Friday, January 24, 2025

అనుభవాలు -జ్ఞాపకాలు-9 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 

అనుభవాలు -జ్ఞాపకాలు-9

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 

 ఇది పుష్కరకాలం నాటి మాట . నేను A. N. R. కళాశాలలో V.R.S తీసుకుని దయల్బాగ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న రోజుల్లో అమెరికాలో consciousness studies అంశానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సును   University of Arizona వారు నిర్వహించారు. అవకాశం రాక పోతుందా అని ఒక నేను కూడ ఒక రాయి విసిరా . ఆశ్చర్యం! నా పేపరు కూడ select అయింది . ఇంతకు నా పేపర్ పేరు “The nature of consciousness of a Jivanmukta” . అది select కాకుండా ఉంటే ఎలా ఉండేదో చెప్పలేను గాని select అయ్యాక నాలో ఉత్సాహం పెరిగింది. కాని అంత సులభంగా పోవడానికి అది అంతర్వేది కాదు అమెరికా . వెళ్ళాలంటే passport కావాలి. ఆఫీసు ఘజియాబాద్ లో ఉంది . మా అబ్బాయి నాతొ నాన్న! passport కోసం నువ్వు ఎలాగూ చాల దూరం వెల్తున్నావు గదా!  నీతో పాటు అమ్మ , ఆరతి ( మా అమ్మాయి) కూడ అప్లై చేస్తే బాగుంటుంది అన్నాడు . ముగ్గురు అప్లై చేశాం .   వాళ్ళ ఇద్దరికీ శాంక్షన్ అయ్యింది. నాది reject అయ్యింది . ఎందుకంటే  నా s.s.c certificate లో chilakamarti అని, degree సర్టిఫికేట్లో chilakamarthi అని, Ph.D certificate లో chilakamarthy అనీ వేరు వేరుగా ఉన్నాయి .    అందుకే reject చేశారు . తిరిగి వచ్చేశాను . Court ద్వారా ఆ మూడు పేర్లు ఒకరికి సంబంధించినవే అని affidavit తెచ్చుకుని మరలా ప్రయత్నిస్తే పని జరిగింది.

మనం సాధారణంగా పిల్లల సర్టిఫికేట్ చూస్తున్నప్పుడు మార్కులు, ర్యాంకుల వైపే దృష్టి సారిస్తాం గాని పేరు సరిగ్గా ఉందో లేదో పరిశీలించం. అందులోనూ మన పేర్లు కొల్లేటి చేంతాళ్ళల్లా చాల పొడుగ్గా ఉంటాయి . అందువల్ల తల్లిదండ్రులు పేర్ల విషయంలో  ప్రత్యేక శ్రద్ధ వహించాలి .  ఇక మరల ఘజియాబాద్ వెళ్లి pass port పని పూర్తి చేసుకున్నా. ఇక వీసా రావాలి . “ మీకు టిక్కట్టు తీసి ఉంచారు . visa వస్తే మిమ్మల్ని పంపిస్తాం రాకపోతే మరొకరు వెళతారు” అని ఖచ్చితంగా చెప్పేశారు విశ్వవిద్యాలయం వారు. ఒకరోజు తెల్లవారు జామున మూడు గంటలకే బయల్దేరి visa  కోసం Delhi వెళ్లి ఆఫీసుకు చేరుకున్నాను . visa ఇవ్వడానికి చాల norms ఉంటాయట. అవేమీ నాకు తెలియదు .

ఏవేవో సుమారు ఎనిమిది ప్రశ్నలు వేశారు . తోచిన సమాధానాలు చెప్పేను . సరే వెళ్ళండి అంటే మనకు visa వస్తుందని ‘passport మన చేతిలో పెట్టేస్తే visa రాదని అనుకోవాలని మా మిత్రులు అన్నారు. ప్రశ్నలడిగాక మీరు వెళ్ళవచ్చు అన్నారు . తిరిగొచ్చేశాను . వారం పది రోజుల తరువాత visa ఇంటికొచ్చింది.  ప్రయాణం ఖాయం అయ్యింది. ఇక మా అమ్మ నాన్నల ఆశీస్సులు తీసుకోవడం అనే ఒక్క పని మిగిలింది . వెంటనే నరసాపురం వచ్చాను . ఆ పని కూడ పూర్తయింది. ఇక పేపర్ బాగుండాలి . మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ మాదిరిగా ఉండకూడదు. ఎందుకంటే సంస్థ కొన్ని లక్షలు ఖర్చుపెట్టి పంపిస్తుంది . వారి నమ్మకాన్ని వమ్ము చెయ్య కూడదు .  పేపరుపై కసరత్తు ప్రారంభమయింది. అంతకు ముందు పంపింది కేవలం synopsis మాత్రమే. నిద్ర, ఆహారాలు మానేసి paper మరియు power point  presentationకి కావలసిన ఆ పని కూడ మిత్రుల సహకారంతో  పూర్తి చేశాను.   

అమెరికా వెళ్ళ వలసిన సమయం ఆసన్నమైంది. “ మీరు అమెరికా చేరాక మంచినీరు తప్ప ఎక్కడ ఏమీ తీసుకోకండి . మేమే అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు కార్యక్రమ నిర్వాహకులు .అన్నమాట ప్రకారమే బయలు దేరిన నాటి తిరిగివచ్చే వరకు pure - vegetarian  food ఏర్పాటు చేశారు . అది తప్ప  ఎక్కడ , ఎప్పుడు , ఏదీ తినలేదు .

ఇక  ముందుగా 1-4-12న అర్థరాత్రి దాటిన తరువాత   డిల్లీ నుండి non-stop విమానంలో బయలు దేరి 3-4-12 ఉదయం చికాగోనగరం చేరాము. సుమారు 15 గంటలు పైగా పట్టింది . నానా స్టాప్ ఐతే ఇంకా ఎక్కువ సమయం పట్టేదని అన్నారు . అక్కడకు చేరాక  మిత్రులు మిమ్మల్ని వారి ఇంటికి తీసుకెళ్ళారు . అక్కడ సుమారు ఐదు రోజులున్నాము.  ఈ ఐదు రోజుల్లోనే ఒకనాడు మాన్య మిత్రులు శ్రీ K. రామకోటేశ్వరరావు గారు నన్ను వారింటికి తీసుకుని వెళ్ళారు. స్వామికార్యం స్వకార్యం అన్నట్లుగా నాకు వారి ఇంటికెళ్లే అవకాశం కూడ లభించింది. ఆ ఐదు రోజుల్లోనే university of Chicago , మరో సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం (పేరు గుర్తుకు రావడం లేదు) , స్థానిక రామకృష్ణా మిషన్ , ఇంకా ఎన్నెన్నో ప్రదేశాలు చూడడం జరిగింది . అతి ముఖ్యమైన మైన మరొక  ప్రదేశం చూడడం జరిగింది . అది వివేకానంద స్వామి congress of world religions లో మాట్లాడిన ప్రదేశం . నా జీవితంలో అటువంటి పరమపవిత్రమైన ప్రదేశం చూడగలుగుతానని అక్కడున్న పెద్దలతో మాట్లాడగలనని  అనుకోలేదు .

ఆ తరువాత 11-4-12 ‘ఆరిజోనా’  విశ్వవిద్యాలయం లో జరిగే conference స్థలానికి చేరాం. నాలుగు రోజులు జరిగింది.  ఒక్కొక్కరికి 20 ని||లు టైం అని, ఆ తరువాత ఏమి మాట్లాడినా అది గాలిలో కలిసి పోతుందని నిర్వాహకులు మాకు ముందే చెప్పేశారు.

ఇక దేశ, విదేశాలనుండి  కొన్ని వందల మంది హాజరయ్యారు. భారతీయులే నాకు తెలిసిన వారు ఏబది మందికి పైగా ఉన్నారు .  మా విశ్వవిద్యాలయ మిత్రులందరూ కూడ వివిధ అంశాలపై papers సమర్పించారు . ఈ conference ఒక విలక్షణ మైనదిగా నాకనిపిం చింది. ఎందుకంటే చాల చోట్ల కొంరురు వారి వారి పేపర్ చదవడం పూర్తి కాగానే బయటకు వెళ్లి పోతారు . మిగిలిన వారివి వినేవారు చాల తక్కువ. అక్కడలా కాదు  అన్ని పత్రాలు అందరు వింటారు . చర్చ కూడ చాల విస్తృతంగానే జరుగుతుంది . ఇది నేను గమనించిన విషయం  

Conference పూర్తయిన తరువాత ఒక రోజు Grand caneon తీసుకెళ్ళారు . ప్రయాణమే రాను పోను పదమూడు గంటలు పట్టింది . ఆ ప్రదేశాన్ని చూడటానికి రోజు కొన్ని వేల మంది అక్కడకు వస్తుంటారట. నేను అక్కడున్న వారిని ,   అక్కడ కొచ్చిన వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను . అవి వాస్తవాలో అవాస్తవాలో తెలియదు . నేను విని తెలుసుకున్నవి మాత్రమే. ఆ ప్రదేశంలో పూర్వం Red Indians ఉండే వారట. Red Indians అంటే ఎవరో కాదు. Colombus ఇండియా కోసం ప్రయాణం అయ్యాడు. అనుకోకుండా అమెరికా చేరుకున్నాడు. అందుకని అక్కడున్న వారికి red Indians అని పేరు పెట్టడం జరిగిందట .   అది చాల గొప్ప జాతి. వారంతా ప్రకృతిని ప్రేమించేవారు, మాయా, మర్మం తెలియని అమాయకులు  . చెట్ల పళ్ళు కోసుకు తినేవారే గాని చెట్లను నరికేవారు కాదట . జంతువుల పాలు పిండుకుని త్రాగే వారు గాని జంతువులను చంపేవారు కాదట .  ఇక క్రమక్రమంగా  అనేక దేశాల నుండి అక్కడకు settlers గా వెళ్లిన వాళ్ళు వాళ్ళని ఆ ప్రదేశం ఖాళీ చెయ్యమన్నారట! . వారు మేం ఎందుకు ఖాళీ చేస్తాం . ఇది మా ప్రాంతం.  మేం తరతరాలుగా ఇక్కడే ఉంటున్నాం . మీరే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చారు. మీరే ఖాళీ చెయ్యండి అన్నారు .   ఇద్దరి మధ్య చాల ఘర్షణలు జరిగాయి . అటు ఇటు కూడ చాల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక settlers వాళ్ళ అమాయకత్వాన్ని  కనిపెట్టి మాకు ప్రభువు ఇవి మీ కిమ్మని కలలో కనిపించి చెప్పాడని కొన్ని కంబళ్ళు పంచిపెట్టారట . ప్రతి కంబళీలోను కొన్ని మసూచి పొక్కులు పెట్టారట . అవి కప్పుకుని వారు అందరు చని పోయారట. క్రమంగా ఆ జాతి అంతం  అయ్యింది . అమెరికాకు స్వతంత్రం వచ్చి 500 సంవత్సరాలైన సందర్భంగా  ఇటీవలి కాలంలో అమెరికన్ దేశీయులు పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు . కాని ఆ జాతిలో ఇంకా కొంచెం మిగిలి యున్న వారు ‘మీ వల్ల మా జాతి పూర్తిగా నశించి పోయింది. ఇది పండుగ చేసుకునే తరుణం కాదు’  అని     ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించారట! . ఆ దేశపు పెద్దలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక పార్లమెంటుకు వదిలేశారట. వారు అన్నీ నిశితంగా పరిశీలించి ఇది నిజమే! అని నిర్ణయించి ఉత్సవాలు చేసుకునే ఆలోచనలకు స్వస్తి పలికారట.  ఇంతటి విశిష్టత కల ప్రదేశం అది .ఆ తరువాత Fenix  నగరం చేరుకుని అక్కడ రెండు రోజులున్న తరువాత మరల చికాగో మీదుగా మాతృభూమి చేరాము. అక్కడ నన్ను ఎవరెవరి ఇంటికి తీసుకెళ్ళారో వారందరూ నాకు స్టూడెంట్స్ (students of Theology )  అవడం నాకు చాల ఆనందాన్ని కలిగించింది . వారు చూపించిన ఆదరం మఱపురానిది, మఱువలేనిది . ముఖ్యంగా ఎంతోమంది మహాపండితుల యొక్క స్నేహం లభించింది . అమెరికాలో ఉన్నది కేవలం 15 రోజులే అయినా మరపురాని అనుభూతిని కలిగించింది.  అందరికీ నమస్కారం .

<><><> 

Thursday, January 16, 2025

అమ్మో! సంక్రాంతి బాబోయ్! సంక్రాంతి by డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

 

అమ్మో! సంక్రాంతి

బాబోయ్! సంక్రాంతి

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

 

సంక్రాంతి అంటే చిన్నాప్పటి నుంచి నాకు సరదాగానే అనిపించినా ఎందుకో హృదయాంత రాళంలో కొంత బాధ చోటు చేసుకునేది. సంతోషం ఎందుకంటే ఇది అన్ని పండుగల వంటిది కాదు .  సహజమైన పండుగ. మనది వ్యవసాయ ప్రథానమైన దేశం . రైతు కష్టపడి పండించిన పంట ఇంటికి చేరుతుంది. సుఖ,సంతోషాలు సమాజంలో వెల్లి విరుస్తాయి .  ఇక వ్యవసాయపు పనుల్లో ఉపయోగించగా మిగిలిన పదార్థాలను , వ్యర్థమైన చెత్త, చదారాన్ని భోగిమంటల్లో  వేస్తారు. దానితో పరిసర వాతావరణం పరిశుద్ధ మౌతుంది. చేతి కందిన పంటలతో దానధర్మాలు, విందులు, వినోదాలతో  జనం చాల ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటారు.

ఇక విచారం ఎందుకంటే  దానికి రెండు కారణాలు . మొదటి కారణం కోడి పందేలు , రెండో కారణం జంతు బలులు.  

అన్నమన్నే ప్రతిష్ఠితం” అనే ధర్మాన్ని బట్టి ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మరొక దానికి అన్నం ఔతుంది .   ఇక ‘అన్నం’ అనే మాటకు మన పెద్దలు అర్థం ఎంత బాగా చెప్పేరో  గమనించండి . అద్యతే అత్తీతి అన్నం ( తినబడేది, తినేది కాబట్టి అది అన్నం ఔతుంది) . ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఎదో మరొక ప్రాణి అన్నం ఔతోంది.

ఉదాహరణకు పిల్లి ఎలుకను తింటే ఆ పిల్లిని మరో జంతువు తింటుంది.  ఇక చరా చరాత్మకమైన ఈ సమస్తసృష్టిని తనలో లయం చేసుకునే వాడు పరమేశ్వరుడు . అందుకే ఆయనను ‘అత్తా’   అని పిలుస్తారు . ‘అత్తా’ చరాచర గ్రహణాత్’ ఆని బ్రహ్మ సూత్రాలు చెపుతున్నాయి. ఇక సృష్టిలో హింస అనివార్యం అనేది కాదనలేని సత్యం .  కాని మిగిలిన జంతువులకు మరో మార్గం లేదు . అవి మరో జంతువుపై ఆధారపడక తప్పదు. కాని మనిషి అలా కాదు . తాను స్వయంగా  ఆహారం పండించి ఉత్పత్తి చేసుకోగలడు. జంతువులనే చంపి తినవలసిన లేదు .

ఇక చెట్లకు కూడ ప్రాణం ఉందని అవి కూడ స్పందిస్తాయని జగదీశ్ చంద్రబోసు నిరూపించారు కదా! అని  అన వచ్చు. కాని  జంతువులకు ఏ   విధమైన వాటికి నాడీ వ్యవస్థ ఉందో అటు వంటిది వాటికి లేదు అని  శ్రీ అరవిందువారు  ఒక చోట చెప్పినట్లుగా గుర్తు . స్పందన వేరు, బాధతో కూడిన స్పందన వేరు . Every reaction need not be necessarily out of pain అంటా రాయన. ఎవరైనా మన వెనుక నుంచి వచ్చి భుజం మీద చెయ్యి వేస్తే  వెనుకకు తిరుగుతాం అది స్పందనే కాని బాధతో కూడింది కాదు. ఏది ఏమైనా ఏదో ఒక దానిని ఆహారంగా చేసు కోక పొతే మానవజాతి మనుగడ కష్టం.

ఇక ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు, ఆశను మాత్రం తీర్చలేదు అన్నారు మహాత్మా గాంధీ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే Nature can satisfy your need but not your greed.

             ఇక మనం ఆహారం కోసం , వినోదం కోసం, సౌందర్యం కోసం, ఫేషన్ల కోసం, ఆరోగ్యావసరాల కోసం ఎన్నో జంతువుల్ని ఎన్నో విధాలుగా మట్టు పెడుతున్నాం. మరికొంత మంది దేవతా ప్రీతికోసం కూడ చంపుతున్నారు. దేని కోసం, ఏ జంతువును, ఏ దేశంలో , ఎవరు, ఎప్పుడు ఎలా క్రూరంగా చంపు తున్నారో తెలుసు కుంటే గుండె చేరువై పోతుంది.       ఆహారం కోసం చంపడాన్ని ఒక వేళ మనం కాదనలేక పోయినా ఆ హింస సాధ్యమైనంత సునాయాసంగా జరగాలి. It should be as humanly as possible, but not as cannily as possible.

  

ఇక కోడి పందేల విషయానికొద్దాం . నేను నా చిన్నతనంలో s యానాం లో 5 వ తరగతి చదువు కుంటున్నప్పుడు మొదటి సారిగా చూశాను.    మనం వినోదం కోసం వాటిని క్రూరంగా హింసిస్తున్నాం  అని నాకు అప్పుడే అనిపించింది .

కోడి పందేల్లో నెగ్గిన వారు సంతోషిస్తారు , ఓడిన వారు  తాత్కాలికంగా బాధపడతారు. ఇక్కడ నెగ్గిన కోడి, ఓడిన కోడి రెండు బాధపడతాయి. ఒక విధంగా ఆలోచిస్తే ఓడిన కోడితో పోలిస్తే నెగ్గిన కోడి పరిస్థితి చాల దారుణం. కొంతమంది  ఓడిన కోడిని దోరగా వేయించుకుని కూరగా చేసుకుని  తింటారు. నెగ్గిన కోడి గాయాలు మానే వరకు మూగవేదన అనుభవిస్తూనే ఉంటుంది.   పూర్వకాలంలో కొంతమంది రాజులు అనాగరికంగా  వినోదం కోసం మనుషుల్ని (కోడి పుంజులుగా) వాడుకునే వారు. వారు కత్తులతో పొడుచుకుని చస్తుంటే వీరు పైశాచికంగా  ఆనందిస్తూ ఉండేవారు. The death on the arena మొదలైన సినిమాల్లో ఇవి మనం చూడవచ్చు.  ఒకరి విషాదం మనకు వినోదం కాకూడదు .  అది పాశవికమైన వినోదమే ఔతుంది. ఇటువంటి ఆచారాలకు మనం స్వస్తి చెప్పాలి . కొన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రభుత్వం కన్ను కప్పి కొంతమంది ఇవి కొనసాగిస్తూనే ఉన్నారు. కర్తా , కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక: అన్నట్లుగా అవి ఏర్పాటు చేసే వారు , ఆమోదించే వారు, చూసేవారు , తప్పట్లు కొట్టేవారు ఈ నలుగురు పాపంలో పాలు పంచుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు .

నా స్నేహితుడు ఒకసారి అన్నాడు . WWW మొదలైన కార్యక్రమాలెన్నో ఉన్నాయి కదా! వాటికి లేని అభ్యంతరం కోడి పందేలకు ఎందుకని . కాని ఆ రెండు ఒకటి కావు. అక్కడ organise చేస్తున్న వాళ్లు , చూస్తున్న వాళ్ళు , దెబ్బలు కొట్టిన వాళ్లు , దెబ్బలు తిన్న వాళ్ళు అందరు మనుషులే. అందుకు సిద్ధంగానే ఉన్నారు. కాని ఇక్కడ వేరు ఆనందం ఒకరిది , బాధ మరొకరిది (మూగ ప్రాణులది) తేడా లేదా అన్నాను.

                     మరో స్నేహితుడు ఇది మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే కదా! అన్నాడు.

నేనన్నాను ప్రాచీనమైన వన్నీ మంచివీ కాదు , నుతన మైనవన్నీ చెడ్డవీ కాదు. మనిషి ఎప్పటికప్పుడు మంచి, చెడులను బేరీజు వేసుకుని  చూసుకోవాలని వేరొక సందర్భంలో మన పెద్దలు చెప్పేరు.

పురాణమిత్యేవ న సాధు సర్వం

న చాsపి కావ్యం నవమిత్యవద్యం

సంత: పరీక్ష్యాన్యతరద్భజంతే

మూఢ: పరప్రత్యవనేయ బుద్ధి: ( భాసమహాకవి )  

ఇక మహాభారతం లోని మాండవ్య ముని  కథ , యముడు విదురుడుగా జన్మించిన ఘట్టాలను పరిశీలిస్తే  వినోదం కోసం  మూగ ప్రాణిని  హింసించడం ఎంత ప్రమాద కరమో తెలుస్తుంది. మనం హేతువాదాన్ని ఉపయోగించి కథను  కొట్టి పారేసినా అందులోని  తాత్పర్యం గ్రహించడం ముఖ్యం.          

ఇక వినోదం కోసం జంతువులను భాగస్వాములుగా చేసి  వాటికి హాని కలుగ కుండా మనం ఆనందించ గల ఎన్నో కార్యక్రమాలు మనం స్వయంగా రూపొందించుకోవచ్చు.     

ప్రాణి హింస మానండి. ప్రకృతిని పరిరక్షించండి.

<><><>