Friday, May 23, 2025

ఆంధ్రులు-అద్వైత సేవ అధ్యాయం-3 (యోగ దర్శనం) . డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

ఆంధ్రులుఅద్వైత వేదాంత సేవ


అధ్యాయం-3

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ ,

M.A. (సంస్కృతం), M. A. (తెలుగు)

M.A. (తత్త్వశాస్త్రం), Ph. D (సంస్కృతం)  

 

ఆస్తిక దర్శనాలు (యోగ దర్శనం )


                                                  యోగదర్శన ప్రవర్తకుడు పతంజలి.  ఆయన మనకందించిన యోగ సూత్రాలు ఈ దర్శనానికి మూలస్తంభాలు . యోగ అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి . సంయోగో యోగ ఇత్యుక్త: జీవాత్మపరమాత్మనో: అని కొందరు,  యోగ: కర్మసు కౌశలం అని కొందరు, అప్రాప్త ప్రాప్తి: యోగ: ప్రాప్తస్య రక్షణం క్షేమ: అని “యోగ: సమచిత్తతా” అని ఎన్నెన్నో అర్థాల్లో ఈ యోగశబ్దాన్ని ఉపయోగించడం మనం గమనిస్తాం. పతంజలిమహర్షి “యోగ: చిత్తవృత్తినిరోధ:” అని నిర్వచించారు. చిత్తవృత్తులను నిరోధించడమే యోగం.

అనగా మనస్సును తన వ్యాపారములనుండి మరలించుట అని అర్థం. అలా చేస్తే మనస్సును లయింప జేసిన జీవుడు సాక్షీ భూతమైన కేవల చైతన్య స్వరూపియై యుంటాడు.( తదా ద్రష్టు:స్వరూపే అవస్థానమ్)      అదియే ఆ జీవుని నైజస్దితి, ప్రపంచమంతా దృశ్యo. ఈ దృశ్యo మనస్సు నాకర్షించి, పలుపలువిధాలుగా పరుగెత్తిస్తుంది. (సూ.4.వృత్తి సారూప్య మితరత్ర) అట్లు లోబడిన మనస్సు ప్రకృతిబంధములందు చిక్కుపడి, జనన, మరణ కూపమగు సంసారప్రవాహమున జీవుని కూలద్రోస్తుంది. ఆ ప్రకారం దృశ్యము నుండి దృక్ ను మరలిoచిన, జీవుడు క్రమంగా కైవల్య స్ధితి యనగా మోక్షము పొందుతాడు .

మనస్సునకు ఐదు వృత్తులు, అనగా ఐదు రకములగు వ్యాపారములుంటాయి . ఆ యా వ్యాపారములందు లగ్నమైన మనస్సు తద్వ్యాపారసారూప్యమును పొందుతుంది . అనగా ఆ యా వ్యాపారములందు మగ్నమైపోతుందని అర్థం . అవి ఐదు విధములు. (సూ.5.వృత్తయః పంచతయ్యః క్లిష్టా:అక్లిష్టాః )

అవి మరల క్లిష్టాః, అక్లిష్టాః అని మరల రెండు రకాలు . కర్మవాసనకు క్షేత్రీభూతమై, పలువిధముల పరుగిడుచు దుఃఖమును కలుగజేయు వృత్తులు క్లిష్టములని జెప్పబడును. అట్లుగాక “నేను వేఱు ఈ ప్రపంచము నా మనస్సును విక్షిప్తము జేయునది.”అని గుర్తించి జీవునకు వివేక ఖ్యాతిని కలిగించు వృత్తులు అక్లిష్టము లనబడును. పురుషః అనగా పురౌ= దేహమందు, శేతే= పరుండియున్న సాక్షీ భూతమైన , దృగ్రూపమైన చైతన్యము.

ఈ విశుద్ధ చైతన్యమును, మనస్సు, అగ్నిని పొగ వలె గప్పివేసి, ప్రపంచ వస్తు భోగమందు వ్యాపారింపచేస్తుంది .

భోగాలాలసమైన మనస్సు జీవుని జనన, మరణ రూపమైన సంసారచక్రమందు పరిభ్రమింప జేస్తుంది.

ఆ ఐదు వృత్తులేవంటే 1.ప్రమాణ,2. విపర్యయ,3. వికల్ప 4. నిద్రా5. స్మృతయః

ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర,

స్మృతి యనునవి. అనగా చిత్తమీ యైదు అవస్థల యందు ప్రవర్తించు చుండును.

యోగశాస్త్రo  ఈ జ్ఞానం  చిత్తవ్యాపారము వలన బుట్టినది గాబట్టి దీన్నిగూడ అరికట్టాలని చెపుతుంది. అనగా చిత్తాన్ని సర్వవిధదృశ్యాల నుండి మరల్చవలయునని తాత్పర్యం . ప్రమాణములు అనగా జ్ఞానసాధనాలు .

విపర్యయః= విపర్యమనగా , మిధ్యాజ్ఞానము= అబద్ధమైన జ్ఞానము; అతద్రూపప్రతిష్టితమ్ = అనగా అతస్మిన్  తద్బుద్ధి: = అది గాని యందు అది యను భ్రాంతి, శుక్తి యందు అనగా ముత్యపుచిప్పయందు , రజతభ్రాంతి= వెండియను భ్రాంతి, రజ్జు సర్పభ్రాంతి = త్రాటి యందు పాము అనెడు భ్రాంతి

ఈ భ్రాంతులు విపర్యయ జ్ఞానము. ఈ విపర్యయ జ్ఞానములందు మనస్సు వ్యాపారించుట ఎట్లు తగదో , ప్రత్యక్షానుమానములoదు గూడ వ్యాపారించుట తగదనియే యోగశాస్త్ర సిద్దాంతము.

యోగ సాధనకు  ఒక ఎనిమిది మెట్లు ఉన్నాయి . అవి క్రమంగా : యమము, నియమము, ఆసనము , ప్రాణాయామము, ప్రత్యాహారము,  ధ్యానము , ధారణ మరియు సమాధి.  ముక్తికి  ఈ ఎనిమిది సాధన మార్గాలు . దీన్నే అష్టాంగ యోగమార్గమని కూడ పిలుస్తారు.

1. యమము. అహింసా సత్యమస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహా:  యమా: . అహింస  అంటే ఎవరిని శారీరకంగాగాని, మానసికంగాగాని హిం సిం చకుం డా ఉండడం , సత్యం మాట్లాడడం, దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అంటే ఏ వస్తువును ఎవరి నుండి ఉచితంగా తీసుకోక పోవడం

2.  నియమము : శౌచ, సంతోష, తప:, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమా: . శౌచమంటే బాహ్యంగాను , అంతరంగం లోను  శుచిగా ఉండడం , ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం , తపస్సు , వేదాధ్యయనం , ప్రతి పని యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణ చెయ్యడం.

          3. ఆసనం: స్థిర సుఖమాసనం. ఇవి చాల ఉన్నాయి.

           4.  ప్రాణాయామం: ఇది పూరక, రేచక  కుంభకములని మూడు విధాలు. గాలిని పీల్చడం, కొంత సమయం స్తంభింప చెయ్యడం  తరువాత మెల్లగా విడిచిపెట్టడం .

               5 . ప్రత్యాహారం : ఇంద్రియాలను వాటి వాటి వ్యాపార కేంద్రాలనుండి నివర్తిం పచేయడం .

              6. ధారణ: నివర్తింప చేసిన ఇంద్రియాలను ఒక ప్రదేశానికి చేర్చడం

7. ధ్యానం : నివర్తింప చేసిన ఆ ఇంద్రియాలను ఒక వస్తువుపై నుంచి తదేకంగా ధ్యానం చెయ్యడం.

8. సమాధి : మనస్సును పూర్తిగా లీనం చెయ్యడం.

ఈ సమాధి సంప్రజ్ఞాత సమాధి – అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు . సంప్రజ్ఞాత సమాధి మరల నాలుగు రకాలు. అసంప్రజ్ఞాత సమాధి సర్వోన్నతం.

                                     <><><>

ఆంధ్రులు-అద్వైత సేవ అధ్యాయం-3 (సాంఖ్య దర్శనం) డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదా రావు

 

ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ

అధ్యాయం-3

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదా రావు

 

ఆస్తిక దర్శనాలు(సాంఖ్య దర్శనం)

 

             వేదప్రామాణ్యాన్ని అంగీకరించే దర్శనాలను ఆస్తిక దర్శనాలని పిలుస్తారు . అవి సాంఖ్యం , యోగం; న్యాయం, వైశేషికం; పూర్వమీమాంస, ఉత్తరమీమాంసలు. ఆస్తికదర్శనాల్లో సాంఖ్యదర్శనం చాల పురాతనమైనది. సిద్ధాంత స్థాపకుడు కపిలమహర్షి. ఈయన సాక్షాత్తుగా భగవత్స్వరూపుడని “సిద్ధానాం కపిలో ముని:”

10/26 సిద్దులలో నేను కపిలమునిని అనే గీతావాక్యం వలన తెలుస్తోంది . రాధాస్వామీ మత ప్రవర్తకులలో ఒకరైన పరమపురుషులు శ్రీ సాహబ్జీమహారాజు వారు కపిలుని గొప్ప జ్ఞాని గాను Master of self-created mind గాను అభివర్ణించారు . కపిలుడు ధర్మ , జ్ఞాన , వైరాగ్య, దివ్యైశ్వర్య సంపన్నుడని అందరి వలే లోకధర్మాలకు బద్ధుడు కాకుండా కేవలం తన కోరిక మీదనే లోకల్యాణం కోసం తనను తాను సృష్టించుకున్న మహామనీషి అని కొనియాడేరు. ఆయన తన శిష్యుడైన అసురి మునికి ఈ సిద్ధాంతాన్ని బోధించగా ఆయన శిష్య ప్రశిష్యుల ద్వారా సమస్త లోకానికి విస్తరించింది.

సాంఖ్యం అంటే యథార్థ జ్ఞానం, లేదా పరిపూర్ణ జ్ఞానం అని అర్థం . ప్రకృతి పురుషుల తారతమ్య వివేచన కలిగి ప్రకృతిలో జరుగు చున్న ప్రతి ప్రక్రియ తనకు సంబంధము లేదని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే      పరిపూర్ణ జ్ఞానం. అలాగే సంఖ్య అంటే number.  దాని నుండి సాంఖ్య అనే పదం వచ్చింది . ఈ సిద్ధాంతం   ఇరువది ఐదు తత్త్వాలతో కూడి ఉండడం వల్ల కూడ దీనికి సాంఖ్యమనే పేరు సార్థకమయింది.

                   ఈ లోకంలో ప్రతి మనిషి 1 ఆధిభౌతికం, 2. ఆధిదైవికం,  3. ఆధ్యాత్మకం అని మూడు విధాల దు:ఖాలననుభవిస్తున్నాడు. మనకు మనుష్యులవల్ల, మృగాలు , పక్షుల వల్ల కలిగే దు:ఖం ఆధిభౌతికం; యక్ష, రాక్షస  గ్రహాదుల వల్ల కలిగే దు:ఖం ఆధిదైవికం. ఇక మూడవ దైన ఆధ్యాత్మిక దు:ఖం మరల శారీరం , మానసం అని రెండు రకాలు. వాత, పిత్త, శ్లేష్మాల వలన కలిగేది శరీరానికి సంబంధిoచినది.   కామ, క్రోధాదుల వలన కలిగే దు:ఖం మానసిక దు:ఖం. ఇవి జ్ఞానం వలననే తొలగిపోతాయి. అటువంటి యథార్థమైన జ్ఞానాన్ని తెలిపేదే సాంఖ్యం . సాంఖ్య సిద్దాంతం చాల క్లుప్తంగా తెలుసు కుందాం .

 

ఈ సిద్దాంతం ప్రకారం ముందుగా  ప్రకృతి(1) ఉంది . ప్రకృతి నుండి  మహత్తు(2) దాని నుంచి  అహంకారం (3) శబ్ద, స్పర్శ, రూపం, రసం, గంధం అనే  తన్మాత్రలు (5) ఉత్పన్న మయ్యాయి . వాటి నుండి మనస్సు (1)  భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు  (5) చర్మం , కన్ను , చెవి , ముక్కు , నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలు  (5) నోరు , చేయి , కాలు , జననేంద్రియం, విసర్జనేంద్రియం అనే ఐదు కర్మేంద్రియాలు    (5)1+5+5+5=(16) మరియ పురుషుడు అనే పదునారు తత్త్వాలు పుట్టాయి . ఇవి కాక పురుషుడు ఒక ప్రత్యెక మైన  తత్త్వం.  మొత్తం అన్నీ కలిసి  1+7+16+1=25 తత్త్వాలు . మూలప్రకృతి దేని నుండి పుట్టలేదు కాబట్టి అది అవికృతి. మహత్తు , అహంకారం ,   శబ్ద - స్పర్శ - రూప -రస గంధం అనే ఐదు మొత్తం ఈ ఏడు ప్రకృతులు, వికృతులు కూడ ఔతున్నాయి. ఎందుకంటే అవి ప్రకృతి నుండి పుట్టడం వల్ల వికృతులు ;    వాటి నుండి  భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచ భూతాలు  (5) చర్మం , కన్ను , చెవి , ముక్కు , నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలు  (5) నోరు , చేయి , కాలు , జననేంద్రియం, విసర్జనేం ద్రియం అనే ఐదు కర్మేంద్రియాలు    (5)1+5+5+5=(16) అనే పదునారు తత్త్వాలు పుట్టడం వలన వాటికి ప్రకృతులు అవుతున్నాయి . ఇక ఆ పదునారు తత్త్వాలనుండి  ఏవీ పుట్టక పోవడం చేత అవి వికృతులు మాత్రమే. ఇక పురుషుడు దేని నుండి పుట్టక పోవడం వలన పురుషుని నుండి ఏదీ పుట్టక పోవడం వలన పురుషుడు ప్రకృతి గాని వికృతి గాని కాజాలడు. .

మూల ప్రకృతిరవికృతి: (1)

మహదాద్యా: ప్రకృతి వికృతయ: సప్త (7)

షోడశకస్తు వికార: (16)

  ప్రకృతి: న వికృతి: పురుష: (1)

అనే మాటలను బట్టి తెలుస్తోంది.

సాంఖ్యసిద్దాంతం 1. ప్రత్యక్షం 2. అనుమానం 3. ఆగమం అని మూడు ప్రమాణాలను అంగీకరిస్తుంది.

ప్రత్యక్ష ప్రమాణానికి ఎనిమిది హద్దులు (పరిధులు) న్నాయి. 1. చాలాదూరంలో ఉన్న ఆకాశంలో ఎగిరే పక్షి మనకు కనిపించదు.  2. చాల దగ్గరలో ఉన్న మనకంటి రెప్ప మనకు కనిపించదు. 3. కన్నుపోతే ఏమీ కనిపించవు. 4. మనస్సు నిలకడ లేకపోతే ఏదీ కనిపించదు. 5. చాల సూక్ష్మమైన అణువు, పరమాణువు మనకు కనిపించవు.

6. ఏదైనా అడ్డు ఉంటే మనకు కనిపించదు. గోడ వెనుక ఉన్న వస్తువులు మనకు కనిపించవు. 7. సూర్యకాంతిలో నక్షత్రాలు మనకు కనిపించవు . 8. సమూహంలో ఉన్న ఒక వస్తువు  ఉదాహరణకు ఒక K. G మినుగుల్లో ఉన్న ఒక చిన్న రాయి మనకు సరిగా కనిపించదు. అందుకే మిగిలిన రెండు ప్రమాణాలను కూడ స్వీకరించింది .

సాంఖ్యులు సత్కార్య వాదులు . అనగా కార్యం కారణం లోనే దాగి ఉంటుంది.

ప్రకృతి, పురుషుని సహకారంతోనే సృష్టి కొనసాగిస్తుంది. ప్రకృతి జడం కావడం వల్ల పురుషుడు నిష్క్రియుడు కావడం వల్ల స్వతంత్రంగా సృష్టి చెయ్య లేరు. కుంటివాడు నడువలేడు, గ్రుడ్డి వాడు చూడలేదు కాని వారిద్దరు కలిస్తే  చాల పనులు చేయగలరు.

पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य

पंग्वन्धवदुभयॊरपि संयॊगस्तत्कृत:  सर्ग: ( 21)

సాంఖ్యం పురుష బహుత్వాన్ని అంగీకరిస్తుంది. ఏ విధంగా చంద్రునిలో ఉండే ప్రకాశం చంద్రునిది కాక సూర్యునిదే  ఔతుందో అదే విధంగా.  ప్రకృతి చేతనా రహితమైనప్పటికి ప్రకృతిలో  ఉండే సత్త్వగుణం వలన అది ప్రకాశవంతంగా అనిపిస్తుంది . కాని అది పురుషగత ప్రకాశన శక్తి మాత్రమె . పురుషుడు నిరంజనుడు , నిష్క్రియుడు . త్రిగుణాత్మకమైన ప్రకృతి లోజరిగే దేని తోనూ పురుషునకు సంబంధం లేదు. సంబంధం కల్పించుకోవడం బంధం , తొలాగించుకోవడం మోక్షం .  భగవద్గీతలోకూడ

ప్రకృత్యా: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ:

అహంకార విమూఢాత్మా కర్తాsహమితి మన్యతే         అని సాంఖ్య సిద్దాంతం సూత్ర ప్రాయంగా వివరించడం జరిగింది. ఈ ప్రకృతిలో జరిగే క్రియా కలాపాలతో నా కెటు వంటి సంబంధం లేదని అనుభవపూర్వకంగా పురుషుడు తెలుసుకోవడమే యథార్థ జ్ఞానం . దానివల్ల ముక్తి లభిస్తుంది .

అది జీవన్ముక్తి , విదేహముక్తి అని రెండు విధాలు. జ్ఞానం వచ్చిన తరువాత శరీరత్యాగా పర్యంతం జీవన్ముక్తి , తదనంతరం విదేహ ముక్తి. ఫ్యాన్ switch off చేసినా వెంటనే ఆగిపోకుండ కొన్ని rounds తిరుగుతుంది . జ్ఞానప్రాప్తికి శరీర పతనానికి ఎటువంటి సంబంధం లేదు కదా!