Saturday, June 27, 2015

తుమ్మల వారి కమ్మని పద్యం

తుమ్మల వారి కమ్మని పద్యం
ధునిక తెలుగుకవులలో శ్రీతుమ్మల సీతారామమూర్తి గారు సుప్రసిద్ధులు. ఆయన ఋషివంటి కవి. కవులలో ఋషి. జన్మ స్థలం అప్పికట్ల . వారికి తెలుగులెంక అనే బిరుదు కూడ ఉంది. దేశభక్తిని పెంపొందించే ఎన్నో కావ్యాలు రచించారు. రాష్ట్రగాన౦తో జాతిని జాగృతం చేశారు. జాతిపితను మహాకావ్యంలో బంధించి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గార్కి అంకితమిచ్చి జాతి ఋణ౦ తీర్చు కున్నారు.  ఒకసారి తుమ్మల వారికి నిడుబ్రోలులో  పౌరసన్మానం చాల ఘనంగా జరిగింది. ఎందరో పురప్రముఖులు, కవులు, కళాకారులు  ఆ సన్మానసభకు హాజరయ్యారు.  ఆనాటి సభకు ప్రముఖ పార్లమెంటు సభ్యులు ఆచార్య రంగా కూడ విచ్చేశారు. ఆయన రాక తుమ్మలవారికే కాదు సభాసదులందరికి ఆశ్చర్యం కలుగజేసింది. ఎ౦దుకంటే ఆచార్య రంగా గారు కేంద్రమంత్రి, బహుముఖప్రజ్ఞాశాలి, బహుకార్యభారమగ్నులున్ను. అటువంటి ఆయన రాకకు సంభ్రమాశ్చర్యాలు ప్రకటిస్తూ తుమ్మలవారు చెప్పిన పద్యం చాల మనోహరంగా ఉంటుంది . ఆ పద్యాన్ని పరికించండి .

కడపన్నిద్దురలేచి హస్తిపురిలోకాఫీని సేవించి చా
రెడు రొట్టెన్ కైరో కడన్నమిలి ప్యారిస్ పూటకూటింటిలో
కడుపున్ని౦పి హితోక్తులాడును ట్రుమన్ కల్పించు  దర్బారున    
నిడుబ్రోలీసుతుడెట్లు వచ్చె జననీ! నీ నేర్పు గాకు౦డినన్
 
శ్రీ ఆచార్య రంగా దినచర్య ఇలా ఉ౦టుంది. ఆయన కడపలో నిద్రలేస్తారట. ఢిల్లీలో కాఫీ త్రాగుతారట . కైరోలో అల్పాహారం తీసుకు౦టారట. ప్యారిస్ లోని ఏదో చిన్నహోటల్లో ఇ౦త తిని ట్రుమన్ తో ముచ్చటలాడతారట. అంతటి బహుకార్యవ్యాపృతుడు ఈ సన్మానసభకు విచ్చేయడం దైవానుగ్రహ౦ కాక మరే౦టి?.       








No comments: