Monday, June 19, 2017

తెలుసుకుందాం -3

తెలుసుకుందాం -3
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
1.  మనం ఏదైనా ఒక  మంత్రం చదివిన తరువాత చివర్లో  ఓం శాంతి: శాంతి: శాంతి: అని మూడు సార్లు అంటాం . దీనికి కారణం  మనం మూడు రకాలైన దు:ఖాలను౦డి విముక్తి పొందడానికే అని తెలుసుకోవాలి . దుఖం మూడు విధాలు. ఆధిభౌతికం, ఆధిదైవికం , ఆధ్యాత్మికం . మనుష్యులవల్ల , మృగాలవల్ల మనకు కలిగే దుఖం ఆధిభౌతికం. యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, గ్రహాల వల్ల కలిగే దు:ఖం ఆధిదైవికం . ఆధ్యాత్మికం మరల శారీరం , మానసం అని రెండు విధాలు . మన శరీరంలో శ్లేష్మం, వాత౦, పిత్తం అని మూడు పదార్థాలు  ఉంటాయి . ఇవి ఉండవలసిన పాళ్ళల్లో కాక భిన్నంగా ఉంటేనే రోగాలు వస్తాయి . అప్పుడు కలిగే బాధ శారీరం. ఇక కామం,  క్రోధం, లోభం , మోహం, మదం, మాత్సర్యం అనే ఆరిటి వల్ల కలిగే దు:ఖం మానసం . కాబట్టి ఈ మూడు విధములైన దు:ఖాలు తొలగడానికే మూడు సార్లు శాంతి:   శాంతి: అంటాం . 
*
2. మన ఇండ్లలో శుభకార్యాలకు , అశుభకార్యాలకు బీజాలు నాటి మొక్కలు పెంచే అలవాటు మన సాంప్రదాయంలో ఉంది . ఉదాహరణకు ఎవరింట్లోనైన ఉపనయనం , వివాహం మొ|| కార్యాలు జరిగితే కొన్ని గింజలు మొలకెత్తేవరకు పెంచడం , అలాగే ఎవరైనా మరణించినప్పుడు ధారాపాత్రపేరుతో కొన్ని ధాన్యం గింజల్ని మూకుళ్ళలో వేసి నీరు పోసి మొలకెత్తేలా చేయడం మనం గమనిస్తాం .     దీనికి గల కారణం ఆలోచిస్తే ఒకటి తెలుస్తుంది . మన వైదికసంస్కృతి ఒక్క చెట్టు కూడ నాశనం కావడానికి ఒప్పుకోదు.  కాకూడదని శాసించింది  . కాని వివాహాదిశుభకార్యాల్లో అగ్నిహోత్రం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే ఎవరైనా మరణించినప్పుడు వారిని దహనం చెయ్యవలసినప్పుడు కొన్ని మొక్కలు నశించడం అనివార్యం . కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చెయ్యడానికే మొక్కలు పెంచమని ఆదేశించింది మన వైదికసంస్కృతి. విషవృక్షమైనప్పటికి నాటినవాడు దాన్ని స్వయంగా నరకరాదని హితబోధ చేస్తాడు కాళిదాసు . ఆహా ! ఎంత గొప్పది మన సంస్కృతి.
ఇక నేను ప్రతిరోజూ కనీసం ఐదుగురికి సరిపోయే ప్రాణవాయువును (OXYGEN) అందిస్తున్నాను. నా రక్షణ గురించి మీరు ఆలోచించరా? ( EVERYDAY I SUPPLY OXYGEN FOR UPTO FOUR PEOPLE . DONT YOU THINK I AM WORTH SAVING?) అంటుంది మొక్క. కాబట్టి ప్రతి చెట్టు ప్రగతికి మెట్టుగా భావించి రక్షించండి . ఒకవేళ ఏదైనా కారణం చేత ఒక మొక్క నశిస్తే ఆ నష్టాన్ని భర్తీ చెయ్యడానికి మరికొన్ని మొక్కలు నాటండి .
**
 
3. మనిషికి జరిపించే పదహారు సంస్కారాల్లో వివాహం ఒకటి ఇది చాల ప్రధానమై౦ది. ఈ వివాహంలో ఎన్నో అంశాలుంటాయి . పెళ్లి కూతురికి  కాళ్ళ గోళ్ళు తీయిస్తారు.
వేదిక వద్దకు బుట్టలో కూర్చోపెట్టి తీసుకొస్తారు . మంగళసూత్రం కట్టిస్తారు . తలంబ్రాలు పోయిస్తారు . ఊరేగింపు జరిపిస్తారు . ఇంకా ఎన్నెన్నో కార్యకలాపాలు ఉంటాయి . ఇవన్ని ఎందుకంటే మన ప్రాచీనమహర్షులు సమస్త మానవాళి సౌఖ్యాన్ని కోరినవారు కావడం చేత సంఘంలో ఒక శుభకార్యం జరిగితే ఆ సమాజంలో ఉన్న చేతి వృత్తులవారికి, మూతి వృత్తులవారికి కూడ ప్రయోజనం కలగాలి . అందువల్లనే పెళ్లి సందర్భంలో కాళ్ళగోళ్ళు తీయించడం అనే నెపంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తిని సగౌరవంగా ఆహ్వానించి సన్మానించి సత్కరిస్తాం . మనం మన కాళ్ళ గోళ్ళను మనమే తీసుకోవచ్చు.  పెండ్లికూతురికి ఒక బ్లేడు ఇస్తే తనే తీసుకుంటుంది, వేరొకరితో తీయించవలసిన పనిలేదు . కాని ఆ పని ఆ ప్రత్యేక వ్యక్తి ద్వారా జరిపించడం వల్ల అతనికి ప్రత్యేక గౌరవం, ఆదరణ, పోషణ లభిస్తున్నాయి . అలాగే పెండ్లి కూతుర్ని నడిపించుకుని కాకుండా బుట్టలో కూర్చోపెట్టి తేవడం వల్ల బుట్టలు తయారు చేసే మేదరికి లాభం చేకూరుతుంది  . అలాగే సమాజంలో ఇంకా ఎన్నో వివిధ వృత్తులు ఆ వృత్తులు నిర్వహించే కులాలు ఉన్నాయి . వాళ్ళందరిని గుర్తించి వారి సేవలను ఉపయోగించుకుంటే తప్ప మొత్తం సంఘానికి ప్రయోజనం చేకూరదు . ఈ విధంగా ఆలోచిస్తే వివాహ౦లో ప్రయోజనం పొందని వృత్తి గాని; కులం గాని మనకు కనిపించవు . కాని నేడు జరుగుతున్నదే౦టి? అవన్నీ కనుమరుగై పోతున్నాయి . కాళ్లగోళ్లు మొదలుకొని కల్యాణమంటపం దాకా అన్నిటికి కాంట్రాక్టర్లే  ఉ౦టున్నారు .  ఈ సంప్రదాయం అశుభకార్యాలకు కూడ వర్తిస్తుంది . ఆ కార్యకలాపాలలో కూడ ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు లాభం పొందేవి. ఇప్పుడలా జరగడం లేదు . కాళ్ళకు ముడేసే  దారం దగ్గర నుంచి కాటికాపరి రుసుము దాక  అన్ని కాంట్రాక్టే.   కాంట్రాక్టర్లే రాజ్యమేలుతున్నారు . ఉన్నవాడు లేనివాడు కూడా ఉన్నవాడికే సర్వస్వం సమర్పి౦చుకుంటున్నాడు . నాటి ఆ వ్యవస్థ బాగుందో నేటి ఈ వ్యవస్థ బాగుందో మనమే నిర్ణయించుకోవాలి.

***

No comments: