Sunday, January 1, 2017

కలనైనా మఱువబోకు కమ్మనైన అమ్మభాష

కలనైనా మఱువబోకు కమ్మనైన అమ్మభాష
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

                 ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాsల్పస్య తపస: ఫలం  అన్నారు
సుప్రసిద్ధసంస్కృతకవి , ఆలంకారికుడు, తత్త్వవేత్త అయిన  శ్రీ అప్పయ్య దీక్షితులు . అంటే ఆ౦ధ్రుడుగా పుట్టడం ఆంధ్రభాష మాట్లాడ గలగడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సిద్ధి౦చదని ఆ మాటలకర్థం .                                                   
​భాష ప్రాణం వంటిది . భాషను పోగొట్టుకుంటే మనం మన  ఉనికిని కోల్పోయినట్లే.  ప్రతివారికి కనీసం మాత, మాతృ భూమి,మాతృభాషలపట్ల ఎనలేని గౌరవం ఉండాలి. మాతృభాషను కించపరిస్తే  తల్లిని అవమానించి నట్లే అ౦టారు మన జాతిపిత మహాత్మా గాంధి . ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. जो मातृभाषा को अवगणना कर्ता है , वह अपनी माता की कर्ता है (Belittling ones mother Tongue is like disparaging ones own mother )
 ​తెలుగుభాష మాట్లాడేవారు తెలుగురాష్ట్రాల్లో సుమారు 9కోట్ల మంది ఉన్నారు. ఇతరరాష్ట్రాల్లోను విదేశాల్లోను కూడ ఇంచుమించు అ౦త మందే ఉన్నారు. ఇంతమంది ఉన్నా కాలగతిలో మనభాష నిలుస్తుందా నిలవదా అనే సందేహం మనకు లేకపోలేదు. దానికి కారణం ఒక భాష పదికాలాలపాటు మనుగడ సాగించాలంటే ఆ భాష మాట్లాడాలి. కేవలం మాట్లాడితేనే సరిపోదు వ్రాయగలగాలి. వ్రాస్తేనే సరిపోదు ఆ భాషలో సాహిత్యసృష్టి జరగాలి. సాహిత్యసృష్టి జరిగినంత మాత్రాన సరిపోదు. ఆసాహిత్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. అప్పుడే ఏ భాషైనా కాలగతిలో  నిలుస్తుంది. లేకపోతే నిలిచే ప్రసక్తి లేదు.
 ఇక ప్రస్తుతవిషయానికొస్తే నేటితరం విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు మాతృభాషగా గల విద్యార్థులలో చాల మందికి  తెలుగుభాషపట్ల ప్రేమలేదు. ఆంగ్లభాషమీదున్న ప్రేమలో వెయ్యో  వంతు కూడ ఆంధ్రభాషపైన లేదు . ఈ విషయంలో వారి వారి తల్లిదండ్రులే చాల వరకు కారణమని చెప్పక తప్పదు. అందరు తమతమ మాతృభాషలు రావడం గొప్పగా భావిస్తుంటే తెలుగువారమైన మనం తెలుగు భాష రాకపోవడం గొప్పగా భావిస్తున్నాం . నిజంగా ఇది సిచేగ్గుటు .  మదర్ టంగ్ రాని వాడికి అదర్ టంగ్ రాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పూర్వం విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్వ్యక్తుల్ని పరిశీలిస్తే వారందరూ తెలుగు భాషలో  నిష్ణాతులని తేలింది. నేడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తే సమయం వేస్టు అయిపోతుందని ఆ సమయాన్ని కూడ ఆ౦గ్లభాషకు కేటాయిస్తే ఇంకా ప్రగతిని సాధిస్తారనే అపోహలో ఉన్నారు .  అమ్మ భాష రాని వాడికి అన్య భాష రానే రాదు. ఈమధ్యనే ఒక సంఘటన జరిగింది. పోరుగురిలో  ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి కాలేజి నుండి తన ఇంటికొచ్చాడు . ఇంటికి తీసుకొచ్చిన ఆటోవాడు అరవై ఐదు రుపాయిలైందని అతనికి చెప్పాడు . అతనికి పాపం అరవై ఐదంటే ఎంతో అర్థం కాలేదు . అడగడానికి నామోషి. అందువల్ల చిల్లరలేదని అబద్ధమాడి ఇ౦ట్లోకెళ్ళి వాళ్ళ తాతను అరవై ఐదుకి అర్థం అడిగి తెలుసుకొని డబ్బు చెల్లించాడు. ఇదీ నేటి పరిస్థితి .
 ఇక ఆంగ్లభాష విషయానికొద్దాం. ఆంగ్లబాషను చాల రాష్ట్రాలవారు భాషగా నేర్చుకుంటున్నారు. మనం మాత్రం మీడియం ద్వారా నేర్చుకుంటున్నా౦. రెంటికి చాల తేడా ఉంది . భాషగా నేర్పేవాళ్ళు మంచిపండితులై ఉండి భాషలోని మెలుకువలు, మర్మాలు నేర్పుతారు. ఇక మీడియం విషయానికొస్తే ప్రతి వాడు అధ్యాపకుడే . వారికేమి తెలీదు పుస్తకంలో ఉన్న విషయాన్ని క్లాసుల్లో చదివేసి , బట్టీ పట్టించి మార్కులు పోసేస్తున్నారు. అందువల్ల  ఇంగ్లీషులో ఒక చిన్న అప్లికేషన్ కూడ వ్రాయలేక పోతున్నాడు. అటు ఇ౦గ్లీషు ఇటు తెలుగు రెండు రాక రెంటికి చెడ్డ రేవడుగా తయారౌ తున్నాడు. అందుకే "ఇంగ్లీషును కాటుకగా దిద్దుకో గాని ఒళ్లంతా పూసుకోకు నల్ల బడతవు" అన్నారు శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు. ఒక విద్యార్థి అ ప్రిన్సిపాల్ కి  లీవులెటరు వ్రాస్తూ please grant me leave for today as I am suffering from mouth motions (వా౦తులు) అని పేర్కొన్నాడు . వాడి వా౦తి సంగతేమోగాని ఆ లెటర్ చదివి ప్రిన్సిపాల్ వా౦తి చేసుకున్నాడు .
ఇక కొంతమంది మిత్రులు తమకు తెలిసో లేక తెలియకో  తెలుగును సులభం చెయ్యాలంటే కొన్ని వర్ణాలు తొలగించాలనే వాదన చేస్తూ ఉన్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఒక D.E.O గారు నా దగ్గరకొచ్చి శకటరేఫ అంటే  (ఱ),  అరసున్న మొదలైన వర్ణాలు తొలగించాలని వాదించారు. నేనన్నాను ఏమండి enough, committee మొ||   పదాలకు అన్ని అక్షరాలు అవసరమా    కొన్ని తిసేయ్యొచ్చు కదా తీసిచూడండి,  ఏ౦ జరుగుతుందో అన్నాను.  ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదు. అందువల్ల తెసేయడం పరిష్కారంకాదు.    శకటరేఫ (ఱ) విషయానికొద్దాం నీరు అంటే water నీఱు అంటే ashes (బూడిద). పాఱు అంటే ప్రవహించడం పారు అంటే పారడం. ఒక అవధానంలో ఒకాయన అడిగారు . మనం బయలు దేరేటప్పుడు నక్క కుడి ప్రక్క పారితే మంచిదా ఎడమప్రక్క పారితే మంచిదా అని . దానికి సమాధానంగా అవధాని గారు ఎటు పారినా పరవాలేదు మన మీద చి౦దకుండా ఉంటే చాలు అన్నారు.
ఇక అరసున్న విషయానికొద్దాం. వెలుగులో అరసున్న ఉంటే ప్రకాశం అని అర్థం.  (వెలు(గు).  ఒక వేళ అరసున్న లేకపోతే వెలుగు అనే పదానికి ముళ్లకంచె అని అర్థం . అందువల్ల వాటిని మనం పిల్లలకు నేర్పినా నేర్పక పోయినా పరవాలేదు గాని తీసెయ్యడం మాత్రం చాల తప్పు . ఈమధ్య కొంతమంది మహాప్రాణవర్ణాలు (ఖ,ఘ మొదలైనవి ) తొలగించమని అంటున్నారు. ఇప్పుడు తెలుగుభాషామతల్లి కనీసం కొన ఊపిరితోనైనా ఉంది. ఆ మహాప్రాణవర్ణాలు తొలగిస్తే ప్రాణమే కోల్పోతుంది .
ఇక మరికొంత మంది టైము , టిక్కెట్టు , రోడ్డు మొ|| పదాలు వాడుతున్నాం . మనం మాట్లాడేది తెలుగే కాదు అని వాదిస్తున్నారు.`ఇది చాల తప్పుడు అభిప్రాయం ఎందుకంటే Time అనేది ఆంగ్లపదం గాని టైము తెలుగుపదమే అవుతుంది . అలాగే Ticket ఆంగ్ల పదం టిక్కెట్టు మాత్రం తెనుగు పదమే. అలాగే Road ఆంగ్లపదం  రోడ్డు తెలుగుపడమే
భాషలో తత్సమం- తద్భవం- దేశ్యం- గ్రామ్యం అనే నాలుగు రకాల పదాలుంటాయి.  రామ అనే సంస్కృతపదం తీసుకుని మనం రాముడు చేసుకున్నాం . అది తత్సమం . అగ్ని  అగ్గి అయింది అది తద్భవం . ఆక్క అన్న మొదలైన పదాలు దేశ్యాలు అవి మన స్వంత పదాలు. అవి కాకు౦డ వస్తాడు ,  కూకుంటాడు మొదలైనవి గ్రామ్యపదాలు . ఇక టైము , రైలు మొ || అన్యదేశ్యాలు. ఇవన్ని తెలుగు పదాలే కాబట్టి వాటిని తెలుగుపదాలు కావనడం సాహసం . తొలగి౦చాలను కోవడం అవివేకం . 
భాష ఎంతపెరిగితే అంత గొప్పదవుతు౦ది. అయ్యయ్యో! అమ్మాయి పెద్దదై పోతోంది పెద్దదైతే మరలా బట్టలు కుట్టి౦చాలి అని ఎవరైనా బాధపడతారా . పైగా ఆనందిస్తారు.  పెరిగే కొద్ది ఆనందంతో కొత్తబట్టలు కుట్టిస్తారు ఎందుకంటే పెరుగుదల సహజం పెరక్కపోవడం అసహజం  . అంగ్లభాష చూడండి ప్రపంచంలో ఉండే అన్ని భాషాపదాల్ని తనలో కలుపుకు౦టూ ఎంత విస్తృతంగా పెరిగిందో. జనన్నాథ అనే పదాన్ని Juggernaut గా మార్చుకుని తనలో ఇముడ్చు కుంది . పండిత pandit అయింది . అలాగే gaddi (సంహాసనం)   మొదలైన కొన్నవందల, వేల  పదాలకు తన నిఘంటువులో స్థానం కల్పి౦చింది . ప్రతి సంవత్సరం నిఘంటువుల్ని వ్యాకరణాన్ని మార్చుకుంటూ పోతోంది . మనం ఆపనే చెయ్యాలి .
ఇక ఇంగ్లీష్ భాష రాక పొతే ప్రగతి ఆగిపోతుందని వాది౦చేవాళ్ళు కొంతమంది లేక పోలేదు. భాష నేర్చుకుందాం తప్పు లేదు . కాని మన భాషను పోగొట్టుకుని మాత్రం కాదు .
కొంత కాలం క్రిత౦  మా గురువు గారు జర్మని వెళ్ళారు . వాళ్లకు ఇంగ్లీషు రాదు వీరికి జర్మన్ భాషరాదు. కాలం ఎలాగో గడిచి పోయింది . తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు వారితో --మీకు ఆంగ్లం రాదు . నేర్చుకోవాలని ఎప్పుడు అని పి౦చలేదా! ఆంగ్లం రాకపోతే అభివృద్ధి సాధ్యమా ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా వారు మాకేమవసరం ప్రపంచంలో ఎవరు ఏ పుస్తకం వ్రాసినా అనతి కాలంలోనే మాకు దాని జర్మన్ అనువాదం మా చేతిలో ఉంటుంది . ఆంగ్లం నేర్చు కోవడం మాకేం అవసరం లేదు పొమ్మన్నారు . 
          దురదృష్టవశాత్తు అటువంటి అవకాశం మనకులేదు . అందువల్ల  మనం ఇ౦గ్లీషు నేర్చుకుంటే గాని డాక్టర్స్ కాలేం, ఇ౦జనీర్సు కాలేం . ఇదే ఆంగ్ల భాషావ్యామోహానికి ఒక ప్రథాన కారణం.  అందువల్ల మనం జర్మన్ దేశీయులమార్గాన్ననుసరి౦చాలి.
ఇక ప్రాన్సు దేశం బ్రిటన్ కు చాల చేరువలో ఉంది . అందువల్ల ఆంగ్లం వాళ్ళ భాషను ఎక్కడ కబళించివేస్తుందో నన్న భయంతో ఎన్నో ఆంక్షలు విధించారు . ఉదాహరణకి కార్యాలయాల్లో ఎవరైనా ఇ౦గ్లీషులో ఉత్తరం వ్రాస్తే  అది చి౦పిపారేస్తారు (ఇది నేను విన్నది). లేకపోతే వాళ్ళ భాష అంతరించి ఇప్పటికి ఎన్నోశతాబ్దాలు అయు౦డేది.
మరికొంతమంది  ఉరుమురిమి మంగల౦ మీద పడిందన్నట్లుగా   సంస్కృతభాషమీద విరుచుకు పడుతున్నారు. పాపం అదేం చేసింది తెలుగును పెంచి పోషించడం, అభివృద్ధి చేయడం తప్ప. గాంధీమహాత్ముడు అన్నారు Sanskrit is like river Ganges to our country if it is dried up all regional languages will loose their vitality and power.
అందువల్ల సంస్కృతాన్ని ద్వేషించడం జాతిని, జాతిపితను అవమానించడమే అవుతుంది.  
కాబట్టి  ప్రభుత్వవిధానాలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ లోపం ఉందో అక్కడ సవరించాలి . రోగం ఒకటి వైద్యం మరొకటి కాకూడదు. ఒక ప్రక్క మాతృభాషను ఉద్ధరించాలి అంటూనే  ఇంగ్లీషు చదివేవారిపట్ల మక్కువ చూపిస్తుస్తున్నా౦. . ఇది సబబు కాదు. తెలుగును ప్రోత్సహించాలి వారికి ప్రభుత్వసంస్థల్లో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి  .  కాబట్టి సమస్యకు ఏది మూలకారణమో తెలుసుకుని దాన్ని గమనించి నివారించ గలిగితే భాషారక్షణ , అభివృద్ధి పెద్దపనే౦ కాదు. భాషారక్షణకు , అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిద్దాం . ఆవేదనాపూరితమైన ​శ్రీ తుమ్మల వారి పద్యంతో ముగిస్తాను.
బెంగాలీ కృతికర్త పాదములకర్పి౦చున్నమస్కారము
ప్పొంగున్  పారశిలేఖినీ విలసనంబుల్సూ చి రావయ్య నా 
బంగారంబ యటంచు నాంగ్లకవి నాహ్వానించు నేపాపమో! 
రంగా మెచ్చడు తెల్గుబడ్డ కవి సమ్రాట్టున్ స్వదేశీయునిన్  .​
><><><>< 



No comments: