Tuesday, October 7, 2025

ఉపనిషత్తులు – మృత్యు తత్త్వ విశ్లేషణ మొదటి భాగం

 

ఉపనిషత్తులు – మృత్యు తత్త్వ విశ్లేషణ

మొదటి భాగం

డా. సిహెచ్. దుర్గా ప్రసాద రావు

dr.cdprao@gmail.com

 పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని మనకు తెలిసినా చావు అంటే అందరికి ఎందుకో భయం .  చావు అనే మాట వినబడగానే అందరికి గుండె ఝల్లు మంటుంది . ఆ మాట అందరి హృదయాల్లోను ఎన్నో భయాందోళనలు రేకెత్తిస్తుంది. దానికి గల కారణాన్ని ఆలోచిస్తే మానవుడు మరణమే అన్నిటికి అంతం అని అనుకోవడమేనని   అనిపిస్తుంది. కాని వాస్తవం అందుకు భిన్నంగా ఉంది .  చైతన్య పరంగా మనం విశ్లేషిస్తే శరీరం, చైతన్యాన్ని కోల్పోవడమే మరణమని స్థూలంగా చెప్పవచ్చు. శరీరం చైతన్యాన్ని కోల్పోతే  జడపదార్థంగా మారిపోతుంది, మట్టితో సమానమై పోతుంది . ఇక ఒక విషయానికి సంబంధించిన భయం తొలగిపోవాలంటే ఆ విషయానికి సంబంధించిన సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం .

మృత్యుతత్త్వాన్ని విశ్లేషించడంలో ఉపనిషత్తుల పాత్ర ఎంతో సమున్నతం గాను,  ప్రత్యేకమైనది గాను,  మరియు ఆకర్షణీయం గాను ఉంది .

వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పరిశీలిద్దాము . ఇది  మరణించిన వ్యక్తి ఆత్మకు,  వారి  బంధువులకు ఎంతో ఓదార్పునిస్తుంది. వేదాంతము  అని మరో పేరుతో కూడ పిలువబడే ఉపనిషత్తులు వేదాలలోని ముగింపు భాగాలు. అంతము అంటే సారాంశ రూపము అని అర్థం . అవి వేదతత్త్వసారాంశరూపాలు .  అవి నిగూఢమైన స్వభావం కలిగి ఉండటం వలన  వ్యక్తిగత ఆత్మ మరియు పరమాత్మ మధ్య గల  వాస్తవిక సంబంధం, వాటి  యొక్క స్వభావం, ప్రపంచ స్వరూపం , జీవిత లక్ష్యం మొదలైన వాటితో వ్యవహరిస్తాయి. ‘ఉపనిషత్’ అనే పదం 'షద్' అనే ధాతువు మరియు ‘ఉప’ మరియు ‘ని’ అనే రెండు ఉప సర్గల నుండి ఉద్భవించింది. ఇవి అన్నీ కలిసి గురువు యొక్క సమీపంలో అధ్యయనం చేయ దగినవి;  బ్రహ్మజ్ఞానాన్ని అందించేవి, పుట్టుక, వృద్ధాప్యం, మరియు మరణం వలన కలిగే భయానికి సంబంధించిన  మనిషి యొక్క సహజమైన అజ్ఞానాన్ని నాశనం చేసి అతనికి  జ్ఞానోదయం కలిగించి  తద్ద్వారా  మోక్షానికి నడిపించేవి అని అర్థం . ఉపనిషత్తులు వేదజ్ఞానం యొక్క సారాంశం. తత్వశాస్త్రం,  అనుభవంతో మేళవించి  గత అనేక శతాబ్దాలుగా మానవ మనస్సును ప్రభావితం చేస్తున్నాయి, మానవత్వం నుండి దైవత్వానికి బంగారు బాటలు వేస్తున్నాయి,  మార్గం సుగమం చేస్తున్నాయి.

 వాటి ప్రకారం, మరణంతొ  ఒకరి ఉనికి పూర్తిగా నశించదు .

మన శాస్త్రాలు, ఒక తాత్విక మార్గాన్ని సూచిస్తూ, మరణానికి భయ పడవద్దని హెచ్చరిస్తున్నాయి. ఓ మూర్ఖుడా! నువ్వు మరణానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడి నంత మాత్రాన  యముడు నిన్ను వదిలివేస్తాడని నువ్వు అనుకుంటున్నావా?  వదిలే ప్రసక్తి లేదు. కానీ అతను పుట్టని వానిని ఏమీ చెయ్య లేడని  ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి, ఈ లోకంలో మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ప్రయత్నించు అంటాయి .

 

మృత్యో:  బిభేషి కిం మూఢ! భీతం ముంచతి వై యమ:  

అజాతం నైవ గృహ్ణాతి కురు యత్నమజన్మని || 

ఇక్కడ ‘అజన్మని’ అంటే జన్మ రాహిత్యం అనే పదం మూడు అంశాలను కలిగి ఉంటుంది.

 1. మరణం యొక్క అనివార్య స్వభావాన్ని గ్రహించడం.

2. మరణం యొక్క స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం.

3. ఆత్మ యొక్క శాశ్వతమైన ఉనికిపై నమ్మకం.

                                                         To be continued.........

 

No comments: