Saturday, May 5, 2012

అమ్మో !అన్నికష్టాలే


ఆంధ్రభోజునిగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాన్ని పాలిస్తున్న రోజలవి. ఆయన సాహితీసమరాంగణ సార్వభౌముడు.అటు కత్తి ఇటు కలం రెండూ సమానంగా నడిపించగల నిపుణుడు. ఒక వ్యక్తికి అన్ని కష్టాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో వర్ణించమని ఒకసారి ఆయన తన ఆస్థాన కవుల్లో ఒకర్ని అడిగాడు. వెంటనే ఆశువుగా ఇలా చెప్పేడు కవి.
ఒక రోజున ఒకవ్యక్తికి తాను ప్రాణప్రదంగ భావించే గురువు గారు ఇంటికొచ్చారట. అప్పుడే తన ఇంట్లో అన్ని పన్లు చక్కబెట్టే దాసి చచ్చిపోయింది. ఆరోజే కొంతమంది దొంగలు గుర్రాల పై వచ్చి దాడి చేసి ఉన్నవన్నీ ఊడ్చుకు పోయారు. ఆసమయం లోనే అల్లుడు తానుకోరింది కొనివ్వలేదని అలుగుతూ అమ్మాయిని తీసుకుపొమ్మని బెదిరిస్తూ ఊత్తరం వ్రాశాడు. అంతట్లోనే తన ఇల్లాలొకప్రక్క పురిటి నెప్పుల్తో గిలగిల్లాడుతోంది. అదే రోజు మరో అమ్మాయి పెళ్లి జరగబోతోంది. నాడే చేలల్లో విత్తనాలు నాటే సమయం నిర్ణయించారు. ఇంతలో అప్పటి కప్పుడే పక్కింటివాడొచ్చి ' నా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిస్తావా చస్తావా ' అంటూ నిలదీసి అడుగుతున్నాడు. దాంతో అతనికెప్పుడూ లేని చెవిపోటు మొదలై తీవ్రంగా బాధిస్తోంది. ఈ లోపులోనే దొమ్మరివాళ్లు వచ్చి బీభత్సం గా డప్పులు వాయిస్తూ దొమ్మరాట మొదలెట్టారు. అసలే ఆ ప్రాంతం లో కరువు తాండవిస్తోంది. అందులోను ఆ రోజు ఎవరిదో తద్దినం పెట్టవలసిన అగత్యం ఏర్పడింది. ఇన్ని సమస్యలు ఒకేరోజునొస్తే మనిషి పరిస్థితి ఊహించండి.

గురువుల రాక దాసిమృతి గుర్రపు దాడియు నల్లునల్కయున్
వరసతి గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తియున్
పొరుగున నప్పుబాధ చెవిపోటును వీధిన దొమ్మరాటయున్
కరవు దరిద్రమాబ్ధికము గల్గె నొకప్పుడు కృష్ణభూవరా!



No comments: