Wednesday, May 31, 2017

ప్రాకృతసాహిత్యంలో హనుమంతుని జన్మవృత్తాంతం

ప్రాకృతసాహిత్యంలో
హనుమంతుని జన్మవృత్తాంతం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

* This is a free translation of a story entitled हणुओं जम्मकहा a portion of “PaUmachariyam” written by Vimalasuri’ in Maharashtri prakrit which depicts the birth of Lord Hanuman. ఇది విమలసూరి రచిoచిన పఉమచరియంఅనే జైనమహారాష్ట్రీప్రాకృతగ్రంథంలోని హణుఓ జమ్మకథా అనే భాగం యొక్క స్వతంత్రానువాదం .
***
కొంతకాలం గడిచిన తరువాత గర్భవతియగు  మహేంద్రతనయ అంజనాదేవి శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి.  ఆమె పాలిండ్లు బరువెక్కాయి . కటిభాగం వెడల్పయింది. గర్భభారం వల్ల నడక వేగం తగ్గింది. ఈ విషయం గమనించిన పవనంజయుని తల్లి అంజనాదేవితో ఓసీ పాపాత్మురాలా! భర్త దూరoలో  ఉన్నా నువ్వు గర్భవతివి ఎలా అయ్యావు అని నిలదీసింది.
 అంజనాదేవి అత్తగారి పాదాలపై పడి, నమస్కరించి భర్త పవనంజయుని రాకపోకలు,
ఆయన ఇచ్చిన ఆనవాలు చూపించినా ఆమె నమ్మలేదు. కీర్తిమతి ఆమెతో  అంది నీ పేరు, చోటు కూడ సరిగా తెలియని వాడు, చాల దూరంలో ఉన్నవాడు ఇక్కడకు రోజు ఎలా వచ్చి పోగలడు?  ఛీ దుష్టురాలా! నువ్వు ఇటువoటి పాపపు పని చేసి పవిత్రమైన వంశానికి చెడ్డ పేరు తెచ్చావు అని నిందించి సేవకుని పిలిచి  ఆమెను వెంటనే పుట్టింటిలో దిగబెట్టి రమ్మని ఆజ్ఞాపించింది. ఆమె ఆదేశానుసారం అంజనాదేవి తన సఖితో మేనాలో కూర్చుని ప్రయాణానికి సిద్ధమైoది. వాహనం మహేంద్రనగరానికి ప్రయాణమయింది . సేవకుడామెను నగరం పొలిమేరలో విడిచిపెట్టి    అమ్మా! పాపిని నన్ను క్షమించు అని  వేడుకొని అక్కడ నుంచి  వెళ్లిపోయాడు. అంతలో చీకటి పడింది .
 మరునాడు సూర్యుడుదయిoచగానే ఆమె తన సఖితో నగరం ప్రవేశించడానికి ప్రయత్నిoచింది. కాని ద్వారపాలకుడామెను లోపలికనుమతించలేదు. శిలాకపాటుడనే ఆ ద్వారపాలకుడు ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విని ఆమె తoడ్రి మహే౦ద్రునకు  విన్నవించాడు. మహేంద్రుడు ఇదంతా నేను విన్నాను. ఈమె అత్తగారు ఈమెకు కలిగిన  గర్భం విషయమై అనుమానిoచిoది.  ఇప్పుడు ఈమె వలన నాకు ఎటువంటి కళoకము వాటిల్లకూడదు . అందువల్ల ఆమెను వెంటనే  నగరం నుంచి బయటకు పంపివేయమని ద్వారపాలకునికి చెప్పాడు.   
 ఆ తరువాత రాజాదేశాన్ననుసరిoచి అంజనాదేవి సఖితో నగరం నుoచి పరదేశానికి తరిమి వేయబడింది. అతిసుకుమారిమైన ఆమె రాళ్ళు , ముళ్ళు గల మార్గంలో నడుస్తూ సహిoపలేని బాధననుభవిoచింది .  ఆమె ఆశ్రయం కోసం ఏఏ ఇళ్లకు వెళ్లిందో వారందరూ  రాజుకు భయపడి ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు.
 దయ, కరుణలేని వారందరు  నిరాకరిoచడంతో  పురుషులు కూడ ప్రవేశించడానికి భయపడే ఘోరమైన  అరణ్యంలో ప్రవేశించింది . ఆ తరువాత ఆమె తన చెలి వసంతమాల  నిర్మించిన శయ్యలో నివసిస్తూ కొన్నాళ్ళకు తూర్పుదిక్కు సూర్యుని ప్రసవించిన విధంగా ఒక వరపుత్రునికి జన్మనిచ్చింది .
ఆ బిడ్డ ప్రభావం వల్ల ఆమె ఉంటున్న గుహలోని చెట్లన్నీ చిగురించాయి, పూలతో వికసించాయి. కోకిలల నాదాలు, తుమ్మెదల ఝంకారాలు గుహoతా మారుమ్రోగాయి.
 అంజనాదేవి అప్పుడే పుట్టిన ఆ బాలుని ఒడిలోకి తీసుకుని నాయనా! నేను పాపాత్మురాలను . ఇటువంటి ఘోరమైన  అరణ్యంలో నీకు నేనేమి చేయగలను?     నువ్వు నీ తండ్రి ఇంట్లోగాని, మాతామహుని (తాతయ్య ) ఇంట్లోగాని పుట్టి ఉంటే నాకు చాల ఆనందంగా ఉండేది .  నేను పతికి , తల్లిదండ్రులకు దూరమై గుంపు నుండి విడివడిన లేడిలా బ్రతుకీడుస్తున్నానంటే అది నీ కోసమే అని దీనంగా విలపించింది . 
 అది విని వసంతమాల అంజనాదేవితో అమ్మా ! నువ్వు జరిగిందానికి బాధపడకు .
పూర్వం ముని చెప్పిన మాటలు నిజంగాక  మానవుకదా! అంది .  వారిద్దరి  మాటలు వింటున్న ఒక విద్యాధరుడు పరివారంతో ఆకాశంనుంచి దిగి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు .
 ఆయన  గుహలో ప్రవేశించి ఓ యువతులారా! మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు ?  అని ప్రశ్నించాడు .  దానికి సమాధానంగా వసంతమాల ఓ సత్పురుషుడా! ఈమె మహేంద్రనృపతి కుమార్తె . మహావీరుడైన పవనంజయుని భార్య .  పవనంజయుడు ఈమెను గర్భవతిని చేసి తన స్వామియైన రావణుని వద్దకు వెళ్ళాడు. ఈ విషయం ఎవ్వరికి తెలియదు . కాని దుష్టురాలైన ఈమె అత్తగారు  ఈమె గర్భాన్ని  అనుమానించి పుట్టింటికి పంపించేసింది . ఈమె తండ్రి కూడ అవమానంతో ఈమెను చేరదీయకుండా బయటకు గేంటేస్తే నేను ఈ ఘోరమైన అరణ్యానికి తీసుకొచ్చాను . ఏ పాపం ఎరుగని  ఈ పుణ్యవతి నేడు రెండవజామున ఈ పూలపాన్పుపై  బిడ్డను ప్రసవించింది అని వివరించింది .
 అది విని ఆయన అమ్మా! నాతండ్రి కరువరద్వీపానికి రాజు. ఆయన పేరు చిత్ర భానుడు .  నా పేరు ప్రతిసూర్యకుడు . నా సోదరి వరహృదయ సుందరి ఇంద్రుని భార్య .  ఈ యువతి నా చెల్లెలి కుమార్తె . ఈమెను చాల కాలం తరువాత చూడడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. కొన్ని ఆనవాళ్ల వలన   నాకు నా బంధువులపై  గల ప్రేమవల్ల గుర్తించ గలిగాను అన్నాడు .
 అంజనాదేవి అతనిని మేనమామగా గుర్తించి ఎంతో హృదయవిదారకంగా విలపించింది. వసంతమాల ఆమెను ఓదార్చింది.   ప్రతిసూర్యకుడు ఆమెను ఓదార్చి జ్యోతిష్కుని పిలిచి  ఆ బాలకుడు పుట్టిన తిథి, వార౦ , నక్షత్ర౦ మొ|| వివరాలు చెప్పమని  అడిగాడు. జ్యోతిష్కుడు ఆ రోజు  ఆదివార౦, చైత్రమాసం , కృష్ణపక్షం , అష్టమి థి అని బ్రాహ్మ మను పేరుగల యోగమని వివరించాడు . అంతేగాక  ఆ బిడ్డ పుట్టిన ముహూర్తం శుభప్రదమై౦దని , మీనోదయకాలమని , గ్రహాలన్నీ ఉన్నతస్థానంలో ఉన్నాయని ఆ బిడ్డ  బల, భోగ, రాజ్య , సంపదలు కలిగి చివరికి  మోక్షసుఖాన్ని పొందుతాడని వివరించాడు .
 ప్రతిసూర్యుడు ఆ జ్యోతిష్కుని తగినవిధంగా సన్మానించి మేనకోడలితో అమ్మా ! మనం హనురుహ నగరానికి బయలుదేరదాం అని చెప్పాడు .   ఆ తరువాత  గుహలో నివసించే  దేవత సమ్మతితో బంగారు విమానంలో అక్కడ నుండి బయలుదేరేడు . అమ్మ ఒడిలో ఉన్న బాలుడు ఒడ్డాణపు మువ్వలను చూస్తూ చేపపిల్లవలె గంతులేస్తూ  ఆడటంవల్ల విమానం నుంచి జారి ఒక  పర్వతశిలపై పడిపోయాడు . క్రిందపడిపోయిన పుత్రుణ్ణి  చూస్తూ భగవంతుడు నాకు నిధి ప్రసాదించి నాకు కళ్ళు లేకుండా చేశాడు అని భావించి దీనంగా విలపిస్తూ  ప్రతిసూర్యకునితో సహా విమానం దిగి  పర్వతశిలపై పడియున్న పుత్రుని చూసి౦ది. ఆ బాలుని శరీరానికి గాని తక్కిన అవయవాలకు గాని ఎటువంటి గాయాలు తగులలేదు . ఆమె చాల ఆనందించింది . ప్రతిసూర్యకుడు చాల సంతోషంతో బాలున్ని మెచ్చుకున్నాడు .  ఆమె పుత్రునితో సహా మరల విమానంలో కూర్చొని మంగళవాద్యాలు మ్రోగుచు౦డగా హనురుహనగరంలో ప్రవేశించింది .  దేవలోకంలో ఇంద్రుడు జన్మించినప్పుడు ఏవిధంగా దేవతలు ఉత్సవం చేశారో ఈ బాలుని జన్మదినోత్సవం కూడ అదే విధంగా వైభవంగా జరిపారు .  బాల్యంలోనే పర్వతం పైన పడి ఆ పర్వతాన్ని నుజ్జునుజ్జుగా చేసినందున అతనికి  ప్రతిసూర్యకుడు శ్రీశైలుడు అని పేరు పెట్టాడు . అలాగే  ఆ బాలుడు హనురుహ నగరంలో ఎంతో గౌరవాదరాలు పొందడం వల్ల పెద్దవారందరు హనుమంతుడని  మరో పేరు పెట్టారు.                                     
From:
Prakritadipika,
Edited by Dr. Sudarsan Lal Jain,
Parshvanath Vidyashram Sodh Samsthan,
I.T.I Roan, Varanasi-5       
***********                                












No comments: