Saturday, May 5, 2012

పట్టుపరిశ్రమ


అఘాయిత్యమైనా ఉండాలి అక్షరమైనా ఉండాలి అన్నది ఆ నాటి మాట. పరిశ్రమైనా ఉండాలి లేక పట్టు పరిశ్రమైనా ఉండాలి అనేది ఈ నాటి మాట. కష్టపడి పై కొచ్చేవాళ్ళు ఈ సమాజం లో ఎంతో మంది ఉన్నారు. వారి ప్రగతికి కారణం పరిశ్రమ . కానీ ఏ కష్టం లేకుండానే పైకొచ్చే వాళ్లు ఇంకా ఎక్కువమంది కన్పిస్తారు. వారి పరిశ్రమ కేవలం పట్టుపరిశ్రమే. పట్టుపరిశ్రమంటే వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లూ పట్టుకుని అడ్డత్రోవలో ఏదో స్థానం సంపాదించడం. వారికి ఉద్యోగం లో చేరాక ఏ పని పాట ఉండదు. అందుకని ఆ రంగం లోను ఈ రంగం లోను చెయ్యి పెట్టి వీరంగం ఆడుతూ ఉంటారు. మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ అన్నట్లు వీరికి సరుకు తక్కువ సణుగుడు ఎక్కువ. దానికి తగ్గట్టు పట్టు పరిశ్రమ ద్వారా అందర్ని ఆకట్టుకుంటారు. వారికెక్కడా ఎదురుండదు. వారే అందరికి ఎదురు. ఇటువంటి వాళ్ల గురించి సుప్రసిద్ధ సంస్కృత కవి జగన్నాథ పండితరాయలు ఒక చక్కని శ్లోకం రచించాడు.అది ఎంత బాగుంటుందో చూడండి. .
ఓ గాడిదా! ఎందుకే నువ్వు అనవసరంగా వాళ్ల బట్టలు వీళ్ల బట్టలు మోస్తూ ఆ గడ్డి ఈ గడ్డి తింటూ భారం తో కాలం గడుపుతున్నావ్. ఒక పని చెయ్యి. ఎవర్నో పట్టుకో . ఎలాగోలాగ రాజుగారి గుఱ్ఱపు శాల్లో దూరిపో. నీకు ఎటువంటి శ్రమ ఉండదు. కాలు కదపక్కరలేదు. అక్కడ నీకు చాల బలమైన ఆహారం దొరుకుతుంది. సెనగలు ఉలవలు ఇంకా మరెన్నో చక్కగా తినొచ్చు. అక్కడ ఉండే వాళ్లకి నువ్వేం భయపడక్కరలేదు. ఎందుకంటె తోకున్న ప్రతీ దాన్నీ గుఱ్ఱం అనే వాళ్లనుకుంటారు. రాజుకేం తెలీదు అందుకని వాళ్లు చెప్పిందే నమ్ముతాడు. మిగిలిన వాళ్లంతా ఏం పట్టించుకోరు. అధికారుల అజ్ఞానం, రాజు అసమర్థత, మిగిలినవారి ఉదాసీనత ఇవన్నీ నీకు చాలా కలిసొస్తాయి. భయపడకుండా నెను చెప్పింది చెయ్యి. సుఖపడతావ్.
ఇంత భావాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ సంస్కృత శ్లోకాన్ని కూడ తిలకించండి మరి.
-రేరే రాసభ ! వస్త్రభారవహనాత్కుగ్రాసమశ్నాసి కిమ్?
రాజాశ్వావసధం ప్రయాహి చాణకాభ్యూషాన్సుఖం భక్షయ
సర్వాన్ పుచ్ఛవతో హయా ఇతి వదంత్యత్రాధికారే స్థితా:
రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్ఠా: పరే

No comments: