Friday, April 30, 2021

శివుడు - మూడో కన్ను అర్థం -అంతరార్థం

 

                 శివుడు - మూడో కన్ను

                     అర్థం -అంతరార్థం

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

నేను  చిన్నప్పుడు మూడో తరగతి చదువుతున్నప్పుడు నాకో స్నేహితుడుoడే వాడు . వాడి పేరు సోమేశ్వరరావు. బాల శివ భక్తుడు. ఎప్పుడూ నాతో ఒరేయ్! శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచం బూడిదై పోతుందిరా అనేవాడు. నాకపుడు అర్థం అ య్యేది కాదు. ఆయన మూడో కన్ను తెరవడమేoటి ? ప్రపంచం బూడిదవడo ఏమిటి?  అనుకుంటూ ఉండే వాణ్ణి . ఆ తరువాతనే దాని  అర్థం ఆ మాటల తాత్పర్యం తెలిసింది. మూడోకన్ను అంటే జ్ఞాన నేత్రం . అది తెరుచుకుంటే ప్రపంచం లేదు. ఉండదా అంటే ఉ౦ డదనికాదు. కాలిన గుడ్డ మాదిరిగా  ఉన్నట్టు లేనట్లుగా కనిపిస్తుంది. దీన్నే సంస్కృతంలో దగ్ధ పట న్యాయం అంటారు. ఉదాహరణకి ఒక చీరగాని చొక్కా గాని కాలిపోయి౦దనుకో౦డి . అది పైకి చీరగానే గుడ్డగానే కనిపిస్తో ఉంటుంది . కాని కట్టుకోడానికి పనికి రాదు. అలాగే జ్ఞానికి ప్రపంచం అంతా కనిపిస్తుంది కాని ఆ ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు .

పురాణాలు వేదాల యొక్క అర్థాలను సామాన్య జనానికి బోధించడం కోసం ఈ విధంగా వివరించేవి. కాబట్టి మనం అందులో ఉండే తాత్పర్యం గ్రహించి తదనుగుణంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడు , మనం చూస్తాం . ఆ చూపులో ఎంతో తేడా ఉంటుంది. ఆయన ఈ ప్రపంచాన్ని నిర్వికారంగా చూస్తాడు. మనం అలాకాదు. అన్నిటితో సంబంధం పెట్టుకుంటాం . ఇదే చర్మ చక్షువుకి జ్ఞాన చక్షువుకి ఉన్న తేడా.

అందుకే “ దివ్యం దదామి తే చక్షు: “  (నేను నీకు దివ్య నేత్రాన్నిస్తాను )  అన్నాడు  కృష్ణుడు అర్జునినితో. కాబట్టి విజ్ఞుడు పురాణాల్లో చెప్పే ప్రతి అంశాన్ని ఉన్నదున్నట్లుగా కాకుండా విమర్శించి తెలుసు కోవాలి.    

 

    

Wednesday, April 28, 2021

నా లండన్ పర్యటన-2 (My trip to London)

 

                  నా లండన్ పర్యటన-2

                         (My trip to London)

                      Dr. Ch. Durgaprasada Rao

A day at Oxford University:

 నేను చిన్నప్పుడు నర్సాపురం టేలర్ హై స్కూలులో చదివే రోజుల్లోనే మా అధ్యాపకులు  oxford మరియు  Cambridge విశ్వవిద్యాలయాలు అక్కడ చదువుకున్న కొంత మంది శాస్త్రవేత్తలగురిoచి చాల గొప్పగా చెపుతూ ఉండేవారు. అవి వింటూ నేను మరికొంత మంది నా స్నేహితుతూ పులకించి పోతూ ఉoడేవాళ్లం. జీవితంలో ఎప్పుడైనా వాటిని చూడగలమా అని  అనుకుoటు ఉండే వాళ్ళo. కాలం ఎప్పుడు , ఎవరికి, ఎలా అనుకూలిస్తుoదో తెలియదు . ఆ రెండు విశ్వవిద్యాలయాలు చూసే   అదృష్టo నాకు కలిగింది .

ఒకరోజు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయానికి బయలు దేరాం .  అది ఇంగ్లండు లోని విద్యాలయాల్లో చాల ప్రాచీన మైనది . అక్కడ 1060 ప్రాoతాల్లోనే ఉన్నతవిద్య బోధిస్తూ ఉండే వారనటానికి ఎన్నో ఆధారాలున్నాయి.  అన్ని శాస్త్రాలకు అక్కడ విశేషమైన ఆదరం ఉంది, సంస్కృతానికి కూడ. ఇక నేను,   నా భార్య, కొడుకు, కోడలు , మనుమరాలు  ఇంచుమించు విశ్వవిద్యాలయం అంతా చూశా౦. ముఖ్యంగా botanical gardens, cavernous Bodleian library,  archeological  museum మొదలైనవన్నీ  చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా Archeological  museumఅన్ని అద్భుతాల్లో  మరో అద్భుతం . ఆ మ్యూజియం చూడడానికి , పూర్తిగా అధ్యయనం చెయ్యడానికి కొన్ని నెలలు సరిపోవు. కొన్ని వేల సంవత్సరాలనాటి  ప్రాచీన ప్రపంచసంస్కృతిని వారు భద్రపరిచారు. అతి ప్రాచీన నాగరికతల చిత్రాలు, ఆనాటి ప్రజలు ఉపయోగించిన వస్తువులు అక్కడ సజీవంగా కాకపోయినా, ఉన్నవి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా 25వేలసంవత్సరాలకు పూర్వం నాటి భారతీయ సంస్కృతీ సాంప్రదాయ విశేషాలు చక్కగా పొందుపరిచారు.   ఆనాటి రాజుల మరియు గ్రీకు వీరుల  మృత దేహాలు యథాతథంగా ఉన్నాయి. వాళ్ళ జోళ్ళు , వారి కాలి గోళ్ళు చాల స్పష్టంగా కనిపిస్తునాయి. ఆ మ్యూజియం చూడ్డానికైనా ప్రతివ్యక్తి లండన్ రావాలని పించింది .  కొన్ని వేల సంవత్సరాల నాటి ప్రాచీనదేశాలను, నాగరికతలను , సాంస్కృతిక చిహ్నాలను చూసి , ఎన్నో అంశాలను camara పొందుపరచడం జరిగింది . ఇక ఇంగ్లాoడులో కొన్ని వందల నాటక శాలలున్నాయి . రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా దేశాలన్నీ కుప్పకూలిపోయాయి. అప్పుడు వారు ముందుగా పునరుద్ధ రి౦చు కున్నవి నాటక శాలలు ఆ తరువాతే చర్చిలు. దీన్ని బట్టి నాటక కళ పట్ల వారికున్న ప్రేమాభిమానాలు మనం అర్థం చేసుకోవచ్చు.     ఎప్పుడూ షేక్స్పియర్ మహాశయుని నాటకాలు ప్రదర్శిస్తూనే ఉంటారు . కిక్కిరిసిన ప్రేక్షకులతో నాటకాలు నడుస్తూనే ఉంటాయి. కాని ఏ నాటకం చూడాలన్నా కనీసం ఆరు నెలలు ముందుగా టిక్కెట్లు రిజర్వు చేయించు కోవాలి. అందువల్ల నాటకం చూసే అవకాశం లేక,  అప్పటికే అలసిపోవడం వల్ల మరేదీ చూసే ఉత్సాహం లేక ఇంటి మొగం పట్టాం.

ఇంకా ఉంది

A day at Cambridge University :

మేము 17-11-2019 న లండన్ లోని Cambridge విశ్వవిద్యాలయం సందర్శించడానికి వెళ్ళా౦ . అది ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పది యూనివర్శిటీలలో ఒకటి . అంతే గాక   Cambridge is the second oldest university in the English-speaking world గా కూడ చెపుతారు. ప్రపంచవిఖ్యాతి గడించిన ఎందరో మహనీయులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో వివిధ శాఖలున్నాయి . ఇక   John C. Taylor తయారు చేసిన corpus clockను 2008లో సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త   Stephan Hawking ప్రారంభిoచారు. ఇది ఈ విశ్వవిద్యాలయానికికొక ప్రత్యేక ఆకర్షణ ( special attraction). విశ్వవిద్యాలయ సందర్శకులకు, పర్యాటకులకు  ఇది ఎంతో ఉత్తేజాన్ని కలిగించే అంశం.  

ఈ విశ్వవిద్యాలయం ఎన్నో శాఖోపశాఖలతో విస్తరించి ఉంది . ఈ విశ్వ విద్యాలయానికి సంబంధించిన ఎన్నో అనుబంధ కళాశాలలు , అనుబంధ పరిశోధనా సంస్థలు దేశమంతట  విస్తరించి ఉన్నాయి. కొన్ని వేలమంది శాస్త్రజ్ఞులు , న్యాయవాదులు , చలనచిత్రనటులు , తత్త్వవేత్తలు , దేశప్రధానమంత్రులు , క్రీడాకారులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారే . ఒలింపిక్ క్రీడల్లో వందలాది స్వర్ణపతకాలను సాధించిన వారిలో  ఈ విశ్వవిద్యాలపూర్వవిద్యార్థులే అధికశాతంలో ఉన్నారనేది ఒక ఉత్తేజ కరమైన అంశం . మేము ఈ విశ్వవిద్యాలయం ప్రధాన భావనాలన్నీ సందర్శించ గలిగాము .   

                                                            <.><.><>><<>


Saturday, April 17, 2021

ప్రసాదరామాయణం – పరిశీలన (కావ్య కర్త : శ్రీ మొదలి శ్రీ రామప్రసాదు గారు)

 

         ప్రసాదరామాయణం పరిశీలన

                     (కావ్య కర్త : శ్రీ మొదలి శ్రీ రామప్రసాదు గారు)

                                                                        డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు

 

భారతీయజనజీవనస్రవంతిలో రామాయణం అంతర్లీనంగా పెనవేసుకుపోయి తరతరాలుగా    జాతిని ప్రభావితం చేస్తూనే ఉంది.   పూర్వం ఒకాయన తన మిత్రుడితో ఏమయ్యా! రామాయణం చదవలేక పోతున్నాను. మొత్తం మూడు ముక్కల్లో రామకథ చెప్పగలవా ? అని అడిగాడు . ఎందుకు చెప్పలేను  కట్టె- కొ ట్టె- తెచ్చె అన్నాడు. అదేంటో కాస్త  వివరించవయ్యా అని అడిగితే ఏముంది ! వారధి కట్టె, రావణుని కొట్టె, సీతను తెచ్చె అన్నాడు. . అలాగే ఏకశ్లోకి  రామాయణాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకి 

      ఆదౌ రామతపోవనాదిగమనం , హత్వా మృగం కాంచనం

వైదేహీ హరణం, జటాయు మరణం, సుగ్రీవసంభావనం,
వాలీనిగ్రహణం, సముద్రతరణం, లంకాపురీ దాహనం,
పశ్చాద్రావణకుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం

శ్రీరామచంద్రమూర్తి  తపోవనానికి వెళ్ళడం,  మాయలేడిని సంహరించడం , రావణుడు సీతను అపహరించడం, జటాయువు మరణం, రామసుగ్రీవుల మైత్రి , వాలివధ , సముద్రం దాటడం , ఆంజనేయుడు లంకానగారాన్ని తగులబెట్టడం , రాముడు రావణకుంభకర్ణాది రాక్షసులను వధించడం మొదలైనవి  రామాయణంలోని ప్రథాన ఘట్టాలు. ఇది కూడ ఇంచుమించు కట్టే కొట్టే తెచ్చే లాగానే ఉంది . 


కాని చాల తక్కువ పద్యాల్లో సమగ్రంగా మొత్తం రామాయణ కథను   అందంగా చెప్పిన కావ్యాలు చాల అరుదు.  అటువంటి ఒక అరుదైన కావ్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం .  రామాయణం వేదాల సారా౦శరూపమైన మహాకావ్యం . కవి వాల్మీకి .

 వేదవేద్యే పరే పు౦సి  జాతే దశరథాత్మజే 

వేద: ప్రాచేతసా దాసీత్సా క్షాద్రామాయణాత్మనా

అన్నారు పెద్దలు . వేదవేద్యుడైన ఆ పరమపురుషుడు (పరమాత్మ)  దశరథుని కుమారునిగా జన్మించగా వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా అవతరి౦చిందని అర్థం . దీన్ని బట్టి రామాయణం వేదార్థ ప్రతిపాదకం . విషయంలోకి లోతుగా వెళ్ళకుండా ఒక్క విషయం పరిశీలిద్దాం. వేదం న పరదారాన్ గచ్ఛేత్ అని పరస్త్రీ గమనాన్ని ని౦దించింది , నిషేధించింది. ఏడక్షరాల ఈ విషయాన్ని   ఇరువదినాలుగువేల శ్లోకాల్లో కావ్యరూపంలో  వాల్మీకిమహర్షి వివరించారు. 

రామాయణం అ౦తా చదివాక రామాదివద్వర్తితవ్యం న రావణాదివత్ అని అంటే రామునిలా ఉండాలని  రావణునిలా ఉ౦డకూడదని మనకు  తెలుస్తుంది .  ఇక మన భరతజాతి శతకోటి జన్మ లెత్తినా వాల్మీకి ఋణాన్ని తీర్చుకోలేదనే విషయంలో ఎటువంటి సందేహం . సరే ! ఆ విషయం అలా ఉంచుదాం

.తెలుగులో కొన్ని వందల రామాయణాలున్నాయి.  ఇక    అటువంటి వాటిలో    ప్రసాద రామాయణం ఒకటి . రచయిత శ్రీ మొదలి శ్రీ రామప్రసాదు గారు . వీరు ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.    వీరు విద్యార్థిదశలోనే ఇంచుమించు పదునారవ ఏట ఈ కావ్యాన్ని రచించినట్లు తెలుస్తోంది . ఈ కావ్యరచన ప్లవంగనామ సంవత్సరం (19-4-1967) శ్రీ రామనవమి రోజున పూర్తయింది .  వీరు  శ్రీ రామచంద్రుల సుబ్బరామశాస్త్రిగారి శిష్యులు . ఇది తెలుగులో వెలువడిన రామాయణాల్లో అతి చిన్నది అని చెప్పవచ్చు. ఇది నిర్వచనరామాయణం . పద్యాల స౦ఖ్య ముప్పది ఏడు మాత్రమే.

.ఈ కావ్యం  ప్రఖ్యాత పండితులు, సినీగేయరచయిత శ్రీమాన్ సముద్రాల  రాఘవాచార్యులవారి ప్రోత్సాహంతో వారి కోరికపై వ్రాసినది కావడం వల్ల ఈ చిరుపొత్తానికి వారి ఆశీస్సులు , అభినందనలు కూడ లభించాయి. విద్వాన్ శ్రీకోట సత్యరంగయ్యశాస్త్రిగారు కొన్ని సవరణలు చేయగా శ్రీ యామిజాల పద్మనాభశాస్త్రి గారు ఆశీస్సులు , అభిప్రాయాలు అందజేశారు . వీరు విద్వాన్ కణ్వశ్రీ గారి వద్ద పద్య రచనలో మెళుకువలు నేర్చు కున్నారు.   అంతేగాక  శ్రీయుతులు వాదారి శ్రీనివాస శర్మ , కలవటాల జయరామకవి , రామచంద్రుల సుబ్బరామశాస్త్రి , అష్టావధాని , కోట సోదరకవులలో నొకరైన  కవిచంద్ర , ఆశుకవి సమ్రాట్,  విద్వాన్ కోట సత్యరంగయ్య శాస్త్రి గారలు వీరిని

పూర్వ జన్మార్జితంబైన పుణ్యవశత (

గవిత ( జెప్పంగ వచ్చును కమ్ర ఫణితి (

   జెప్పితాతయ్య కర్పించియొప్పితీవు

శ్రీయుతమ్ముగ(బడయుము శ్రేయములను

 అని అభినందించి ఆశీర్వదించారు  .

  కవి ఈ కావ్యాన్ని వారి తాతగారైన  శ్రీ యుతులు సుబ్బరామయ్య గారికి అంకితం చేశారు . శ్రీ సుబ్బరామయ్య గారి గుణగణాలను వారు ఇలా స్తుతించారు

 కాశ్యపగోత్రుడై ఘనుడై మొదలివంశ

                           కీర్తిని జగదేకకీర్తి చేసి

ఆశ్రితలోకంబునాదరంబున జేర్చి

                      బాంధవ్యమున జూచు భవ్య మూర్తి

హాస్యమునకునైన నన్యులతో వివా

                  దములు చేయనియట్టి ధన్యమూర్తి

మానసంబున ఈశు మైమరచి పూజించు

                  పరమపావనుడైన భక్త మూర్తి

 సుగుణగణములు గల సుబ్బరామయ్యకు

ముదముతోడ రామ మూర్తి కథను

అంకితంబు జేతునత్యంత  భక్తితో

నదియె భాగ్యకరము నగును నాకు.

 ఇది సంగ్రహ రామాయణమని కాబోలు కవి చాల సంగ్రహంగా రెండు

 పద్యాలలోనే  వినాయకుని , దేవీదేవతలను , పూర్వకవులను స్తుతించారు.

ఉత్పలమాల :

కొక్కు హుమాయు రౌతగుచు  కోర్కెల దీర్చెడి విఘ్న దేవునిన్

మ్రోక్కులదీర్చు శ్రీపతిని మ్రొక్కెద శంకర బ్రహ్మ దేవులన్

తిక్కన పోతనాది కవినేతల వాల్మికి మౌనివర్యు ని౦

పెక్కిన తక్కు సత్కవుల నేరిమి మీరగ నే భ్జజి౦చెదన్

ఆ|| వె.

 శ్రీనివాసు ముద్దు చెలియవైయొప్పారు

కమలనేత్రి నన్ను కరుణ జూడు

పరమశివుని దయను వలచి చేకొన్నట్టి

అంబ ! భక్తీ నిన్ను నాశ్రయింతు .

కవి వాల్మీకి అనడానికి బదులు వాల్మికి అనడం చూస్తే అపి మాషం మషం కుర్యాత్ ఛందోభంగం న కారయేత్ (మాషం అనడానికి మషం అనొచ్చు గాని ఛందస్సు తప్పకూడదు ) నియమాన్ననుసరి౦చారని  భావించొచ్చు.  ఈ కావ్యంలో కథ శ్రీరామ జననంతోనే  ప్రారంభం అయింది.

 జనులకు  శుభ౦ రాక్షసులకు భయం కలగజేయడానికి ఋషులు , దేవతాగణాలు  స్తుతించగా  కారణజన్ముడై దశరథునకు , కౌసల్యకు చైత్రమాస,  శుక్లపక్ష, నవమి నాడు  రామ నామధేయంతో  జన్మించాడని కవి వర్ణించారు . ఇక్కడ కారణజన్ముడు అనే పదంతో ఆయన అవతార ప్రయోజనాన్ని సూచించారు .

నిజమే! రామ అంటే రాక్షస మరణ హేతువని , రామ అంటే రావణ మరణ హేతువని సూచిస్తూ కారణజన్ముడనే పదం కవి వాడడం వారి ప్రతిభకు ఒక తార్కాణ. 

మరొక పద్యంలో రాముని సోదరులైన లక్ష్మణ , భరత, శత్రుఘ్నుల పుట్టుకను వివరించారు. వారందరి బాల్యాన్ని  , నేర్చిన శస్త్రాస్త్ర విద్యల్ని ఒక్క పద్యంలో వివరించారు .     

దురిత సంతమసంబును దొలగ జేసి

దీప్తి వెలుగొంద జగతి సందీప్తి మెఱయ

రామ నామ ధేయంబుతో రాజిలంగ

పుట్టె నా పద్మ నాభుండు పుడమియందు

 రాముడనుజన్ములైన భరతుడు లక్ష్మ

ణుడు శత్రుఘ్నుడును  గూడి మండలాధి

పతిని మించు శౌర్యంబుతో ( బ్రగతి తోడ

జగతియందొప్పుచు౦ డిరి చాల ప్రీతి

  మరో పద్యంలో శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నారని వర్ణించారు .

ఆతరువాత రెండు పద్యాల్లో దశరథుని నిండుసభ , ఆ సభకు విశ్వామిత్రుడు రావడం , యాగరక్షణకై రాముని పంపమని అడగడం రాజు కాదనలేక పోవడంవర్ణి౦చారు .

ఆ తరువాత   రామలక్ష్మణులు ముని వెంట వెళ్లడం  రాముడు తాటక , సుబాహులను చంపడం , అహల్య శాపవిమోచనం , రాముడు  సీతను పెండ్లాడడం వర్ణించారు.

ఆ తరువాత రెండు పద్యాలలో లక్ష్మణ, భరత. శత్రుఘ్నులకు ఊ ర్మిల, మాండవ్య , శ్రుత కీర్తులతో వివాహం జరిపించారు. ఆ తరువాత పరశురామగర్వభంగం వర్ణించారు . రామలక్ష్మణభరతశత్రుఘ్నులతో దశరథుడు అయోధ్య చేరుకున్నాడు.  దశరథుడు రామునికి రాజ్యం ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాడు  . ఇది తెలిసిన మంథర కైకేయికి  ఏదో చెప్పి ఆమె మనస్సును విషపూరితం చేసింది .  తత్ఫలితంగా రామునకు అరణ్యవాసం. ఆయన సీతాలక్ష్మణులతో వనం చేరుకున్నాడు.

 ఆ తరువాత గుహుని సహాయంతో నదిదాటి అడవిలో ప్రవేశించాడు. నేలపై కాలు మోపని శ్రీ లలితుడు అడవుల్లో ఎన్నో కష్టాలనుభ వి౦౦చాడు.

  సీతారామ లక్ష్మణులు భారద్వాజుని ఆశ్రమం చేరి ముని ఆశీస్సులు పొందారు.  చిత్రకూటపర్వతం చేరుకున్నారు. భరతుడు వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని ప్రాధేయ పడగా అతనినోదార్చి తన పాదుకలిచ్చి  ప౦పేశాడు. ఆ తరువాత వారు దండకారణ్యం చేరుకున్నారు. రాచనగరున నుండ వలసిన రామభద్రుడు పర్ణ శాలలో

 నుండ వలసి వచ్చిందట . ఈ విషయాన్ని  సమర్ధిస్తూ కవి         

 కాల మొకరీతి సాగునే ఘనులకైన అంటారు. సీతారామలక్ష్మణుల వనవాసక్లేశాన్ని చాల చక్కగా వర్ణించారు .

పట్టు పైడంచుల వరలు చీరలు గట్టు

కోమలి నారలన్ కోర్కెగట్టె

రాజ్యము పాలించు రాఘవునకు నహో!

కానలే రాజ్యమై గ్రాలె నిపుడు

పట్టుపాన్పులపైన పవ్వళించు విభులు

శిలలపై పరుండ వలసి వచ్చె

అన్న  , వదినల సేవ లందించు  సౌమిత్రి

కంటికి నిద్దుర కలుగ దాయె

పంచభక్ష్యాదులను భుజి౦చువారు

కందమూలాల కాలంబు గడపిరెట్లు ?

రాజ్యభోగాల సుఖియించు రాజసుతులు

కష్టవనజీవితమ్మును గడపిరెట్లు ?

 శూర్పణఖ దుష్టచేష్టలు, లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కొయ్యడం , ఖరదూషణాదుల వధ వర్ణించారు.  ఆ తరువాత మారీచుడు మాయలేడి రూపంలో తిరుగుచు సీతకు కనిపి౦చడం, , సీత మోజుపడడం, , రాముడు ఆ లేడిని వెంబడించడం, మారుగొంతుకతో మారీచుడు అరవడం , లక్ష్మణుడు రాముని రక్షణకై పర్ణశాలను విడిచి వెళ్ళడం , రావణుడు సమయం కనిపెట్టి మునివేషం ధరించి సీతను మోసగించి లంకానగారానికి కొని పోవడం అనే అంశాలు చోటు చేసుకున్నాయి.  శ్రీరాముడు సీతను వెతుకుతూ కిష్కింధకు చేరుకోవడం , దుందుభిని కూల్చడం  , సప్తతాళాలను కూల్చడం , ఆంజనేయుడు సుగ్రీవునకు రామునకు చెలిమి కుదర్చడం , వాలివధ మొదలైన అంశాలు న్నాయి.

సుగ్రీవుడు, సీతను ఒక్క మాసంలో వెదికి తెమ్మని వానర ప్రముఖులను ఆజ్ఞాపించడం, హనుమంతుని దక్షిణదిశకు పంపడం, రాముడు తన ముద్రికను సీతకిమ్మని ఆ౦జనేయునకు  సమర్పించడం ఇందులో అంశాలు.

 వానరులు కొండలు, కోనలు, అడవులు, చెట్లు , చేమలు పుట్టలు సమస్తం వెదికారు కాని సీత జాడ తెలియలేదు. ఆ సమయంలో దశరథుని మిత్రుడు సంపాతి యను పక్షి సీతను రావణుడు లంకకు కొనిపోయాడని తెలియ జేశాడు.

హనుమంతుడు రామనామ౦ జపిస్తూ ఆకాశమార్గంలో లంకానగరం చేరుకున్నాడు. లంకిణిని చంపాడు. లంకానగరంలో ప్రవేశించి , మేడ మేడలు , వాడవాడలు , పూల తోటలు నేర్పుగా వెదికాడు. అశోకవనంలో, విరబోసుకున్న కురులతో మాసిన చీరతో హృదయవిదారకంగా విలపిస్తున్న సీతను చూశాడు. రాముని క్షేమసమాచార౦  ఆమెకు తెలియ జేశాడు.

 రావణుడు ఆంజనేయుని తోకను కాల్చగా , ఆంజనేయుడు లంకను తగులబెట్టి సీతను వీడ్కొని  రాముని చేరుకుంటాడు. శ్రీ రాముడు సీత జాడ తెలుసుకొని రావణుని జయించడానికి నిశ్చయించు కుంటాడు . రాముడు సముద్రుని చేరుకుని అతనిని  ప్రార్థిస్తాడు. సముద్రుడు రామునకు ప్రత్యక్షమై వారధి నిర్మించమని నలునిచే వెయ్యబడిన రాయి నీటిలో మునుగదని ఉపాయం సూచిస్తాడు.

 నలుడు, నీలుడు మిగిలిన వానరులు వారధి నిర్మించగా రాముడు వానర సైన్యంతో లంకకు చేరుకుంటాడు.

 లంకానగారాన్ని చేరిన రాముడు సువేలాద్రి నుండి రావణునకు అంగదుని ద్వారా రాయబారం పంపిస్తాడు. రావణుడు అహంకారంతో అంగదుని మాటలను లెక్క చెయ్యక పోవడంతో యుద్ధం అనివార్యమౌతు౦ది.

 వానర యూధం , రాక్షససైన్యం పరస్పరం కలబడడంతో రక్తం ఏరులై పాఱి ఎర్రని రంగుతో భూమంతా కుంకుమ పరచినట్లయిందని వర్ణించడం కవి ప్రతిభకు నిదర్శనం . వసుధ యెల్లను కుంకుమ పరచి నట్లు.

రావణుని పక్షంలో కుంభకర్ణాది మహావీరులు పోరాడారు.  వారంతా మరణించగా రావణుని వంతు వచ్చింది. రామరావణ యుద్ధం ప్రారంభమయింది. రాముడు రావణుడు ప్రయోగించిన బాణాలను త్రిప్పి కొడుతుంటే ఆకాశంలో తోక చుక్కలు ఒక దానితో మరొక్కటి ఢీకొన్న విధంగా ఆకాశం కాంతివంతమై౦దని వర్ణన చెయ్యడం  కవి భావుకతకు మరో ఉదాహరణ. చివరకు రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుని నేలకూల్చాడు. స్వర్గానికి  సాగనంపేడు. పద్యం ఎంత బాగుందో చూడండి.

 ఎన్నియొ క్రూర కార్యముల నెన్నక చేసిన ధూర్త దైత్యుడా

పన్నుల జేసె మౌనులను ; వల్లభుడై భువినేలె, నాతనిన్

మన్నునగూల్పగా విడిచెమాన్యత బ్రహ్మశరంబు రాముడా

చెన్నున రావణు౦ బనిచె   శ్రేయము నాకము జేరగా నొగిన్  

 రావణమరణానంతరం సమస్తలోకాలు ఎంతగా సంతో షి౦చాయో కవి చక్కగా వర్ణి౦చారు. కవిగారి తెనుగు పలుకు బడులు

దశకంఠ కంటక దైత్యుండు మరణింప

సకల లోకమ్ములు శాంతి బొందె

ముక్క౦టి దేవుడు , దక్కినంపు దొరయు

కొక్కు తేజపు రౌతు , చుక్కల దొర,

బమ్మదేవర , వజ్రి, పద్మ బా౦ధవుడును ,

 గాలి నెచ్చెలికాడు గాలి ఱేడు,

వరుణుడు తక్కిన నరులును ఋషులును ,

చారణ తుంబుర నారదులును

గీ || అరయ శ్రీరాము మెచ్చుచు నభినుతి౦చి

పుష్ప వర్షమ్ము కురిపించి పూజ సేయ

భువికి నేతె౦చిరానాడు  పూతచరితు

రాము గుణ ధాము రణ రంగ భీము నెలమి.

రాముడు జనులయపని౦దరాకుండా ఆమెను అగ్నిపూత గావించి దివ్యధామానికి వెళ్ళే దేవునిలా అయోధ్యలో ప్రవేశించాడు

కవి ఈ విధంగా కావ్యం రచించి రామ రాజ్య వర్ణనతో కావ్యం ముగించారు.

పంట భూములయందుపైడి పండునటుల ,

కాలరీతిని వాన కలుగు చుండ ,

చారులబలబున చోరుల తొలగించి ,

ధర్మము నాల్గు పాదాల నడువ ,

మంత్రులు సకల సామంతులు నాల్గు వ

ర్ణాల పురజనులు నాయకులును

భరత శత్రుఘ్నులు భక్తీ ప్రపత్తులన్,

వింజామరలు బట్టి వీచు చుండ ,

 గీ|| లక్ష్మణు౦డాంజ నేయుండులాలితముగ

తన్ను సేవింప రాముడు ధర్మ రీతి

నాడు పట్టాభిషిక్తుడైనాడు భువిని

రామ రాజ్యంబె  లక్ష్యమై రాజిలంగ.

 ఇప్పుడు మనం ఉంటున్నది డబుల్ రామరాజ్యం . ప్రజలు రామ రామా అని తల్లడిల్లు తున్న పరిస్థితి. మళ్ళీ మనం ఆ రామ రాజ్యం పొ౦ది సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తు అల్పాక్షరాల్లో అనల్పార్థం అన్నట్లు  ఇంత సంగ్రహంగా రామాయణాన్ని కూర్చిన శ్రీ మొదలి శ్రీరామ ప్రసాదు గారిని అభినందిస్తూ సెలవు.

                                                       ముఖ్య గమనిక :

ఒక్క అరగంట లోనే రామాయణ మ౦తా చదివి పలితం పొందాలనుకునే  వారికి పుస్తకం soft copy  పంపడం జరుగుతుంది.

 ఈ సమీక్ష చదివి మూలకావ్య కర్తను ప్రశంసించదలచిన వారికి వీలుగా వారి చిరునామా ఈ దిగువన పొందుపరచడ మైనది.

Sri M. Sri Rama Prasad ,

“ Sruti Flats” 1 floor ,

Opp to City Union Bank,

21/6 , Mahalakshmi Street,

Near T. Nagar Bus Depot, Chennai .

600017.

Cell:- 09444929384

Land: 04424321361

E. mail.

modali. sriramaprasad@gmail