Tuesday, May 13, 2025

బొట్టుబిళ్లోపాఖ్యానం DR. CHILAKAMARTHI DURGAPRASADA RAO

                                                 బొట్టుబిళ్లోపాఖ్యానం

DR. CHILAKAMARTHI DURGAPRASADA RAO

M.A (Sanskrit), M.A (Telugu), M.A (Philosophy)

 & Ph. D (Sanskrit)

ఒకసారి ఒకావిడ నన్ను  “అయ్యా! భర్త పోతే బొట్టు తీసేయాలా తీయవలసిన  అవసరం లేదా”  అని ఒక ప్రశ్న అడిగారు. నేను “ఎవరి వల్ల ఏది వస్తుందో వారు లేక పోతె అది తీసేయ్యాలమ్మా! ఇక బొట్టు మొగుడి వల్ల రాలేదు. చుట్లు  మొగుడి వల్ల వచ్చాయి. అందువల్ల బొట్టు తీసెయ్యవలసిన అవసరం లేదు. చుట్లు మాత్రం  తీసేయాలి అన్నాను.  బొట్టు విలువ తెలిసిన వారెవరూ అది తీసెయ్యమనరు. బొట్టు ఎందుకు పెట్టుకొవాలో తెలుసుకోవాలనుకుంటే వినండి అని ఒక విషయం చెప్పాను.

అదంతా విన్నాక ఆవిడ నేను బొట్టు తియ్యనండి, తియ్యను గాక తియ్యను అంది . సంతోషం తల్లీ  వెళ్లి, రామ్మా! అన్నాను.

ఇంతకు నేను ఆమెకు చెప్పిన విషయమేమిటంటే “ అమ్మా! భారతీయ సంస్కృతిలో బొట్టుకు చాల ప్రాధాన్యం  

ఉంది. ఇది అందరికీ అర్థం కాదు . వాళ్లకి ఎంత చెప్పినా తెలియదు. ఆత్మ శక్తి (చైతన్యం)  శరీరమంతా ప్రవహిస్తున్నా దాని స్థానం రెండు కను బొమలకు, నాసికా మూలానికి సమీపంలో సుమారు ఒకటిన్నర లేదా  రెండు అంగుళాల లోపల ఉంటుoదని యోగులు చెపుతున్నారు . భగవద్గీత కూడ భ్రూమధ్యం అని చెపుతుంది.     ఒక విధంగా చెప్పాలంటే అదే మనం బొట్టు పెట్టుకునే స్థానం . అది చాల పవిత్రమైనది, ప్రభావ పూర్ణ మైనదీని. ఆ ప్రదేశాన్ని, దాని పవిత్రతను మనకు జ్ఞాపకం చెయ్యడానికే, బొట్టు పెట్టుకోవడం అనే ఆచారాన్ని మనకు అలవాటు చేశారు.    

బొట్టు పెట్టుకునేటప్పుడు మన దృష్టి ఆ ప్రదేశంపై  కేంద్రీకృతం అవుతుందని, తద్ద్వారా మనస్సు పదే పదే ఆత్మస్థానం వైపునకు  మరలుతుందని  మన పెద్దలు అభిప్రాయ పడ్డారు. బొట్టు కేవలం అందం కోసం కాదు.            

 ఒకసారి ఉపనయనం మాట కొద్దాం. ఉపనయనం అనే పదానికి రెండు అర్థాలున్నాయి . ఒకటి ‘ఉప’ సమీపానికి నయనం తీసుకుని వెళ్ళడం; రెండు ‘ఉప’ సమీపంలో ఉన్న నయనం నేత్రం అంటే జ్ఞాననేత్రాన్ని తెరిపించడము.  ఇక పూర్వం  ఉపనయనంలో తండ్రి గాయత్రీ మంత్రం ఉపదేశించగానే ఒక్కసారిగా వటువునకు ఆత్మానుభూతి కలిగేది . ఆ తరువాత మామూలు స్థితికి వచ్చేసేవాడు. కాని ఒకసారి ఆత్మానుభూతి రుచిచూసిన వాడు కావడంవల్ల , రుచి మరిగినవానిలా   పదే పదే దానికోసమే ప్రాకులాడేవాడు, కాలాంతరంలో సాధించే వాడు . ఇప్పుడా పరిస్థితి లేదు . పెళ్ళికోసం ఉపనయనం జరిపిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆత్మ సాధనకై బొట్టు అలవాటు చేశారు. బొట్టు పెట్టుకునే టప్పుడు మన మనసంతా బొట్టు పెట్టుకునే చోటు మీదనే కేoద్రీకరించ బడుతుంది కాబట్టి   ఆ ప్రదేశంలో మనసును కేంద్రీకరిస్తే అవ్యక్తమైన, విగలితవేద్యాంతరమైన  ఆనందానుభుతి కలుగుతుంది. రోజు రోజుకు రెండు మూడుసార్లు ఈ సాధన వలన క్రమంగా మనస్సు ఆత్మ వైపునకు ఆకర్షించబడుతుంది . మనస్సును అంతర్ముఖం చేసిన వాడు బాహ్యమైన విషయాలపట్ల ఆసక్తి చూపించడం తగ్గించుకుంటాడు . ఉన్నదంతా లోపలే ఉంది, బయట ఏమీ లేదని తెలుసుకుంటాడు . అందుకే ఉపనిషత్తులకే తలమానికమైన కఠోపనిషత్తు ఆత్మసాధనను ప్రస్తావిస్తూ:   

      “కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్షత్

ఆవృత్త చక్షు: అమృతత్వమిచ్ఛన్” అంది.

అంతెందుకు మనం స్వామిని దర్శించుకోడానికి తిరుపతికి ఎంతో కష్టపడి వెళతాం. కాని విగ్రహం దగ్గరకు వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం . తీరా  కళ్ళు తెరిచేటప్పటికి బయటెక్కడో ఉంటాం . ఇది చాల వింతగా అనిపిస్తుంది . అంత కష్టపడి వెళ్ళడం దేనికి? అక్కడ రెండు కళ్ళు మూసు కోవడం దేనికి?    కాని అది చాల మంచి పని . మనకు తెలియకుండానే మనం ఒక మంచి పని చేస్తున్నాం. చూడవలసింది లోపలే ఉంది , బయటెక్కడో కాదు . ఇక మరో విషయం ఏమిటంటే ఈ ప్రపంచమంతా చైతన్యమయం . (సర్వం ఖల్విదం బ్రహ్మ , నేహ నానాస్తి కించన)  ఈ చైతన్యం ఒక్కటే అయినా వ్యవహారంలో భౌతికం , మానసికం , ఆత్మసంబంధి అని మూడు విధాలుగా కనిపిస్తోంది. భౌతిక చైతన్యం (Physical Consciousness) ఇతరులను చూడలేదు . తనను తాను చూసుకోలేదు. ఒక కుర్చీ మరొక కుర్చీని చూడలేదు , తనను తాను చూసుకోలేదు. రెండోది మనశ్చైతన్యం ( Mental Consciousness) మనస్సు మరో వస్తువును చూస్తుంది, గాని తనను తాను చూసుకోలేదు . ఇక మూడోది ఆత్మ చైతన్యం ( Spiritual Consciousness). ఇది ఇతరులనూ చూస్తుంది తనను తాను  కూడ చుసుకోగలదు. అందుకే ఉపనిషత్తు- శాంతో దాంత: ఉపరత: తితిక్షు: శ్రద్ధావిత్త: సమాహితో భూత్వా అత్మన్యేవాత్మానం పశ్యేత్ అంది.

కాబట్టి చూడవలసినదంతా లోపలనే ఉంది . మనలోనే ఉంది . ఆ అనుభూతి కలిగించడం కోసమే బొట్టు .

ఇది పెట్టుకునే వాళ్ళని పెట్టుకోనివ్వండి . తీసేసే వాళ్ళని తీసేసుకోనివ్వండి . ఎవ్వరినీ ఆక్షేపిoచకండి. ఇప్పుడు అంటింపు బొట్లు వచ్చాయి . ఇవి గాలికి చెదరవు, చెమటకు కరగవు.

ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఎందరో భక్తులు  ఉండేవారు. ఒకసారి స్వాముల వారు మారిపోయారు . ఒక్కసారి భక్తులలో కూడ ఊహించని రీతిలో మార్పులొచ్చాయి. ఆడువారి సంఖ్య క్రమ క్రమగా పెరిగి పోతూ ఉంది. మగవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఊరిలో అలజడి మొదలైంది. ప్రభుత్వం వారు నిఘా వేశారు . చివరకు తేలిందేమిటంటే కొత్తగా వచ్చిన స్వామి తన కాళ్ళకు మ్రొక్కిన ఆడవారందరికి బొట్టు బిళ్ళల packets పంచడం మొదలు పెట్టారు. అదీ అసలు కారణం.

             <><><>        

            

No comments: