Thursday, September 4, 2025

త్యాగరాజ కీర్తనలు – పురుషకార వైభవం-సమీక్షకులు: డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 

 

త్యాగరాజ కీర్తనలు – పురుషకార వైభవం

(ఒక విహంగవీక్షణాత్మకసమీక్ష)

గ్రంథరచయిత్రి : శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల రాజ్యలక్ష్మి,  ఎం.ఏ, ఎం.ఫిల్

సమీక్షకులు: డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

M.A (Sanskrit), M.A (Telugu), M.A (Philosophy) & Ph. D (Sanskrit)

 

          నా సహాధ్యాయిని మరియు సోదరీమణి  అయిన శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల రాజ్యలక్ష్మి గారు రచించిన “త్యాగరాజ కీర్తనలు - పురుషకార వైభవం” అనే గ్రంథం ఆమూలాగ్రం చదివాను. ఇది పన్నెండు అధ్యాయాలతో కూడిన విమర్శనాత్మకమైన గ్రంథం .

ఈ గ్రంథంలో స్వగతం మరియు ఉపసంహారం కాకుండా పన్నెండు అధ్యాయాలున్నాయి .   

1.                  మొదటి అధ్యాయంలో  ‘తెలుగులో పద కవిత్వం’ ; రెండవ  అధ్యాయంలో  ‘పద కవిత్వ క్రమ పరిణామం’ ,  మూడవ అధ్యాయంలో   వాగ్గేయకార లక్షణం – వాగ్గేయకారులు, నాలుగవ అధ్యాయంలో  ‘త్యాగయ్య- జీవితవిశేషాలు’ ఐదవ అధ్యాయంలో , ‘త్యాగయ్యపై రామదాసు ప్రభావం, ఆరవ అధ్యాయంలో   ‘ భక్తి – శరణాగతి’  , ఏడవ అధ్యాయంలో  ‘పురుష కారం – ఆవశ్యకత, ఎనిమిదవ అధ్యాయంలో   ‘ త్యాగయ్య కీర్తనల్లో లక్ష్మీ పురుషకారత్వం , తొమ్మిదవ అధ్యాయంలో  త్యాగయ్య కీర్తనల్లో ఆచార్యపురుషకారత్వం , పదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో  జానపద గేయ రీతులు,  పదకొండవ అధ్యాయంలో,  త్యాగయ్య కీర్తనలలో భాషా విశేషాలు , పన్నెండవ అధ్యాయంలో  త్యాగయ్య కీర్తనల్లో సందేశం

పొందుపరిచారు .  ఆ తరువాత ఉపసంహరంలో  అన్నీ సమన్వయం చేశారు.  

ఇక ధర్మ, అర్థ,  కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాల్లో మోక్షం సర్వశ్రేష్ఠ౦.  అందుకే అది పరమపురుషార్థమై౦ది . మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే అది సిద్ధిస్తుంది. అందుకే  ఆపస్తంబ మహర్షి ‘ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్’ అనే మాటల్లో  మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కంటే  ఉన్నతమైన పరమార్థం మరొకటి లేదన్నారు  . ఈ   మోక్ష ప్రాప్తికి,   కర్మభక్తి, జ్ఞానం అనే   మూడు మార్గాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే , మోక్షమనే  సామ్రాజ్యం,  కర్మ, జ్ఞానం, భక్తి అనే ముక్కాలి పీటపై నిలిచి ఉంది .   ఇక,  కర్మలు ఎన్నో విధాలుగా ఉన్నాయి , వాటికి పరిమితి లేదు అవి అనంతములు . అంతే కాక,  కర్మలు ఎంతో ధనవ్యయంతో ముడి పడ్డాయి , అందరు ఆచరించ లేరు . కర్మకాండకు ఎన్నో నియమ నిబంధనలు కూడ ఉన్నాయి . యజ్ఞ, యాగాది కర్మలు అన్ని కులాల వారు ఆచరి౦చలేరు. కర్మకాండకు వయోపరిమితి , ఆశ్రమ నిబంధనలు  ఎన్నో ఉన్నాయి . పోనీ ఎలాగో కష్టపడి కర్మల నాచరి౦చినా, కర్మల వలన పొందేది ఏదీ శాశ్వతం కాదు .  ఇక జ్ఞానం  విషయానికొస్తే అది అందరికీ అందుబాటులో ఉండదు . జ్ఞాన ప్రాప్తికి నిత్యా నిత్య వస్తు వివేకం కావాలి  . లౌకిక సుఖాల పట్ల పారలౌకిక సుఖాల  పట్ల వైరాగ్యం కావాలి .  శమం,  అంటే ఇంద్రియ నిగ్రహం,  దమం అంటే మనో నిగ్రహం , ఉపరతి, అంటే కర్మఫల త్యాగం,   ‘తితిక్ష’  అంటే శీతోష్ణ , సుఖదు:ఖాది ద్వాలను  సహించగలగడం; ‘శ్రద్ధ’ అంటే శాస్త్ర వాక్యాలపట్ల, గురు  వాక్యాలపట్ల అచంచలమైన విశ్వాసం , ‘సమాధానం’ అంటే, ఎటువంటి ఏమరుపాటు లేని నిశ్చలమైన మనస్సు  మొదలైన గుణాలు అలవరచుకోవాలి  . ‘ముముక్షుత్వం’ అంటే మోక్షం పట్ల తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి . ఇవన్నీ అలవాటు చేసుకోవడం  అంత సులభమేమీ కాదు . అందువల్లనే మోక్ష సాధనాల్లో భక్తి,   చాల గొప్పదని శ్రీ శంకరుల వంటి  మహాజ్ఞాని స్వయంగా అంగీకరించారు.  అంతేగాక మనకు,  భగవంతుడు మానవజన్మ ప్రసాదించినందుకు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం భక్తి మార్గంలో ప్రయాణం చేసేవారికి  పుష్కలంగా లభిస్తోంది . ప్రతివ్యక్తి, తన   భక్తి భావాలను  ప్రకటి౦చు కోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.

అందుకే భక్తాగ్ర గణ్యులలో ఒకరైన పోతనగారు,

నీ పాద కమలసేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూతదయయును

తాపస మందార! నాకు దయసేయగదే!   అని వేడుకున్నారు. ఇక భక్తి, జ్ఞాన, కర్మలు ఒకదాని కంటే, మరొకటి వేరుగా లేవు . ఏ ఒక్కటి మిగిలిన రెంటిని విడిచి ఉండదు. కర్మ,   భక్తి జ్ఞానాల్ని ;   భక్తి,   కర్మ జ్ఞానాల్ని ; జ్ఞానం,  భక్తి కర్మలను విడిచి పెడితే అవి సమగ్రాలు అనిపించుకోలేవు.   అంతేగాక ఈ భక్తి,

శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం , వందనం,  దాస్యం , సఖ్యం , ఆత్మనివేదనం అని తొమ్మిది విధాలుగా  కనిపిస్తోంది. ఈ తొమ్మిది మార్గాల్లో ఎవరికి  వీలైన మార్గాన్ని వారు అనుసరించి,  తరించిన మహనీయులు ఎందరో మనకు కనిపిస్తున్నారు. ఇక భక్తిలో ‘కీర్తనం’ అనేది  ఒక ముఖ్య మైన అంశం .

  ‘కీర్తనం’ అంటే భగవంతుని గుణ, గణాలను నోరార, కీర్తించడం.    ఇక  ‘కీర్తన’ ద్వారా తాము తరించి, జాతిని మొత్తం తరింప చేసిన వాగ్గేయకారులు ఎంతోమంది మన పవిత్ర భారత దేశంలో జన్మించారు . వారిలో శ్రీ త్యాగరాజ స్వామి ఒకరు.

ఇక ఈ గ్రంథ రచయిత్రి,  శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మొదటి అధ్యాయంలో పద కవిత్వం యొక్క ఆవిర్భావ వికాసాలను చక్కగా వివరించారు. పదానికి సంగీతం జోడిస్తే కీర్తన అవుతుందని వివరించారు .

రెండవ అధ్యాయంలో ‘పద కవిత’ యొక్క క్రమ పరిణామాన్ని వివరించారు. ఆ సందర్భంలో సంకీర్తనాచార్యులైన    క్షేత్రయ్య , అన్నమయ్య, పురందరదాసు, సారంగపాణి , రామదాసు మొదలగువారి గొప్పదనాన్ని ప్రస్తావించారు.

మూడవ అధ్యాయంలో వాగ్గేయకారుల కవిత లక్షణాల్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ,

సంస్కృత వాగ్గేయకారులైన జయదేవుడు, లీలాశుకుడు , నారాయణ తీర్థులు, కృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు, చిన తిరుమలాచార్యులు, చిన్నన్న, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి మొదలగువారి ప్రతిభను కొనియాడారు. అంతేగాక తమిళంలో ఆళ్వార్లు , నాయన్మారుల యొక్క పద కవితా విశేషాలను, కన్నడంలో సుప్రసిద్ధుడైన పురందరదాసు గొప్పదనాన్ని పరిచయం  చేశారు.

నాల్గవ, అధ్యాయంలో త్యాగరాజ స్వామి జీవిత విశేషాలను వివరిస్తూ ఆయనకు లభించిన శ్రీరామ సాక్షాత్కారం, క్షేత్ర పర్యటన, ఆయన రచించిన  కృతులు,  ఆయన సిద్ధి పొందడం, ఆయన ఆరాధన ఉత్సవ విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా

అభివర్ణించారు.

ఐదవ అధ్యాయంలో త్యాగరాజుపై రామదాసు ప్రభావాన్ని సోదాహరణంగా తులనాత్మకంగా వివరించారు.

ఆరవ అధ్యాయంలో భక్తికి, పరాకాష్ఠ రూపమైన శరణాగతి స్వరూపాన్ని           వేద, పురాణ , ఇతిహాస, ద్రావిడ ప్రబంధాలతో బాటుగా; శ్రీ రామానుజాచార్యుల వారి అభిప్రాయాలను కూడ మేళవించి    శరణాగతి యొక్క ప్రాముఖ్యాన్ని  ప్రామాణికంగా నిరూపించారు.  

“ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ:”  

అనే భగవానుని ప్రతిజ్ఞ, ఆయన మనకు ప్రసాదించిన అభయ దానం   సర్వ జన విదితమే కదా !  

              ఏడవ అధ్యాయంలో పురుష కారం యొక్క ప్రాముఖ్యాన్ని చర్చించారు.  మనం,  మన కంటే చాల ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ద్వారా పనులు జరిపించుకోవాలంటే అతనికి చాల ఇష్టులు , సన్నిహితులు ఐన వారిని ఆశ్రయించడం,  లోక సహజమైన విషయం . ఆధ్యాత్మిక విషయంలో కూడ ఇదే పరిపాటి. అయ్య మనసు కంటే, అమ్మ మనసు సుతి మెత్తనిది.   కాబట్టి,  అమ్మ ను అడిగి ఆమె ద్వారా అయ్య వలన పనులు చేయించుకోవడం సర్వసామాన్యం. అందుకే “ నను బ్రోవమని చెప్పవే,  సీతమ్మ తల్లి” అని భక్తులు ముందుగా అమ్మవారిని పొగిడి  ఆమె ద్వారా తమ కోరికలు తీర్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎంతైనా,  స్త్రీ మూర్తి,  సద్య:ప్రసాదిని కదా!        

ఎనిమిదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో రామునకు సీతమ్మ , విష్ణువునకు లక్ష్మిపురుష కారం అనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు.

తొమ్మిదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో ఆచార్య పురుష కారం అనే అంశాన్ని వివరిస్తూ భగవద్భక్తుల ద్వారా భగవానుని ఆశ్రయించాలని వివరించారు. భగవంతుని కన్నా భక్తుడే,  సులభ గ్రాహ్యుడని  అదే సులభమైన మార్గమని వివరించారు .  పదవ  అధ్యాయం లో త్యాగరాజ కీర్తనలలోని జానపద గేయ రీతుల్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదకర్తల రచనలలో గ్రాంథిక , శిష్ట వ్యావహారిక , వ్యావహారిక కీర్తనలను పేర్కొని

వాటి యొక్క సర్వజన ఆమోదకత్వాన్ని నిరూపించారు . త్యాగ రాజ స్వామి రచించిన కీర్తనలలోని ఆచార, వ్యవహారాలను,

సంప్రదాయాలను, దేశి రాగ రీతులను విశ్లే షించారు.

పదునొకండవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలోని భాషావిశేషాలను

వివరించారు.

పన్నెండవ అధ్యాయంలో త్యాగ రాజ స్వామి తన కీర్తనల ద్వారా ప్రజలకు అందించిన  సందేశాన్ని అందమైన మాటలలో పొందుపరచి వీనులకు  విందు చేకూర్చారు.

ఇంకా ఈ గ్రంథంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి . అవన్నీ పాఠకులు స్వయంగా చవివి తెలుసుకోవాలి.  ఈ గ్రంథం ఆమె సునిశితమైన  ప్రజ్ఞకు , వేద, వేదాంగ, వేదాంత శాస్త్ర జ్ఞానానికి , రాగ, తాళ లయాత్మకమైన  సంగీత శాస్త్ర అవగాహనకు దర్పణం అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇటువంటి అద్భుతమైన గ్రంథాన్ని సమాజానికి అందించిన ఆమెను మనసారా అభినందిస్తూ , ఆమె కంటే వయస్సులో కొంచెం పెద్దవాడిని కావడం వల్ల ఆశీర్వదిస్తూ.......

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.     

 

Sunday, August 31, 2025

కలనైనా మఱువబోకు ‘కమ్మనైన’ అమ్మభాష రచన : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

కలనైనా మఱువబోకు ‘కమ్మనైన’ అమ్మభాష

 

రచన : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

9897959425

Revised

 

 

                సుప్రసిద్ధ సంస్కృత కవి , ఆలంకారికుడు, తత్త్వవేత్త అయిన  శ్రీ అప్పయ్య దీక్షితులు “ఆంధ్రత్వమాంధ్రభాషా చ, నాsల్పస్య తపస: ఫలం”  అన్నారు

. అంటే ఆ౦ధ్రుడుగా పుట్టడం, ఆంధ్రభాష మాట్లాడ గలగడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సిద్ధి౦చదని ఆ మాటలకర్థం .                                                   

​భాష ప్రాణం వంటిది . భాషను పోగొట్టుకుంటే మనం మన  ఉనికిని కోల్పోయినట్లే.  ప్రతి వారికి కనీసం,  తమ మాతతమ మాతృభూమి, తమ మాతృభాషలపట్ల ఎనలేని గౌరవం ఉండాలి. మాతృభాషను కించపరిస్తే  తల్లిని అవమానించి నట్లే అ౦టారు మన జాతిపిత మహాత్మా గాంధి . ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. जो मातृभाषा को अवगणना कर्ता है , वह अपनी माता की कर्ता है (Belittling ones mother Tongue is like disparaging ones own mother )

 ​తెలుగుభాష మాట్లాడేవారు తెలుగు రాష్ట్రాల్లో సుమారు తొమ్మిది కోట్ల మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లోను విదేశాల్లోను కూడ ఇంచుమించు అ౦త మందే ఉన్నారు. ఇంతమంది ఉన్నా కాలగతిలో మన భాష నిలుస్తుందా?, నిలవదా? అనే సందేహం మనకు లేకపోలేదు. దానికి కారణం ఒక భాష పదికాలాలపాటు మనుగడ సాగించాలంటే ఆ భాష మాట్లాడాలి, కేవలం మాట్లాడితేనే సరిపోదు, ఆ భాషలో  వ్రాయగలగాలి, వ్రాస్తేనే సరిపోదు, ఆ భాషలో సాహిత్యసృష్టి జరగాలి,  సాహిత్యసృష్టి జరిగినంత మాత్రాన సరిపోదు, ఆ సాహిత్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. అప్పుడే ఏ భాషైనా కాలగతిలో  నిలుస్తుంది. లేకపోతే నిలిచే ప్రసక్తి లేదు.

 ఇక ప్రస్తుత విషయానికొస్తే నేటి తరం విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు మాతృభాషగా గల విద్యార్థులలో చాల మందికి  తెలుగుభాషపట్ల ప్రేమ లేదు. ఆంగ్లభాషమీదున్న ప్రేమలో వెయ్యో  వంతు కూడ ఆంధ్రభాషపైన లేదు . ఈ విషయంలో వారి వారి తల్లిదండ్రులే చాల వరకు కారణమని చెప్పక తప్పదు. అందరు తమతమ మాతృభాషలు రావడం గొప్పగా భావిస్తుంటే తెలుగువారమైన మనం తెలుగు భాష రాకపోవడం గొప్పగా భావిస్తున్నాం . నిజంగా ఇది సిగ్గుచేటు .  మదర్ టంగ్ రాని వాడికి అదర్ టంగ్ రాదు. అమ్మ భాష రానివాడికి అన్యభాష సరిగా రాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పూర్వం విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్వ్యక్తుల్ని పరిశీలిస్తే వారందరూ తెలుగు భాషలో  నిష్ణాతులని తేలింది. నేడు చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తే సమయం వేస్టు అయిపోతుందని ఆ సమయాన్ని కూడ ఆ౦గ్లభాషకు కేటాయిస్తే ఇంకా ప్రగతిని సాధిస్తారనే అపోహలో ఉన్నారు .  అమ్మభాష రాని వాడికి అన్య భాష రానే రాదు. ఈమధ్యనే ఒక సంఘటన జరిగింది. పొరుగూరిలో  ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి కాలేజి నుండి తన ఇంటికొచ్చాడు . ఇంటికి తీసుకొచ్చిన ఆటో డ్రైవరు  అరవై ఐదు రుపాయిలైందని అతనికి చెప్పాడు . అతనికి పాపం అరవై ఐదంటే ఎంతో అర్థం కాలేదు . అడగడానికి నామోషి. అందువల్ల చిల్లర లేదని అబద్ధమాడి, ఇ౦ట్లోకెళ్ళి వాళ్ళ తాతను అరవై ఐదుకి అర్థం అడిగి తెలుసుకొని డబ్బు చెల్లించాడు. ఇదీ నేటి పరిస్థితి. ఇదే కొనసాగితే కొన్నాళ్ళకి బస్సుల మీది తెలుగులో వ్రాసే ఊళ్ళ పేర్లు చదవలేక ఇబ్బంది పడవలసిన స్థితి వస్తుంది .  

 ఇక ఆంగ్లభాష విషయానికొద్దాం. ఆంగ్లబాషను చాల రాష్ట్రాలవారు భాషగా నేర్చుకుంటున్నారు. మనం మాత్రం మీడియం ద్వారా నేర్చుకుంటున్నా౦. రెంటికి చాల తేడా ఉంది . భాషగా నేర్పే వాళ్ళు మంచిపండితులై ఉండి ఆ భాషలోని మెలుకువలు, మర్మాలు నేర్పుతారు. ఇక మీడియం విషయానికొస్తే ప్రతి వాడు అధ్యాపకుడే . వారికేమి తెలీదు. పుస్తకంలో ఉన్న విషయాన్ని క్లాసుల్లో చదివేసి , బట్టీ పట్టించి మార్కులు పోసేస్తున్నారు.  క్లాసుల్లో కుక్కింగు; పరీక్షల్లో కక్కింగు నేటి పరిస్థితి .  అందువల్ల  ఇంగ్లీషులో ఒక చిన్న అప్లికేషన్ కూడ వ్రాయలేక పోతున్నాడు. అటు ఇ౦గ్లీషు, ఇటు తెలుగు రెండు రాక రెంటికి చెడ్డ రేవడుగా తయారౌ తున్నాడు. అందుకే "ఇంగ్లీషును కాటుకగా దిద్దుకో గాని ఒళ్లంతా పూసుకోకు నల్ల బడతవు" అన్నారు శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు.

ఒక విద్యార్థి,  ప్రిన్సిపాల్ కి  లీవులెటరు వ్రాస్తూ please grant me leave for today as I am suffering from mouth motions అని వాశాడు . వా౦తి అనే దానికి ఏ పదం  వ్రాయాలో తెలియక  mouth motions  అని వ్రాశాడు . వాడి సంగతేమోగాని ఆ లెటర్ చదివి ప్రిన్సిపాల్ వా౦తి చేసుకున్నాడు .

ఇక కొంతమంది మిత్రులు తమకు తెలిసో, లేక తెలియకో  తెలుగును సులభం చెయ్యాలంటే కొన్ని వర్ణాలు తొలగించాలనే వాదన చేస్తూ ఉన్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఒక విద్యాశాఖాధికారి (D.E.O) గారు నా దగ్గరకు వచ్చి శకటరేఫ అంటే బండిఅరసున్న మొదలైన వర్ణాలు తొలగించాలని వాదించారు. నేనన్నాను, ఏమండి!  enough, committee మొ||   పదాలకు అన్ని అక్షరాలు అవసరమా?    కొన్ని తిసేయ్యొచ్చు కదా! తీసిచూడండి,  ఏ౦ జరుగుతుందో చూద్దాం అన్నాను.  ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు. అందువల్ల తెసేయడం పరిష్కారంకాదు.    శకటరేఫ (ఱ) విషయానికొద్దాం . బండి ర ఉపయోగించకుండ నీరు అంటే water,  ఉపయోగించి నీఱు అంటే ashes (బూడిద). పాఱు అంటే ప్రవహించడం పారు అంటే పారడం. ఒక అవధానంలో ఒకాయన అడిగారు . మనం బయలుదేరేటప్పుడు నక్క, కుడి ప్రక్క పారితే మంచిదా ఎడమ ప్రక్క నుండి పారితే మంచిదా అని . దానికి సమాధానంగా అవధాని గారు ఎటు పారినా పరవాలేదు మన మీద చి౦దకుండా ఉంటే చాలు అన్నారు.

ఇక అరసున్న విషయానికొద్దాం. వెలుగులో అరసున్న ఉంటే ప్రకాశం అని అర్థం.  (వెలు(గు).  ఒకవేళ అరసున్న లేకపోతే వెలుగు అనే పదానికి ‘ముళ్లకంచె’ అని అర్థం . చీకు అనే పదంలో అరసున్న ఉంటే గ్రుడ్డి అని అర్థం . నన్నయ గారు ధృతరాష్ట్రుని ‘చీ(కురాజు’ అనడం మనం గమనించవచ్చు. అరసున్న లేక పోతె ఆ పదానికి చీకిపోవడం అనే అర్థం వస్తుంది. అందువల్ల వాటిని మనం పిల్లలకు నేర్పినా నేర్పక పోయినా పరవా లేదు గాని తీసెయ్యడం మాత్రం చాల తప్పు . ఈ మధ్య కొంతమంది మహా ప్రాణ వర్ణాలు (ఖ,ఘ మొదలైనవి ) తొలగించమని అంటున్నారు. ఇప్పుడు తెలుగు భాషామతల్లి కనీసం కొన ఊపిరితోనైనా ఉంది. ఆ మహాప్రాణవర్ణాలు తొలగిస్తే, ప్రాణమే కోల్పోతుంది .

ఇక మరికొంత మంది టైము టిక్కెట్టు రోడ్డు మొ|| పదాలు వాడుతున్నాం . మనం మాట్లాడేది తెలుగే కాదు అని పిచ్చిపిచ్చిగా  వాదిస్తున్నారు.`ఇది చాల తప్పుడు అభిప్రాయం ఎందుకంటే Time అనేది ఆంగ్లపదం గాని టైము తెలుగుపదమే అవుతుంది . అలాగే Ticket ఆంగ్ల పదం, టిక్కెట్టు మాత్రం తెనుగు పదమే. అలాగే Road ఆంగ్లపదం  రోడ్డు తెలుగుపదమే.

భాషలో తత్సమం- తద్భవం- దేశ్యం- గ్రామ్యం అనే నాలుగు రకాల పదాలుంటాయి.  ‘రామ’ అనే సంస్కృతపదం తీసుకుని మనం రాముడు చేసుకున్నాం . అది తత్సమం . అగ్ని అనే పదం ,  ‘అగ్గి’ అయింది అది తద్భవం . ‘అక్క’ ‘అన్న’ మొదలైన పదాలు దేశ్యాలు అవి మన స్వంత పదాలు. అవి కాకు౦డ వస్తాడు ,  లెగుస్తాడు, కూకుంటాడు మొదలైనవి గ్రామ్యపదాలు . ఇక టైము రైలు మొ || అన్యదేశ్యాలు. ఇవన్ని తెలుగు పదాలే కాబట్టి వాటిని తెలుగుపదాలు కావనడం సాహసం . తొలగి౦చాలను కోవడం అవివేకం . 

భాష, ఎంత పెరిగితే అంత గొప్పదవుతు౦ది. అయ్యయ్యో! అమ్మాయి పెద్దదై పోతోంది పెద్దదైతే మరలా బట్టలు కుట్టి౦చాలి అని ఎవరైనా బాధ పడతారా! . పైగా ఆనందిస్తారు.  పెరిగే కొద్ది ఆనందంతో కొత్త బట్టలు కొట్టిస్తారు. ఎందుకంటే పెరుగుదల సహజం పెరగక పోవడం అసహజం  . అంగ్లభాష చూడండి ప్రపంచంలో ఉండే అన్ని భాషాపదాల్ని తనలో కలుపుకు౦టూ ఎంత విస్తృతంగా పెరిగిందో. ‘జనన్నాథ’ అనే పదాన్ని Juggernaut గా మార్చుకుని తనలో ఇముడ్చుకుంది . పండిత pandit అయింది . అలాగే gaddi గద్ది (సంహాసనం)   మొదలైన కొన్ని వందల, వేల  పదాలకు తన నిఘంటువులో స్థానం కల్పి౦చింది . ప్రతి సంవత్సరం నిఘంటువుల్ని, వ్యాకరణాన్ని మార్చుకుంటూ పోతోంది . మనం ఆ పనే చెయ్యాలి .

ఇక ఇంగ్లీషు భాష రాకపోతే ప్రగతి ఆగిపోతుందని వాది౦చేవాళ్ళు కొంతమంది లేక పోలేదు. భాష నేర్చుకుందాం తప్పు లేదు . కాని మన భాషను పోగొట్టుకుని మాత్రం కాదు .

కొంత కాలం క్రిత౦  మా గురువులైన ఆచార్య పోచంచర్ల శ్రీరామముర్తి గారు  జర్మని వెళ్ళారు . వాళ్లకు ఇంగ్లీషు రాదు, వీరికి జర్మన్ భాష రాదు. కాలం ఎలాగో గడిచి పోయింది, ఎవరికీ ఏమి రాకపోయినా కాలం ఆగదు కదా   . ఆయన, తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు వారితో “మీకు ఆంగ్లం రాదు . నేర్చుకోవాలని ఎప్పుడు అని పి౦చలేదా! ఆంగ్లం రాకపోతే అభివృద్ధి సాధ్యమా ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా వారు మాకేమవసరం ప్రపంచంలో ఎవరు ఏ పుస్తకం వ్రాసినా అనతికాలంలోనే మాకు దాని జర్మన్ అనువాదం మా చేతిలో ఉంటుంది . ఆంగ్లం నేర్చు కోవడం మాకేమీ  అవసరం లేదు పొమ్మన్నారు . 

          దురదృష్టవశాత్తు అటువంటి అవకాశం మనకు  లేదు . అందువల్ల  మనం ఇ౦గ్లీషు నేర్చుకుంటే గాని డాక్టర్స్ కాలేం, ఇ౦జనీర్సు కాలేం . ఇదే ఆంగ్లభాషా వ్యామోహానికి ఒక ప్రథాన కారణం.  అందువల్ల మనం జర్మన్ దేశీయులమార్గాన్ననుసరి౦చాలి.

ఇక ఫ్రాన్సు  దేశం,  బ్రిటన్ కు చాల చేరువలో ఉంది . అందువల్ల ఆంగ్లం వాళ్ళ భాషను ఎక్కడ కబళించి వేస్తుందో అన్న భయంతో ఎన్నో ఆంక్షలు విధించారు . ఉదాహరణకి నేను విన్న, ఒక విషయం చెపుతాను . ఫ్రాన్సులో,  కార్యాలయాల్లో ఎవరైనా ఇ౦గ్లీషులో ఉత్తరం వ్రాస్తే  అది చి౦పి పారేస్తారు. లేకపోతే వాళ్ళ భాష అంతరించి ఇప్పటికి ఎన్నో శతాబ్దాలు అయు౦డేది.

మరికొంతమంది  ఉరుమురిమి మంగల౦ మీద పడిందన్నట్లుగా   సంస్కృతభాషమీద విరుచుకు పడుతున్నారు. పాపం! అదేం చేసింది తెలుగును పెంచి పోషించడం, అభివృద్ధి చేయడం తప్ప. గాంధీమహాత్ముడు అన్నారు Sanskrit is like river Ganges to our country if it is dried up all regional languages will lose their vitality and power.

అందువల్ల సంస్కృతాన్ని ద్వేషించడం జాతిని, జాతి పితను అవమానించడమే అవుతుంది.  

కాబట్టి  ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ లోపం ఉందో అక్కడ సవరించాలి . రోగం ఒకటి వైద్యం మరొకటి కాకూడదు. ఒక ప్రక్క మాతృభాషను ఉద్ధరించాలి అంటూనే  ఇంగ్లీషు చదివేవారి పట్ల మక్కువ చూపిస్తుస్తున్నా౦. ఇది సబబు కాదు. తెలుగును ప్రోత్సహించాలి వారికి ప్రభుత్వ సంస్థల్లో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి  .  కాబట్టి సమస్యకు ఏది మూల కారణమో తెలుసుకుని దాన్ని గమనించి నివారించ కలిగితే, భాషారక్షణ అభివృద్ధి పెద్ద పనే౦ కాదు. భాష రక్షణకు అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిద్దాం . తెలుగులెంక, ​శ్రీ తుమ్మల సీతారామ మూర్తి గారి ఆవేదనా పూరితమైన పద్యంతో ముగిస్తాను.

బెంగాలీ కృతికర్త పాదములకర్పి౦చున్నమస్కారము

ప్పొంగున్  పారశిలేఖినీ విలసనంబుల్సూ చి రావయ్య నా 

బంగారంబ యటంచు నాంగ్లకవి నాహ్వానించు నేపాపమో! 

రంగా మెచ్చడు తెల్గుబడ్డ కవి సమ్రాట్టున్ స్వదేశీయునిన్  .​

మాతృభాషను రక్షించుకుందాం , ఆత్మ గౌరవాన్ని కాపాడు కుందాం . నమస్కారం .

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

9897959425.

 

><><><><