Monday, February 17, 2014

శ్రీసత్యనారాయణస్వామి వ్రతము(పద్యకథనము) చిలకమర్తి వేంకటసూర్యనారాయణ

శ్రీసత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము)
గ్రంథకర్త:
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ
నరసాపురం
*****

శ్రీ సత్యదేవుని  పరాత్పరునిగా వరించి, స్మరించి, భజించి తరించిన భక్తశిఖామణులకు ఈ కృతి అంకితం
ఇట్లు
గ్రంథకర్త
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ 
పురోహితులు
యర్రమిల్లి వారి వీధి
గంటలమ్మ గుడివద్ద
నరసాపురం -534275-A.P
మున్నుడి
మా ఇలవేల్పు,  ఇష్టదైవమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి  కథను పద్యకావ్యంగా వ్రాయాలనే తలంపు నాకు కలగడం, అది కార్యరూపం చివరకు కావ్యరూపం ధరించడం చాల దశాబ్దాల క్రితమే జరిగినప్పటికీ ఏ కారణం చేతనో అది ముద్రణకు నోచుకోలేదు. ఇటీవల మా అబ్బాయి చిరంజీవి దుర్గాప్రసాదు ప్రోత్సాహంతో ముద్రణకు నోచుకుంది.  నాకు తెలుగు సాహిత్యంలో అంత పట్టు లేకపోయినా దేశీఛందస్సుతో కొంత పరిచయం ఉండటం వలన సీస, కంద, ఆటవెలది, తేటగీతులతోనే ఈ కావ్యం వ్రాయడం జరిగింది. కేవలం పద్యరూపంలో స్వామి కథను వివరించడమే నా లక్ష్యం కావడం వల్ల ఈ గ్రంథంలో అలంకారాలకు, రసధ్వనులకు ప్రాథాన్యం ఇవ్వలేదు .  నా యీ కావ్యరచనకు స్ఫూర్తి దాతలైన కీ || శే || పెద్దింటి దీక్షితదాసు గారిని, కావ్యగత దోషాలను సవరించి, మెరుగు పరచి  ముద్రణ యోగ్యతను కల్పించిన కీ|| శే || అత్తిలి గోపాల కృష్ణమాచార్యులు గారిని, నతశిరస్కుడనై స్మరించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఈ చిఱుపొత్తంపై తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందించడంతో బాటుగా ముద్రణలో ఆసాంతం కృషి చేసిన మాన్యశ్రీ వంగపండు నరసింహం గారికి సదా కృతజ్ఞుడను. ఈ గ్రంథరచనలో సహకరించిన నా అర్థాంగి వేంకటరమణకు, మా అబ్బాయి చి || దుర్గాప్రసాదుకు కృతజ్ఞతాపూర్వకమైన ఆశీస్సులు.  ఈ గ్రంథానికి ఇంత చక్కని రూపకల్పన చేసిన చి || సౌ || సునీతగారికి కృతజ్ఞతలు. ఈ గ్రంథం పఠితలకు పద్యరచనపై, ఆసక్తిని , భగవద్భక్తిని, ఆధ్యాత్మికచింతనపై అనురక్తిని కలుగచేస్తుందని ఆశిస్తున్నాను.
ఎందఱో మహానుభావులు  అందరికి వందనాలు.
ఇట్లు
చిలకమర్తి వేంకటసూర్యనారాయణ
<><><> 
ఓం శ్రీమాత్రే నమ:
అభిప్రాయము
తెలుగుసాహిత్యంలో  అనంతమైన భక్తిసంపద ఉంది. ఎందఱో భక్తశిఖామణులు, కవులు, వాగ్గేయకారులు, సంగీతసార్వభౌములు తమ రచనలతో భక్తిసాహిత్యాన్ని పరిపుష్టం చేశారు.  నేటికీ  చేస్తూనే ఉన్నారు. మున్ముందు కూడా అనంతంగా సాగిస్తూనే ఉంటారు. అలాంటి భక్తిసాహిత్యపు  కోవలో చేరిందే శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతకల్పపద్యకృతి. ఇది ఇంతకు పూర్వం లేని ఒక ప్రత్యేక ప్రక్రియగా  చెప్పవచ్చు.         
           సత్యదేవుని వ్రతం గుఱింఛి ఆంధ్రదేశంలో తెలియనివారుండరు. ఆ స్వామి వ్రతవిధివిధానం, ఆ పైన ఆ దేవుని మహిమకు సంబంధించిన కథలు {వచన రూపంలో}, ఆ వ్రతప్రసాదవినియోగం, పూజామాహాత్మ్యం మొదలగునవి జనబాహుళ్యానికి తెలిసిన విషయాలే. ఆ కథలు, వ్రతవిధానం కూడ తేటతెలుగుపదాలతో చెప్పబడ్డాయి. మరి అదే వ్రతవిధానాన్ని అంతే సులభమైన శైలిలో, అలతియలతి పదాలతో, సామాన్యునికి సైతం అర్థమయ్యే రీతిలో చేయబడిన పద్యకృతి ఈ కృతి.  
ఈ పద్యకృతిని హృద్యంగా చెప్పడంలో రచయిత మాన్యశ్రీ చిలకమర్తి వేంకటసూర్యనారాయణ గారు సఫలీకృతులయ్యారు. అన్వయక్లేశం, సమాసాడంబరం  లేకుండ చిన్న చిన్న పద్యాల (గీ||ఆ.వె||కం) నెంచుకుని కొన్ని సందర్భాల్లో సీసపద్యభాసురంగా ప్రథానమైన వ్రతవిధానాన్నే గాకుండా ఉపకథలను సైతం చదువరుల హృదయానికి  హత్తుకునేటట్లు పద్యరచన సాగించారు.
              వీరి కథాకథనపధ్ధతి, వేగం, శిల్పం, శయ్యాసౌభాగ్యాలను సంతరించుకుంది. కవిగారికి కందపద్యంపై మంచి పట్టు ఉంది.  ఈయన కష్టం కందపద్యం అనే నానుడి ప్రక్కన పెట్టి కందపద్యాలనే అశ్వబృందాలపై స్వారీ చేశారు అనిపిస్తుంది.
       ఈ కృతిలో ప్రతి కందము రసనిష్యందమే. మచ్చునకు 14,38,50,71, 97 పద్యాలు చవి చూడవచ్చు. వీరి సీసపద్యాలు కూడ రసావాసమై అనవద్యమైన శయ్యతో సాగాయి. ఉదా: 1. 14, 26 సంఖ్య గల పద్యాలు.
శ్రీ సూర్యనారాయణగారు ప్రవేశపెట్టిన కథావస్తువు కేవలం సత్యదేవుని వ్రతవిధానం మరియు వివిధకథల సముదాయమే అయినా వీటిని రసరమ్యంగా తీర్చిదిద్దడంలో వీరు కావ్యఫణితినే అవలంబించారు. ఇష్టదేవతా స్తుతి, పూర్వకవుల ప్రశంస, వంశవృక్షవివరణ, ఫలశ్రుతి మొదలగు పూర్వకవిసంప్రదాయాల్ని పాటించి వ్రతకథల రచనలో కూడ కావ్యశిల్పాన్ని ప్రదర్శించడమే కాక , శైలి ఏమాత్రము కుంటుపడకుండా ఒకే సుమసమాహారంగా రసస్ఫూర్తితో పరిపూర్తి చేశారు.
తన వంశవృక్షాన్ని ఆ వంశజుల గొప్పదనాన్ని శ్లాఘిస్తూ ఆ ఘనయశస్కుల కోవలో జన్మించిన నాకు వారే స్ఫూర్తి అని ధ్వనింపజేసేటట్లు ఉదాత్తంగా ఉగ్గడిస్తూ సగర్వంగా చెప్పడం ప్రశంసనీయం.
వీరి అర్ధాంతరన్యాసాలంకారవిన్యాసం కడు రమణీయం. ప. 68,73,80.మచ్చుకు. ఈ కృతిలో 2వకథలో విప్రుడు, కట్టెలమ్మువాడు పాత్రలు. విప్రుడు సత్యదేవుని వ్రతం చేసిన విధానం , దయార్ద్రహృదయం, కట్టెలమ్ము వాడి వినయపూర్వకవిజ్ఞప్తి, దృఢదీక్షతో భక్తిశ్రద్ధలతో స్వామివ్రతం చేసిన విధానం పాఠకుల హృదయాన్ని అలరిస్తుంది. నిశ్చలభక్తికి తార్కాణంగా నిలుస్తుంది.
3,4 వ కథలో వైశ్యుడు తనకు సంతానం కలిగితే స్వామి వ్రతం చేస్తానని అనుకోవడం సంతానం పొంది  కూడ స్వామివ్రతం చెయ్యడానికి ధనలౌల్యం అడ్డురావడం, లోభత్వం, దేవునిశాపం, తన్నివారణ, మొదలగు విషయాలు అభివర్ణిస్తూ చెప్పిన కథ దైవం పట్ల ఎంతవారికి వ్యాపార దృష్టి కూడదన్న చేదునిజాన్ని, నిస్వార్థభక్తితత్త్వాన్ని ప్రబోధించే విధంగా వివరించారు రచయిత. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతవిధానంలో స్వామి ప్రసాదానికి విశిష్టత , పవిత్రతలు ఉన్నాయి. వ్రతానంతరం స్వామిప్రసాదం తీసుకోకుండ వెళ్ళిన వారికి వ్రతఫలం దక్కదు సరికదా! కష్టాలపాలౌతారన్న సత్యాన్ని నిరూపిస్తూ;  సామాన్యుడు , రాజు అందరు స్వామిదృష్టిలో సమానమే , నిష్ఠతో  పూజ సల్పుటే ప్రధానం అన్న విషయాలు మనోజ్ఞంగా   చిత్రించబడినవి.  శ్రీ సత్యనారాయణస్వామివ్రతం చేసే సందర్భంలో వచనంతో బాటు ఈ పద్యకృతిని కూడ వినిపిస్తే, ఇది కూడ  పూజలో క్రొత్త విధానమై , భక్తి శ్రోతలకు చేరువై మరింత భక్తి ప్రపూరితం చేస్తుందని ఆశిస్తూ ...
వంగపండు నరసింహం M.A., B.Ed., Retd. హెడ్మాష్టర్ (Z.P)
 బేతవోలు, గుడివాడ
>>><<< 
పూజాసామగ్రి
      సీసం:  పసుపు కుంకుమయును ప్రతిమ పంచామృత
మాకులు పోకలు నరటిపళ్ళు
హారతికర్పూరమగరవత్తులు గంధ
  ముంబూలు కొబ్బరి బొండములును
    మంటపవస్త్రంబు మరి తగు బియ్యము
కోమలకలశంబు కొలది గుడము
గోధుమశర్కర గోక్షీరకృతమాజ్య
మందమౌ దీపాలకుందులమర
 గీ||  బంధువుల విందు నటుపైన భజన సల్పి
తీక్ష్ణ మైనట్టి యుపవాసదివ్యదీక్ష
నిశ్చలంబగు సద్భక్తి నిండుమనసు
సత్యదేవుని పూజకు సాధనములు
***

శ్రీసత్యనారాయణస్వామి వ్రతము
(పద్యకథనము)

1.                శ్రీ గణనాథుని c జెల్వుగనుతియించి
                 శారదాంబను మది సంస్మరించి
       వల్మీకభవునకు వందనంబొనరించి
                  ఘనుని వ్యాసర్షిని గారవించి
       కాళిదాసుని పాద కమలముల్ భజియించి
                    నన్నయ్య వాణికి నతులొనర్చి
       తిక్కయజ్వనుమది స్థిరముగా వినుతించి         
                       పోతనార్యుని మది c బొగడి భక్తి
తే .గీ || కరము శ్రీ నాథు కైతకు శిరము వంచి
          పెద్దన కవివతంసుని c బ్రీతి c దలచి
          వ్రాయc బూనితి  సత్యనారాయణవిభు
           వ్రతవిధానమ్ము కథలను పద్యకవిత       

2.                కం|| ప్రాచీన కవుల ( దలతును
            దాచిన ధనమట్లు సతము ధారుణిలోనన్
             యోచించి మధురపదముల
            తూచినయటులొసగి నాకు దోహదపడగన్
3.                పాపుల శిక్షించి  భక్తుల రక్షించి
         అమరులానందింపనవతరించి
గాధినందనుగాంచి కడుభక్తి సేవించి
          తాటకాదుల ద్రుంచి ధర్మమెంఛి
ఱాతిని స్పర్శతో నాతిని గావించి
           గౌతముందిలకించి కరుణ నించి
శివధనుస్సును వంచి సీతను వరియించి
          భార్గవరాముని పరిభవించి
జనకాజ్ఞ పాలించి  వనసీమ విహరించి
          మారీచు ఖండించి మాయ నెంచి
 గీ || ఆలిగానక వనసీమ నలమటింఛి
        గాలి కొమరుని ఘనమిత్రుగా(దలంచి
        వాలి నిల(గూల్చి వార్ధికవ్వలనునిల్పి
        రావణాదుల(దునుమాడి రమణి(గూడి
        వరలు రాముడు నన్ను ( గాపాడు( గాక !           

4.                కం || శిరమున పింఛంబమరగ
              ఉరమునసిరిమురిపెమొందియూయలలూగన్
              మురళీగానమొనర్చెడు
              హరి సతతంబొసగు(గాక నఖిలార్థంబుల్
      

5.                ఆ.వె || నంది వాహనుండు నారాయణహితుండు
                    శేషభూషితుండు చిన్మయుండు
                    భక్తజనవశుండు పార్వతీనాథుండు
                    శంకరుండు నాకు జయము గూర్చు  
6.  కం ||  తాపసమందారుండై
              ప్రాపుగ శ్రితజనులనేలు ప్రభుడై  సాయీ
              రూపమున నవతరించిన
              శ్రీపతి నేననవరతము సేవింతు మదిన్
7.    కం || అక్షయముగనభయంబిడి
               శిక్షణతో నమితవిద్య శిష్యుల కొసగన్
               రక్షణనిధి నాసద్బుధ
               దక్షుని పెద్దింటి దిక్షితబుధుం గొలుతున్ 
8.    సీ|| కడు యశమవనిలో గడియించుకొన్నట్టి
                     ఆరామద్రావిడులందు నమిత
        శీలత( జెన్నొందు చిలకమర్తి సువంశ
                    సంభూతుడైనట్టి సత్యవ్రతుడు
        వేదవేదాంగాది విద్యాప్రవీణుండు
                     వేంకటకృష్ణయ్య విమలచరితు
       నకు ధర్మపత్నిగా నలరారుచున్నట్టి
                     వేంకమగర్భాన విష్ణుకృపను
       ముద్దులనొలికించు ముగ్గురు తనయులు
                  ఉద్దండతేజులై యుద్భవింప
గీ || నట్టివారిలో( గడపటి యాత్మజుండు
      శాంత హృదయుండు సజ్జన సన్నుతుండు
      సుగుణధాముడు సత్కవి సుబ్బన తన
     యుండ సూర్యనారాయణాఖ్యుండ నంద్రు
<><><> 





                                                        

No comments: