Tuesday, November 12, 2019

కళ్యాణ మిత్రుడు(మహారాష్ట్రీ జైన ప్రాకృత కథ)


కళ్యాణ మిత్రుడు

(మహారాష్ట్రీ జైన ప్రాకృత కథ)

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు

పూర్వం జంబూద్వీపంలో  అపరవిదేహ అనే  దేశం ఉంది . ఆ దేశంలో క్షితిప్రతిష్ఠితం అనే నగరం ఉంది . ఆ నగరాన్ని పూర్ణచంద్రుడనే రాజు పరిపాలిస్తున్నాడు .  ఆయన భార్య కుముదిని .  ఆ రాజుకు ఆమె అంటే చాల ఇష్ట౦ . వారికి గుణసేనుడనే కుమారుడు కలిగాడు. ఆ రాజు ఆస్థానంలో యజ్ఞదత్తుడనే పురోహితుడున్నాడు . అతని భార్య  సోమదేవమ్మ .  వారికి  అగ్నిశర్మ అనే పుత్రుడు కలిగాడు.  ఆతని కళ్ళు  పి౦గళవర్ణంతో గోళీకాయల్లా ఉంటాయి , తప్పడ ముక్కు , చిన్న చిన్న చెవులు , ఎత్తుపళ్ళు , వంకరగా  బండగా  ఉండే మెడ ,  కురుచ చేతులు , చాల సన్నని వక్షం , బానవంటి పొట్ట  , ఎగుడు దిగుడు పిక్కలు, ఒకకాలు పొడుగు మరోకాలు పొట్టి, చింతనిప్పుల్లాంటి ఎర్రని జుట్టు  .    అదీ వాడి స్వరూపం .

ఆ నగర రాజకుమారుడు వాణ్ణి జనం మధ్యలోకి రప్పించి , వాద్యాలు వాయిస్తూ , తప్పట్లు చరుస్తూ నాట్యం చేయించేవాడు . గాడిదపై కూర్చోబెట్టి మిగిలిన కుర్రకారుచే మహారాజు , మహారాజు అని జేజేలు కొట్టించి ఊరేగి౦చేవాడు. ఈ విధంగా రాజకుమారుడు రోజు అవమానించడం చేత ఆ బాలునిలో  వైరాగ్య భావం కలిగింది .

వెంటనే అతడు నగరం విడిచిపెట్టి వనాలకు బయలు దేరాడు . సుపరితోషం  అనే ఆశ్రమానికి చేరుకున్నాడు . అక్కడ ఉన్న మునులంతా అతన్ని చాల ఆదరించారు . ఒక మంచిరోజు చూసి దీక్ష కూడ తీసుకున్నాడు. ఎన్నో అవమానాలను భరించి వైరాగ్యం పొందిన అతడు ఆ రోజునే  నేను నేటినుంచి నెలకు ఒక పర్యాయమే భోజనం చేస్తాను . ఒక వేళ నేను భిక్షకి వెళ్ళిన ఇంటిలో భిక్ష లభించక పొతే  మరో ఇంటికి వెళ్ళను , ఆహారం లేకుండానే గడిపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు . కాలం గడుస్తోంది .

అక్కడ రాజు పూర్ణచంద్రుడు తన కొడుకు  కుమారగుణసేనుడికి పెళ్లి చేసి , సింహాసనంలో కూర్చోబెట్టి తాను భార్యతో వనాలకు వెళ్లి పోయాడు . కుమారగుణసేనుడు తన భార్యయైన వసంతసేనతో ఎన్నో రాజ్యసుఖాలనుభావిస్తూ ఒకనాడు వసంతపురం అనే నగరం చేరుకున్నాడు. ఆ సమయంలో నారింజ పళ్ళ బుట్టలు మోసుకేడుతున్న ఇద్దరు ఋషి కుమారులు అక్కడకు వచ్చారు .  వారు శాస్త్రోక్తంగా రాజుని ఆశీర్వదించారు. రాజు ఆసనం నుండి లేచి వారిని కూర్చోబెట్టి గౌరవించాడు. వారిద్దరూ ఓమహారాజా ! మా ఆశ్రమకులపతి మీయొక్క కుశల సమాచారాన్ని కనుక్కోమని మమ్మల్ని పంపిస్తే మేము మీ వద్దకు వచ్చామని వివరించారు . అప్పుడు రాజు వారితో మహాత్ముడైన మీ కులపతి ఎక్కడ ఉన్నారు అని అడగ్గా వారు చాల దగ్గరలో  సుపరితోషమనే తపోవనంలో ఉన్నారని వివరించారు .

రాజు భక్తీ భావంతో ఆశ్రమాన్ని చేరుకొని ఎంతోమంది మునులను వారి సమక్షంలో ఉన్న కులపతిని చూశాడు .  కులపతికి సవినయంగా నమస్కరించి వారినందరిని తన ఇంటికీ  వచ్చి ఆతిథ్యం  స్వీకరి౦చమని కోరాడు  . దానికి కులపతి అతనితో సరే నాయనా! మేము వస్తాము . కానీ అగ్నిశర్మ అనే ఒక తాపసుడున్నాడు. ఆయన ప్రతిరోజూ ఆహారం తీసుకోడు . ఆయనకో నియమం ఉంది . నెలకొకసారి మాత్రమె ఆయన ఆహారం తీసుకుంటాడు . ఆయన మొదట ఏ ఇ౦టికైతే
వెళ్తాడో ఆ ఇంటిలో భిక్ష వేస్తేనే స్వీకరిస్తాడు . ఒకవేళ అక్కడ భిక్ష లభించకపోతే మరో ఇంటికి వెళ్ళడు , ఆ నెలంతా ఉపవాసమే చేస్తాడని వివరించాడు . అది విన్న రాజు ఆయన్ని చూడదలచి ఆ ముని ఎక్కడ ఉన్నారని అడగ్గా ఈ ఆశ్రమంలోనే ఉన్న ఆమ్రవనంలో  తపస్సు చేసుకుంటున్నారని  చెప్పాడు . అప్పుడు రాజు అక్కడికి వెళ్లి అక్కడొక మునిని చూశాడు . ఆయన పద్మాసనంలో కూర్చున్నాడు . నిశ్చలమైన నేత్రాలతో , ప్రశాంతమైన ముఖంతో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు . రాజు అతన్ని అగ్నిశర్మగా గుర్తించి సంతోషంతో నమస్కరించాడు . ఆ మహర్షి రాజుకి స్వాగతం పలికి అతన్ని ఆశీర్వదించాడు . రాజు మునితో  ఓ మహాత్మా! మీరు ఇంత కఠోరమైన వ్రాతదీక్సను స్వీకరిచడానికి కారణమే౦టి ? అని ప్రశ్నించాడు . దానికి సమాధానంగా ఆ ముని  రాజా! దారిద్ర్యదు:ఖం,    ఇతరుల వలన కలిగిన అవమానం , అందంగా లేకపోవడం , అదే విధంగా మహారాజ కుమారుడైన గుణసేనుడనే కళ్యాణమిత్రుడు అని సమాధానం చెప్పాడు . రాజుకు సందేహం కలిగింది . ఓ మహామునీ !  సరే దారిద్ర్యం ,  అవమానం , మొదలైన కారణాలు సరైనవే కాని మహారాజపుత్రుడు గుణసేనుడు కళ్యాణ మిత్రుడు ఎలా అయ్యాడో వివరించమని అడిగాడు . మహారాజా! వినండి

जे होन्ति उत्तमनरा धम्मं  सयमेव ते पवज्जन्ति |
मज्झिम पयई संचोइया उ न कया इ वि जहन्ना ||
चोएइ  य जो धम्मे जीवं विजिहेण केणइ नएण |
संसार चार्य गयं जो नणु कल्लाणमित्तोत्ति || 
              (  जैन महाराष्ट्री प्राकृतम् )
ఎవరు స్వయంగా ధర్మం పట్ల ఆకర్షితులౌతారో వారు ఉత్తమమైన కోవకు చెందిన వారు .  మధ్యములు ఇతరులచే ప్రేరేపి0పబడి ధర్మం పట్ల ఆకర్షితులౌతారు . అధములు ఏవిధంగాను ధర్మం పట్ల ఆకర్షితులు కాజాలరు . ఎవడు సంసారంలో చిక్కుకున్న జీవుని ఏదోవిధంగా ధర్మంవైపు ఆకర్షితుడయ్యేలా చేస్తాడో వాడే కళ్యాణమిత్రుడని చెప్పబడతాడు    అన్నాడు మహర్షి .
( ఇది కళ్యాణమిత్తో అనే జైనమహారాష్ట్రీప్రాకృతకథకు స్వేచ్ఛా నువాదం )

No comments: