Monday, May 31, 2021

హృద్యం-తెనుగు పద్యం -5

 

హృద్యం-తెనుగు పద్యం -5

(అమ్మా -నాన్న  నీకప్పగి౦చారు నీదే బాధ్యత)

                                      డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

గత శతాబ్దానికి చెందిన తెనుగు శతక కవులలో  శ్రీ   శరభేo ద్రకవి ఒకరు.  ఆయన శ్రీ కాలళహస్తి శతకాన్ని రచించారు. ఆయన బాణాలస వంశానికి  చెందిన వారు. విశ్వకర్మకుల భూషణుడు . తండ్రి పేరు భద్రయ. ఇందులో 107 పద్యాలున్నాయి. అన్నీ చంపకోత్పలాలే. ఎక్కువ పద్యాలు ఐదు పాదాలతో కూడి ఉన్నాయి.

ఈ శతకాన్ని యస్ .వి. గోపాల్ అండ్ కో.. ఆనంద భారతీ ముద్రాక్షరశాల ( మద్రాసు) లో  1950 లో ముద్రించారు .  ఎన్నో శివపురాణ కథలు ఇందులో మనకు కనిపిస్తాయి.  ఈ శతకం  ఆయన  ప్రతిభకు ఒక దర్పణoగా నిలుస్తోంది . ముందుగా పద్యం . ఈ శతకంలో కొన్ని ముద్రణ దొషాలు కూడ కనిపిస్తున్నాయి.

తత్తర నన్ను గన్న తలిదండ్రులె యెత్తుక ముద్దులాడి నీ

పొత్తున డించి యీశ్వరుడు పోషణ చేయునటంచు గట్టిగా

దత్తము చేసినారు గురుదైవము నిద్దరు నాకు నీవె సా

క్షాత్తు నిజస్వరూపమును గన్నుల జూపుము కాoక్ష దీర సం

రక్షక ! కాళహస్తిబుధరంజిత సాంబశివా!  మహా ప్రభో   !      

 ఓ సాంబశివా ! స్వయంగా నన్ను కన్న నా తలిదండ్రులే  నువ్వే నన్ను రక్షించి , పోషించాలని నన్ను నీకు దత్తత చేసి వెళ్లి పోయారు. అప్పటినుంచి గురువు , దైవo  ఆ రెండు నాకు నువ్వే   కాబట్టి నీ యథార్థ స్వరూపాన్ని సాక్షాత్తుగా  నాకు చూపించు. దైవం , గురువు వీరిద్దరిలో దైవంకన్న గురువు మిన్న అన్నారు పెద్దలు . ఎ౦దుకంటే దైవం గురువును చూపించలేక పోవచ్చు గాని గురువు దైవాన్ని చూపించగలడు. నాకు గురువు దైవం ఈ రెండు నువ్వే కాబట్టి నీ దర్శనం నాకు ప్రసాదించమని ఆవేదనతో చెప్పిన ఈ పద్యం చాల హృదయం గమం .

ఇటువంటి మహాకవుల  భావనల ను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .    

 

No comments: