Saturday, October 18, 2014

పంచభూతాలు-రామాయణo

పంచభూతాలు-రామాయణo
Dr.Chilakamarthi Durga Prasada Rao

ఈ ప్రపంచం పంచభూతాలతో తయారైంది. అవి భూమి, నీరు, ఆగ్ని, వాయువు, ఆకాశం. మొదటిది భూమి. రెండోది నీరు. మూడోది అగ్ని . నాల్గోది వాయువు. ఐదోది ఆకాశం.
ఈ పంచభూతాలు ఆధారంగా ఒక కవి చిన్నపద్యంలో సంగ్రహంగా రామాయణకథను వివరించాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. కాబట్టి కాదేదీ కవికినసాధ్యం .

అంచిత చతుర్థజాతుడు
పంచమమార్గమున బోయి ప్రథమతనూజన్
గాంచియు నచట తృతీయం
బుంచి ద్వితీయంబు దాటి యొందెను రాజున్       

ఒక చతుర్థజాతుడు పంచమమార్గంలో ప్రయాణం చేసి, ప్రథమతనూజను చూసి, అచట తృతీయం ఉంచి , ద్వితీయం దాటి రాజును చేరుకున్నాడట. ఇదంతా చాల గందరగోళంగా ఉంది . అందువల్ల ఇది పూర్తిగా అర్థం కావాలంటే పంచభూతాలపరిజ్ఞానం కావాలి. అదెలాగో చూడండి.

చతుర్థజాతుడు అంటే ఆంజనేయస్వామి . ఎందుకంటే పంచభూతాల్లో  నాల్గోది వాయువు . వాయుదేవుని పుత్రుడే  ఆంజనేయస్వామి.
 పంచమమార్గమున పోయి అంటే ఐదవదైన ఆకాశమార్గంలో ప్రయాణం చేసి అని ఆర్థం.  ప్రథమతనూజన్ అంటే పంచభూతాలలో  మొట్టమొదటిదైన భూమి కుమార్తె (సీత) ను అని అర్థం. అందు( లంకలో )  తృతీయంబుoచి అంటే  మూడవదైన అగ్నిని ఉంచి (తగులబెట్టి) అని అర్థం . ఇక  ద్వితీయంబు దాటి అంటే నీటిని ( సముద్రాన్ని) దాటి రాజును ( శ్రీరాముని ) చేరుకున్నాడట . మొత్తం రామాయణకథ సంగ్రహంగా ఈ పద్యంలో  కనిపిస్తోంది .   
తాత్త్వికంగా చూస్తే ఆత్మ నుండి ఆకాశం పుట్టింది . ఆకాశం నుండి వాయువు పుట్టింది . వాయువు నుండి అగ్ని పుట్టింది . అగ్ని నుండి నీరు పుట్టింది. నీటి నుండి భూమి పుట్టింది. ఇది సూక్ష్మం నుంచి స్థూలప్రపంచం ఏర్పడిన విధానం.  (ఆత్మన: ఆకాశ: సంభూత:, ఆకాశాద్వాయు:, వాయోరగ్ని:, అగ్నేరాప:, అద్భ్య: పృథివీ, పృథివ్యా: ఓషథయ:, ఓషథీభ్యో sన్నమన్నాత్పురుష: ) కాని ఇక్కడ  కవి వ్యావహారికదృష్టితో స్థూలం నుంచి సూక్ష్మానికి   (వెనుకనుంచి ముందుకు) పంచభూతాల వరుసను పరిగణనలోకి తీసుకున్నాడు. అందువల్ల స్థూలరూపంలో రాముడుగా కనిపిస్తున్న ఈ   ఆకారం వెనుకనున్నది ఆ సూక్ష్మమైన ఆత్మతత్త్వమే అని మనం గ్రహించాలి.   వేదవేద్యుడైన ఆ పరమపురుషుడు దశరథ తనయుడగు రామునిగా పుట్టగా వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా వెలువడిందట. ( వేదవేద్యే పరే  పుంసి జాతే దశరథాత్మజే
వేద: ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా )
అంతేగాక  ఈ సృష్టి ఉన్నంతకాలం పంచభూతాలు ఉంటాయి . పంచభూతాలు ఉన్నంత కాలం రామాయణం ఉంటుoదని మరియు ఉండాలనే ఆకాంక్షతో  కవి ఈ అందమైన శ్లోకం రచించి నట్లు కనిపిస్తోంది. కవి ఎవరో నాకు తెలియదు గాని ఆయన ప్రతిభకు అభినందనలు.















              

No comments: