Saturday, September 2, 2017

ఎంగిలి

ఎంగిలి
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

              సుబ్బారావుకి ఎన్నినియమనిష్ఠలున్నాయో, అంతకు మించిన చాదస్తం కూడ ఉంది .

ఎప్పుడు భార్యకంటే ముందుగానే భోజనం చేస్తాడు . ఒకసారి ఎందుకో  భార్యతో కలిసి భోజనానికి కూర్చున్నాడు . మంచినీళ్ళు త్రాగి గ్లాసు క్రి౦ద పెట్టబోతూ గ్లాసుకేసి చూశాడు . అందులో అన్నం మెతుకు కనిపించేసరికి గతుక్కుమన్నాడు .  తీరా చూస్తే అది వాళ్ళావిడ త్రాగిన గ్లాసు . ఎంగిలి గ్లాసుతో నీళ్ళు త్రాగినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి . మన భారతీయ సంస్కృతిలో ఎంగిలి తినడంగాని , ఇతరులకు పెట్టడంగాని మహాపాపం. అందుకు  ప్రాయశ్చిత్తం చేసుకోవాలి .  ఏమిటా ప్రాయశ్చిత్తం  అని గ్రంథాలన్నీ తిరగేశాడు. ఒక పుస్తకంలో ఎంగిలి తిన్నపాపం కాశీని సందర్శిస్తే పోతుందని వ్రాసి ఉంది . ఇక చేసేదేముంది. కాశికి బయలుదేరడానికి సిద్ధం అయ్యాడు . పూర్వం కాశికి వెళ్ళడం కాటికి వెళ్ళడంతో సమానమనేవారు . ఎందుకంటే  కాశీకి బయలుదేరిన వాడు అక్కడకు ఎప్పుడు వెడతాడో తెలియదు. వెళ్ళినవాడు తిరిగి ఇంటికి చేరతాడో చేరడో తెలీదు. ఒకవేళ చేరితే  ఎప్పుడు చేరతాడో  ఏ స్థితిలో చేరతాడో  ఎవరికీ తెలీదు. కాని మన సుబ్బారావు అవన్నీ ఆలోచించకుండా ధైర్యంగా  కాలినడకనే  బయలుదేరాడు .   మధ్యాహ్నసమయానికి ఒక ప్రాంతం చేరుకున్నాడు . కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి . భోజనం కోసం ఒక ఇంటిలో దూరాడు . ఆ ఇంటి ఇల్లాలు సుబ్బారావుకి మంచి విందుభోజనం పెట్టింది . అమ్మా! భోజనం చాల బాగుంది . సేమ్యా పాయసం చెప్పలేనంత రుచిగా ఉంది . మీకు నా కృతజ్ఞతలు అంటూ అన్నదాత్రీ సుఖీ భవ అని ఆశీర్వదించాడు . ఆమె సంతోషంతో  తిన్నవాడా ఖుషీ భవ  అంటూ నాయనా ! నేను బయటకు వెళ్ళగా చూసి ఒక కుక్క ఇంట్లో దూరి పాయసంపై ఉన్న పాలతొరక తెట్టు  నాకేసింది. లేకపోతే ఇంకా రుచిగా ఉండేది బాబూ! అంది . అదివిని గతుక్కుమన్నాడు సుబ్బారావు . కాని ఏమీ మాట్లాడలేక అక్కడనుంచి ముందుకు నడిచాడు . నడవగా నడవగా కొంత సేపటికి చీకటి పడింది . రాత్రి భోజనానికి సమయం ఆసన్నమై౦ది. ఆకలితో కడుపు నకనకలాడుతో౦ది. ఒక సత్రం చేరుకున్నాడు . ఆ సత్రం యజమాని తనని పిలిచి ఆదరంగా భోజనం పెట్టాడు . తాంబూలం వేసుకోడానికి తమలపాకులు, పోకచెక్క , సున్నం అందించాడు . సుబ్బారావు అంతులేని ఆనందంతో ఆకులకి సున్నం రాసి పోక దట్టించి నోట్లో పెట్టుకుని నమలసాగాడు . ఎంత నమిలినా పోక నలగడం లేదు . అతని అవస్థను గమనించిన ఆ సత్రం యజమాని నాయనా! ఆ పోకను ఇప్పటికే సుమారు పదిమంది నోట్లో పెట్టుకుని నలగ్గొట్టడానికి ప్రయత్నించారు , ఎవరివల్ల కాలేదు అన్నాడు అసహనంగా . సుబ్బారావుకి మతిపోయినంత పనైంది. ఇంత దారుణ౦గా వ్రతభంగమైనందుకు లోలోపల చింతిస్తూ ముందుకు పొతే ఇంకా ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అని భయపడుతూ ఇంటికి తిరుగుముఖం పట్టాడు .

No comments: