వ్యక్తిత్వం –వకారపంచకం
డాక్టర్ . చిలకమర్తి
దుర్గాప్రసాద రావు
“వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ
వకార పంచకేనైవ నరో భవతి పూజిత:”
అన్నారు మన పెద్దలు . అంటే మనిషి
వ్యక్తిత్వాన్నిసూచించే అంశాలు ఐదు ఉన్నాయి. అవే౦టంటే వస్త్రం , రూపం , మాటతీరు , విద్య , వినయం అనేవి . వాటిగురించి క్రమంగా తెలుసుకుందాం .
1. వస్త్రం :
మొదటిది వస్త్రం . ఒక మనిషి ధరించే బట్టల వల్ల అతడు ఎటువంటి వాడో చాలవరకు అందరికి తెలుస్తుంది . అందువల్ల ప్రతివ్యక్తి తనకున్నంతలో ఎప్పుడు పరిశుభ్రమైన బట్టలనే ధరించాలి. మురికి బట్టలు
వేసుకో కూడదు . మంచి బట్టలే వేసుకోవాలి . ఆ బట్టలు వ్యక్తి యొక్క హుందాతనాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి . ఇక్కడ మంచిబట్టలంటే ఖరీదైన బట్టలని కాదు పరిశుభ్రమైన బట్టలని మాత్రమే . సమాజంలో కొంతమంది బట్టలను బట్టి గౌరవించేవారు కూడ ఉంటారు.
బట్టలను బట్టి వ్యక్తిని అంచనా వేయడం కేవలం మనుషుల్లోనే కాదు దేవతల్లో కూడ ఉంది . ఇక మనుషుల సంగతి వేరే చెప్పాలా!
విష్ణుమూర్తి పీతాంబరుడు కాబట్టి సముద్రుడు పిలిచి
పిల్లనిచ్చాడని శివుడు గజచర్మధారి కాబట్టి విషం ఇచ్చాడని మన పెద్దలు చమత్కరించారు
. ఈ విషయాన్ని వివరిస్తూ ఎప్పుడో నేనొక పద్యం కూడ వ్రాశాను .
భువిలో యోగ్యతకన్న వస్త్రమునకొప్పున్ భూషణాధిక్య
గౌ
రవముల్ పచ్చని బట్టవానికి మహద్ రాగంబుతోడందనూ
భవనిచ్చెన్ గజచార్మధారియగు నా
ఫాలాక్షుకాత్మోత్థీతో
గ్రవిషంబిచ్చె నదీకళత్రుడట వస్త్రంబే ప్రధానంబుగన్
అందువల్ల పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఎవరు ఆక్షేపించే విధంగా ఉ౦డకూడదు .
కుచేలినం దంతమలాపహాసినం
బహ్వాశన౦ నిష్ఠురవాక్యభాషిణ౦
సూర్యోదయే చాస్తమాయే చ శాయినం
విముంచతి శ్రీ రపి చక్రపాణిన౦
అనే సూక్తి ఒకటుంది . మాసిపోయిన బట్టలు వేసుకున్న
వాణ్ణి, ముఖం కడుక్కోని వాణ్ణి, అతిగా తినే వాణ్ణి, కఠినంగా మాట్లాడేవాణ్ణి, సూర్యోదయ - సూర్యాస్తమయ వేళల్లో పడుకునే వాణ్ణి లక్ష్మి దరిజేరదట. ఒక
వేళ ఆ పనులు విష్ణువు చేస్తున్నా అతన్ని విడిచి పెట్టేస్తు౦దట.
ఇక ఈ కాలంలో కొంతమంది ఫ్యాషన్ పేరుతో అసభ్యకరమైన , అర్ధనగ్నంగా ఉండే బట్టలు ధరిస్తున్నారు .! ఒకడు ముందు in-shirt చేసు కున్నాడు . వెనకాల
in-shirt చేసుకోలేదు. వాడి స్నేహితుడు అడిగాడు ఏరా! ముందు in-shirt ఎందుకు చేసుకున్నావు
? సమాధానం: - చొక్కాచిరిగి పోయింది . మరి వెనుక in-shirt ఎందుకు చేసుకోలేదు ? పేంటు చిరిగిపోయింది .
ఇదీ సమాధానం . ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే నామోషి
. కాని ఇప్పుడు బట్టలు చింపుకుని మరీ వేసుకుంటున్నారు . ఇది మరీ విడ్డూరం .
కాబట్టి మనిషి ఇతరులు ఆక్షేపించే విధంగా కాకుండా పరిశుభ్రమైనవి , సంస్కారం ఉట్టి పడేటటువంటి బట్టలు ధరించాలి.
2. రూపం :- ఇది రెండో అంశం . మనిషి రూపాన్ని బట్టి కూడ ఒక్కొక్కప్పుడు
వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. “యత్రాకృతి:
తత్ర గుణా: భవంతి” అన్నారు
మన పెద్దలు . ఎక్కడ రూపం ఉంటుందో అక్కడ గుణాలు కూడ ఉంటాయని ప్రతీతి . అంటే అందంగా ఉన్న ప్రతివాడు మంచివాడని అందవికారంగా ఉన్నవాడు చెడ్డవాడని అర్థంకాదు . రూపం
గుణాన్ని చాటే అంశాల్లో ఒకటని మాత్రమే. అందువల్ల ప్రతిమనిషి తనకున్నంతలో అందంగా , హుందాగా గంబీరంగా కనిపించాలి .
౩. వాక్కు :- ఇది మూడోది . మనిషి వ్యక్తిత్వం
మాటతీరును బట్టి చెప్పొచ్చు . కొంతమంది మృదువుగా మాట్లాడతారు , కొంతమంది కఠినంగా మాట్లాడతారు . ఎంతో కఠినమైన
విషయాన్ని కూడ మృదువుగా చెప్పొచ్చు . కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని చాల కఠోరంగా
మాట్లాడతారు . అందువల్ల ఇతరులకు బాధకలగకుండా మాట్లాడ గలగాలి .
4. విద్య :- ఇది నాల్గో అంశం .
మనిషికి విద్య నిజమైన అలంకారం . విద్యలేని వాడు
వింతపశువు అన్నారు మన పెద్దలు . ఇప్పుడు చదువుకొన్నవాడు సంతపశువుగా
ప్రవర్తిస్తున్నాడు . సరే ! ఆ విషయం అలా ఉంచుదాం . ప్రతి తల్లి , తండ్రి తమపిల్లల్ని విధిగా చదివి౦చాలి.
"మాతా శతుర్ : పితా వైరీ యేన బాలో న పాఠిత:
న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా" అంటుంది పంచతంత్రం .
పిల్లల్ని చదివి౦చని తల్లి , తండ్రి వారి పాలిట శత్రువులట. ఎందుకంటే చదువులేని వాడు సమాజంలో హంసలమధ్య కొంగలా
తేలిపోతాడట. అంతేకాకుండా “పుత్ర:
శత్రు: అపండిత:” అని కూడ చెబుతుంది పంచతంత్రం . అంటే చదువుకోని కుమారుడు, కుమార్తె తల్లితండ్రుల పాలిట శత్రువులట . అందువల్ల తల్లి దండ్రులు విధిగా
తమపిల్లల్ని చదివించాలి . పిల్లలు విధిగా చదువుకోవాలి .
5. వినయం :- ఇది ఐదవ అంశం . చదువు ఎంత ముఖ్యమో
చదువుతో పాటు వినయం కూడ అంతే ముఖ్యం. అందువల్ల మనిషి ఎంత విద్యావంతుడౌతాడో అంత వినయవంతుడు కూడ కావాలి . వినయంలేని విద్య వాసన
లేని పువ్వు వంటిది . అది ఎవరికీ ఉపయోగ పడదు . తనకు కూడ ప్రమాదాన్ని తెచ్చి
పెడుతుంది . మనిషి ఈ ఐదు అంశాలను పరిశీలించి తగిన విధంగా
జాగ్రత్తగా మసలుకుంటే అది వ్యక్తిత్వవికాసానికి దోహదం చేస్తుంది .
>>>>><<<<<
No comments:
Post a Comment