ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ
అధ్యాయం-3
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదా రావు
ఆస్తిక దర్శనాలు(సాంఖ్య దర్శనం)
వేదప్రామాణ్యాన్ని
అంగీకరించే దర్శనాలను ఆస్తిక దర్శనాలని పిలుస్తారు . అవి సాంఖ్యం , యోగం; న్యాయం, వైశేషికం; పూర్వమీమాంస, ఉత్తరమీమాంసలు. ఆస్తికదర్శనాల్లో సాంఖ్యదర్శనం చాల
పురాతనమైనది. సిద్ధాంత స్థాపకుడు కపిలమహర్షి. ఈయన సాక్షాత్తుగా భగవత్స్వరూపుడని
“సిద్ధానాం కపిలో ముని:”
10/26 సిద్దులలో నేను కపిలమునిని అనే గీతావాక్యం వలన తెలుస్తోంది . రాధాస్వామీ మత ప్రవర్తకులలో ఒకరైన
పరమపురుషులు శ్రీ సాహబ్జీమహారాజు వారు కపిలుని గొప్ప జ్ఞాని గాను Master of self-created
mind గాను అభివర్ణించారు . కపిలుడు ధర్మ , జ్ఞాన , వైరాగ్య, దివ్యైశ్వర్య
సంపన్నుడని అందరి వలే లోకధర్మాలకు బద్ధుడు కాకుండా కేవలం తన కోరిక మీదనే లోకల్యాణం
కోసం తనను తాను సృష్టించుకున్న మహామనీషి అని కొనియాడేరు. ఆయన తన శిష్యుడైన అసురి
మునికి ఈ సిద్ధాంతాన్ని బోధించగా ఆయన శిష్య ప్రశిష్యుల ద్వారా సమస్త లోకానికి
విస్తరించింది.
సాంఖ్యం అంటే యథార్థ జ్ఞానం, లేదా పరిపూర్ణ జ్ఞానం అని అర్థం . ప్రకృతి పురుషుల తారతమ్య వివేచన కలిగి
ప్రకృతిలో జరుగు చున్న ప్రతి ప్రక్రియ తనకు సంబంధము లేదని అనుభవ పూర్వకంగా
తెలుసుకోవడమే పరిపూర్ణ జ్ఞానం. అలాగే
సంఖ్య అంటే number. దాని నుండి సాంఖ్య అనే పదం వచ్చింది . ఈ
సిద్ధాంతం ఇరువది ఐదు తత్త్వాలతో కూడి
ఉండడం వల్ల కూడ దీనికి సాంఖ్యమనే పేరు సార్థకమయింది.
ఈ లోకంలో ప్రతి మనిషి 1
ఆధిభౌతికం, 2. ఆధిదైవికం, 3. ఆధ్యాత్మకం అని మూడు విధాల
దు:ఖాలననుభవిస్తున్నాడు. మనకు మనుష్యులవల్ల, మృగాలు , పక్షుల వల్ల కలిగే దు:ఖం ఆధిభౌతికం; యక్ష, రాక్షస గ్రహాదుల వల్ల కలిగే దు:ఖం
ఆధిదైవికం. ఇక మూడవ దైన ఆధ్యాత్మిక దు:ఖం మరల శారీరం , మానసం అని
రెండు రకాలు. వాత, పిత్త, శ్లేష్మాల వలన కలిగేది శరీరానికి సంబంధిoచినది. కామ, క్రోధాదుల వలన
కలిగే దు:ఖం మానసిక దు:ఖం. ఇవి జ్ఞానం వలననే తొలగిపోతాయి. అటువంటి యథార్థమైన
జ్ఞానాన్ని తెలిపేదే సాంఖ్యం . సాంఖ్య సిద్దాంతం చాల క్లుప్తంగా తెలుసు కుందాం .
ఈ సిద్దాంతం ప్రకారం ముందుగా ప్రకృతి(1) ఉంది . ప్రకృతి నుండి మహత్తు(2) దాని నుంచి అహంకారం (3) శబ్ద, స్పర్శ, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు (5) ఉత్పన్న
మయ్యాయి . వాటి నుండి మనస్సు (1) భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే
పంచభూతాలు (5) చర్మం , కన్ను , చెవి , ముక్కు , నాలుక అనే ఐదు
జ్ఞానేంద్రియాలు (5) నోరు , చేయి , కాలు , జననేంద్రియం, విసర్జనేంద్రియం
అనే ఐదు కర్మేంద్రియాలు (5)1+5+5+5=(16) మరియ పురుషుడు అనే పదునారు తత్త్వాలు పుట్టాయి .
ఇవి కాక పురుషుడు ఒక ప్రత్యెక మైన
తత్త్వం. మొత్తం అన్నీ కలిసి 1+7+16+1=25 తత్త్వాలు . మూలప్రకృతి దేని నుండి పుట్టలేదు
కాబట్టి అది అవికృతి. మహత్తు , అహంకారం , శబ్ద - స్పర్శ - రూప -రస గంధం అనే ఐదు మొత్తం
ఈ ఏడు ప్రకృతులు, వికృతులు కూడ ఔతున్నాయి. ఎందుకంటే అవి ప్రకృతి
నుండి పుట్టడం వల్ల వికృతులు ; వాటి
నుండి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచ
భూతాలు (5) చర్మం , కన్ను , చెవి , ముక్కు , నాలుక అనే ఐదు
జ్ఞానేంద్రియాలు (5) నోరు , చేయి , కాలు , జననేంద్రియం, విసర్జనేం
ద్రియం అనే ఐదు కర్మేంద్రియాలు (5)1+5+5+5=(16) అనే పదునారు తత్త్వాలు పుట్టడం వలన వాటికి
ప్రకృతులు అవుతున్నాయి . ఇక ఆ పదునారు తత్త్వాలనుండి ఏవీ పుట్టక పోవడం చేత అవి వికృతులు మాత్రమే. ఇక
పురుషుడు దేని నుండి పుట్టక పోవడం వలన పురుషుని నుండి ఏదీ పుట్టక పోవడం వలన పురుషుడు
ప్రకృతి గాని వికృతి గాని కాజాలడు. .
మూల ప్రకృతిరవికృతి: (1)
మహదాద్యా: ప్రకృతి వికృతయ: సప్త (7)
షోడశకస్తు వికార: (16)
న ప్రకృతి:
న వికృతి: పురుష: (1)
అనే మాటలను బట్టి తెలుస్తోంది.
సాంఖ్యసిద్దాంతం 1. ప్రత్యక్షం 2. అనుమానం 3. ఆగమం అని మూడు ప్రమాణాలను అంగీకరిస్తుంది.
ప్రత్యక్ష ప్రమాణానికి ఎనిమిది
హద్దులు (పరిధులు) న్నాయి. 1. చాలాదూరంలో ఉన్న
ఆకాశంలో ఎగిరే పక్షి మనకు కనిపించదు. 2. చాల దగ్గరలో ఉన్న మనకంటి రెప్ప మనకు కనిపించదు. 3. కన్నుపోతే ఏమీ
కనిపించవు. 4. మనస్సు నిలకడ లేకపోతే ఏదీ కనిపించదు. 5. చాల సూక్ష్మమైన
అణువు, పరమాణువు మనకు కనిపించవు.
6. ఏదైనా అడ్డు
ఉంటే మనకు కనిపించదు. గోడ వెనుక ఉన్న వస్తువులు మనకు కనిపించవు. 7. సూర్యకాంతిలో
నక్షత్రాలు మనకు కనిపించవు . 8. సమూహంలో ఉన్న ఒక వస్తువు ఉదాహరణకు ఒక K. G మినుగుల్లో ఉన్న ఒక చిన్న రాయి మనకు సరిగా కనిపించదు. అందుకే
మిగిలిన రెండు ప్రమాణాలను కూడ స్వీకరించింది .
సాంఖ్యులు సత్కార్య వాదులు . అనగా కార్యం కారణం లోనే దాగి ఉంటుంది.
ప్రకృతి, పురుషుని సహకారంతోనే సృష్టి కొనసాగిస్తుంది. ప్రకృతి జడం కావడం వల్ల
పురుషుడు నిష్క్రియుడు కావడం వల్ల స్వతంత్రంగా సృష్టి చెయ్య లేరు. కుంటివాడు
నడువలేడు, గ్రుడ్డి వాడు
చూడలేదు కాని వారిద్దరు కలిస్తే చాల పనులు
చేయగలరు.
पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य
पंग्वन्धवदुभयॊरपि संयॊगस्तत्कृत: सर्ग: ( 21)
సాంఖ్యం పురుష బహుత్వాన్ని అంగీకరిస్తుంది. ఏ విధంగా చంద్రునిలో ఉండే
ప్రకాశం చంద్రునిది కాక సూర్యునిదే ఔతుందో
అదే విధంగా. ప్రకృతి చేతనా రహితమైనప్పటికి
ప్రకృతిలో ఉండే సత్త్వగుణం వలన అది
ప్రకాశవంతంగా అనిపిస్తుంది . కాని అది పురుషగత ప్రకాశన శక్తి మాత్రమె . పురుషుడు
నిరంజనుడు , నిష్క్రియుడు . త్రిగుణాత్మకమైన ప్రకృతి లోజరిగే దేని తోనూ పురుషునకు
సంబంధం లేదు. సంబంధం కల్పించుకోవడం బంధం , తొలాగించుకోవడం
మోక్షం . భగవద్గీతలోకూడ
ప్రకృత్యా: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ:
అహంకార విమూఢాత్మా కర్తాsహమితి మన్యతే అని సాంఖ్య సిద్దాంతం
సూత్ర ప్రాయంగా వివరించడం జరిగింది. ఈ ప్రకృతిలో జరిగే క్రియా కలాపాలతో నా కెటు
వంటి సంబంధం లేదని అనుభవపూర్వకంగా పురుషుడు తెలుసుకోవడమే యథార్థ జ్ఞానం . దానివల్ల
ముక్తి లభిస్తుంది .
అది జీవన్ముక్తి , విదేహముక్తి
అని రెండు విధాలు. జ్ఞానం వచ్చిన తరువాత శరీరత్యాగా పర్యంతం జీవన్ముక్తి , తదనంతరం విదేహ ముక్తి. ఫ్యాన్ switch off చేసినా వెంటనే
ఆగిపోకుండ కొన్ని rounds తిరుగుతుంది . జ్ఞానప్రాప్తికి శరీర పతనానికి ఎటువంటి సంబంధం లేదు కదా!
No comments:
Post a Comment