Tuesday, February 11, 2020

శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహం గారు రచించిన శ్రీ అంతర్వేదీ క్షేత్ర మాహాత్మ్యం


శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహం గారు రచించిన
శ్రీ అంతర్వేదీ క్షేత్ర మాహాత్మ్యం
(ఒక సమీక్ష)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు



ఆంధ్రదేశం పుణ్యక్షేత్రాలకు కాణాచి . భక్తజనులకు కల్పవల్లి. ఇక ఎవరైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు వారికి ఆ కేత్రం యొక్క ప్రాచీనత, ప్రాశస్త్యం తెలుసుకోవాలనే కోరిక కలగడం సహజం. అది తెలుసుకోవడం వల్ల వారికి భక్తి ప్రపత్తులు   ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది . అందుకే ఆంధ్రసాహిత్యంలో స్థలపురాణాలకు ఎంతో ప్రాధాన్య౦  ఉంది . శ్రీనాధుడు మొదలగు మహాకవులు కాశీఖండం , భీమేశ్వరపురాణ౦ మొదలైన గ్రంథాలు వెలయించి  ఆయా క్షేత్రాలను వర్ణించి భక్తిమార్గానికి రాచబాట వేశారు . శ్రీనాథుని బాటలో ఎంతోమంది  ప్రబంధకవులు స్థలపురాణగాథల్ని ఇతివృత్తంగా తీసుకు ని అనేక కావ్యాలు వెలయించారు . ధూర్జటి , తెనాలి రామకృష్ణుడు మొదలైన కవులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ఇటీవల కాలంలో స్థలపురాణాలకు సంబంధించిన కావ్యాల్లో  శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహం గారు రచించిన  శ్రీ అంతర్వేదీక్షేత్రమాహాత్మ్యం   పేరెన్నిక గన్నది .

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నరసింహ స్వామి అవతారానికి ఒక విశిష్టత ఉంది . ఇక మానవ వికాసాన్ని  దృష్టిలో ఉంచుకుని దశావతారకల్పన జరిగిందని భావించేవారు కూడ మనలో కొంతమంది లేకపోలేదు . వారి అభిప్రాయం ప్రకారం ఆదిలో నీరు మాత్రమే ఉంది ( ఆప ఏవ ససర్జాదౌ అని ఉపనిషత్తు )  . నీటి నుంచి మొదట చేప పుట్టింది ( మత్స్యావతారం ) . అది క్రమంగా ఉభయచరం అయింది (కూర్మావతారం ) అది క్రమక్రమంగా చతుష్పాత్తు అయింది (వరాహావతారం) .  అది కాలాంతరంలో జంతువు + మనిషికి మధ్యగల నారసింహావతారం అయింది .  ఆ తరువాత పొట్టిమనిషి ( వామనావతారం ) అవతరించాడు . ఆ తరువాత ప్రాచీన రాతి  యుగానికి సంబంధించిన ఆటవిక మనిషికి ప్రతీక పరశు రామావతారం . ఆనాటి మనిషి గొడ్డళ్ళతో క్రూరమృగాలను వేటాడే వాడు . ఆ తరువాత బాణాలను ఉపయోగించి దూరంగా ఉండే వానిపై ప్రయోగించే నేర్పు సంపాదించాడు మనిషి . ఇదే రామావతారం . ఆ తరువాత క్రమంలో మనిషి చక్రం కనిపెట్టేడు . మానవనాగారికతలో చక్రం కనిపెట్టడం ప్రధానమైన అంశం . చక్రం కనిపెట్టాక మానవనాగరికత పూర్తిగా వికసించింది . చక్రం కృష్ణావతారానికి ప్రతీక . అందుకే  కృష్ణావతారాన్ని సంపూర్ణా వతారంగా పరిగణించారు మన పెద్దలు . బుద్ధి వికాసానికి ప్రతీక బుద్ధావతారం . కల్కి గురించి తరువాత ఆలోచిద్దాం .నేనే దేవుణ్ణ  ని చెప్పుకునే ప్రతి ప్రబుద్ధుడు కల్కి అవతారమే . ఈ దృష్టితో ఆలోచించినా నరసింహావతారం ఉదాత్తమైనది . ఎందుకంటే అది జంతువు నుండి మొదలైన మొట్ట మొదటి మానవ పరిణామం . ఆ విషయం అలా ఉంచుదాం .     
     
శ్రీ భాగవతుల వారు సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప పండితులు . వీరు నరసాపురంలోని మిషన్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్-I పండితునిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు .  వీరి కావ్యాల్లో అశోకచక్రవర్తి పద్యకావ్యం తలమానికం . ఇవి కాకుండా మరెన్నో కావ్యాలు వీరు రచించారు.

ప్రస్తుత కావ్యం శ్రీ అంతర్వేదీ క్షేత్రమాహాత్మ్యం నాలుగాశ్వాసాల కావ్యం . ముదటి ఆశ్వాసంలో  గౌతమమహర్షి తపస్సు, శివుడు వరములివ్వడం , గోదావరీనది పరిసరప్రాంతాల్లో ఉండే పుణ్య క్ష్హేత్రాలు వర్ణించబడ్డాయి . రెండో ఆశ్వాసంలో విశ్వామిత్రమహర్షి అసూయ , రక్తలోచనుని యౌద్ధత్యం , విశ్వామిత్రుడు, వసిష్టమహర్షి  సంతానాన్ని మట్టుపెట్టడం , అరుంధతి పుత్రశోకం , వసిష్టమహర్షి  నరసింహస్వామిని  ప్రార్థించడం, నరసింహస్వామి చేసిన  దుష్టశిక్షణ,  ఆశ్వారూఢా౦బికవృత్తాంతం, అ౦తర్వేదీక్షేత్రప్రశస్తి వర్ణన మొదలైన అంశాలున్నాయి .  మూడవ ఆశ్వాసంలో  ఆలయనిర్మాణానికి అహర్నిశలు  కృషి చేసిన శ్రీ యుతులు కేశవదాసు , మారేమండ నరసింహారావు, కొపనాతి ఆది నారాయణరావుగారల వివరాలున్నాయి . నాలుగో ఆశ్వాసంలో శంతనుని కథ , రుచి వృత్తాంతం  , క్షేత్ర మహిమ, ప్రసిద్ధి మొదలైన అంశాలతో ఈ గ్రంథం  ఆమూలాగ్రం చవులూరించే విధంగా ఉంది .
కవి చాల గడుసరి . స్థలపురాణ౦ వంకతో గోదావరీ కూలంకష చరితను  చాల కూలంకషంగా వర్ణించారు . అంతేకాక గోదావరీపావనతీరంలో ఉండి కవితాసుధలు చిందించిన నన్నయాది కవులను వారి గొప్పదనాన్ని పఠితలకు పరిచయం చేశారు . గోదావరీప్రాంతాన్ని కళలకు కాణాచిగా , భూతలస్వర్గంగా వర్ణించిన ఈ పద్యం చాల హృదయ౦గమంగా ఉంది .

షట్శాస్త్ర పాండిత్య చర్చల వేదిక 
                     నాల్గు వేదమ్ముల నలువ మోము
ఆర్ష భాషకు ( గొల్వు లమర(జేసిన చోటు
                    పంచాంగకర్తల పట్టుగొమ్మ
సంగీత సాహిత్య సారస్య మెఱిగిన
                       రసలోల సుకవి తల్లజుల నెలవు
చిత్రలేఖన నాట్య శిల్పకళల మేటి
                            దాతృత్వ మహిమకాస్థాన భూమి
కలదు గోదావరీప్రాంత కమ్రసీమ
కళలకాణాచి పుణ్యాల గాదె ; మతము
లన్ని భ్రాతృభావంబుతో నలరు చుండ
భువికి వచ్చిన దివివోలె పొల్పు దనరు (62)

ఆంధ్రులందరికి  నాలుగు వ్రేళ్ళు నోట్లోకి పోయే అవకాశాన్ని , అదృష్టాన్ని కల్పి౦చిన సర్. ఆర్ధర్ కాటన్ మహాశయుని నాలుగు పద్యాలో స్తుతించి  ఋణం తీర్చుకున్నారు (64, 65,66&67).   ముఖ్యంగా ఆ మహాశయుని వరుణదేవునితో పోల్చడం సముచితం .

పుడమి నాంధ్రావని జనుల పూజనీయు(
డైన కాటన్ దొరన్ గొల్తు రహరహంబు
సస్య సంపదకాతడు సహకరింప
సరవి వరుణ దేవునిగను సంస్మరింత్రు     

రచయిత రెండో ఆశ్వాసంలో అంతర్వేది తీర్థ వైభవాన్ని వర్ణిస్తూ తీర్థంలో అమ్మే వస్తువులను, దుకాణాలను   కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. మూడవ ఆశ్వాసంలో ఆలయనిర్మాతలైన శ్రీయుతులు కేశవదాసు , మారేమండ వరసింహా రావు, కొపనాతి    ఆదినారాయణ గార్ల వంశకీర్తిని , భక్తి ప్రపత్తులు, కార్య దీక్షా దక్షతలు  సమగ్రంగా వర్ణించారు . నాలుగో ఆశ్వాసంలో రుచివృత్తాంతం , క్షేత్రప్రశస్తి కావ్యానికి సమగ్రతను చేకూర్చగా , ఆలయంలోని అర్చకస్వాములు,  ధర్మకర్తలు  వారి కార్యదీక్ష, దక్షతలు కావ్యానికి సహజత్వం , సమకాలీనతలను  చేకూర్చాయి .  గ్రంథంలో రచయిత శ్రీ శంకరభగవత్పాదుల  లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబం అనే మకుటం గల స్తోత్రాన్ని పొందుపరచడం బంగారపు ఆభరణానికి వజ్రం పొదిగి నట్లుగా ఉంది . కవిగారి పద్యాల్లో పదాలు , భావం సమాన వేగంతో పరుగులు తీశాయి .  కవి సందర్భానుసారంగా ఎన్నో సూక్తులు పాఠకులకంది౦చారు .

ఎట్టి జితే౦ద్రియు౦డయిన నీర్ష్యను వీడక యున్నచో భువిన్
బట్టుగ జీవనాంబునిధి పారము ముట్టగలేడు భద్రతన్(౩౦)

ఇంకా ఈ కావ్యంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి . ఈ కావ్యం రాశిలో చిన్నదైనా వాసిలో ఎంతో మిన్న అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .   ఈ కావ్యం తెలుగుసాహిత్య చరిత్రపుటల్లో క్షేత్రకావ్యాల సరసన శాశ్వతస్థానం సంపాదిస్తు౦దనడంలో ఎటువంటి సందేహం లేదు.  రచయిత శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహం గారు సదా  అభినందనీయులు .

                                                                                  ******

No comments: