Tuesday, April 4, 2017

సీతారామ కళ్యాణం

సీతారామ కళ్యాణం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సాధారణoగా మనం ఏ శుభలేఖ తెరిచి చూసినా వధూవరుల పేర్ల కంటే ముందుగా ఒక సంస్కృత శ్లోకం దర్శనం ఇస్తుంది. అది ఎవరు వ్రాశారో తెలియదు గాని సంస్కృత శ్లోకాలలో దానికున్న ప్రశస్తి దేనికీ లేదు . అది ప్రింట్ అయినన్ని సార్లు బహుశా మరేశ్లోకం ప్రింట్ అయి ఉండదు. అది ఇంతవరకు గిన్నిస్ బుక్కు లోకి ఎందుకెక్కలేదో కారణం తెలియదు. అంత విశిష్టమైoది ఆ శ్లోకం . ముందుగా శ్లోకం చూద్దాం .

  జానక్యా : కమలామలాoజలిపుటే యా : పద్మరాగాయితా:
  న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుoదప్రసూనాయితా:
  స్రస్తా: శ్యామలకాయకాంతికలితా:   యా: ఇంద్రనీలాయితా:
  ముక్తాస్తా: శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా:

ఇది సీతారాముల వివాహ సందర్భంలోది.  ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం .
యా: = ఏవి
జానక్యా: = జానకీదేవి యొక్క
కమల= పద్మమువంటి
అమల= స్వచ్ఛ మైన
అంజలిపుటే= చేతియందు
పద్మరాగాయితా: = పద్మరాగమణుల వలె మెరయుచున్నవో
రాఘవ మస్తకే = రామచంద్రుని తలపై   
న్యస్తా: = ఉంచబడిన(వై)ప్పుడు
కుందప్రసూనాయితా: =మల్లె మొగ్గలవలె మెరయుచున్నవో
స్రస్తా : జారుచున్నవై
శ్యామల= (రామచంద్రముర్తి యొక్క)  నల్లనైన
కాయకాంతి= శరీరపు కాంతితో
 కలితా:=  కూడియుండుట వలన   
ఇంద్రనీలాయితా: = ఇంద్ర నీల మణులవలె మెరయు చున్నవో  
తా: =  అటువంటి (పవిత్రమైన)         
శ్రీరామ వైవాహికా: = శ్రీ రామచంద్రమూర్తి వివాహమునకు సంబంధించిన
ముక్తా: = ముత్యములు
భవతాం = మీ అందరకు
శుభదా: = శుభములు చేకూర్చునవి
భవంతు = అగుగాక
జానకీదేవియొక్క పద్మదళముల వంటి అరచేతులలో నున్నప్పుడు  పద్మరాగ మణులవలె మెరుస్తున్నవియు , ఆమె  శ్రీరామచంద్రమూర్తి తలపై పోస్తున్నప్పుడు మల్లెమొగ్గలవలె ప్రకాశించుచువియు, శ్రీరామచంద్రుని శరీరంపై జాలువారుచున్నప్పుడు నీలమేఘచ్ఛాయగల దేహకాంతిచే  ఇంద్రనీలమణుల వలె భాసించు  ఆ ముత్తెపు తలంబ్రాలు మీకందరకు శుభములు కలుగ జేయుగాక.  
ఈ శ్లోకంలో తద్గుణాలంకారం ప్రయోగించ బడింది.
తద్గుణస్వగుణత్యాగాదన్యదీయగుణగ్రహ:
పద్మరాగాయతే నాసామౌక్తికం తేsధరత్విషా
అని దాని లక్షణం .ఎక్కడ ఒకవస్తువు తనధర్మాన్ని విడిచిపెట్టి సమీపంలో ఉన్న వేరొక  వస్తువు యొక్క ధర్మాన్ని స్వీకరి౦చడం వర్ణించబడుతు౦దో అది తద్గుణాలంకారం .       ఓ యువతీ! నీ నాసాభరణములోని ముత్యము నీ పెదవియొక్క కాంతిచే పద్మరాగము వలె ప్రకాశించుచున్నది .
ఇక్కడ ముత్యం పారదర్శకం . అందువల్ల సమీపంలో ఉన్న వస్తువు ఏ రంగులో ఉంటే ఆ రంగు దానిలో ప్రతిఫలిస్తుంది . ఇక్కడ ఆ వనిత పెదవి పద్మరాగంలా మెరుస్తోంది కాబట్టి   ఆరంగు నాసామౌక్తికంలో ప్రతిఫలించి అది కూడ పద్మరాగంలా మెరుస్తోంది .   
ఇక్కడ సీతారాముల వివాహసందర్భంలో తలంబ్రాలుగా ఉపయోగించ బడిన ముత్యాలు కమలదలములవంటి ఎర్రనైన సీతాదేవి దోసిలిలో పద్మరాగ మణులవలెను; ఆమె చేతులనుండి శ్రీరామచంద్రుని తలమీద పడుతున్నప్పుడు తమ సహజ మైన కాంతితో  మల్లెమొగ్గలవలెను; ఆ పిదప రామచంద్రుని శరీరం నుండి జాలువారుచున్నప్పుడు ఆయన శరీర కాంతి ప్రతిఫలించి ఇంద్రనీల మణులవలెను మెరయు చున్నవని తాత్పర్యం . అటువంటి ముత్యాలు అందరికి శుభం కలుగ జెయ్యాలని కవి ఆశంస .

                                       ******     

No comments: