసెలో కుక్కి మంచం పై చిక్కి శల్యమై మరణానికి చేరువలో  ఉన్న ‘శాంతిమాల’ అనే ఒక స్త్రీ దర్శనం ఇస్తుంది.  అక్కడ ఒక పసిపాపను గుండెలకు హత్తుకొని నందుడు నిలబడి ఉంటాడు . అక్కడ చండీదత్తుడనే ఆరు సంవత్సరాల బాలుడు తనను లాగుకొని రాగా సుందరి ప్రవేశిస్తుంది. సుందరీ నందులు ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరికొకరు దగ్గరగా చేరబోయి హఠాత్తుగా ఆగి పోతారు. నందుడు ప్రాణేశ్వరీ! అనబోయి, తనను తాను సముదాయించుకుని  సోదరీ! నీవా! అని సంబోధిస్తాడు. ఆమె కూడ ప్రాణేశ్వరా! అనబోయి   తనను తాను సముదాయించుకుని సోదరా! నీవా! అంటుంది.

‘శాంతిమాల’  వారితో “ నాకు మరణం సమీపిస్తోంది, అని చెప్పి తన శిశువుల వైపు తిరిగి ఆ శిశువులను సుందరీ నందులకు అప్పగించి శాశ్వతంగా కన్నుమూస్తుంది. అపుడు బుద్ధుడు వారితో  “మాతృహీనులైన ఈ అనాథ శిశువులను మీరు తప్పక కాపాడాలి ” అని చెపుతాడు. ఈ ప్రపంచంలో ఇంకా ఎందరో అనాథ సుందరీ నందులున్నారు, వారందరినీ ఆదుకున్నప్పుడే ఈ భువి దివిగా మారుతుంది, బౌద్దాశయం నెరవేరుతుంది అని చెపుతాడు.

బుద్ధుడు సుందరితో అమ్మా! భార్యా వియోగంలో మునిగిన నందుడు ఈ మార్గంలోకి రావడం ఒక విజయం, నీవు కూడ ఈ మార్గంలోకే రావడంతో అది ఘన విజయమైనది . పరస్పర ప్రేమికులైన మీరిద్దరూ మానవ ప్రేమికులు కావడంతో అది సంపూర్ణ విజయమైనది. ఇది ఒక వ్యక్తి  సాధించిన విజయం కాదు. ఇది కరుణా విజయం అని పేర్కొంటాడు. ఆ తరువాత సుందరీ నందులు చేసిన బుద్ధ స్తుతితో నాటకం ముగుస్తుంది .

 

ఇక మూల కథ,  కథలోని   సుందరీ నందులు , కొంతమంది బుద్ధుని శిష్యులు,  ప్రక్కన పెడితే మిగిలిన సంఘటనలన్నీ కవి ప్రతిభా కల్పితాలే. పాత్రల పేర్లు కాలానుగుణం పెట్టడం గమనార్హం . పాత్రోచిత భాష ప్రయోగించడం ప్రశంసనీయం .

ఇక ఈ నాటకంలో పింగళి, కాటూరి కవుల పద్యాల కూర్పు  బంగారు కంకణాలకు రత్నాలు పొదిగి నట్లుగా ఉంది. వీరి స్వీయరచనలైన గేయాలు బంగారానికి తావిని కూడ చేకూర్చిన విధంగా ఉంది . . ఇక సర్వ లక్షణ లక్షితం, సహృదయ హృదయానురంజకం ఐన ఈ నాటకాన్ని గురించి  ఎంత చెప్పిన అది చాలదు . నేను కొంత మాత్రమే చెప్పగలిగాను. ఈ నాటకానికి ఎంతోమంది మహాపండితులు ప్రశంసా వర్షాలు కురిపించడం ముదావహం .

ఈ నాటకాన్ని తదేకదీక్షతో చూసిన వారు పులకించకుండ ఉండలేరు, కంట తడి పెట్టక మానరు.  అయినా గారెల రుచి తింటేను, సంగీతం రుచి వింటేను, నాటకం రుచి కంటేను మాత్రమే తెలుస్తుంది . చదివితే పూర్తిగా తెలియదు. అందువల్ల నటన పట్ల ప్రావీణ్యం గల నటులు ఈ నాటకాన్ని పలు ప్రాంతాల్లో ప్రదర్శిస్తే దీని గొప్పదనం తెలుస్తుంది, బౌద్ధ ధర్మం కూడ దేశమంతా వెల్లి విరుస్తుందని నమ్ముతూ ఆ మహాయజ్ఞం తెలుగు వారికి  రాజధాని అమరావతితో ప్రారంభమైతే  మరింత సొబగు చేకుఱుతుందని భావిస్తూ , నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుని హృదయపూర్వకంగా అభినందిస్తూ .....

దుర్గాప్రసాదరావు.        

9897959425.       

 

 

No comments: