Thursday, June 25, 2015

అర్థం- అంతరార్థం

అర్థం- అంతరార్థం 
సంస్కృతభాషలో ఒక సూక్తి ఉంది . అదే౦టంటే
ప్రాత: ద్యూతప్రసంగేన మధ్యాహ్నే స్త్రీప్రసంగత:
రాత్రౌ చోరప్రసంగేన కాలో గచ్ఛతి ధీమతాం   

లోకంలో  బుద్ధిమంతులైన వారు ఉదయం జూద౦ గురించి, పగలంతా  స్త్రీ గురించి  , రాత్రంతా దొ౦గల గురించి చర్చిస్తూ కాలం గడిపేస్తారట. ఇదెంత విడ్డూరం. ఇలాచేస్తే వాళ్ళు బుద్ధిమంతులెందుకౌతారు. బుద్ధిహీనులే ఔతారు.  అపుడిది సూక్తి అవదు సుత్తే అవుతుంది . అందువల్ల ఇది సూక్తి కాబట్టి దీని అర్థం వేరుగా గ్రహించాలి. ఎలాగో చూద్దాం.
ఇక్కడ ద్యూతప్రసంగేన అనే మాట మహాభారతాన్ని సూచిస్తుంది. మహాభారతకథకు కీలకం జూదమే కదా! అలాగే స్త్రీప్రసంగత: అనే మాట రామాయణాన్ని సూచిస్తుంది. రామాయణకథకు మూలం స్త్రీ(సీత)యే కదా!  ఇక చోరప్రసంగేన అనే మాట భాగవతాన్ని సూచిస్తుంది. భాగవతకథానాయకుడు నవనీతచోరుడైన శ్రీకృష్ణుడే కదా!
భారతీయసంస్కృతికి, ఆధ్యాత్మికప్రగతికి భారత, రామాయణ, భాగవతాలు మూలస్త౦భాలు. మానవజీవిత౦లో సాధించవలసిన ధర్మార్థకామమోక్షాలకు ఆకరాలు.  ఈ మూడిటిలోనూ ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు  సంబంధించిన విషయాలున్నప్పటికి ప్రత్యేకంగా శ్రీమద్రామాయణ౦ ధర్మానికి, శ్రీమద్భారతం అర్థకామాలకు, శ్రీమద్భాగవతం మోక్షానికి ప్రామాణికాలు.  కాబట్టి ఈ మూడు గ్రంథాలను  ప్రతి వ్యక్తీ తప్పక చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి. ఇవి కేవలం మతగ్రంథాలు కావు. మానవుణ్ణి మహనీయునిగా మార్చే మహత్తరమైన గ్రంథాలు. అందుకే పండితపామరులందరికి  నిత్యపారాయణగ్రంథాలు. ఆ గ్రంథాలన్నీ సంస్కృతభాషలో ఉండడం వల్ల సంస్కృతభాష నేర్చుకుని అవి చదివితే  మంచిదే. ఒక వేళ స౦స్కృత౦ నేర్చుకునే అవకాశం లేకపోతే అనువాదాలను చదివి విషయం గ్రహించవచ్చు . పరస్త్రీలను ఆశిస్తే  ఎటువంటివారికైనా పతనం తప్పదని రామాయణం , అధర్మాన్ని ఆశ్రయిస్తే అధోగతి తప్పదని మహాభారతం, మానవుని ఆధ్యాత్మికప్రగతికి భక్తిమార్గం రాచబాట అని భాగవతం సారా౦శరూప౦గా చెబుతాయి.  కాబట్టి మానవులందరూ కుల, మత, జాతి, లింగ వివక్షలేకుండా ఈ మూడుగ్రంథాలను చదివితే  మహనీయులు కాగలరనడంలో ఎటువంటి సందేహం లేదు.  

  
        










No comments: