Monday, June 23, 2014

ఉపదేశ శిఖామణి -2

            ఉపదేశ శిఖామణి -2
6. జ్ఞానo పొందడానికి కొన్ని సాధనాలున్నాయి. వాటిని ప్రమాణాలు అంటారు. వాటిలో మొదటిది ప్రత్యక్ష ప్రమాణం  . ప్రత్యక్ష ప్రమాణమంటే జ్ఞానేంద్రియాలకు వస్తువులతో సంయోగంద్వారా  కలిగే జ్ఞానం . ఈ ప్రత్యక్షజ్ఞానం నిర్దుష్టమే అయినా దానికి కొన్ని పరిమితులున్నాయి.
 1.  అతిదగ్గరగా ఉన్న మనకంటిరెప్పలు మనకు కనిపించవు.
2.అతిదూరంగా ఎక్కడో ఎగురుతున్న పక్షి మనకు కనిపించదు.
౩. కన్ను పోతే ఏమి కనిపించదు.
4. మనస్సు స్థిరంగా లేకపోతే ఏమి కనిపించదు.
5. అతిచిన్న వైనఅణువులు ,పరమాణువులు మనకు కనిపించవు.
6. మనకు మనింటి గోడవతల ఉన్న వస్తువు కనిపించదు.
7. సూర్యుని వెలుగుముందు నక్షత్రాలు కనిపించవు.
8. పెద్ద మినుగుల రాశిలో ఒక బెడ్డ కనిపించదు.
అంతే కాకుండ ప్రత్యక్షంగా కనిపిoచేవన్ని  నిజం కావు. ప్రక్క రైలు బండి కదులుతుంటే మనరైలు బండి కదులుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే చంద్రుడు మనకు చూడడానికి చాల చిన్నగా కన్పిస్తాడు. ఇవన్ని నిజాలు కావు. అందువల్ల మరో ప్రమాణాన్ని ఆశ్రయించక తప్పదు . అది అనుమాన ప్రమాణం . ఉదాహరణకు  కొంతమంది ఇలా    ఆలోచిస్తూ ఉంటారు . పర్వతం  మీద అగ్ని ఉంది.    పొగ కనిపిస్తోంది కాబట్టి .(ఇక్కడ పర్వతం పక్షం .అగ్ని సాధ్యం . పొగ హేతువు).  ఎక్కడెక్కడ పొగ ఉoటుoదో అక్కడక్కడ నిప్పు ఉంటుంది . ఉదాహరణ వంటిల్లు . పర్వతం మీద పొగ కనిపిస్తోoది కాబట్టి అక్కడ నిప్పు ఉంది  అని తార్కికులు నిప్పు చూడ కుండానే బుద్ధిబలంతో పొగను బట్టి నిప్పుయొక్క ఉనికిని  ఊహిస్తారు.
కాని  ఓ అమాయకుడ ! పరతత్త్వం తర్కానికి అందేది కాదు.కాబట్టి నీ ప్రత్యక్షప్రమాణాలు అనుమానప్రమాణాలు ఇక్కడ పనికి రావని తెలుసుకో. ఒక వేళ తర్కంతోనే అన్ని సాధిoచదలచు కుంటే సాధ్యమైన( నివు సాధించిన ) ఆ నిప్పు నిన్ను నిలువునా దహిo చేస్తుంది. అందువల్ల   గౌరీశుని భక్తితో సేవించు. నీకు ముక్తి లభిస్తుంది.
సాధ్యో వహ్ని: హేతుర్ధూమ:
పక్ష: శైలో మా కురు తర్కం
తత్సాధ్యస్త్వాం దహతి తదానీo
నాప్యనుమానం ప్రత్యక్షం హి (6)-భజ గౌరీశం
7. నాయనా! మృత సంజీవనగుళికలు గాని , వైద్యుడు చెప్పిన పథ్యం గాని నిన్ను యముని బారినుండి కాపాడలేవు. కాబట్టి నువ్వు మృత్యుంజయుడైన సదాశివుని పాదాలు పట్టుకో. మృత్యువు నుండి బయటపడి చిరoజీవివౌతావు. 
     మృతసoజీవనగుటికా రక్షతి
     కాలాన్నాపి భిషగ్వర పథ్యం
    మృత్యుంజయపద భక్తిం కురుషే
    యది తo తీర్త్వా నిత్యో భవసి(7) భజగౌరీశo
8. నాయనా ! నీ భార్య, పిల్లలు నీ డబ్బునే ఆశిస్తారు . అందువల్ల నీ దగ్గర డబ్బు లేకపోయినా , నువ్వు ముసలివాడవైనా వాళ్ళు నిన్ను విడిచిపెట్టేయడం ఖాయం . వాళ్ళ సంగతి నీకప్పుడు తెలుస్తుంది నువ్వప్పుడేమి చెయ్యగలవు?  చెప్పు . కాబట్టి గౌరీశుని సేవించు.
జాయాపుత్రా: ద్రవ్యపరాస్తే
నష్టే ద్రవ్యే వృద్ధత్వే త్వం
జ్ఞాస్యసి తేషాం కృత్యం శ్రద్ధాం
శేష: కిం వద విహితం కర్తుం? (8) భజ గౌరీశం
9. ప్రపంచoలో మూడే మూడు రకాల మనుషులుంటారు.ఒకడు జ్ఞాని అంటే అన్ని తెలిసిన వాడు. రెండోవాడు అజ్ఞాని . అంటే ఏమి తెలియనివాడు.  ఇక మూడో వాడు జిజ్ఞాసువు. అంటే ఏదో తెలుసుకోవాలనే కోరిక గలవాడు. సమస్త శాస్త్రాలు జిజ్ఞాసువు కోసమే.
ఎoదుకంటే జ్ఞానికి శాస్త్రాలతో పని లేదు. అజ్ఞానికి ఉపయోగం లేదు.    అందువల్ల జిజ్ఞాసువును ఉద్దేశించి అంటున్నాడు. నాయనా! ఆ శంకరుడు అష్టైశ్వర్యములకు ప్రభువై ఉండి కూడ అవి కష్టాలకు హేతువులని గ్రహించి వాటిని విడిచిపెట్టి భిక్షాటన చేస్తూ ఎలా నిర్భయంగా ఉన్నాడో చూడు.
అష్టైశ్వర్యప్రభురపి విత్తం
కష్టం జ్ఞాత్వా త్యక్తతదాశ:                                                       
భిక్షార్థమరే! చరతి స్థాణు:
భయరహితం తo  పశ్య ముముక్షో (9)
10. మాయ అనే మేఘం సంసార సముద్రంలోని ఇంద్రియ సుఖాలనే నీటిని త్రాగి వర్షిస్తోoది. కలలో కూడ నువ్వు ఆ నీటిని తలవకు. ఒక వేళ తలచావో దోషజ్వరం నీకు సంక్రమిస్తుంది. (10)
మాయామేఘ: పీత్వా వర్షతి
భవజలదే: స్తద్విషయవిషాక్తం        
నీరం స్వప్నేsపి త్వం న స్మర
నోచేద్దోషజ్వరవాన్ భవతి (10) భజ గౌరీశo
11. ఓ మానవ! మాయ అనే వేశ్య ఇoద్రి యసుఖాలనే అభినయాలతో నిన్ను మోసం చేస్తోoది. నీవు ఆ మాయామోహంలో పడక , విషయ విముఖుడవై ఉండి ప్రజ్ఞాన ఘనమగు  నీ స్వరూపాన్ని రక్షిoచుకో. నీవు ముక్తుడవౌతావు.(11)
మాయావేశ్యా  వంచయతి త్వాం
విషయాభినయైర్విశ్వవిలాసై :
ప్రజ్ఞానఘనం పాలయ నిత్యం
తాం ప్రతి విముఖో భవ ముక్తోsసి (11) భజ గౌరీశం
12. ఈ కనిపించే ప్రపంచమంతా నశిoచేది అనే విషయo సదా భావించు. తత్త్వం తెలుసుకుo టే నువ్వు సత్యజ్ఞానానందరూపమైన పరబ్రహ్మ మని తత్త్వ మసి అనే వాక్యం ద్వారా శ్రుతి చెబుతోంది.
దృశ్యo సర్వం నశ్వరమేత
ద్భావయ సతతం జ్ఞాతే తత్త్వే
సత్యజ్ఞానానంద బ్రహ్మ
త్వమసీత్యేవo శ్రుతిరపి వదతి(12) భజగౌరీశం               
13. ఓ మానవా! నాభి అనే గుహలో కుoడలినీ అనే పాము నిద్రావస్థలో ఉంది. దాన్ని నువ్వు ప్రాణాయామం మొదలైన సాధనాల ద్వారా మేల్కొనేలా చెయ్యి . అది పైకి ప్రాకి సహస్రారం నుంచి అమృతాన్ని వర్షిస్తుంది. . ప్రతి రోజు ఆ అమృతాన్ని నువ్వు ఆస్వాదించు.
నాభీకందే భుజగీ సుప్తా
తాముత్థాపయ మరుదాయామై:
ఊర్ధ్వం గత్వా వర్షత్యమృతం
దశశతకమలాత్తం పిబ నిత్యం (13)
 భజగౌరీశం
౧౪ నాయనా! ప్రాణవాయువు స్పందిస్తే మనస్సు కూడ చంచలమౌతుంది. మనస్సు చంచలమైతే అది ఇంద్రియసుఖాల పట్ల లగ్న మౌతుంది. అది ఇంద్రియసుఖాల పట్ల లగ్నమైతే నీగతి అనేకవిధాలుగా ఉంటుంది అటువంటి అనర్థం కలగకుండప్రాణ వాయువును నిరోధించు.
ప్రాణస్పందాచ్చిత్తవికార:
చిత్తవికారాద్విషయాసక్తి:
విషయాసక్త్యా వివిధగతిస్తే
తస్మాత్ప్రాణనిరోద్ధా భవ రే (౧౪)
భజ గౌరీశం
నీవు చిన్మయుడగు పరమేశ్వరుని ధ్యానం చెయ్యి. దానివల్ల  నీ సంచితకర్మలన్ని నశిస్తాయి. నీవు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకో శాలనే    పంచకోశాలకు  నాథుడవు. అతీ తుడవు.నీ అసలు స్వరూపం తెలుసుకోవాలనుకుoటే ఎల్లప్పుడు పరమశివుని పాదపద్మములను నమస్కరిoపుము.

15. చింతయ సాoబం చిన్మయదేవం
సంచితకర్మత్వత్తో గచ్ఛతి
పoచనదీనాం నాథోsసి త్వం
ప్రణతో భవ రే పరమశివాంఘ్రౌ ( 15) భజ  గౌరీ శం 

16. నాయనా! నువ్వు ఈ కలిదోషాలు  నశిoచడానికి శ్రద్ధాభక్తులు కలిగి మృదువైన  బిళ్వపత్రాలతోను, పువ్వులతోను మన్మథవిజేతయగు పరమశివుని పూజించు. నీ మనస్సు నిర్మలమౌతుoది. ఇది యథార్థం.         
కోమలబిల్వీదళపుష్పాద్యై:
కామరిపుం జయ కలిమలశాoత్యై
శ్రద్ధాభక్తిధ్యానసమేతో
నిర్మలచిత్తస్సత్యం  భవసి.
17. పార్వతీ సమేతుడైన ఆ శంకరుడొక్కడే మనల్ని సృష్టిoచువాడు, మనకు రక్షకుడున్ను. ఇది నిజం అటువంటి పరమశివుని నీవు నీ హృదయాకాశంలో స్మరించు.   
జననత్రాణసమర్థ : సాంబ:
శంకర ఏకో హ్యాస్తే  సత్యం
ధ్యాత్వా ముక్తో భవతి శివం యం
తo త్వం భావయ హృదయాకాశే (17) భజ గౌరీశం
17. త్యాగరాజునకు ఆనందసముద్రమైనట్టిదియు, సుర్యనాడి ఇడను చంద్రనాడి పింగళను కలుపునట్టి సుషుమ్ననాడి యందు నిమగ్నమై పవిత్రుడవగుము. నీకు జన్మమరణాలుoడవు.
త్యాగేశపదానందసముద్రే
భాను హిమాంశోర్యో గవిశేషే
కాలే స్నాత్వా పూతో భవ రే
న పునర్జన్మ న పునర్మరణం (17) భజ గౌరీ శం
( ఇత్యానందనాథపాదపద్మోపజీవినా కాశ్యపగోత్రోత్పన్నేనాంధ్రేణ త్యాగారాజనామ్నా విరచిత: ఉపదేశశిఖామణి: సoపూర్ణ : )      







     


No comments: