Thursday, August 30, 2012

అందుకే మానుకున్నా


అందుకే మానుకున్నా !

డాక్టర్ . చిలకమర్తి. దుర్గాప్రసాద రావు
3/106 Premnagar , Dayalbagh, Agra
91+9897959425
dr.cdprao@gmail.com

జంట కవిత్వం తెలుగువారి సాహితీ ప్రక్రియల్లో ఒకటి. తెలుగుసాహిత్యంలో నందిమల్లయ్య ఘంటసింగనలు తొలి జంట కవులుగా పేరు పొందారు. వీరు ప్రబోధచంద్రోదయం, వరాహపురాణం మొ || కావ్యాలు రచించారు. వీరిలో ఒకరైన ఘంటసింగయ్య ముక్కుతిమ్మనకు మేనమామగా ప్రసిద్ధులు.

ఇక ఆధునిక కాలానికొస్తే తిరుపతి వేంకట కవులు జంటకవులుగా చాల ప్రసిద్ధులు. వారిలో ఒకరు దివాకర్ల తిరుపతిశాస్త్రి గారు రెండవ వారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు. తిరుపతి వేంకట కవుల్లో శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చాల చిన్న వయసులోనే మరణించినప్పటికీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు ఇరువురి పేర్ల తోటే గ్రంథాలు వ్రాశారు. ఆయన రచించిన ప్రతిరచన 'తిరుపతివేంకటీయం' గా ప్రసిద్ధి కెక్కింది. ఆయన సౌజన్యం అటువంటిది. మరో విశేషమేమిటంటే ఆయన తనకు లభించిన పారితోషికంలో సగభాగాన్ని తిరుపతిశాస్త్రిగారి కుటుంబానికి అందజేసేవారని కూడ చెబుతారు. ఆయన సౌజన్యానికి ఇది ఒక పరాకాష్ఠ. సరే ఆసంగతి అలా ఉంచుదాం. ఆ మహనీయుల ప్రభావం ఆనాటి ఎంతోమంది కవులపై పడింది . తత్ఫలితంగా ఎంతోమంది జంట కవులు వెలువడ్డారు. వారిలో రామకృష్ణ కవులు, వేంకట పార్వతీశ కవులు, కొప్పరపు కవులు మొదలగువారు చాల ప్రసిద్ధులు. వారందరు సాహిత్య వినీలాకాశంలో సూర్య చంద్రుల్లా కవితా కాంతులను వెదజల్లినవారే. తిరుపతి కవులతో సరిసమానంగా కవిత్వ మల్లినవారే. ఇక కొంతకాలం జంటకవులుగా వెలుగొంది మధ్యలో విరమించుకున్నవారు కూడ కొంతమంది లేకపోలేదు. కారణాలు వేఱు. శ్రీవిశ్వనాథ శ్రీకొడాలి ఆంజనేయులుగారు కలిసి జంట కవిత్వంచెప్పేవారు. కాని శ్రీ కొడాలివారు కవిత్వాన్ని విడిచిపెట్టి మహాత్ముని అడుగుజాడలననుసరించి స్వాతంత్ర్యోద్యమంలో చేరిపోయారు. అయన కవిత్వం చాల చక్కనిది చిక్కనిది. అందుకే శ్రీవిశ్వనాథ వారు ఆయన కవిత్వాన్ని ప్రశంసిస్తు తమ రామాయణ కల్పవృక్షం లో ఇలా అంటారు...
ఆతడె తోడుకల్గినను నచ్చముగా కలకండలచ్చులం
బోతలు పోసియుండెదము పోతనగారి విధాన దీపితా
లాతమువోలె సుంతయు విలంబనమోర్వదు నిత్యవేగి నా
చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావతీవ్రతన్.
ఇక శ్రీ గుర్రం జాషువ గారు శ్రీ దీపాల పిచ్చెయ్య శాస్త్రిగారు మహాకవులే కాక మంచి మిత్రులుకూడ. ఇద్దరు కలసి కవిత్వం చెప్పేవారు. కొంతకాలం గడిచింది. ఎందుకోగాని జాషువ గారు ఆయనతో సాహితీవ్యవసాయం చెయ్యడం అకస్మాత్తుగా విరమించుకున్నారు. ఈ విషయం సాహిత్యరసికుల్ని చాల కలవరపరిచింది. ఒకసారి శ్రీ జాషువ గారి మిత్రగణం ఆయన దగ్గరికెళ్లి అయ్యా! మీరు శ్రీ దీపాల వారు కలిసి చక్కని కవిత్వం చెప్పేవారు . మేమందరం చాల ఆనందించేవాళ్లం. మీరు ఎందుకు మానేశారో సెలవిస్తారా! అనడిగారు. దానికాయన ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు.
నాపేరు మొదట నిల్పిన
పాపంబదియేమొ జాషువా పిచ్చి యగున్
నాపేరు చివర నిల్పిన
శాపంబిడినట్లు పిచ్చిజాష్వా యయ్యెన్

నాపేరు ముందు పెడితే 'జాషువా పిచ్చి' అవుతోంది. ఒకవేళ వెనక ఉంచితే ' పిచ్చి జాష్వా' అవుతోంది . ఏ విధంగా చూసినా నాకే ఇబ్బందిగా ఉంది అందుకే ఆయనతో జంట కవిత్వం చెప్పదం మానుకున్నా అన్నారు. చూడండి జాషువ గారి చమత్కారం.

No comments: