Wednesday, July 23, 2025

ప్రేమశిఖరం ( పద్య నాటకం) ఒక విహంగ వీక్షణాత్మకసమీక్ష.

 

అభినందన మందారమాల

ప్రేమశిఖరం

( పద్య నాటకం)

ఒక విహంగ వీక్షణాత్మకసమీక్ష

నాటకరచయిత:  ‘పద్యనాటక రత్న’ చిటి ప్రోలు వేంకటరత్నం.

సమీక్షకులు: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                           నా మిత్రుడు శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన ‘ప్రేమశిఖరం’ అనే పద్య నాటకాన్ని ఆమూలాగ్రం చదివేను. ఇది వారి గురువర్యులు శ్రీ వి.వి.యల్ . నరసింహారావు గారు రచించిన ఆనందభిక్షువు కావ్యానికి నాటకీకరణ . శ్రీ వి. వి. యల్ . నరసింహారావు గారు నాకు తెలియక పోయినా సాహిత్యజగమంతటికీ  తెలిసిన ప్రముఖ కవి , పండితులున్ను.

ఇది బౌద్ధసిద్దాంతానికి సంబంధించిన ఇతివృత్తాన్ని స్వీకరించి  రచించిన పద్య నాటకం.

ఇక బుద్ధుని గురించి వేరుగా మనం ప్రపంచానికి చెప్పవలసిన పనిలేదు. ‘విశ్వప్రేమ’ అనే ఒక నీరూపమైన (అంటే రూపం లేని)  భావం మానవరూపాన్ని ధరిస్తే ఆయనే బుద్ధుడు . బోధిసత్త్వుడు బుద్ధుని కంటే ఒక మెట్టు క్రంది వాడు.   కొంచెం తక్కువ .  బోధిసత్త్వుడే మరుసటి జన్మలో బుద్ధుడౌతాడు. అతని ప్రేమ ఎంత గొప్పదో చూడండి .

కలికలుషకృతాని యాని తాని

మయి నిపతంతు విముచ్యతాం హి లోక:

ఇది ఆయన ఆశయం . ఈ ప్రపంచంలో ఉన్న అందరి బాధలు ఒకేసారి నా పైన పడినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు,  నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఈ లోకం మాత్రం సంతోషంగా ఉంటే అది చాలట. ఇది బోధిసత్త్వుని స్వభావమైతే ఇక అంతకంటే ఉన్నతుడైన బుద్ధుని గురించి వేరే చెప్పాలా! మానవ నాగరికతలో విశ్వ ప్రేమకు ఒక మొట్టమొదటి ప్రతిరూపం.

ఈ నాటకానికి మూలకథ ‘ఆనందభిక్షువు ’ అనే మహాకావ్యం . కవి శ్రీ వి. 'వి. యల్ . నరసింహారావు గారు. ఈ నాటకం లోనికి ప్రవేశించే ముందు అశ్వఘోషుడు రచించిన ‘ సౌందరనందం’ గురించి కొంచెం తెలుసుకుందాం.

నందుడు బుద్ధునికి పినతండ్రి కుమారుడు. . ఇంద్రియసుఖముల పట్ల అమితమైన ఆసక్తి కలవాడు . అతని భార్య సుందరి . వారిద్దరి కలయిక విడదీయరానిది . ఒకరిని విడిచి మరొకరు ఒక్క క్షణమైనా ఉండలేని వారు.

నడపుల రాజ హంస, తెలినవ్వుల వెన్నెలవాక, తేనెలూ రెడి నునుపల్కు తేనెపెర, రెమ్మలు వైచు విలాసవల్లి, వ్రే

ల్మిడి హృదయంబు నొచ్చి చను మేలిమి చూపు సుమాస్త్రమైన, య

ప్పడతుక నంద భాస్కరుని పాయగ నోర్వదు ఛాయయుం బలెన్

అంటారు పింగళి కాటూరి కవులు

అతడు సూర్యుడు ఆమె నీడ . వారి యనుబంధం చక్కనిది, చిక్కనిది. ఎంత చక్కనిదో అంత చిక్కనిది , ఎంత చక్కనిదో అంతే చిక్కనిది కూడ. . ఒకనాడు వారిరువురు ఏకాంతంలో ఉండగా బుద్ధుడు భిక్షకై వారి ఇంటికి వెళతాడు. అతని రాకను గమనించలేని తమకంలో వారున్నారు. బుద్ధ భగవానుడు కొంతసేపు నిరీక్షించి వెనుదిరిగి వెళ్లి పోతాడు . ఆ తరువాత వారి పరిచారిక భగవానుని రాకను వారికి విన్నవిస్తుంది. నందుడు జరిగినదానికి తీవ్రమైన  పరితాపం చెందుతాడు . అన్నగారి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకోడానికి బయలుదేరతాడు . ఆమె క్షణంలో తిగిగి రమ్మని భర్తను కోరుకుంటుంది. నేను ఇప్పుడే నీ కాళ్ళకు  పూసిన  కాలి పారాణి ఆరే లోపుగానే వస్తానని వాగ్దానం చేసి అక్కడ నుండి బయలు దేరతాడు . బుద్ధుడు తన వద్దకు వచ్చిన నందునకు తన శిష్యులద్వారా ధర్మోపదేశం కావిస్తాడు . అంతే! నందుడు ఇక ఇంటికి తిరిగి వెళ్ళడు. ఆ తరువాత సుందరి బుద్ధ భగవానుని చేరుకొని ఆయన అనుమతితో బౌద్ధమతాన్ని స్వీకరింస్తుంది. వారిరువురు సమాజ సేవలో తమ జన్మ పునీతం చేసుకుంటారు .

ఇక ఈ నాటకం నాందీ శ్లోకంలో వైయక్తికమైన ప్రేమకంటే విశ్వవ్యాప్తమైన ప్రేమ గొప్పదని అటువంటి విశ్వప్రేమ గలవారే స్తుతి పాత్రులని విశ్వప్రేమ యొక్క గొప్పదనం కీర్తించబడింది .

ప్రస్తావనలో మాయా , జ్ఞానేంద్రుడు అనే ఇద్దురు వ్యక్తుల  సంభాషణద్వారా మాయ, కల్యాణి అనే ఒక యువతి తాను వివాహం చేసుకోబోయే వరుడు  కారు ప్రమాదంలో మరణించడంచేత ఆమె  చాల శోకంతో  విలపిస్తున్నదని, ఆమె వేరొకరిని వివాహం చేసుకోడానికి ఇష్టపడక  జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండడానికి నిశ్చయిం చుకున్నదని విని తెలుసుకుని ఇదంతా చూస్తే బుద్ధ భగవానుని మాటలు నిజమనిపిస్తున్నవి  అంటాడు జ్ఞానేంద్రుడు. అంతేకాక ప్రేమ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాకుండ విశాలమైన పరిధిలో విశ్వవ్యాప్తం చేస్తే శోకం కలుగదు అనే జ్ఞానేంద్రుని ప్రస్తావన ద్వారా విశ్వప్రేమను బోధించే ప్రేమశిఖరం నాటక ప్రదర్శనకు పునాది కల్పించడం చాల సందర్భోచితంగా ఉంది. ఇది రచయిత ప్రతిభకు ఒక నిదర్శనం .  తరువాత నాటకం ప్రారంభం అవుతుంది .   మొదటి అంకం మొదటి రంగంలో  శ్రావస్తి నగర ప్రజలు ఒకచోట కుర్చుని పిచ్చాపాటి మాట్లాడు కొంటూ ఉంటారు . ప్రకృతి అనే పదునెనిమిది  సంవత్సరాల వయస్సు గల ఒక కడజాతి అమ్మాయి, తప్పిపోయిన తన దూడ కోసం వెతుక్కుంటూ అక్కడకు వస్తుంది. కడజాతి దానికి కళ్ళు నెత్తికెక్కాయని అక్కడి వాళ్ళు ఆమెను నిందిస్తారు. వారిలో ఒకరు పెద్దలారా! కాలం మారింది , ఇప్పుడు వర్ణభేదాలు పనికిరావని చెపుతాడు . వారందరికి బుద్ధుని బోధనలు గుర్తు చేస్తాడు. వారందరూ ఆ బుద్ధదేవుని కూడ నిందిస్తారు. . కొంతసేపటికి వారు నిష్క్రమిస్తారు . ప్రకృతికి తన దూడ యైన ‘గౌరి’ కనిపించగానే ఆనందంతో పరవశిస్తుంది. అంతలో కొంతమంది భిక్షువులు బుద్ధుని బోధనలను ఆలపిస్తూ సంచరిస్తూ ఉంటారు . ఆనందుడనే భిక్షువునకు దాహంతో గొంతు ఎండి పోతుంది. అతను చుట్టూ చూస్తూ అమ్మా! దాహంతో  గొంతు ఎండి పోతున్నది. మంచినీళ్ళు పోయవమ్మా ! అని అడుగుతాడు . సామీ! నేను అంటరానిదాన్ని అంటుంది . ఓ అమాయకురాలా! మానవత్వమ్ము సామాన్యమైన గుణము తక్కుగల భేదములు కల్పితములు చూవె” అని     అమ్మా ! నాకు  దాహం తీర్చు తల్లీ! అని అడుగుతాడు .

ప్రకృతి దాహార్తుడైన ఆనందునకు  దాహం తీరుస్తుంది. వారు వెళ్ళిపోతారు.

మొదటి అంకం రెండవ రంగంలో ప్రకృతి, ఆనందుల పరస్పరాకర్షణ మొదలౌతుంది .

రెండో అంకం మొదటి రంగంలో ప్రకృతి మనస్సులో నిన్నలేని అందమేదో నిదురలేచినట్లౌతుంది . తన తల్లి  యైన శివమానస పై విరహ సంబంధమైన  ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంది . శివమానస ఆ ప్రశ్నలకు చాల కంగారు పడుతుంది .

రెండో అంకం రెండవ రంగంలో  ఆమెకు  తన బిడ్డ బౌద్ధ భిక్షువుతో ప్రేమలో పడిందని తెలుస్తుంది .

మూడవ అంకం మొదటి  రంగంలో శివమానస తన పుత్రిక మనస్సు మునీశ్వరునిపై లగ్నమైనదని గ్రహించి ఆమె భవిష్యత్తు తెలుసుకొనుటకు ధ్యానమందిరానికి చేరుకుంటుంది. ఆకాశంలో ఉరుములతో కూడిన వర్షం , వేగంగా ప్రవహించే సెలయేళ్ల ధ్వని విని అమంగళం శంకిస్తుంది. కాని నిశ్చింతగా  ఉండమని బిడ్డకు ధైర్యం చెపుతుంది.

మూడవ అంకం రెండవ రంగంలో శివ మానస స్నానం చేసి, పవిత్రయై పద్మాసనం లో అగ్ని గుండానికి ముందు కూర్చొన్నదై ముందుగా భైరవమంత్రాన్ని జపిస్తుంది . ఆ తరువాత శతరుద్రమంత్రానుసంధానం చేస్తుంది .

నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ: నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ:

యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధను:

శివ శరవ్యాయా తవ తయా నో రుద్రా మృడయతు  స్వాహా

యా తే రుద్రశివాతనూ రఘోరా పాపకాశినీ

తయాన స్తనువా శన్తమయా గిరిశంతాభి చాకశీ హి స్వాహా

అనే మంత్రాన్ని జపిస్తూ హోమకుండంలో గుగ్గిలం వేస్తుంది.

ఆ తరువాత శరభ గీతికను ఆలపిస్తుంది .

ఆ తరువాత నారసింహమంత్రం జపిస్తుంది. బీజాక్షరాలు జపిస్తూ యంత్ర పూజలు చేస్తుంది . ద్వాదశ చక్రాన్ని నిర్మిస్తుంది . అంజనం వేస్తుంది . ఆ తరువాత గణపతి హోమం చేయిస్తుంది . తన ‘అనామిక’ను ( అంటే ఉంగరం వ్రేలిని ) కోసుకుని ఆ రక్తంలో ఒక శలాకను ముంచి భూర్జపత్రంలో బీజాక్షరాలు  వ్రాస్తుంది. సర్వజనం మే వశం ఆనయ అని ప్రార్థిస్తుంది . చివరగా కొమ్ముబూర ఊదుతుంది. అప్పుడు అంజన పేటికలో ముని కుమారుడు కనిపించినట్లే కనిపించి వెంటనే  మాయమౌతాడు.

అప్పుడు శివమానస, తన కూతురు ప్రకృతితో   ఇతను అంజనానికి అందడు. అని చెప్పి సర్వ సృష్టి ప్రదర్శక సాధనమైన దివ్యదర్పణాన్ని ఇస్తుంది. ఆ ముని ఆత్మ శక్తికి నా మంత్ర శక్తికి పోరాటం జరుగుతోంది . మనం గెలవాలంటే ఇంకా పరిశుద్ధులం కావాలి  అని చెబుతుంది. దీంతో మూడవ అంకం పూర్తవుతుంది.

 

నాలుగో అంకం మొదటి రంగంలో కపిలవస్తుపురంలో మర్రిచెట్టు క్రింద బుద్ధుడు పద్మాసనంలో ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. ఎదురుగా ఆశ్వజిత్తుడు , ఉరువేల కాశ్యపుడు , నందుడు , మౌద్గల్యాయనుడు, రాహులుడు , సారిపుత్రుడు , కూర్చుని ఉంటారు.

బుద్ధుడు వారిలో ఒక్కొక్కరికి వారి వారి స్థాయికి తగినట్లుగా ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు . మనస్సును తన ఇష్టానుసారంగా నడిపించగల యతియే   సమర్థుడని వివరిస్తాడు. స్థిరమైన వివేకం కలవారి హృదయంలో విషయ వాంఛలు ప్రవేశించవని బోధిస్తాడు.

ఎల్లప్పుడు దుష్టమైన ఆలోచనలు చేయు వానికి ఎల్లప్పుడూ దుఃఖాలు వెంటనే ఉంటాయని వివరిస్తాడు.

విషయ సుఖాలపైన ఆసక్తి గల వానిని రాత్రి జల ప్రవాహం గ్రామాన్ని ముంచి వేసిన విధంగా అతనిని సర్వనాశనం చేస్తుందని వివరిస్తాడు. భిక్షువులు అందరు  రాగద్వేషాలను త్రుంచి వేయాలని హెచ్చరిస్తాడు.

ప్రియశిష్యుడైన ఆనందుని కొంచెం దగ్గరకు రమ్మని  ఆదేశిస్తాడు.

ఈ లోపుగా ఉరుములు, మెరుపులతో కూడిన భీకరమైన నాదం  వినిపిస్తుంది. ఆనందుడు తన ప్రమేయం లేకుండానే అక్కడి నుండి నిస్సహాయుడుగా బయటకు లాగివేయ బడతాడు. మిగిలిన శిష్యులు నిబ్బరంగా ఆయన ముందు కూర్చొనే ఉంటారు. బుద్ధుని ఉపదేశ వాక్యాలు శ్రద్ధగా వింటూ ఉంటారు. కొంతసేపటికి ఆనందుడు తిరిగి వచ్చి గురుదేవా! ఏదో ఒక బలమైన శక్తి నన్ను ఎక్కడికో లాక్కు వెళ్ళింది, నేను మీరిచ్చిన ధార్మిక శక్తియందు గల విశ్వాసంతో సకల బంధాలనుండి బయటపడి మరల మీ దగ్గరకు చేరుకోగలిగాను అంటాడు .

అప్పుడు బుద్ధుడు అతనితో నా ధార్మిక శక్తికి నీ యోగశక్తి కూడ తోడైంది అని శిష్యులవైపు చూసి ఆనందుడు తిరిగి వచ్చాడు . మనం భిక్షకు బయలుదేరదాం పదండి అంటాడు. అందరు బయలుదేరారు.

రెండవ రంగంలో  ‘శివమానస’ తన దివ్య దర్పణంలో ఆనందుడు వచ్చినట్లే వచ్చి  తిరిగి బుద్దాశ్రమానికి వెళ్లి పోయాడని తెలుసుకుని మంత్ర రాజమైన మణిభద్రాన్ని ప్రయోగిస్తుంది. అది కూడ నిష్ఫలం కాగా  త్రైపురాకర్షణ మంత్రాన్ని అనుసంధానం చేస్తుంది . ఆనందుడు రావడం తథ్యం అనుకుంటుంది. తల్లీ, కూతురు ఇద్దరు సంతోషిస్తారు .

నాలుగో అంకం మూడో రంగంలో బుద్ధుడు శిష్యులను అందరిని సమావేశ పరచి బ్రహ్మచర్యాన్ని గురించి బోధిస్తాడు .

మనసనెడి చిన్న పడవలో మమత అనెది

నీరు నిండినచో తోడి పారబోసి

బ్రతుకు నదిలోన నిర్వాణ పథము పట్టి

పడవ మునుగని యట్లు పోవలయు నరుడు

అని హెచ్చరిస్తాడు .

ఏ మతానికైనా మౌలిక మైన విలువలు ఆచరించడమే ముఖ్యమని బోధిస్తాడు.

మంచి చెడ్డలు పరిగణింపకయు సతము

బ్రహ్మ చర్యము పూనెడు బౌద్ధ ధర్మ

వేత్త యొక్కడే నిక్కమౌ భిక్షువగును

బిచ్చమెత్తెడు వాడెల్ల భిక్షువగునె?     అని హితబోధ చేస్తాడు.

ఆనందుడు తన దాహాన్ని తీర్చిన ప్రకృతిని ప్రేమతో ఆప్యాయంగా చూశాడని, కాని ఆమె అతనిని అపార్థం చేసుకుందని, ఆమె తల్లి మంత్రికురాలే గాని అమృత హృదయ అని,  తండ్రి లేని కూతురి కోసమే ఇదంతా చేసిందని అంటాడు . బౌద్ధ భిక్షువు ఏ ఒత్తిడికి లొంగ కూడదని హితబోధ చేస్తాడు .

నేపథ్యంలో మెరుపులు, ఉరుములతో కూడిన వడగళ్ళ వాన కురుస్తున్న ధ్వనులు వినిపిస్తాయి . అది ఆనందుని ధార్మిక శక్తికి,  క్షుద్రశక్తికి జరుగుతున్న పోరాటమని బుద్ధుడు వారికి చెపుతాడు.

ఆ క్షుద్రశక్తి ఆనందుని మళ్ళీ లాక్కు పోతుంది. అందరు బుద్ధుని వైపు చూస్తారు. ఆయన మాత్రం చిరునవ్వు కురిపిస్తాడు .

నాలుగో అంకం నాలుగో రంగంలో ఆనందుడు ప్రకృతి ముందు వివశుడై కళా విహీనంగా బోర్లాపడి పోతాడు. ముని శక్తికి ‘శివమానస’ కృశించి నశిస్తుంది. తల్లి మరణంతో ప్రకృతి చాల విలపిస్తుంది .

ఆనందుడు ప్రకృతి వైపు నిరాసక్తంగా చూస్తాడు . ప్రకృతి నిర్లిప్తంగా ఆనందుని వైపు     చూస్తుంది . నేపథ్యంలో బుద్ధుని బోధనలు వినిపిస్తాయి . ఆనందుడు , ప్రకృతి, గౌరి  బుద్ధుని ఆశ్రమం వైపు నడుస్తారు .

ఐదవ అంకంలో బుద్ధుడు, ఆయన ముందు ఆనందుడు మిగిలిన శిష్యులు కూర్చొని ఉంటారు . అందరూ ఆయనకు నమస్కరిస్తారు. ప్రకృతి కూడ స్వామికి నమస్కరిస్తుంది . బుద్ధ శిష్యులు ప్రకృతి ప్రార్థనపై ఆమెకు దు:ఖం, దు:ఖానికి కారణం , దు:ఖ నివారణ , నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను వివరిస్తాడు . ఆ తరువాత మౌద్గల్యాయనుడు ఆమెతో అమ్మా ! ప్రకృతీ ! జీవితాన్ని మచ్చ లేకుండా చేసుకునే ఎనిమిది దారులున్నాయి అని,

అవి సరైన నడవడి, సరిగా మాట్లాడడం , మంచి ఆలోచనలు పోనివ్వకుండా, చెడ్డ ఆలోచనలు రానివ్వకుండా ఉండడం, ఎవరికీ అపకారం చెయ్యని జీవనోపాధి , స్వచ్ఛమైన జీవితం ఇవేనమ్మా ! అని వివరిస్తాడు .

బుద్ధుడు ప్రకృతితో అమ్మా ! మనుషులందరినీ ప్రేమించడమే అసలు సిసలైన ప్రేమ. ఆనందుని మీద నీ ప్రేమ వ్యక్తికే పరిమితమైనది కాబట్టి అది దు:ఖానికి దారి తీసింది . సర్వ మానవుల్ని ఇంకా  సాధ్యమైతే సర్వ జీవుల్ని ప్రేమించడమే ప్రేమలో శిఖరస్థాయి అంటాడు.

అందరు అదే ప్రేమశిఖరం అని ముక్తకంఠంతో నినదిస్తారు . అందరు నిష్క్రమిస్తారు .

1.      ఇక ఈ నాటకంలో రచయిత పాత్రలకు తగిన భాషను ఉపయోగించడం గొప్ప విశేషం.

2.      నాటకీకరణకు అనుకూలంగా మూల కథకు రసోచితమైన మెరుగులు దిద్దడం ఇంకో విశేషం .

3.      ఆనాడే అంటరానితనం  అనే దురాచారాన్ని వ్యతిరేకించే ఉదార వాదులు కూడ ఉన్నారనే విషయాన్ని ప్రదర్శించడం  మరో విశేషం

4.      అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు కూడ వేద మంత్రాలను , క్షుద్ర మంత్రాలను కూడ నేర్చుకునే వారని చెప్పడం మరో విశేషం .

5.      క్షుద్రశక్తులకన్న యోగ శక్తి గొప్పదని తెలుస్తోంది.

6.      మతంలోని మౌలికమైన విలువలను ఆచరించడమే ముఖ్యమని వేషధారణ ముఖ్యం కాదని వివరించడం జరిగింది.

7.      కవి శుద్ధమైన తాత్త్విక విషయాలను కూడ హృదయానికి హత్తుకునే విధంగా రసరాగ రంజితం చేసి సమాజానికి అందించగలడని ఈ నాటకం నిరూపణ చేసింది .

8.      బుద్ధుని అభిప్రాయాలను తెలుకోవాలనుకునే వారికి ఈ నాటకం చాల

                       ఉపయోగ పడుతుంది.

9.      ఇవే గాక ఈ నాటకంలో మరెన్నో విశేషాలున్నాయి .

మొత్తం మీద గౌతమబుద్ధుని బోధనలను ఇంత గొప్ప నాటకంగా మలచిన నా మిత్రుడు శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం తన గురువు గారి ఋణం తీర్చుకున్నారనడంలో ఎటువంటి  సందేహం లేదు. ఆయనను మనసారా అభినందిస్తూ ....

                                                  చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                                       9897959425

                                             <><><>

 

 

No comments: