Sunday, November 1, 2020

ఉచిత సలహాలు --- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

                                                       ఉచిత సలహాలు

                                                                                   డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు 

మన సమాజంలో కొంత మందిని చూడండి . ఏదోఒకటి మాట్లాడుతూ ఉంటారు , ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు . సలహాలు ఇవ్వడం మంచిదేగాని అడిగినా అడగకపోయినా సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదు . అడిగినప్పుడు సలహా ఇస్తేనే దానికొక విలువ ఉంటుంది . లేకపోతే దానికి విలువ లేకపోవడం మాట అటుంచి ఆ వ్యక్తి  చులకన అవుతాడు . మన సంస్కృతి అపృష్టో బహు భాషతే అని అడగకుండా సలహా చెప్పేవాణ్ణి నిందించింది.

ముఖ్యంగా వైద్యవిషయంలోనూ, జ్యోతిష0 విషయంలోనూ అందరు అందరికి సలహాలిస్తూ ఉంటారు . ఈ ప్రపంచంలో కొద్దో గొప్పో ఈ రెండు తెలియనివారుండరట.

ఆపి సాగరపర్యంతా విచేతవ్యా వసుంధరా దేశోహ్యరత్ని మాత్రోపి నాస్తి దైవజ్ఞవర్జిత:

అంటారు నీలకంఠ దీక్షితులు . చతుస్సముద్రముద్రితమైన ఈ భూమండలం అంతా వెదకి చూచినా జ్యోతిష్కుడు లేని చోటు జానెడైనా కనిపించదట.  ఇక అడగని వారికి సలహాలు చెప్పడం మంచిదికాదని మామిత్రులు డాక్టర్ . బండ్లమూడి ఆంజనేయులు గారు చాల చక్కని పద్యంలో సూచించారు .

అడగనంతవరకు నాప్తున కైనను

చేరి హితము నెపుడు చెప్పరాదు

అడగకుండ పెట్ట నన్నంబు విషమౌను

గుణ్య రామ రాయ గురు విధేయ

కాబట్టి ఉచితసలహాలు చెప్పేముందు ఒక్క నిముషం ఆలోచించాలి . ఇక

ముఖరతాsవసరే హి విరాజతే అంటే  ఒక్కొక్కప్పుడు వాచాలత కూడ శోభిస్తుంది అంటాడు భారవి .   ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కొన్ని సందేహాలున్నాయి . అవి ప్రక్కనున్న వ్యక్తిని అడిగితెలుసుకోవచ్చు కాని అడగడానికి భయం, అడిగితే ఏమనుకుంటాడో నని సంశయం . అటువంటి సందర్భాల్లో వాళ్ళ అవసరం తెలుసుకొని సలహాలివ్వడం తప్పులేదు .    కాని సాధారణ పరిస్థితిల్లో మాత్రం ఇతరులు అడుగకుండ సలహాలు చెప్పి అనవసరంగా నోరు పారేసుకోకూడదు.  

 

 

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన ప్రేమాంబుధి శతకం ఒక సమీక్ష

 

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన ప్రేమాంబుధి శతకం

ఒక సమీక్ష

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

3/106, ప్రేమనగర్, దయాల్బాగ్, ఆగ్రా

 

నేను Science of Consciousness కు సంబధించిన  ఒక అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనడానికి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు శ్రీ నేమాని సోమయాజులు గారు  నాకు పరిచయం అయ్యారు. వారు కూడ ఆ కాన్ఫరెన్సులో పాల్గొనడానికే విచ్చేశారు . అక్కడ మేం ఇద్దరం ఎప్పుడు కలుసుకున్నా సాహిత్యం గురించే చర్చించుకునే వాళ్ళం . వారు కంప్యూటర్ సైన్సులో నిపుణులైనా సాహిత్యం పట్ల వారు కనపరిచే ఆసక్తి నాకు ఆనందసంభ్రమాలను కలిగించేది . వారు  వృత్తి రీత్యా విజ్ఞానశాస్త్రం s(software) లో నిపుణులు, ప్రవృత్తి రీత్యా గొప్ప సాహితీ వేత్త , కవి , పండితులు , అవధానవిద్యలో ఆరితేరిన వారు . వారిని కవిత్వం వరిచడం చూస్తే ‘చతురకవిత్వ తత్త్వ పటుసంపద ఒక్కరి సొమ్ముగాదు భారతి దయ’ అన్న కనుపర్తి అబ్బయామాత్యుని మాట అక్షరాలా నిజమనిపిస్తుంది . అమెరికాలో ఉ౦టూనే అటు వృత్తిపరంగాను ఇటు ప్రవృత్తిపరంగాను ఆహర్నిశలూ శ్రమిస్తూ  ఆంధ్రుల గొప్పదనాన్ని, ప్రతిభాపాటవాలను  ప్రపంచ౦ నలుమూలలా  విస్తరింపజేస్తున్న  మహామనీషి, సాటిలేని మేటి పండితులు శ్రీ నేమాని వారు .  

 

 

ఇక వారు రచించిన ప్రేమాంబుధిశతకం ఆమూలాగ్రం ఆసక్తితో చదివాను. నేను చిదివాను అనడంకంటే ఆ గ్రంథం నన్ను మొదటినుంచి చివరిదాకా  చదివేలా చేసింది అనడమే సబబని నాకు తోస్తోంది . ప్రతిపద్యం చాల హృద్యం, శైలి ప్రసన్నగంభీరం అంటే  మాటల్లో ప్రసన్నం భావంలో గంభీరం అన్న మాట . ప్రతిపద్యంలోను భాష , భావం రెండు శివపార్వతుల్లా పెనవేసుకు పోయాయి .    రచన పరిణతి చెందినదనడానికి ఇదొక ఉదాహరణ . 

ఇక ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాల్లో మోక్షం సర్వశ్రేష్ఠ౦.  అందుకే అది పరమపురుషార్థమై౦ది . మానవుడు తన యథార్థస్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే అది సిద్ధిస్తుంది . అందుకే  ఆపస్తంబమహర్షి ‘ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్’ అనే మాటల్లో  మానవుడు తన యథార్థస్వరూపాన్ని తెలుసుకోవడం కంటే  ఉన్నతమైన పరమార్థం మరొకటి లేదన్నారు  . ఈ మోక్షప్రాప్తికి  కర్మ, భక్తి, జ్ఞానం అనే   మూడు మార్గాలున్నాయి . కర్మలు ఎన్నో విధాలుగా ఉన్నాయి , వాటికి పరిమితి లేదు . అంతే కాక కర్మలు ధనవ్యయంతో ముడిపడ్డాయి , అందరు ఆచరించ లేరు . కర్మకాండకు ఎన్నో నియమనిబంధనలున్నాయి . యజ్ఞయాగాది కర్మలు అన్ని కులాలవారు ఆచరి౦చలేరు. కర్మకాండకు వయోపరిమితి , ఆశ్రమనిబంధనలు  ఎన్నో ఉన్నాయి . పోనీ ఎలాగో కష్టపడి కర్మల నాచరి౦చినా కర్మలవలన పొందేది ఏదీ శాశ్వతం కాదు .  ఇక జ్ఞానకాండ విషయానికొస్తే అది అందరికీ అందుబాటులో ఉండదు . నిత్యానిత్యవస్తువివేకం కావాలి  . లౌకిక సుఖాల పట్ల పారలౌకిక సుఖాల  పట్ల వైరాగ్యం కావాలి . ఇంద్రియనిగ్రహం( శమం) ,  మనో నిగ్రహం(దమం ) , కర్మఫలత్యాగం(ఉపరతి )  , శీతోష్ణ , సుఖదు: ఖాది ద్వంద్వాలను  సహించగలగడం (తితిక్ష )  , శాస్త్ర వాక్యాలపట్ల గురువాక్యాలపట్ల అచంచలమైన విశ్వాసం (శ్రద్ధ) , ఎటువంటి ఏమరుపాటులేని నిశ్చలమైన మనస్సు (సమాధానం) మొదలైన గుణాలు అలవరచుకోవాలి  . మోక్షంపట్ల కోరిక (ముముక్షుత్వం)  కలిగి ఉండాలి . ఇవన్నీ అలవడడం అంత సులభమేమీ కాదు . అందువల్లనే మోక్షసాధనాల్లో భక్తి  చాల గొప్పదని శ్రీశంకరుల వంటి  మహాజ్ఞాని స్వయంగా అంగీకరించారు.  అంతేగాక మనకు భగవంతుడు మానవజన్మ ప్రసాదించినందుకు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం భక్తిమార్గంలో ప్రయాణం చేసేవారికి  పుష్కలంగా లభిస్తోంది . ప్రతివ్యక్తి  భక్తి భావాలను  ప్రకటి౦చు కోడానికి శతకసాహిత్యం ఎంతో బాసటగా నిలుస్తోంది .

 ప్రేమాంబుధిశతకంలో  “రాధాస్వామి! ప్రేమాంబుధీ!” అనే మకుటంతో నూటతొమ్మిది పద్యాలున్నాయి . రచయిత తాను స్వయంగా  రాధాస్వామిసత్సంగ మతానుయాయి   కావడం వల్ల దేవాధిదేవుడైన రాధాస్వామీదయాళురను ప్రేమసముద్రునిగా వర్ణించి మనసారా  స్తుతించారు .

మోక్షం పూజలు,  దానధర్మాలు చేయడం వల్ల సిద్ధి౦చదని ధ్యానం వల్లనే సిద్ధిస్తుందని చాటి చెప్పే ఈ పద్యం ముముక్షువుల పాలిట ఒక కల్పవృక్షం .

“ విరిరాశుల్గొని పూజలన్ సలుపగన్, వేవేలు దానమ్మిడన్,
బురముల్ మెచ్చ వ్రతమ్ములన్ సలుపగన్ మోక్షమ్ము సిద్ధించునే?
స్థిరచిత్తమ్మున నొక్కలిప్తనయినన్ జేయంగ నీధ్యానమున్
దరియింపందగు విశ్వవారిధిని రాధాస్వామి! ప్రేమాంబుధీ!” || 4 ||

భగవంతుడు (GOD) సృష్టి, స్థితి ,లయకారకుడని(Generator Operator and Destroyer) అని అభివర్ణించిన ఈ పద్యం భగవంతుని యథార్థ స్వరూపాన్ని మనకు వెల్లడి చేస్తోంది.

“ నీవే విశ్వమునెల్లఁ గూర్చితివి తండ్రీ! తాల్చి ప్రీతిన్ మదిన్
నీవే సంస్థితికారణంబు విపదానీకంబు నీమాయయే
నీవే విశ్వవినాశకారణముగా నిత్యానుకంపానిధీ!
దైవంబున్నదె నిన్నుమించునది? రాధాస్వామి! ప్రేమాంబుధీ!” || 5 ||
రచయిత సత్సంగసాహిత్యాన్ని ఆపోశనం పట్టిన వారవడం చేత వాటిలోని ఎన్నో అంశాలను తెలుగులో తేటతెల్లం చేశారు.

సూర్యేందుల్ శతకోటులైనను   సుమీ క్షుద్రంబు నీ కంటె*****(7) 17,19,20,27

అండదేశం , పిండదేశం, బ్రహ్మాండం మొదలైన పదునెనిమిది లోకాలు వాటన్నిటికి కారణ భూతుడైన రాధాస్వామీ దయాళుని స్తుతించిన తీరు  చాల హృద్యం.

“ తుండల్ చూడఁగ నాఱు పిండమునఁ బ్రద్యోతించుచుండంగ, బ్ర
హ్మాండంబందున నాఱుభాగములు, నిర్మాయాప్రదేశంబునన్
ఖండంబుల్గన నాఱు కల్గినవి నీగర్భంబునుండే ప్రభూ!
దండంబుల్ శతకోటి కైకొనుము రాధాస్వామి! ప్రేమాంబుధీ!” || 12 ||

రాధాస్వామీ మతంలో గురువే దైవం ఆ గురువు, వారి అనుగ్రహం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే పద్యాలు ఈ శతకంలో ఎన్నో ఉన్నాయి . గురువే తల్లి ,తండ్రి, ప్రియుడు , మిత్రుడు , బంధువు . గురువే ఆత్మను తెలుసుకోడానికి అనువైన శబ్దమార్గాన్ని బోధించే యాప్తుడు  అటువంటి గురువు అన్నికోరికలు తీర్చే కల్పవృక్షం . హరిహరబ్రహ్మాదులకు గూడ గురువే  ఆరాధింపదగినవాడు . ఆ గురువు శబ్దస్వరూపుడు. అంత్యకాలంలో మనకు గురువే రక్షకుడు , అతడే దిక్సూచి.  తరణోపాయము , తరుణోపాయము కూడ గురువే . ఎవరు సుఖదు:ఖాలను గురువు యొక్క  దివ్యేచ్ఛగా భావించి తదనుగుణంగా మసులు కుంటారో వారికి స్వార్థపరమార్థాలు రెండు సిద్ధిస్తాయి . మోక్షం కరతలామలకం అవుతుంది . ఇక  విశ్వవ్యాప్తమైన చైతన్యం (Universal Consciousness) మానవలోకాన్ని రక్షించడానికి ఒక శరీరాన్ని ఆశ్రయిస్తుంది . ఆయనే సద్గురువు .   

రచయిత రాధాస్వామీసత్సంగ మతానికి సారభూతమైన శబ్దాభ్యాస (sound practice) విధానాన్ని చక్కగా వివరించారు .  సృష్టికి మూలం శబ్దం . ఈ విషయాన్ని ఇంచుమించు అన్ని మతాలూ అoగీకరిస్తున్నాయి . ఇక రాధాస్వామీ మతానుయాయులు సద్గురువు వలన ఆ శబ్దరహస్యాన్ని  తెలుసుకుని శబ్దాభ్యాసంతో ఆత్మధామాన్ని అనాయాసంగా , సునాయాసంగా చేరుకోగలుగుతున్నారు . ఇదే రాధాస్వామీమత౦ ప్రత్యేకత , ప్రాశస్త్యం  కూడ.   సమస్తసృష్టికి ధ్వనియే మూలమని అది  అందరికీ ఆంతర్యంలో మార్మోగుతూ ఉంటుందని భక్తుడు ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని ఆ ధ్వనిని వి౦టూ అందులో  లీనమైతే అదే అన్ని కష్టాలను నాశనం చేస్తుందని అదే ముక్తికి మార్గదర్శకమని వివరించారు .

ధ్వనిలో లీనముఁ జేయగావలయు నాత్మన్ సర్వలోకస్థులున్
ధ్వనితోఁ గాలును గాలకర్మములు రాధాస్వామి! ప్రేమాంబుధీ!”

 ధ్వని సద్గురువు మనకిచ్చే దానం . అది అన్ని  కష్టాల్ని తొలగించి మోక్షాన్నిస్తు౦ది.
“ సృష్టికి మందు ధ్వనియే ఉంది . సమస్త సృష్టి ధ్వని నుంచి పుట్టింది సమస్త కార్యములు
ధ్వని వల్లనే నెరవేరతాయి . ధ్వని సర్వకాల సర్వావస్థలలో అందరినీ రక్షిస్తుంది. భ్రమలు తొలగిస్తుంది . అన్ని నాదములు ఆ ధ్వని నుంచే పుడుతున్నాయి  అటువంటి ధ్వని ఈ లోకంలో హాగ్యశాలురకు మాత్రమే లభిస్తోంది. ఆ  ధ్వనిలో ఆత్మను లీనo చేస్తే సర్వకర్మలు నశిస్తాయి. ధ్వని అమృతంతో సమానం. అది అందరు పానం చేయాలి. ధ్వనిమార్గాన్ని సద్గురువే బోధిస్తారు. ధ్వనియే కర్త ,కర్మ , క్రియ , ధ్వనియే ద్రష్ట , దృశ్యం , దర్శనం .ధ్వనియే సమస్తం.  ధ్వని వశం చేసుకున్నవాడే భాగ్యవంతుడు .  ధ్వని అహంకారాన్ని,  భయాల్ని , బాధల్ని పోగొడుతుంది . గురుకృపతో ధ్వనిరహస్యం తెలుసుకున్న వాడు సులభంగా  ముక్తి పొందగలడు. కాబట్టి ధ్వనిశూన్యంబగు జ్ఞానమాగడము అన్నారు  (58,59,60, 61,62,63,64,65)
ఇక భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియని స్థితిలో భక్తుడు తన ఆవేదనను వ్యకం చేస్తూ ప్రార్థించే ఈ పద్యం సర్వసిద్దాంత సమానత్వానికొక దర్పణంగా కనిపిస్తోంది.

“ నీవెట్లుందువు? బ్రహ్మవిష్ణుహరవాణీలక్ష్మికాత్యాయినో
త్రోవంజూపు దయాస్వరూపుఁడగు క్రీస్తుంబోలియో లేక య
హ్హోవావోలెనొ జ్ఞానిమహ్మదుగ జీవోద్ధారమున్ జేతువో
దైవంబన్నది యెట్టులుండుఁగద రాధాస్వామి! ప్రేమాంబుధీ!”  || 85 ||

ఈ శతకంలో ఎన్నో దుష్కరప్రాస పద్యాలను రచయిత చాల సుకరంగా , సహజరమణీయంగా ప్రయోగించారు . ఇది భాషపై వారికి గల అపరిమితమైన అధికారాన్ని నిరూపిస్తోంది. ఇంకా ఈ శతకంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి. అవన్నీ వివరిస్తే అదొక పెద్ద గ్రంథమే అవుతుంది .   సిద్ధాంతనిరూపణ, భాషాపటిమ , భావవ్యక్తీకరణ సమపాళ్ళతో నిండిన ఈ శతకం ఒక  త్రివేణీ సంగమం. 

భక్తిభావాలతో బాటుగా రాధాస్వామీ సత్సంగసిద్ధాంతాలను రంగరించి వివరించే ఈ శతకం  రాధాస్వామీమతానుయాయులకే గాక  సమస్తభక్తజనాళికి మార్గదర్శకంగా నిలిచి వారి ఆధ్యాత్మిక అభ్యున్నతికి దోహదం చేస్తు౦దని నా ప్రగాఢ విశ్వాసం . వ్యాస విస్తర భీతిచే ఇంతటితో విరమిస్తున్నాను .  భక్తులకు, జిజ్ఞాసువులకు నిత్యపారాయణ గ్రంథంగా నిలువదగిన ఈ శతకాన్ని రచించి మనకందించిన శ్రీ నేమానివారు సర్వదా , సర్వధా అభినందనీయులు .   

చిలకమర్తి దుర్గాప్రసాదరావు

12.5.20.

********

 

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన సద్గురూత్తమ శతకం – ఒక సమీక్ష

 

శ్రీ నేమాని సోమయాజులు గారు రచించిన సద్గురూత్తమ శతకం – ఒక సమీక్ష

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

3/106, ప్రేమనగర్ , దయాల్బాగ్, ఆగ్రా

శ్రీ నేమాని సోమయాజులుగారు రచించిన సద్గురూత్తమశతకం నేను ఆమూలాగ్రం చదివేను . ఇది ఒక అపూర్వమైన రచన . 1౦8 పద్యాలు గల  ఈ శతకంలో గురువు యొక్క గొప్పదనం కొనియాడబదిండి .   భారతీయసంస్కృతీసాంప్రదాయాలు గురువును భగవంతునితో సమానం గాను  భగవంతునికన్నా ఉన్నతునిగా కూడ  విశ్వసిస్తున్నాయి .

మోక్షమార్గానికి గురుభక్తి ఒక్కటే శరణ్యమని ఉపనిషత్తులు పేర్కొన్నాయి.

“ తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం (ముండకోపనిషత్తు) ఆ బ్రహ్మజ్ఞానంకోసం గురువును మాత్రమే ఆశ్రయి౦చాలి. ఆ గురువు శాస్త్రజ్ఞానం గలవాడు , బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి  అని   చెబుతోంటే ఉపనిషత్తుల సారా౦శరూపమైన భగవద్గీత కూడ  తద్విద్ధి  ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన: తత్వదర్శిన:  ( ఓ అర్జునా! వినయపూర్వకమైన నమస్కారం వలన , తెలుసుకోవాలనే కోరికతో కూడిన ప్రశ్న వలన , సేవ ద్వారా నీకు జ్ఞాని , తత్త్వదర్శి అయిన గురువు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని తెలుసుకో )  అంటో౦ది .

యస్య దేవే పరాభక్తి: యథా దేవే తాథా గురౌ

తస్యైతే కథితా హ్యర్థా: ప్రకాశంతే మహాత్మన:

ఎవడికైతే భగవంతునియందు , గురువునందు అచంచలమైన భక్తి ఉంటుందో అట్టి మహాత్మునకు సమస్త అభీష్టములు నెరవేరతాయని శ్వేతాశ్వతర ఉపనిషత్తు ముక్తకంఠంతో ఘోషిస్తోంది .

శ్రీ శంకర భగవత్పాదులు:

గురోరంఘ్రి పద్మేమనశ్చేదలగ్నం

తత: కిం ? తత: కిం ?తత: కిం ?తత: కిం ?

అనే మాటలద్వారా గురుభక్తి లేకపోతే అంతా   వ్యర్థమే అని తమ అభిప్రాయాన్ని ప్రకటించారు .

గురువు భగవంతుని కన్నా ఉన్నతుడని భాగవతం సూచిస్తోంది .

భాగవతంలో రుక్మిణి శ్రీ కృష్ణుని వద్దకు అగ్నిద్యోతనుడనే ఒక బ్రాహ్మణుని రాయబారిగా పంపుతుంది . ఆయన కృష్ణుని వద్దకు చేరుకుని అతనితో :

ఓ కృష్ణ! ఆ రుక్మిణి నీకు తగినది . నీవు ఆమెకు తగిన వాడవు . మీ ఈ డు జోడు సరైనది . మా గురువుగారి మీద ఒట్టు అంటాడు .  (ఆ యెలనాగ నీకు తగునంగనకుందగుదీవు మా యుపాధ్యాయుల యాన) దేవుని మీద ఒట్టు అనొచ్చు లేదా సాక్షాత్తు భగవత్స్వరూపమైన ఆ కృష్ణునిపై ఒట్టు

పెట్టవచ్చు కానీ అలా అనకుండా మా గురువుగారిపై ఒట్టు అనడం ఇక్కడ  గమనించవలసిన అంశం .

అటు ఉపనిషత్తులు, ఇటు భగవద్గీత, మరో ప్రక్క భాగవతాది పురాణాలు   పూర్తిగా అర్థం చేసుకున్న   శ్రీ నేమాని వారు రాధాస్వామీసత్సంగ సిద్ధాంతానికి కేంద్రబిందువైన గురువు యొక్క గొప్పదనం అందరికి చాటి చెప్పడానికి ఈ శతకరచన చేపట్టి ఉంటారని నాకనిపిస్తుంది.

 రచయిత ఈ శతకంలో గురువుయొక్క వైశిష్ట్యం , సంసారం యొక్క క్లేశాలు , సంసారక్లేశాలనుండి విముక్తిని ప్రసాదించే గురువుబోధలు , ధ్వని రూపమైన శబ్దాభ్యాస విధానం , ఉపాసనా పద్ధతి, భక్తిస్వరూపం మొదలైన విశేషాలు పొందుపరిచారు .

గురువుయొక్క గొప్పదనాన్ని ప్రస్తుతిస్తూ సంసారసాగరాన్ని తరింపయ్యడానికి గురువే సర్వసమర్థుడని,  గురుకృప కొంగుబంగారం వంటిదని, గుర్వనుగ్రహం శతకోటి జన్మలపాపాల్ని హరిస్తుందని, గురువు మానవరూపంలో కనపడే పరమాత్మయని  గురువు మట్టిముద్దను కూడ కుందనపు బొమ్మగా తీర్చిదిద్దగల మహిమాన్వితుడని వర్ణి౦చారు. సంసారం చీకటి కూపం, సముద్రం వలే భయంకరమైన అఘాదం, ఆ సంసారం నుంచి బయటపడవేయగల ఏకైకసాధన గురుభక్తి, గురువు సర్వోన్నతుడు , వేదవేద్యుడు  , భక్తజనుల పాలిట కల్పవృక్షం , దేవతలకే దైవం , చైతన్యస్వరూపుడు, దుష్టులను సంహరించే వాడు ,   అనాధులకు దిక్కు , ఎల్లప్పుడు ఆనందాన్ని ప్రసాది౦చేవాడు, శుభములు చేకూర్చే వాడు, అత్యున్నత స్థానాన్ని పొందినవాడున్నూ అని అభివర్ణించారు  .   

పరుఁడవు వేదవేద్యుఁడవు భక్తులపాలిట కల్పవృక్షమున్
స్థిరుఁడవు దేవదేవుఁడవుఁ జిన్మయరూపుఁడవున్ దురాత్మసం
హరుఁడ వనాథనాథుఁడవు హ్లాదనసంతతదాతవున్ శుభం
కరుఁడ వగమ్యగమ్యుఁడవు గావవె నన్నిక సద్గురూత్తమా! 19


గురునామ స్మరణ ఎలా ఉండాలో చెబుతూ చంద్రునికోసం చాతకపక్షి  , స్వాతిచినుకులకోసం ముత్యపు చిప్ప , లేత మామిడి కోసం పికం , భర్త కోసం సాధ్వి, అలాగే తల్లి బిడ్డల్ని చేప నీటిని తలచే విధంగా ఉ౦డాలని వర్ణించిన పద్యం చాల హృద్యంగా ఉంది .

చాతకపక్షి చందురుని, స్వచ్ఛపుముత్యము స్వాతిచిన్కులన్
లేతరసాలమున్ బికము, ప్రేముడి సాధ్వియు ప్రాణనాథునిన్
మాత సదా తనూజులను, మత్స్య ముదమ్ముఁ దలంచునట్లుగాఁ
బ్రీతిగ నిన్ను నేఁదలఁతుఁ బ్రేమసుధాంబుధి! సద్గురూత్తమా!!” 59

   గురునామస్మరణ సమస్తపాపాలు నశి౦పచేస్తుంది, కర్మవాసనలు తొలగిస్తుంది , సంసార బంధాల్ని పోగొడుతుంది . కాబట్టి గురునామ స్మరణ తప్పక చెయ్యాలని తెలియ జేశారు.

తావకనామసంస్మృతివిధానముచే నశియించుఁ బాపముల్
దావకనామసంస్మృతివితానముచే నశియించుఁ గర్మముల్
దావకనామసంస్మృతియుదంచనచే నశియించు బంధముల్
దావకనామసంస్మృతినిఁ దప్పక చేసెద సద్గురూత్తమా!” 23

నేడు సమాజంలో భక్తి వెఱ్ఱి తలలు వేస్తోంది .

“ తెనుగునాట భక్తిరసం తెప్పలుగా పాఱుతోంది

డ్రైనేజీ స్కీము లేక డే౦జరుగా మారుతోంది”

అని శ్రీ గజ్జెల మల్లారెడ్డి గారు ఆవేదన చెందడం మనందరికీ తెలిసిన విషయమే . ఇటువంటి తరుణంలో     భక్తి యొక్క నిజమైన స్వరూపాన్ని వివరించే ఈ పద్యం రచయిత ఆధ్యాత్మికపరిణతికి ఒక దర్పణంగా కనిపిస్తోంది . పరమాత్మయందు ఆసక్తి ,  ప్రత్యగాత్మ(జీవాత్మ) పయి సఖ్యము , వీడరాని ప్రేమ, పరిపక్వతన౦దిన భావబంధము ముక్తికి యుక్తమైన మార్గంగా చెప్పడం నేటి సమాజానికి  ఎంతో మేలు కల్గిస్తుంది

భక్తియనంగ నా పరమపావనమౌ పరమాత్మయందు నా
సక్తియు, ప్రత్యగాత్మపయి సఖ్యత, వీడఁగరాని ప్రేమ,
వ్యక్తమనోజ్ఞమైన పరిపక్వతనందిన భావబంధమున్
ముక్తికి యుక్తమార్గమును బొచ్చెములేనిది సద్గురూత్తమా! 103


సాధన లేని సిద్ధి స్వప్నసమానమని చెబుతూ ఆధ్యాత్మిక పురోగతికి సాధనయొక్క ఆవశ్యకతను చాటి చెప్పేరు. (106)

కులమత భేదాలు కుత్సిత భావాలని , హింసను ప్రోత్సహి౦చే  మతం వ్యర్థమని ఉద్బోధించారు .  (107)

తచయిత యమకాలంకార ప్రయోగంలో చాల నిపుణులు .

సారములేని కాలుని ప్రసారము లోతగు కష్టపూర్ణ కా

సారము (87) మానము హేయ మాన మవమానములం గలిగింప నోపు (94) మొదలైన పద్యాలు ఇందుకుదాహరణలుగా పేర్కోవచ్చు.

రచయిత సందర్భానుసారంగా ‘పినతనమండు కాకర పెద్దయినంతనె కీకర’ మొదలైన ఆమెత వంటి సామెతలను పొందుపరిచి శతకానికి వింత సొబగులు చేకూర్చారు . రాజాజ్ఞలో ఒదిగిన  భటులమాదిరిగా అందమైన పదాలు ఛందస్సులో ఎటువంటి క్లేశం లేకుండా పొందికగా ఇమిడి పోయాయి .    ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శతకం గురుభక్తి ప్రతిపాదకం ప్రతిపద్యరమణీయం .  నేమాని వారు ‘ప్రేమాంబుధిశతకము’ ద్వారా దేవ ఋణాన్ని   ఈ శతకరచనతో తన గురు ఋణాన్ని  కొంతవఱకు తీర్చుకున్నారని నాకనిపిస్తోంది . 

విషయ ప్రతిపాదనలోను , భావప్రకటనలోను , భాషాసారళ్య౦లోను ఈ శతకం  నిరుపమానం . ఈ శతకం ఆంధ్ర సాహిత్య చరిత్ర పుటలలో విశిష్య శతకసాహిత్యచరిత్రపుటలలో శాశ్వతస్థానాన్ని సంపాదిస్తు౦దనడంలో ఎటువంటి సందేహంలేదు .  ఇటువంటి అమూల్యమైన శతకాన్ని మనకందించిన శ్రీ నేమానివారు సదా అభినందనీయులు .

చిలకమర్తి దుర్గాప్రసాద రావు

3/106, ప్రేమనగర్ , దయాల్బాగ్.ఆగ్రా 

<><><><>