Friday, May 21, 2021

పదిలమైన కాపురానికి పన్నెండు సూత్రాలు.

 

పదిలమైన కాపురానికి పన్నెండు సూత్రాలు.

                      శ్రీమతి . చిలకమర్తి లక్ష్మీకుమారి M.A

 

మానవనాగరికతలో వివాహవ్యవస్థ ఒక పెద్ద మలుపు. సమాజంలో వ్యక్తి శాశ్వతం కాదు కాబట్టి, సమాజం శాశ్వతంగా ఉండాలి కాబట్టి సమాజానికి ఉత్తమపౌరులను అందించాలనే  సదుద్దేశంతో ఈ వివాహవ్యవస్థ ఏర్పాటైంది. ఇది సమాజంలో స్త్రీ పురుషులకొక గుర్తింపుని, గౌరవాన్ని ఇస్తుంది. అందుకే నాటి ఆటవికసమాజం మొదలుకొని నేటి ఆధునికసమాజం వరకు ఈ వివాహవ్యవస్థ 

ఎంతో ప్రాధాన్యం పొ౦దిది . కాని ఆధునిక నాగరికత పెరుగుతున్న కొద్దీ ఈ వివాహవ్యవస్థ బలహీనమౌతోoది.  అసలు విలువ, గౌరవం లేకుండా పోతోంది. అందువల్ల దీన్ని బలోపేతం చెయ్యడానికి సదవగాహన ఎంతైనా అవసరం. ఇప్పుడు కొన్ని నియమాలు తెలుసుకుందాం

1. కుటుంబవ్యవస్థ పటిష్ఠ౦గా ఉ౦డాలంటే  భార్యాభర్తల మధ్య ఒక సదవగాహన చాల  అవసరం. స్త్రీ తన కుటుంబ పరివారాన్ని , పుట్టి పెరిగిన పరిసరాల్ని  విడిచిపెట్టి శాశ్వతంగా తన ఇంటికి వస్తోందని  మగవాడు అనుకోవాలి. అలాగే తాను  ఒక గౌరవ ప్రదమైన మరో  ఇంట్లో అడుగు పెడుతున్నానని ఆ ఇంటి గౌరవం, మానమర్యాదలు తాను రక్షించాలని , తన గౌరవం  కూడ దక్కించుకోవాలని  స్త్రీ  అనుకోవాలి.  

2. దాంపత్యం అంటే ఒక సదవగాహన . అవసరమైతే ఒకరు మరొకరికోసం కొన్ని అలవాట్లను , అభిరుచులను వదులు కోవాలి . భర్త కోసం  భార్య,  భార్యకోసం భర్త తమ  వ్యక్తి గత అభిరుచులను కొన్ని వదులుకుని అందరితో  కలిసికట్టుగా ఉండడం నేర్చుకోవాలి. అలాగని తమ వ్యక్తిత్వాన్ని చంపుకొమ్మని కాదు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకు౦టూనే కొన్ని అభిరుచులను త్యాగం చేయాలి .

3. స్త్రీ పురుషులు వారి కుంటుంబ గౌరవాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. అలాగే ఎదుటి వారి కుటుంబాన్ని ఎన్నడు కి౦చపరచ కూడదు.

4. వధువు అమ్మానాన్నలు గాని, వరుని అమ్మానాన్నలు గాని  దంపతుల వైవాహికజీవితంలో ఎన్నడు జోక్యo  కలగజేసుకోకాడదు. వారిని వారిగా ఉ౦డనివ్వాలి అడిగినప్పుడే  తమకు తోచిన మంచి సలహాలు చెప్పాలి. నేడు కాపురాలు నిట్ట నిలువుగా కుప్ప కూలి పోవాడానికి  కారణం వీరి అనవసర  ప్రమేయమే .       

5. ఇంకో ముఖ్యమైన విషయ మేoటంటే  స్త్రీకి భర్త ఎంత ముఖ్యమో ఆయన కుటుంబ సభ్యులు  కూడ అంతే ముఖ్యం . వారిని భర్తతో సమానంగానే  గౌరవి౦చాలి. అలాగే మగవాడు  కూడ భార్యకిచ్చే గౌరవం   ఆమె పరివారానికి  కూడ  ఇవ్వాలి .

6. స్త్రీపురుషు లిద్దరు సమానమని ఈ ప్రపంచం ఎంత మొత్తుకుంటున్నా శారీరకంగా స్త్రీకి కొన్ని పరిమితులున్నాయి ఉదాహరాణకి ఒక పురుషుడు తన ఆఫీసులో ఇంటి తాళాలు మరిచిపోతే ఆ పూటకి ఇంటి అరుగుమీద పడుక్కుని కాలక్షేపం చెయ్యగలడు. అదే పరిస్థితి స్త్రీకి ఎదురైతే ఆమె అలా చేయలేదు. ఆడదానికి కొన్ని పరిమితులున్నాయి . ఇవి ప్రకృతి విధించిన biological limitations . అందువలన  ఆమె తన  పరిమితులకు లోబడి నడుచుకోవాలి. తగుదునమ్మా అని మగాడిలా ప్రవర్తించకూడదు.

7.                కుటుంబంలో దంపతుల మధ్య దాపరికం ఉండకూడదు . ఏ పనైనా చెప్పిచెయ్యడం,   ఒప్పించి చెయ్యడం, లేదా చేసిన తరువాత చెప్పడం  చాల అవసరం.

8.                దాంపత్యం 63 లా ఉండాలి . మగాడు ఆరైతే స్త్రీ ఆరులో సగం మూడు . భార్య అర్థాంగి  కాబట్టి ఆరులో సగం మూడు లాగానే ఉంటే దాంపత్యం 63 లా హాయినా , ఆనందంగా , ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. అంతే  గాని ఆడది తగుదునమ్మ అని ముందుకొస్తే దంపతులు  36 లా  ఎడమొహం పెడమొహం  ఔతారు . ఆరు పెద్దది కనుక దాని గౌరవం దానికివ్వాలి  . అంతేగాని నామాటే చెల్లాలని  3 ముందుకొస్తే 36 అవుతుంది. ఇది ప్రమాద కరం.

9.               దంపతులెవరైనా తమకంటే వయస్సులో పెద్ద వారిని లేదా సమానమైన వారిని చిన్నవారిని కూడ ఏనాడు కి౦చపరచకూడదు. విభేది౦చవచ్చు కాని విరోధించకూడదు. ఇతరుల  అభిప్రాయాన్ని అంగీకారింపక పోవచ్చు. అంత మాత్రం చేత మీకే౦ తెలీదు . మీకంటే నేనెక్కువ చదువుకున్నాను అని గర్వంగా మాట్లాడకూడదు . చదువు వేరు అనుభవం వేరు. పది  సంవత్సరాల చదువు లేదా జ్ఞానం  ఐదు సంవత్సరాల్లో  సంపాది౦చొచ్చు. కాని పది  సంవత్సరాల అనుభవానికి పదేళ్ళూ పడుతుంది. అందువల్ల మనకున్న మిడి మిడి జ్ఞానంతో పెద్దల్ని తక్కువ చెయ్యకూడదు.   వారి  అభిప్రాయం తప్పని త్రోసిపుచ్చ కూడదు.       Your opinion is your opinion only. అనే పెద్దల మాటను ఎవరు, ఏనాడూ మర్చిపోకూడదు. సామరస్యంతో అన్ని చర్చించుకోవాలి . మంచి చిన్న వారు చెప్పినా అంగీకరి౦ చాలి చెడు పెద్దవారు చెప్పినా తిరస్క రి౦చాలి. నేడు కొత్త కాపురాలు కూలి పోడానికి కారణం అవగాహన లేకుండా మూర్ఖత్వంతో ప్రవర్తించడమే .

10.         ఒక ఇంటిలో కూతురే మరో ఇంటికొస్తే కోడలౌతు౦ది . అలాగే ఒక ఇంటిలో  కొడుకే మరో ఇంటి అల్లుడౌతాడు . కాబట్టి తన కొడుకుని చూసినట్లు అల్లుణ్ణి; తన కూతుర్ని చూసినట్లు కోడల్ని చూడగలిగితే కుటుంబం స్వర్గ తుల్యం ఔ తుoది. అలాగే ఆడది తన తల్లి ని చూసినట్లు అత్తను , తండ్రిని చూసినట్లు మామను చూస్తే సమస్యలే ఉండవు .

 

11.         భార్యాభర్తలు ఎట్టి  పరిస్థితిలోను మూడవ వ్యక్తి చొరబడకుండా తమ సమస్యలు తామే సామరస్యంతో పరిష్కరించు కోవాలి .  ఇద్దరు పరిష్కరి౦ చుకుంటే ఇంపు,  మూడో వ్యక్తి చొరబడి తే కంపు .

12.         ఆఖరిది అతిముఖ్యమైనది ఒకటుంది. ఈ సృష్టిలో ఎవరి  ప్రత్యేకత వారిదే . అందువల్ల మనల్ని మన స్థితిగతుల్ని  ఎవరితోనూ పోల్చుకోకూడదు . మన ప్రత్యేకత మనది. పోలిక ప్రమాదం .

             మరికొన్ని సూచనలు మరోసారి ....

 

 

No comments: