Friday, May 4, 2012

సంస్కృతసాహిత్యంలో పేరడీ కవిత

-->
ఆధునిక సాహిత్యం లో ఎన్నో కవితా ప్రక్రియలున్నాయి. వాటిలో పేరడీ ఒకటి. వాస్తవానికి ఈ పేరడి పదం 'parioda'అనే గ్రీకుభాషాపదం నుండి ఆంగ్లసాహిత్యంలోకి వచ్చింది. ఇతరులు రచించిన ఒక పద్యాన్ని గాని గద్యాన్ని గాని మాటను గాని హాస్య రసాన్ని జోడిస్తూ అనుకరించడం పేరడీ అనవచ్చు.
 
Parody is a humorous imitation of a serious writing. A Parody follows the form of the original , but often changes its sense , thus making fun of the writer's characteristics (Sankaranarayana, English-English-Telugu Dictionary)
1. A humarous exhaggirated imitation of an author, literary work ,style etc.
  1. A feeble imitation.
సాధారణంగా కవులలో గల హాస్యప్రియత్వం, ఆక్షేపధోరణి, సంఘసంస్కరణాభిలాష ఈ పేరడీకవిత పుట్టడనికి కారణాలౌతున్నాయి. కారణాలేవైనా చమత్కారం పుట్టించడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. పేరడి అనే ఈ ఆధునిక కవితా ప్రక్రియ అన్ని భాషా సాహిత్యాల్లోను పుష్కలంగ ఉంది. ఉదాహరణకి సుమతీ శతకం లో

అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడునెడ తెగకపాఱునేరును ద్విజుడున్
చొప్పడిననూరనుండుము
చొప్పడకున్నట్టియూరుచొరకుము సుమతీ!
అనే పద్యం ఉంది. దానికి పేరడీగా ఒకకవి ఇలా మరొక పద్యం వ్రాశాడు.

అప్పచ్చులతో వేడిగ
నెప్పుడు భోజనము పెట్టునిల్లోహొటలో
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతీ!

అతిప్రాచీనభాషల్లో ఒకటైన సంస్కృతంలో కూడ ఈ ప్రక్రియ కనబడడం ఒకవిశేషం. దీన్నిబట్టి సంస్కృతం ఆధునికంలో ఆధునికం ప్రాచీనంలో ప్రాచీనమని చెప్పక తప్పదు .
పేరడీ కవులు పరమపవిత్రమైన వేదాన్ని కూడా విడిచిపెట్టలేదు. దాన్ని కూడ పేరడీ చేశారు. భోజనప్రియులైన కొంతమంది పేరడీ కవులు వేదం లోని చమకాన్ని
' ఇడ్లీ చ మే ఉప్మా చ మే పూరీ చ మే చట్నీ చ మే చపాతీ చ మే
అని అనుకరించారు. ఇక లౌకికసాహిత్యం తీసుకుందాం. భగవద్గీ త కు సంబంధించిన కర్మయోగం లో ఒక శ్లోకం ఉంది.

"సన్యాస: కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ
తయోశ్చ కర్మసన్యాసాత్కర్మయోగో విశిష్యతే "

కర్మలను విడిచిపెట్టడం సన్యాసం. ఫలితాలను ఆశించకుండాకర్మలను చేస్తూనే ఉండడం కర్మయోగం. మోక్షం పొందడానికి ఈ రెండు మార్గాలూ మంచివే. ఐతే ఈ రెండిట్లోను రెండోది అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మలను ఆ చరించడం ఇంకా చాల మంచిది. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. దీన్ని అనుకరిస్తూ చాయపానప్రియుడు, ప్రతిభావంతుడు ఐన ఒక హాస్య కవి 'టీ' యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ ఏ మంటున్నాడో చూడండి.

"కాఫీపానం చ టీపానం నిశ్రేయసకరే ఉభే
కాఫీటీపానయోర్మధ్యే టీపానం విశి ష్యతే "

కాఫీ త్రాగడం , టీ త్రాగడం రెండూ ఆరోగ్య కరమే. కాని ఈ రెండింటిలో 'కాఫీ ' కన్న 'టీ' మరింత ఆరోగ్యకరం. 'కాఫీ'మరియు 'టీ' ఈరెండూ ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కల్గిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని రెండిటిలోను'టీ'యే మంచిదంటాడు కవి. అసందర్భం అనుకోకుండా అదెందుకో తెలుసుకుందాం.
అమృతం కోసం దేవతలు రాక్షసులూ కలిసి పాలసముద్రాన్ని చిలికారు. ముందుగ కాలకూట విషం వచ్చింది. ఆ తరువాత 'పీయూషం ' అంటే అమృతం వచ్చింది. రాక్షసులకు కాలకూటం దొరికింది. దేవతలు అమృతం చేజిక్కించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న మనుషులకు ఒళ్లు మండి పోయింది. వెంటనే బ్రహ్మ దగ్గరకెళ్లారు. "అందరికి అన్ని అందాయి . మాకేమీ లేదా!” అనడిగారు నిష్ఠూరంగ. బ్రహ్మ వాళ్లను సంతృప్తి పరచడం కోసం కాలకూటం లోంచి 'కా' ను పీయూషం లోంచి "పీ" ని వేరు చేసి ''కాఫీ" తయారుచేసి ఇస్తేగాని వాళ్లు ఊరుకోలేదు. అందుకే

"కాలకూటంచ దైత్యానాం పీయూషం చ దివౌకసాం
ఉభౌ మిళిత్వా మర్త్యానాం కాఫీ భూలోకవాసినాం
అన్నారు పెద్దలు.
కాబట్టి కాలకూటవిషం లో ఉండే మాదకశక్తి , అమృతం ఉండే రుచి ఈ రెండూ కాఫీలో ఉన్నాయి. అందుకే కాఫీ కంటే టీ మంచిదన్నారేమో పెద్దలు. ఆ సంగతలా ఉంచుదాం. భగవద్గీతలో మరో శ్లోకముంది.

"చతుర్విధా: భజంతే మాం జనా: సుకృతినోర్జున!
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ!

ఓ అర్జున! నన్ను నాలుగు రకాల మనుష్యులు కొలుస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నవారు, ఏదోతెలుసుకోవాలనే తపన గల వాళ్లు, ఏవో కోరికలు గలవారు మరియు జ్ఞానులు .
ఈ శ్లోకాన్ని మనసులో పెట్టుకుని సుప్రసిద్ధ పండితులు శ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఒక శ్లోకం రచించారు. అదెంతబాగుందో చూడండి.

చతుర్విధా: భజంతే మాం జనా: సుచతురా: ప్రభుం
కవయ: కార్యకర్తార: కాంతా: కార్యాక్షమాశ్చ యే

ప్రభువునైన నన్ను నాలుగు రకాల వాళ్లు కొలుస్తూ ఉంటారు. మొదటివారుకవులు. రెండోవారు పనులు కావలసిన వారు. మూడోవారు ఆడవాళ్లు. నాలుగోవారు ఏ పని చేయలేని వాళ్లు. ఈ శ్లోకం పొగడ్తలకు, ప్రలోభాలకు లొంగే ఈ నాటి రాజకీయనా యకులకు చాల బాగ వర్తిస్తుంది.

ఇంకోటి చూద్దాం. రామాయణం లో ఒక ఘట్టం ఉంది. రాముడు సీతావియోగదు:ఖంతో ఉన్నాడు. వానరులు కొన్ని బంగారు ఆభరణాలు రాముని ముందుంచి అవి సీతవి అవునో కావో చెప్పమన్నారు. ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. సీతమ్మ ఆభరణాలను గుర్తించే పరిస్థితిలో లేడు. అందుకని ఆ పని లక్ష్మణుడికి అప్పగించాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో అన్న మాటలివి.

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
నూపురే త్వభి జానామి నిత్యం పా దాభివందనాత్

అన్నయ్యా! నేనెల్లప్పుడూ వదిన గారి పాదాలు మాత్రమే చూసేవాణ్ణి దణ్ణం పెట్టుకునే వాణ్ణి. అందువల్ల ఆమె భుజాలకు పెట్టుకునే కేయూరాలెలా ఉంటాయో నాకు తేలీదు. అలాగే చెవులకు పెట్టుకునే కుండలాలెలా ఉంటాయో తెలీదు. కానీ కాళ్లకు పెట్టుకునే నూపురాలు మాత్రం వదినమ్మవో కావో చెప్పగలను అన్నాడు.
ఈ శ్లోకాన్ని అనుసరిస్తూ ఒక అద్భుతమైన పేరడీ సృష్టించారు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. పాఠాలు చెప్పకుండానే అందర్నీ కాకా పడుతూ కాలక్షేపం చేసే కుహనా ఉపాధ్యాయుల్ని దుయ్యబట్టేరు.

"నాహం జానామి పాఠ్యాంశాన్
నాహం జానామి పాఠనం
జానామిత్వధికారస్థాన్
నిత్యం పాదాభివందనాత్"

చెప్పవలసిన పాఠాలేమిటో నాకు తెలీదు. పాఠం ఎలాచెప్పాలో కూడ నాకు తెలీదు. కాని విద్యాశాఖలో పనిచేసే అధికారులెవరో వాళ్లు మాత్రం బాగా తెలుసు . ఎందుకంటే వాళ్ల కాళ్లకు రోజు నేను దణ్ణం పెడుతూ ఉంటాను కాబట్టి . మరొకటి చూద్దాం.
కాళిదాస మహాకవి రఘువంశం అనే మహాకావ్యాన్ని రచించారు. ముందుగా కావ్యనాయకులైన రఘువంశరాజుల గుణ గాణాలను వర్ణిస్తూ

'శైశవేభస్త విద్యానాం యౌవనే విషయైషిణాం
వార్ధకే మునివృ త్తీనాం యోగేనాంతే తనుత్యజాం'
అనే అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఆ రఘువంశ చక్రవర్తులు బాల్యంలో అన్ని విద్యలు నేర్చుకునేవారట . యౌవనంలో సకలసౌఖ్యాలూ అనుభవించేవారట. వార్ధక్యం లో మునులవలే తపస్సు చేసుకుంటూ చివరిదశలో యోగమార్గంలో శరీరాన్ని విడిచిపెట్టేవారట.

ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒక ఆధునికకవి నేటి కాలం లో కొంతమంది దినచర్యను సున్నితం గా ఆక్షేపిస్తూ ఇలా వ్రాశారు.

'శైశవే ధ్వస్తవిద్యానాం యౌవనే విషయైషిణాం
వార్ధకే శనివృత్తీనాం రోగేణాంతే తనుత్యజాం'

ఆనాటి వాళ్లు అంతటి వారైతే ఈ నాటి వారు ఎంతటి వారో స్వయం గా చూడండి. వీరు బాల్యం లో చదువు మాటే ఎత్తరట. యౌవనంలో మాత్రం సకలభోగాలు అనుభవిస్తారట. ఇక ముసలితనం లో శనిగ్రహంలా అందరిని ఏడిపించుకు తింటూ చివరదశలో సకలరోగాలతో తీసుకు తీసుకు చస్తారట. మన సంస్కృతి ఏ స్థాయి నుండి ఏ స్థాయి కి దిగజారిందో తెలుసు కోడానికి ఈ రెండు శ్లోకాలు చాలు.
మరో పేరడి చూద్దాం

కాలో వా కారణం రాజ్ఞ: రా జా కాలస్య కారణం
ఇతి తే సంశయో మాభూద్రాజా కాలస్య కారణమ్.

రాజుకు కాలం కారణమా లేక రాజే కాలానికి కారణమాఅని సందేహించక్కరలేదు.రాజే కాలానికి కారణం.రాజు కాలాన్ని బట్టి మారతాడా! లేక రాజే కాలాన్నికూడ మరుస్తాడా!అంటే రాజే కాలాన్నికూడమార్చగలడని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒకకొంటె కవి హాస్య రసాన్ని మేళవించి మరోసరసమైన శ్లోకం వ్రాశాడు.

"కుక్కుట్యా: కారణం వాండం కుక్కుటీవాండకారణం
ఇతి వాం సంశయో మాభూదుభయం తృప్తి కారణం"

ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారు.వారిలో ఒకడు గ్రుడ్డుకు కోడి కారణమంటాడు. రెండో వాడు కోడికే గ్రుడ్డు కారణమంటాడు. వాళ్లిద్దరు ఎప్పటికి ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కాలం గడిచినా వాదం ముగియడం లేదు. అంతలో హఠాత్తుగా మూడోవ్యక్తి ప్రవేశించాడు. ఇలా అందుకున్నాడు. కోడికి గ్రుడ్డు కారణమా! లేక గ్రుడ్డే కోడికి కారణమా! అని మీరు వాదులాడుకోవలసిన పనిలేదు. ఎందుకంటే పుంజు పెట్టల కలయికే ఈ రెండింటికి మూలకారణం అన్నాడు కొంటెగా. వాదోపవాదాలతో కాలహరణం చేసేవారికిదొక చురక.
ఇటువంటి పేరడీ కవితలు సంస్కృతంలో కోకొల్లలుగా ఉన్నాయి . కొన్ని మాత్రమే ఇందులో పేర్కోడం జరిగింది. ఈ పేరడిప్రక్రియలో కూడా సంస్కృత సాహిత్యం ఇతర సాహిత్యాలు దేనితోను తీసిపోదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సమాజం లో మంచిమార్పులు తీసుకురాడానికి ఈ ప్రక్రియ కూ డ ఇతోధికంగా తోడ్పడుతుందని ఆశిద్దాం.

పేరడీ కవిత సినిమా పాటల్లో ఎక్కువగా కనిపిస్తుంది . మచ్చుకు నన్ను దోచుకుందువటే  అనే డాక్టర్ . సి. నారాయణ రెడ్డి గారి గీతానికి   శ్రీ తాళాభక్తుల లక్ష్మీప్రసాద్ గారి పేరడీ గీతాన్ని ఆస్వాదించండి .

నన్ను పీక్కు తిందువటే వన్నెల నా భార్యా
అన్నములో  నంజుకొందు నిన్నే నా సూర్యా - నిన్నే నా సూర్యా
                                         --- నన్ను పీక్కు తిందువటే---
హరియి౦తును నీ సొమ్మును సరదాలకు ఖర్చు పెట్టి
గడ్డిపరక వోలె కర్పూరకళిక వోలె  - కర్పూరకళిక వోలె
ఎంతటి నెరజాణవొ నా కొంప ముంచినావు నీవు
కలకాలం ఊడని గొల్ళెమును వేసినావు -   గొళ్లెమును వేసినావు
                                     -- నన్ను పీక్కు తిందువటే---
నా మనసే గాలముగా నీవే చిఱు చేపవుగా
దొరికినావు బాబు  నే కొరికితిందు రోజు   కొరికి తిందు రోజు
ఏ నాటిదొ ఆ పాపం ఎరుగరాని విధి కోపం                                         
ఎన్ని యుగాలైనా ఇది వదలిపోని శాపం - వదలిపోని శాపం
                                 -- నన్ను పీక్కు తిందువటే---

రచయిత:-- శ్రీ తాళాభక్తుల లక్ష్మీప్రసాద్



..........................

No comments: