Sunday, December 1, 2013

అబద్ధాలాడినా అతికినట్లుండాలి


అబద్ధాలాడినా అతికినట్లుండాలి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
కొబ్బరి చెట్టెందుకెక్కేవురా అంటే దూడగడ్డికోసం అన్నాడట ఒకాయన . ఇటువంటి సమాధానం మనుషులే కాదు దేవుళ్లు కూడ చెబుతారు. ఏంటి ! ఆశ్చర్యంగా ఉందా! ఎందుకుండదు. కాని ఇది నిజం. కావాలంటే ఒక్కసారి చదివి చూడండి. 
నందగోపబాలకుడు నవనీతచోరుడనే విషయం అందరికి తెలిసిందే. వెన్న దొంగిలించే నెపంతో తమను అనుగ్రహిస్తున్నాడని తెలుసుకోలేని కొంతమంది గోపకాంతలు అతనిపై నేరాలు మోపుతూ ....
ఓయమ్మ! నీ కుమారుడు
మాయిండ్లను పాలుపెరుగు మననీడమ్మా!
పోయెదమెక్కడికైనను
మాయన్నలసురభులాన మంజులవాణీ!”
అని యశోదతో మొరపెట్టు కోవడం కూడ మనకి తెలుసు. అయినా ఎవరి త్రోవ వాళ్లదే. ఆ సంగతలా ఉంచుదాం.
ఒకనాడు కృష్ణుడు యథాప్రకారం వెన్న దొంగిలించడానికి కొంతమంది స్నేహితుల్ని వెంటేసుకుని బయలు దేరాడు. ఒక ఇంట్లో దూరాడు. ఆ ఇంటి యజమాని చాల తెలివైన వాడు. వెన్న కుండ నట్టింట్లో చాలఎత్తైన ప్రదేశంలో ఉట్టెకు వ్రేళాడగట్టి ఉంచాడు. వెన్న దొంగ అంతకంటే తెలివైన వాడు. మిత్రుల్ని ఒకళ్ల మీదొకళ్లని నిలబెట్టి వాళ్లమీంచి పైకెక్కి కుండలోనున్న వెన్న తినడం మొదలెట్టాడు. ఇలా చాల రోజులు, కాదు సంవత్సరాలే గడిచాయి. కాని ఒకరోజు పొరబాటున మూతక్రిందపడి చప్పుడయ్యింది. ఆ చప్పుడు విని యజమాని లేచాడు. తీరా చూస్తే ఏ ముంది ! వెన్న కుండ ఖాళీ అవుతోంది. బాల కృష్ణుడు తనపనిలో తానున్నాడు. ఒళ్లు మండిపోయింది యజమానికి.
"ఎవరివయ్యా నువ్వు ? " అనడిగాడు
"నాపేరు కృష్ణుడు" అనిసమాధానం
నీకిక్కడేం పని"?
మా ఇల్లనుకుని వచ్చాను"
సరే! అది బాగానే ఉంది. ఆ వెన్న కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు"
అందులో చీమ ఉంది దాన్ని తీయడానికి చెయ్యి పెట్టాను.
ఓహో అలాగా! అటైతే ఈ నిద్ర పోతున్న ఈ జనాన్నంతా ఎందుకు లేపావు ?
వీళ్లా ! చాల రోజుల నుంచి మా దూడ కనిపించడం లేదు. అందుకని అదెక్కడికి పోయిందో తెలుసుకోడానికి వీళ్లని లేపాను.
ఈ విధంగా అతికీ అతకని సమాధానం చెప్పి తప్పించుకున్న ఆ నవనీతచోరుడు మిమ్మల్ని రక్షించుగాక అని ఒక కవి అద్భుతమైన శ్లోకం రచించాడు. ఈ సంభాషణ చాలబాగుందికదూ! మరి శ్లోకంకూడ తిలకిద్దామా .
కస్త్వం? కృష్ణ మవేహి మాం, కిమిహ తే ? మన్మందిరాశంకయా
యుక్తం తన్నవనీతభాజనపుటే న్యస్త: కిమర్థం కర:?
కర్తుం తత్ర పిపీలికాపనయనం, సుప్తా: కిముద్బోధితా:?
బాలా: వత్సగతిం వివేక్తు మితి సంజల్పన్ హరి: పాతు వ:
_____________

No comments: