Wednesday, August 17, 2022

నేటి భారతం

 

                            నేటి భారతం

                                                                         Dr. Chilakamarthi DurgaprasadaRao.

                                                                                9897959425     

                                                                              dr.cdprao@gmail.com

       కలిస్తే నిలుస్తాం  విడిపోతే పడిపోతాం’ అన్నది ఆర్యోక్తి.


చెట్టపట్టాలేవేసుకుని దేశస్థులంతా నడువవలెనోయ్

అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ  మెలగవలెనోయ్

అన్నారు మహాకవి శ్రీగురజాడ. ఒకప్పుడు మన భరతజాతి అన్నదమ్ముల వలె కలసి మెలసి  మహాత్ముని అడుగుజాడల్లో నడిచి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసాయుతంగా పారద్రోల  గలిగింది. కానీ ఎం లాభం ? స్వతంత్రం సిద్ధించి ముప్పాతిక ఏళ్లయినా  స్వాతంత్ర్యఫలితాల్ని మనం పూర్తిగా పొందలేకపోతున్నాం . రోజు రోజుకి నిరుద్యోగం, నిరక్షరాస్యత, అవినీతి, అరాచకత్వం, అసూయాద్వేషాలు, ప్రాంతీయభేదాలు, మతవై షమ్యాలు  పెచ్చుపెరిగిపోతున్నాయి. మహాత్ముని మాటలకు వక్రభాష్యం చెపుతున్నారు.  ఎలాగో చూడండి .

చెడు అనుకుము  చెడు వినకుము

 చెడు కనకు మటంచు నొక్కి చెప్పిన గాంధీ

చెడు  చేయకంచు చెప్పెనె ?

చెడు చేయగ నేల మాకు  సిగ్గున్ ఎగ్గున్

 అంటు ఎన్నో  చెడ్డపనులు చేస్తూ ఇలా సమర్థించు కుంటున్నారు.

  నేటి నల్ల దొరలకంటె ఆనాటి   తెల్లదొరలే మేలనిపిస్తు న్నారు . అందుకే నేనన్నానొకప్పుడు .  

తెల్లదొరలేగ నిప్పుడు

 నల్లదొరలె  దేశముందు నయవంచకులై  

కొల్లంగొట్టుచు  దేశము

తెల్లదొరలె నయమటం చులు తెలిపిరి మనకున్ .

అన్ని విలువల్నీ డబ్బుతో కొనేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే

అమ్ముడు పోవని వస్తువు

ఇమ్మహి  కనబడదు ని క్కమిది  తెలియవలెన్ 

 సొమ్మోక్కటున్న యీ దే

శమ్మున కొనలేని వస్తుజాలము కలదే

అంటే అతిశయోక్తి కాదు.

 కులదురభిమానం , మతదురభిమానం జాతీయ సమైక్యాన్ని దెబ్బతీస్తున్నాయి.   

కులము మతమ్మను  రెండే

లమానములిపుడు కావు గుణములు ఈ

కులమతవైషమ్యము గొ

గొడ్డలిపెట్టుగ దేశమంతటను వ్యాపించెన్

 అందుకే అంటున్నాను కలిస్తే నిలుస్తాం విడిపోతే పడి పోతాం.

ఇక సత్యం వద’ అనే మాటకు  ఒత్తు తగిలించి  సత్యాన్ని వధిస్తున్నారు.   ‘ధర్మం చర’ అని ధర్మాన్ని పాటించమంటే ‘చర’ అనే పదానికి వేరో అర్థం  లాగి ధర్మాన్ని మింగేస్తున్నారు. ఆనాడు వందేమాతరం అని గొంతెత్తి అరిస్తే  ఇప్పుడు ‘వంద ఏమాత్రం’ అని వేలకువేలు  గుంజుకుంటున్నారు.  

ఒకప్పుడు తెల్లదొరలు  హిందూ ముస్లిం, ఉత్తర దక్షిణ ఆర్య, ద్రావిడ భేదాలు మనలో  కల్పించి మన ఐక్యతను విచ్ఛిన్నం చేసి తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటే నల్లదొరలైన  మనవారు కూడ  అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు కుల,  మత, జాతి, ప్రాంతీయ భేదం రెచ్చ గొట్టి జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారు. ప్రజలు వారు  చూపించే తాత్కాలికమైన ప్రలోభాలకు లోనై మన సంస్కృతిని వ్యక్తిత్వాన్ని మరచి  ఆడమన్నట్లు ఆడుతూ , పాడమన్నట్లు పాడుతూ ఉన్నారు.  ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే మన జాతి మనుగడ అనుమానాస్పదమే.  కాబట్టి మనమంతా మనసా,  వాచా, కర్మణా ఏకం కావలసిన  తరుణం ఆసన్నమైంది. దుష్టశక్తులతో  కలసికట్టుగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. అందుకోసం మనలో గల సంకుచితమైన  ప్రాంతీయ తత్వాన్ని, భాషా తత్వాన్ని, జాతి, మత, బేధాలు విడిచిపెడదాం.  కులాన్ని గోడలకు, మతాన్ని మందిరాలకూ మాత్రమె   పరిమితం చేద్దాంద్దాం.  జాతి, కుల, మత, ప్రాంతీయ దురభిమానాలను విడిచిపెడితే  ఎటువంటి దుష్టశక్తి నైనా ఎదిరించి  నిలబడ గలుగుతాం . ఆనాడే వ్యక్తి సంక్షేమంతో పాటు దేశసంక్షేమం కూడ సాధించే వీలు కలుగుతుంది.  ముఖ్యంగా నేటి విద్యావంతులైన యువత నవసమాజనిర్మాణానికి కంకణం కట్టుకోవాలి. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా;  

విద్యార్థులు  దేశభావి  నిర్ణేతలురా  అన్న  మహాకవి మాటల్ని సార్థకం చేయాలి. పనులు ప్రయత్నిస్తే  సిద్ధిస్తాయిగాని  కేవలం ఉఉహాగానాలతో సిద్ధించవు. .  అందువల్ల నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, మేధావులు ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తామని  త్రివర్ణపతాకప్రతిష్ఠ  ఇనుమడింప చేస్తామని  లక్ష్యం  సిద్ధించే వరకు వదలి పెట్టమని ప్రతిజ్ఞ చేద్దాం.

                Arise and awake stop not.

                   Till the goal is reached

అనే   వివేకానందుని మాటలు తారక మంత్రంగా జపించి, ఆచరించి, సాధించి, తరలించాలని కోరుతూ సేవ మాత్రమె దీనికి సాధనంగా భావిస్తున్నాను.

నాఉద్దేశంలో  దేశసేవ ఇలా ఉండాలి.

బ్రతికున్న వారికంటెను

మృతి చెందిన వారె చాల మేలనిపించే .

 స్థితి నేడున్నది  యీదు

  స్థితినిర్ములనమె దేశ సేవయనదగున్.

                జై భారత్.

 

 

 

No comments: