Tuesday, December 2, 2025

పురాణమిత్యేవ న సాధు సర్వం రచన: డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

పురాణమిత్యేవ న సాధు సర్వం

రచన: డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

కాళిదాసు మనకు జాతీయ కవి. ఆయనకు మన జాతి ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా ఆయన ఋణం తీరదు . ఆయనకు ముందు,  భాసుడు, సౌమిల్లకుడు , కవిపుత్రుడు వంటి ఎంతో మంది గొప్ప గొప్ప కవులు ఉండేవారు . కాళిదాసు ‘మాళవికాగ్నిమిత్రం’ అనే ఒక నాటకం వ్రాస్తూ  భాస, సౌమిల్లక , కవిపుత్రాదుల వంటి ఎంతో ప్రసిద్ధులైన కవులుండగా నా నాటకాన్ని ఎవరు చదువుతారు? అని ఒక ప్రశ్నవేసుకుని దానికి తానే సమాధానం చెప్పుకుంటూ ఒక అమూల్యమైన విషయాన్ని మనకు అందించాడు.

పురాణమిత్యేవ న సాధు సర్వం

  చాపి కావ్యం నవమిత్యవద్యం

సంత: పరీక్ష్యాన్యతరద్భజంతే

మూఢ: పరప్రత్యయనేయ బుద్ధి:  

 ఇది పాతది కదా! అని ప్రతి దానిని మంచిదిగా భావించ కూడదు . అలాగే ఇది క్రొత్తది కదా! అని  ప్రతి దానిని పనికి రానిదిగా భావించకూడదు. ప్రాచీనంలో పనికి రానివి, నూతనంలో పనికి వచ్చేవి కూడ ఉంటాయి .  సత్పురుషులు ఏది మంచి , ఏది చెడు అనే విషయాలను బేరీజు వేసుకుని చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తారు . మూర్ఖుడు తన బుర్రతో ఆలోచించకుండా ఇతరులు చెప్పిన మాటలు నమ్ముతాడు అని కాళిదాసు మాటలలోని అభిప్రాయం . కాళిదాసు ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావిం చినా ఇది సార్వకాలిక సత్యం . కాబట్టి ప్రతివ్యక్తి, ఒక వస్తువు లేదా సిద్ధాంతం యొక్క మంచి, చెడులు మాత్రమే ఆలోచించాలి గాని, పాతదే మంచిది, క్రొత్తది చెత్తది అని మూర్ఖుని వలె వాదించకూడదని సారాంశం . పాత సినిమాలన్నీ మంచివి; క్రొత్త సినిమాలన్నీ చెత్తవి అని మనం అనగలమా ? అనలేం . ఎందుకంటే పాత సినిమాలలో చెత్త సినిమాలూ  చాల ఉంటాయి అలాగే  క్రొత్త సినిమాలలో మంచివి కూడా చాల ఉంటాయి . కాబట్టి మనకు మంచి, చెడు అనేవి  ముఖ్యం గాని పాతదా , క్రొత్తదా   అనేది ముఖ్యం కాదు . చెడు పాతదైనా తీసి వెయ్యాలి , మంచి ఎంత క్రొత్తదైనా ఆహ్వానించాలి. ఇక ప్రపంచ సాహిత్యం లోనే మొట్ట మొదటిదైన ఋగ్వేదం “ ఆ నో భద్రా: క్రతవో యాంతు విశ్వత: అంటే let noble thoughts come from all sides “అన్ని దిక్కులనుండి ఉన్నతమైన ఆలోచనలు ప్రసరించు గాక” అని ఉదాత్తమైన ఆలోచనలకు పెద్ద పీట వేసింది.   

అంతే కాకుండా మన పెద్దలు  “తాతస్య కూపోsయమితి బ్రువాణా: తిక్తం జలం కాపురుషా: పిబంతి” అన్నారు .          

  ఇది మా తాత తండ్రులు త్రవ్వించిన బావి అని గొప్పలు చెప్పుకుంటూ ఆ బావిలోనుంచి వెలువడే చెత్త నీటిని త్రాగే వాళ్ళు మూర్ఖులని నిరసించారు .

ఇక ఈ ప్రపంచం పరిణామ శీలం . ఎప్పుడు మారుతూనే ఉంటుంది. బుద్ధ భగవానుడు ఒక మాట అంటాడు . ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు , మార్పు ఒక్కటే శాశ్వతం అని . Nothing is permanent but change. మార్పును ఆహ్వానించడం ఆరోగ్య లక్షణం, ఆహ్వానించక పోవడం అనారోగ్య లక్షణం . కాని ఆ మార్పు మంచికి దారి తీస్తోందా? చెడుకి దారి తీస్తోందా? అనేదే మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. 

మంచి ఎవరు చెప్పినా స్వీకరించాలి . చెడు మన దైనా పరిహరించాలి . కాళిదాసు రఘువంశ రాజుల పరిపాలనా విధానాన్ని వర్ణిస్తూ...

ఆ దిలీపుడు తన శత్రువైనా వాడు మంచివాడైతే  అతనిని గౌరవించేవాడట. ఇక చెడ్డవాడు, తన మిత్రుడైనా వాణ్ణి విడిచిపెట్టే వాడట . అతనికి మంచి, చెడులే గాని; తనవాడు , పరాయివాడు  అనే భేదం లేదు. ఇది అసలు సిసలైన ఆచరణ యోగ్యమైన భారతీయ సిద్ధాంతం.

          

    

No comments: