Wednesday, January 6, 2021

అభినందనమందార మాల

 

అభినందనమందార మాల

శ్రీ అనిపెద్ది జగన్నాథ శాస్త్రి గారు రచించిన

“ భావతరంగాలు”

ఒక విహంగ వీక్షణ సమీక్ష

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ , పి.ఓ.యల్,

ఎం.ఏ ( సంస్కృతం ) ఎం .ఏ ( తెలుగు) ఎం . ఏ (తత్త్వశాస్త్రం )

 పిహెచ్.డి (సంస్కృతం )

3/106, ప్రేమ్ నగర్ , దయాల్ బాగ్ , ఆగ్రా -282౦౦5

dr.cdprao@gmail.com

 

ఉదయం తు శతాదిత్యా: ఉదయం త్వి౦దవశ్శతం

న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:

అన్నారు పెద్దలు.  వందమంది  సూర్యులు ఉదయి౦చు గాక . అలాగే వందమంది చంద్రులు ఉదయి౦చుగాక. మానవునిలో దాగిన అజ్ఞానమనే చీకటి కవి వాక్కువలన మాత్రమే తొలగిపోతుంది.

కవి వాక్కుకి అంతశక్తి ఉంది . ఎందుకంటే అది ప్రతిమనిషినీ ఆలోచింపచేస్తుంది . అందుకే  Byron అనే ఆంగ్లకవి ఇలా అంటారు. 

But words are things and a small drop of ink

Falling, like dew upon a thought, produces

That which makes thousands, perhaps millions think.

(Don Juan, canto III, st.88.

అటువంటి ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని కూర్చడంలో నేర్పరి మా మిత్రుడు జగన్నాథశాస్త్రి . కాసేపు  మా ఇరువురి గతంలోకీ వెళుతున్నా .

మేం  శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఓరియంటల్ కళాశాల(పాలకొల్లు)లో చదువుకున్నాం . మాది college కే రెండో బ్యాచ్. అధ్యాపకులందరు మమ్మల్ని చాల ఇష్టపడుతూ ఉండేవారు . ప్రేమగా చూస్తూ ఉండేవారు . కాలేజీ అంతా ఒక కుటుంబంలా ఉండేది .   కళాశాల ఏర్పడక పూర్వం మాకు దేవస్థానంగదుల్లో క్లాసులు జరుగుతుండేవి. భాషాప్రవీణ (ఎంట్రన్స్) లో మాకు శ్రీ మండలీక వేంకటరావుగారు అన్ని పాఠాలు చెప్పేవారు . ఆయన ఆనాడు పిల్లలకు ప్రైవేట్లు చెబితే చాల డబ్బు వచ్చేది . కాని ఆయన అవన్నీ వదులుకుని మాకు పాఠాలు చెప్పేవారు . వారి ఋణ౦ మేం ఎన్ని జన్మలెత్తినా తీర్చు కోలేనిది . ఇక కళాశాలగా  వెలిశాక  శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం( principal)గారు మాకు కాదంబరి, అభిజ్ఞానశాకుంతలం, శ్రీనాథుని కావ్యాలు   చెప్పేవారు. శ్రీ వేదుల సుందరరామశాస్త్రి గారు ( వీరు విశ్వవిఖ్యాతవ్యాకరణ శాస్త్రవేత్త శ్రీ తాతా రాయడు శాస్త్రిగారి యను౦గుశిష్యులలో ఒకరు, భాష్యాంతవైయాకరణి) మాకు సిద్ధాంతకౌముది బోధించేవారు. శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు తెనుగువ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . శ్రీ సోమంచి సత్యనారాయణ గారు మృచ్ఛకటికం మొదలైన నాటకాలు , డాక్టర్ . శ్రీపాద కృష్ణమూర్తి గారు ప్రాచీన , ఆధునిక సాహిత్యాలు, శ్రీ వీరుభొట్ల కుటుంబ సత్యనారాయణ గారు శివార్పణం వంటి ఆధునికపద్యగ్రంథాలు బోధించేవారు. ఇక అప్పటినుంచే జగన్నాథశాస్త్రి భావకవిత్వాన్ని , అభ్యుదకవిత్వాన్ని బాగా చదివి వంటపట్టించుకున్న వ్యక్తి. ఆ  రోజుల్లోనే  ఎప్పుడు శ్రీశ్రీ గారి కవితల్ని వల్లె వేస్తూ ఉండేవారు. జగన్నాథశాస్త్రి రెండో బెంచ్ లో కూర్చుని భావకవిత్వం , అభ్యుదకవిత్వం చదువుతూ తన్మయత్వంతో  తలొంచుకుని కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వర శర్మ  గారికి కనిపించేవాడు కాదు.  అప్పుడాయన “జగన్నాథ స్వామిన్ ! నయనపతగామీ భవతు మే”  ( ఓ జగన్నాథస్వామీ ! నా కంటికి కని పించవయ్యా! ) అంటూ ఉండేవారు.   పాలకొల్లు ఎంతో మంది వదాన్యశేఖరులకు పుట్టినిల్లు .

శ్రీ యుతులు రేపాకవారు  , అత్యం వారు  , అద్దేపల్లి వారు వందలాది విద్యార్థులకు, తదితరులకు ఉచిత భోజనవసతి చేకూర్చేవారు . మేం అక్కడ భోజనం చేస్తూ  కాలేజీలో చదువుకునే వాళ్ళం  . అధ్యాపకులందరు మమ్మల్ని సుతనిర్విశేషంగా ప్రేమించేవారు . వారి దాతృత్వంలోను , అధ్యాపకుల నేతృత్వంలోను కొంత విద్య నేర్చుకున్నాం .  అదంతా రామలిమ్గేశ్వరుని దయ. అందుకే

ఆరామంబులకెల్ల మిన్నయగు క్షీరారామమందుండి ని

న్నారాధించుట(జేసి మాకు హిత విద్యాబుద్ధులబ్బెన్ నిజం

బౌరా ! నీ మహిమల్ నుతి౦చుట శక్యంబౌనె మాబోంట్లకున్

క్షీరారామపురీ విహార రసికా! శ్రీ రామలి౦గేశ్వరా!

అని అనుకుంటూ ఉంటా .   

ఇక విద్యార్ధులమైన మేం అందరు కలిసే ఉన్నా జగన్నాథశాస్త్రి, మల్లాది సాంబశివరావు , నేను చాల సన్నిహితంగా మెలిగే వాళ్ళం . వాళ్లిద్దరిలోను ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది . శ్రీ శ్రీ గారిమీద కోపంతో ఎవరైనా  మహాప్రస్థానం , ఖడ్గసృష్టి   మొదలైన గ్రంథాలను ఎవరికీ కనిపి౦చకుండా దాచేస్తే జగన్నాథశాస్త్రి యథాతథంగా అప్పగి౦చగల ధీమంతుడు . ఇక సాంబశివరావు ఏ పద్యానికైనా విశేషార్థం చెప్పగలిగే ప్రజ్ఞాపాటవాలు గలవాడు.  అతను నేడు  ఈ లోక౦ విడిచి మాకు పుట్టెడు  శోకం మిగిల్చాడు .  ఇక జగన్నాథశాస్త్రికి  నాటి ను౦చీ  భావకవిత్వం, అభ్యుదయకవిత్వం పట్ల గల ఆసక్తి దినదినాభివృద్ధి చెంది కావ్యరచనకు దోహదం చేసింది.

     ఇక ‘భావతరంగాలు’ జగన్నాథశాస్త్రి గారి ద్వితీయపుత్రిక . ఇందులో సుమారు డెబ్బది యారు కవితాఖండికలున్నాయి . అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క  ప్రత్యేకతను సంతరి౦చుకున్నవే. అవన్నీ ప్రకృతివర్ణనలు , తాత్త్వికచింతన , మానవసంబంధాలు , విద్య  అనే నాలుగు భాగాలుగా విభజి౦చొచ్చు . ఇది ఆధునికకవిత్వమే ఐనా రచయిత వినాయక , శంకరుల ప్రార్థనలతో ప్రాచీన సాంప్రదాయాన్ని పాటించడం ఒక విశేషం . ఇక గ్రంథం విషయానికొస్తే  ఆశ’ అనే ఖండికలో   ఆశ మనిషిని బందీగా చేస్తుందని శ్రమ, సంతృప్తి జీవితానికి నిండుదనం చేకూరుస్తాయనే జీవితపరమార్థాన్ని  వివరించారు .  దివ్యత్వం’ అనే కవితలో ఆత్మ, శరీరాలను మథించడం వల్ల జన్మ, మృత్యు, జరాతాపాల్లేని  అమృతత్వం సిద్ధిస్తుందని చెప్పడం ఆయన ఆధ్యాత్మికభావాల  పరిపక్వతకు ఒక ఉదాహరణ. ‘శిశిరకాంత’ భావనా శక్తికి అద్దం పట్టేదిలా ఉంది . ‘ఆమె’ ఖ౦డికలోని ఊహాసు౦దరి కవిత్వానికి దోహదం చేసి౦దనిపిస్తుంది. ‘మక్షిక’ అనే కవితలో జీవితాన్ని శ్లేష్మ౦లో ఈగలా పోల్చడం చాల బాగుంది . ‘సాహిత్యం’  అనే కవితలో సాహిత్యం వసుధైకకుటుంబభావనకు దోహదంచేస్తుందని, మానవతావిలువలు , మంచిచెడులు తెలిపి  అంతులేని సంతృప్తిని కలిగిస్తుందని ,  సాహిత్యంతో తదేకమై , మమైకమైతే  సమగ్రప్రపంచాన్ని చూసిన చిత్తంబున మనగల్గుతామని చెప్పడం ప్రత్యక్షర సత్యం . ఇక ‘విశ్వవిద్యాలయం’ కవిత ద్వారా పుట్టినదగ్గర నుంచి మరణించే వరకు  మనిషికి విశ్రాంతి లేదని చదువు , సహనం ఓర్పు సంతోషాన్ని కలిగిస్తాయని వివరించారు .‘స్నేహం’ అనే ఖండికలో

ముడివడిన మనస్సు ఘన సంఘటిత తమస్సు

విశ్వమున కొక యశస్సు విడివడిన మనస్సు

లవణ యుత పయస్సు , కలహమున కొక హవిస్సు’ అని స్నేహం యొక్క పారమ్యాన్ని విశ్లేషించారు . ‘ఓంకారం’ ‘సన్ననిరేఖ’ ‘ భగవాన్’ మొదలైన ఖండికలు ఆధ్యాత్మిక చింతనకు ఉదాహరణ.

‘జీవితం’ అనే ఖండికలో జీవిత సత్యాలను వివరించారు . కష్టాలలో కృంగక సుఖాలలో పొంగక సమభావంతో ఉండాలని ఉద్బోధించారు . జీవితం అటు ప్రమాదకరమని, ఇటు ప్రమోదకరమని చెపుతూ అంటీఅంటని విధంగా గెంటుకురావాలని చెప్పడం పండిన అనుభవానికి నిండైన ఉదాహరణ.  

‘నాటకం’ అనే కవిత ద్వారా ‘బ్రతుకులో నటించడం కన్నా హేయముంటు౦ది ఈ లోకంలో’ అంటారు .

‘చిన్నోడ’ ఖండిక ద్వారా  భారతదేశ గతవైభవాన్ని ఎలుగెత్తి చాటేరు.

‘గ్రంథాలయం’  ఖండికలో “చీకట్లోంచి వెలుగుకు రమ్మనేది గ్రంథం ; విషయపరిజ్ఞానాన్ని పెంచేది గ్రంథం; జ్ఞానతృష్ణను తీర్చే చలివేంద్రం గ్రంథం;

కావ్యమాలికలన్నీ సరస్వతీదేవి కంఠాభరణాలే; లోకకల్యాణానికి దేవాలయాలు  -- అని చె ప్పడం ఎంతో మనోజ్ఞంగా ఉంది .

‘నాలుక’ లో        నాలుకను వర్ణిస్తూ:

‘పలుకులరాణి నృత్యకళావేదిక నాలుక ;

నాలుక జాపితే ఆరోగ్యం తెలుస్తుంది ,

నాలుక జారితే అనర్థాలు కలుగుతాయి’ అంటారు .            బాపు గారి బొమ్మను వర్ణిస్తూ ‘ గుండె లోతుల్లోని భావాన్ని చూపుల్లో చూపే బాపు బొమ్మ , చిరునవ్వుల కొమ్మ ‘ అంటారు .       అలాగే                  

‘సంఘాన్ని వెదకి చూసి సౌమ్యాన్ని నేర్చుకో’

‘ సర్వత్రా దైవాన్ని చూడు ‘  తెలుగే ఊపిరి తెలుగు భాష మఱువకు,  ‘ మేల్కొన్నహృదయం మేలిమి బంగారములే ‘   ‘ప్రతిభారతీయుడు విశ్వ కల్యాణానికి పచ్చ తోరణమే’ మొదలైన మాటలు రసభావాలకు మూటలు , సమాజప్రగతికి బాటలు. స్థాలీపులాకన్యాయంగా కొన్ని ఖండికలు మాత్రమే విశ్లేషించడం జరిగింది . ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా వ్యాసవిస్తరభయంవల్ల ఇంతటితో విరమిస్తున్నా . 

ఈ కవితాసంపుటి భావితరాన్ని అందులోనూ యువతరాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తుందని విశ్వసిస్తూ , జగన్నాథశాస్త్రిగారి కలం నుండి మరెన్నో కావ్య ఖండికలు వెలువడాలని మనసారా ఆకాంక్షిస్తూ....                                                            దుర్గాప్రసాద రావు . 

 

    

  

No comments: